Brahmamudi July 21st Episode: అప్పూ విడుదల.. ప్లేట్ తిప్పేసిన శీను.. శిక్ష తప్పించుకున్న యామిని
Photo Courtesy: JioHotstar
యామిని ఇచ్చిన సలహాతో అప్పూని విడిపించడానికి రాజ్కి బ్రహ్మాండమైన ఐడియా వస్తుంది. రేవతికి ఫోన్ చేసి శీనుగాడు తాను క్షేమంగా ఉన్నానని చెప్పడానికి వాళ్లమ్మకి ఫోన్ చేస్తాడని.. నువ్వు వాళ్ల ఇంట్లోనే పడుకుని కన్నేసి ఉంచమని చెబుతాడు రాజ్. తమ్ముడు చెప్పినట్లుగానే శీనుగాడి ఇంట్లో పడుకుని అతను తన తల్లికి కాల్ చేసిన విషయాన్ని రహస్యంగా గమనిస్తుంది రేవతి. కోర్టులో కావ్య, అప్పూ, కళ్యాణ్లు టెన్షన్ పడుతుండగా రాజ్ వచ్చి ఆ శీనుగాడు వాళ్లమ్మకి ఫోన్ చేసిన విషయం చెప్పి రేవతికి దగ్గరికి వెళ్తాడు.
కోర్టులో కావ్య దగ్గరికి యామిని వచ్చి నువ్వు అప్పూని విడిపించలేవని నానామాటలు అంటుంది. రాజ్ బావని నాకు వదిలిస్తే అప్పూని చిటెకెలో శిక్ష నుంచి తప్పిస్తానని ఆఫర్ ఇస్తుంది. ఆ మాటలతో కావ్య మండిపడుతుంది. శీనుగాడి ఇంటికి వచ్చిన రాజ్.. అతని తల్లి ఫోన్ నుంచి శీనుగాడికి ఫోన్ చేసి మీ అమ్మకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పడంతో అతను కంగారుపడి ఇంటికి బయల్దేరబోతుండగా యామిని మనుషులు కత్తితో బెదిరిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. ఇక జూలై 21వ తేదీ ఎపిసోడ్ 779లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కావ్యని బోనులో నిలబెట్టి విచారణ చేస్తాడు యామిని తరపు లాయర్. అప్పూ అరెస్ట్ అయ్యారు అని తెలియగానే బెయిల్ తీసుకుని నేరుగా స్టేషన్కు వెళ్లారా? అని ప్రశ్నిస్తాడు లాయర్. నా చెల్లెలు కాబట్టి స్టేషన్కు వెళ్లానని, బాధ్యత ఉంది కాబట్టి బెయిల్ ఇప్పించానని అంటుంది కావ్య. నా చెల్లెలి కోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తానని అంటుంది. అందుకే శీను ఇంటికి కూడా వెతుక్కుంటూ వెళ్లారని అంటాడు లాయర్. ఆ మాటలతో అప్పూ, కావ్య, కళ్యాణ్ షాక్ అవుతారు. తప్పు చేశారని తెలిసినా చెల్లెలి మీద ప్రేమతో బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకెళ్లారని అంటాడు లాయర్. చెల్లెలికి శిక్ష పడకుండా కాపాడాలని శీను ఇంటికి వెళ్లి బెదిరించడానికి ప్రయత్నించారని చెబుతాడు లాయర్. మాట వినకపోయే సరికి తనని మాయం చేశారని అంటాడు లాయర్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు.
శ్రీను ఇంటికి వెళ్లిన మాట వాస్తవమేనని, కానీ అప్పటికే అతను అక్కడ లేడని చెబుతుంది కావ్య. ఆ శీను తన ఫ్రెండ్తో కలిసి కావాలనే అప్పూని ఇరికించేలా చేశాడని, ఎందుకలా చేశాడో కనుక్కోవడానికే వెళ్లానని అంటుంది. మీ చెల్లెలు ఏ తప్పు చేయలేదంటే నమ్మడానికి సాక్ష్యం కావాలని చెబుతాడు లాయర్. నువ్వు చెప్పిన సాక్ష్యంతోనే అప్పూకి శిక్ష పడబోతోందని కావ్యతో అంటుంది యామిని. నేను ఏ తప్పూ చేయలేదని, ఆ శీను ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదని కోర్టుతో చెబుతుంది అప్పూ. రాజ్ కోసం కావ్య కోర్టు బయట ఎదురు చూస్తుంటుంది.
అసలు బావ రాడని, నీ చెల్లెలి జీవితాన్ని నీ స్వార్ధానికి బలి చేస్తున్నావని అంటుంది యామిని. నువ్వు బావ కోసం ఎదురుచూస్తూ ఉంటే జడ్జిగారు శిక్ష వేసేస్తారని అంటుంది యామిని. నా మాట విని నేను చెప్పిన డీల్కి ఇప్పటికైనా ఒప్పుకోమని చెబుతుంది. ఆయన సాక్ష్యం తీసుకుని ఖచ్చితంగా వస్తారు.. నా చెల్లెల్ని కాపాడతారని అంటుంది కావ్య. మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యిందని నేను వెళ్తానని శీనుగాడు యామిని మనుషులతో గొడవపడతాడు. నాకు మా అమ్మే ముఖ్యమని, డబ్బులు కూడా వద్దని చెబుతాడు శీనుగాడు. దాంతో యామిని మనుషులకు కోపం వచ్చి తనని కోట్టబోతుండగా రాజ్ అడ్డుపడతాడు. ఆ రౌడీలతో ఫైట్ చేసి శీనుగాడిని కారులో కూర్చోబెడుతుండగా వెనుక నుంచి రాజ్ని తలపై కొడతాడు యామిని మనిషి. దాంతో రాజ్ కిందపడిపోతాడు.
మీ ముందు అన్ని సాక్ష్యాలను సమర్పించానని, అప్పూ లంచం తీసుకుంటూ దొరికిపోయినట్లుగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, సాక్షి కోర్టుకు రాకపోవడానికి కూడా అప్పూయే కారణమని చెబుతాడు యామిని లాయర్. ఆమెకు శిక్ష విధించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తాడు. లంచం ఇచ్చిన శీను కోర్టుకు వస్తేనే గానీ నిజం బయటకు రాదని, తగిని సాక్ష్యాలను సమర్పిస్తానని అప్పూ లాయర్ చెబుతాడు. ఇప్పటికే సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారని, ఇలా గడువు ఇస్తే ఇంకేం చేస్తారోనని యామిని లాయర్ అంటాడు. ఆ మాటలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. మీరు తప్పు చేశారా? లేదా? అని అడుగుతారు. ఇంతలో శీనుని తీసుకుని కోర్టుకు వస్తాడు రాజ్.
శీనుని బోనులో నిలబెట్టి విచారణ చేయిస్తాడు యామిని లాయర్. అప్పూకి లంచం ఇచ్చారా? లేదా? అని న్యాయమూర్తి అడగ్గా.. ఇచ్చానని చెబుతాడు శీను. ఏసీబీ ఆఫీసర్లకు కంప్లయంట్ ఇచ్చి అపూర్వ గారు లంచం తీసుకునే సమయంలో సాక్ష్యాలతో సహా నిరూపించింది ఈ శీనుయేనని అంటాడు యామిని తరపు లాయర్. కాబట్టి అపూర్వ దోషి అని తేలిందని చెబుతాడు. ఇంతలో శీనుగాడు కలగజేసుకుని.. అప్పూని లంచం కేసులో ఇరికించాలని కావాలనే నేను ఆ పని చేశానని అంటాడు. ఆ మాటతో యామిని షాక్ అవుతుంది. ముందుగా ఏసీబీ ఆఫీసర్లను స్టేషన్కు రప్పించానని, మేడం నన్ను లంచం అడగలేదు.. నేను, మా ఫ్రెండ్ కలిసి అప్పూని ఇరికించామని చెబుతాడు శీనుగాడు.
అలా ఇరికించడం వల్ల నీకొచ్చే లాభం ఏంటని యామిని తరపు లాయర్ ప్రశ్నించడంతో డబ్బు కోసం ఇదంతా చేశామని అంటాడు శీనుగాడు. ఎవరు డబ్బులిస్తానని చెప్పారని లాయర్ అడగటంతో ఒక లేడీ ఇస్తానని చెప్పారని, ఆవిడ ఎవరో నాకు తెలియదని చెబుతాడు శీనుగాడు. దాంతో యామిని ఏం జరిగిందో గుర్తుచేసుకుంటుంది. ఒకవేళ మన ప్లాన్ ఫెయిలై నువ్వు పోలీసులకు దొరికిపోతే కోర్టులో మాత్రం నా పేరు చెప్పడానికి వీల్లేదని చెబుతుంది యామిని. అలా చేస్తే నేను ఇరుక్కుంటాను కదా అని శీనుగాడు అడుగుతాడు. తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు నీకు ఆరు నెలలు జైలు శిక్ష వేస్తారు, కానీ నా కోసం నువ్వు జైలుకు వెళ్తే నెలకు లక్ష చొప్పున ఇస్తానని అంటుంది యామిని.
డబ్బు కోసమే ఇదంతా చేశానని కోర్టులో అబద్ధం చెబుతాడు శీనుగాడు. కావాలని ఫ్రాడ్ చేసి నా క్లయంట్ను ఇందులో ఇరికించాడని అప్పూ లాయర్ చెబుతాడు. ఇప్పటికైనా నా క్లయంట్ను నిర్దోషిగా విడుదల చేయాలని కోర్టు వారిని కోరుతున్నానని అంటాడు. అప్పూని నిర్దోషిగా విడుదల చేస్తున్నానని.. అప్పూని ఇరికించడానికి కుట్ర చేసిన శీనుకి 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెబుతారు. శీను చేత అప్పూని ఇరికించేలా కుట్ర చేసి ఆ లేడీ ఎవరో కనిపెట్టాలని పోలీసులను ఆదేశిస్తారు. అప్పూ నిర్దోషిగా విడుదల కావడంతో రాజ్కి కళ్యాణ్ థ్యాంక్స్ చెబుతాడు.


Click it and Unblock the Notifications










