Brahmamudi January 23rd Episode: డీఎన్ఏ రిపోర్ట్స్ మార్చేసిన రుద్రాణి..బిడ్డ హెల్త్ ప్రాబ్లమ్ కనిపెట్టిన కావ్య
Photo Courtesy: JioHotstar
కావ్య తప్పు చేసే మనిషి కాదు.. నవమాసాలు మోసి కన్నబిడ్డని ఏ తల్లి కూడా తన బిడ్డ కాదని చెప్పదు. కావ్య వైపు కూడా ఒకసారి ఆలోచించమని రాజ్తో చెబుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ. అక్క చెబుతున్నది నిజమో? కాదో? తెలియాలంటే పాపకి డీఎన్ఏ టెస్ట్ చేయించాలని అప్పూ చెప్పడంతో రాజ్ కూడా సరేనని అంటాడు. వీరి ప్లాన్తో రేఖ, రాహుల్లు షాక్ అవుతారు. పాపకి డీఎన్ఏ టెస్ట్ చేయించడానికి కావ్య ససేమిరా అంటుంది. నువ్వు చేస్తున్న ఆరోపణలకు చట్టప్రకారం సాక్ష్యం ఉండాలని రాజ్ నచ్చచెప్పడంతో కావ్య సరేనని అంటుంది.
కావ్యకి రాజ్ డీఎన్ఏ టెస్ట్ చేయించబోతున్నాడని రుద్రాణి చెప్పడంతో మినిస్టర్ ధర్మేంద్ర షాక్ అవుతాడు. ఏం చేసైనా సరే ఈ బిడ్డను దూరం చేసుకోనని రుద్రాణితో చెబుతాడు. డీఎన్ఏ టెస్ట్ కోసం కావ్య బ్లడ్ శాంపిల్స్ ఇస్తుంది. రిపోర్ట్స్ ఎలా వచ్చినా సరే దానికి కట్టుబడి ఉంటానని కావ్య దగ్గర రాజ్ మాట తీసుకుంటాడు. కావ్యను వరుసగా సమస్యలు చుట్టుముడుతూ ఉండటంతో సుభాష్, అపర్ణలు బాధపడతారు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. ఇక జనవరి 22వ తేదీ ఎపిసోడ్ 936లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
పాప రిపోర్ట్స్ కోసం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతుంది. ఆ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో టెన్షన్తో చనిపోతానని అంటుంది ఇందిర. ఇంతలో కావ్య హాయిగా బయటకు వస్తుంది. మేమంతా ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఇంత కూల్గా ఎలా ఉన్నావని దుగ్గిరాల ఫ్యామిలీ ప్రశ్నిస్తుంది. మీరంతా కాగితాలను నమ్ముతున్నారు... నేను మాత్రం జీవితాలను నమ్ముతున్నానని అంటుంది కావ్య. అందుకే మీరు కంగారుపడుతున్నారు.. నేను మాత్రం రిలక్స్గా ఉన్నానని చెబుతుంది. నాకు నిజం తెలుసు కాబట్టి... రిపోర్ట్స్ ఎలా వస్తాయో ముందే చెబుతానని అంటుంది కావ్య.
ఇంతలో రిపోర్ట్స్ రావడంతో అది చూసి షాక్ అవుతారు రాజ్, కళ్యాణ్. దాంతో అసలు రిపోర్ట్స్లో ఏమని వచ్చిందని ఇందిర ప్రశ్నించగా.. ఈ పాప మా పాపే అని వచ్చిందని రాజ్ చెప్పడంతో కావ్య ఉలిక్కిపడుతుంది. కళావతి డీఎన్ఏ పాప డీఎన్ఏతో మ్యాచ్ అయ్యిందని రాజ్ అనగా... కావ్య నో, అబద్ధం అని గట్టిగా కేకలు వేస్తుంది. ఈ రిపోర్ట్స్ అబద్ధం, ఆ టెస్టులు అబద్ధమని అంటుంది కావ్య. ఎవరో నా మీద, నా పాప మీద కుట్ర చేస్తున్నారు... ఈ పాప.. నా పాపే అంటే నేను ఒప్పుకోనని గొడవ చేస్తుంది. డాక్టర్లు చేసిన టెస్టులు, వాళ్లు ఇచ్చిన రిపోర్ట్స్ కూడా అబద్ధమా అని ఇందిర ప్రశ్నిస్తుంది.
రిపోర్ట్స్ , టెస్టులు అని మీరు నన్ను మోసం చేయలేరని కావ్య మండిపడుతుంది. ఎన్నో కేసులు, ఎన్నో మిస్టరీలలో డీఎన్ఏ టెస్టులతో మోసాలు బయటపడ్డాయి. అలాంటిది డీఎన్ఏ టెస్ట్ అబద్ధమని ఎలా అంటావని అప్పూ మండిపడుతుంది. నువ్వు తల్లిని కాబోతున్నావు కదా? నా బాధ మీకు తెలియడం లేదా? మీరంతా పిల్లల్ని కన్నవాళ్లే కదా? నేను గొంతు చించుకుని అరుస్తున్నా.. ఈ పాప నా పాప కాదని చెబుతున్నా వినిపించుకోవడం లేదని మండిపడుతుంది. ఆ మాటలతో కావ్యపై రాజ్ సీరియస్ అవుతుంది. పిచ్చిదానిలా మా మీద పడిపోతున్నావని రాజ్ ఫైర్ అవుతాడు.
ఒక ఆడదానిగా, ఈ బిడ్డకు ప్రాణం పోసిన తల్లిగా ఈ రిపోర్ట్స్ని నేను నమ్మనని అంటుంది కావ్య. స్వచ్ఛమైన మనసుతో ఈ బిడ్డను చూడు.. నీ అనుమానం పొగొట్టాలని మేమంతా ఇంత చేస్తుంటే ఎందుకు నమ్మడం లేదని ఫైర్ అవుతాడు రాజ్. ఈ బిడ్డను నీకు దేవుడిచ్చిన వరంగా చూసుకో... మాకు ఆనందం లేకుండా చేయొద్దని మండిపడుతుంది ఇందిర. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది మేం విన్నాం.. ఇకపై నేను చెప్పింది నువ్వు వినాల్సిందే. అనవసరంగా గొడవలు మాని.. ఈ పాప.. నీ పాపేనని నువ్వు ఒప్పుకోవాలని రాజ్ అనగా.. ఒప్పుకోనని కావ్య తేల్చేస్తుంది. నా ప్రాణం పోయినా.. ఈ పాప.. నా పాప అని ఒప్పుకోను, నన్ను పిచ్చిదానిలా అనుకున్నా.. నా భర్త, నా కుటుంబం నాకు అండగా నిలబడకపోయినా పర్లేదని అంటుంది కావ్య. ఆమె మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.
డీఎన్ఏ రిపోర్ట్స్ మార్చేసి ఆ కావ్యను పిచ్చిదానిలా చేశారని ధర్మేంద్రను మెచ్చుకుంటుంది రుద్రాణి. ఇండియాలో కావ్య ఎక్కడికి వెళ్లినా డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ ఇదే వస్తుందని చెబుతాడు ధర్మేంద్ర. ఆ ఇంట్లో జరిగే ఏ విషయమైనా మీకు చెబుతానని తేల్చేస్తుంది. ఆ ఇంట్లో పెరుగుతున్న పాప ఆరోగ్యం మెల్ల మెల్లగా క్షీణిస్తుంది.. ఆ పాప చనిపోవడంతో ఆ ఇంట్లో నవ్వులు దూరం అవుతాయి. ఆ కావ్య పిచ్చిది అవుతుంది, నాకు జరిగిన అవమానానికి నేను వేయబోతున్నశిక్ష ఇది అని అంటుంది. పాప చనిపోతుందని తెలిసి ధర్మేంద్ర బాధపడతాడు. దీని గురించి మీరేంద బాధపడొద్దు.. మీ భార్య ఆనందమే మీకు ముఖ్యమని చెబుతుంది రుద్రాణి. మీరు చేసిన సాయానికి రుణం తీర్చుకోలేనని ధర్మేంద్ర అనగా.. ఏదో ఒకరోజు నేను అడిగిన దానిని కాదనకుండా చేస్తే చాలని అంటుంది రుద్రాణి.
ధర్మేంద్రకు వీడ్కోలు చెప్పి రుద్రాణి వెళ్లిపోతుండగా.. తులసి చూసి ఆవిడ ఎవరు? తరచూ మన ఇంటికి వస్తుంది? నా డెలివరీ సమయంలో కూడా హాస్పిటల్కి వచ్చింది అని భర్తని అడుగుతుంది. ఆవిడ మన ఫ్యామిలీ ఫ్రెండ్.. ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం.. ఆవిడకి మనం ఎంతో రుణపడి ఉన్నామని చెబుతాడు ధర్మేంద్ర. పాప డీఎన్ఏ రిపోర్ట్స్ తప్పుగా రావడంతో కావ్య కుమిలిపోతూ ఉండగా రాజ్ వచ్చి ఓదారుస్తాడు. క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండని నువ్వు.. ఇప్పుడు నన్ను చూస్తేనే తలతిప్పుకుంటున్నావా అని రాజ్ బాధపడతాడు. కళ్ల ముందు నిజాలు కనిపిస్తున్నా నువ్వు ఒప్పుకోవడం లేదని అంటాడు. నిన్ను అర్ధం చేసుకున్న క్షణం నుంచి నీ మాట కాదు అన్నానా? నిన్ను నమ్మలేదా? నిన్ను గౌరవించలేదా? కానీ పాప విషయంలో ఎందుకు అర్ధం చేసుకోవడం లేదని ప్రశ్నిస్తాడు రాజ్.
నువ్వు చెప్పేది నిజమైతే నేను చూపించిన దానికి ఏ పేరు పెడతావని అడుగుతాడు రాజ్. ఈ పాప మన పాప ఎందుకు కాకూడదు? అసలు మన బిడ్డను మార్చాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? మన శత్రువులు మన బిడ్డను ఎత్తుకుపోతారు కానీ మరో బిడ్డను ఎందుకు పెడతారు? అని ప్రశ్నిస్తాడు రాజ్. నేను చెప్పేది ఒకసారి ఆలోచించు.. కానీ నన్ను ఏడిపించొద్దు అని చెబుతాడు. భర్త మాటలతో కావ్య కంటతడి పెడుతుంది. దాంతో కృష్ణుడి దగ్గరికి వెళ్లి ఏ సంబంధం లేని ఈ పసిబిడ్డను ఒప్పుకోమని చెబుతున్నారని బాధపడుతుంది. నా బిడ్డ ఎక్కడ ఉందో దారి చూపించు.. నా సమస్యకు పరిష్కారం చూపించు అని ప్రాధేయపడుతుంది. ఇంతలో పాప నురగలు కక్కుతూ కనిపిస్తుంది. అది చూసిన కావ్య షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











