Brahmamudi June 17th Episode: ఉంగరాలు మార్చేసిన కనకం.. అప్పూ చేతికి ఆధారం, యామిని ఛాప్టర్ క్లోజ్!
Photo Courtesy: JioHotstar
అమ్మవారికి యామిని హారతి ఇస్తుండగా కనకం ఫ్యాన్ పెట్టడంతో అది ఆరిపోతుంది. దీంతో ఇది అరిష్టమని పెళ్లిని అపేయాలని అపర్ణ, ఇందిరతో పాటు వాళ్లు ఏర్పాటు చేసిన ముత్తయిదవలు అంటారు. పెళ్లిని ఆపాల్సిన అవసరం లేదని ఈరోజే రాజ్- యామినికి నిశ్చితార్ధం చేసి మరో ముహూర్తం పెడతానని చెప్పడంతో అపర్ణ, ఇందిర, కనకం షాక్ అవుతారు. పెళ్లిని ఆపాలని శాస్త్రితో వేసిన పథకం యామినికి తెలిసిందని వాళ్లకి అర్ధమవుతుంది.
కర్ర విరగ్గొట్టి, ఫ్యాన్ ఆపినంత మాత్రాన ఈ పెళ్లి ఆగదని కావ్యతో అంటుంది యామిని. నేను తలచుకుంటే ఈ పెళ్లి ఆపడం నిమిషం పని అని, అయినా ఈ పెళ్లి జరగదని తేల్చిచెబుతుంది కావ్య. పెళ్లిని ఆపాలంటే అల్లుడిగారి మనసు మార్చాలని నిర్ణయించుకున్న కనకం.. రాజ్ దగ్గరికి వెళ్లి బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. ఇక జూన్ 17వ తేదీ ఎపిసోడ్ 750లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
గదిలో ఉన్న రాహుల్ - రుద్రాణిలు ఎంతకు పలకకపోవడంతో స్వప్న కంగారుపడి తలుపు తీస్తుంది. లోపలికి వచ్చి చూసేసరికి తల్లీకొడుకులు ఇద్దరూ కిటికీలోంచి తప్పించుకున్నట్లు స్వప్న గమనిస్తుంది. శాస్త్రి మరోసారి నిశ్చితార్ధానికి ముహూర్తం పెట్టడంతో అపర్ణ చేతుల మీదుగా వైదేహి తాంబూలాలు తీసుకుంటుంది. మీ అత్తగారి చేతుల మీదుగానే తాంబూలాలు తీసుకుంటున్నాని కావ్యని చూస్తూ మనసులో అనుకుంటుంది యామిని. జరుగుతున్నది తాంబూలాలు మార్చుకోవడమేనని, పెళ్లి జరగడానికి ఇంకా చాలా టైం ఉందని కావ్య అనుకుంటుంది. నిశ్చితార్ధపు ఉంగరాలు మరిచిపోవడంతో గదిలోకి వాటిని తీసుకొస్తుంది వైదేహి.
ఆ వెంటనే కనకానికి కన్ను కొడుతుంది అపర్ణ. వైదేహి నడుచుకుంటూ వస్తుండగా కనకం.. కార్పెట్ లాగుతుంది. దీంతో వైదేహి కింద పడిపోబోతుండగా కనకం పట్టుకుని నిశ్చితార్ధపు ఉంగరాలు ఉన్న బాక్స్ మార్చేస్తుంది. చూసుకుని నడవాలి కదా వైదేహి గారు ఎంత బాధ్యత నెత్తిన పెట్టుకున్నారు అని అంటుంది కనకం. నీలా డబ్బున్న వాళ్లింటికి కూతుళ్లని పంపించాలన్న ఆరాటం నాకు లేదని చెబుతుంది వైదేహి. మీలా పెళ్లి అయిపోయిన వాళ్లని విడగొట్టి నాటకాలాడి, పరాయి మొగుడిని మీ కూతురికి మొగుడిగా మార్చేంత గొప్ప మనసు నాకు లేదని సెటైర్లు వేస్తుంది కనకం.
వైదేహి ఇచ్చిన బాక్స్లో ఉంగరాలు కనిపించకపోవడంతో అంతా కంగారుపడతారు. ఈ పెళ్లి జరగడం కంటే ఆగిపోవడమే ఎక్కువైందని సెటైర్లు వేస్తుంది ధాన్యలక్ష్మీ. దోషాన్ని పొగొట్టాలని చెప్పి ఈ నిశ్చితార్ధం జరిపిస్తే ఇది కూడా ఆగిపోయేలా ఉందని అంటుంది. ముత్తయిదువులు కూడా పెళ్లిలో ఇది అరిష్టమని ఈ పెళ్లి జరగకూడదని అంటారు. శాస్త్రి.. కనకం వైపు చూసి ఇదంతా నీ పనా అని మనసులో అనుకుంటాడు. ముహూర్తం టైం దాటిపోతోందని, ఉంగరాలు ఉన్నాయా? లేదా? నిశ్చితార్ధం జరుగుతుందా? లేదా అని అడుగుతాడు శాస్త్రి. ఇలా ప్రతిసారి ఆటంకాలు వస్తే నేను మాత్రం ఏం చేయగలనని ప్రశ్నిస్తాడు.
ఆ వెంటనే యామిని కలగజేసుకుని కొత్త ఉంగరాలే మార్చుకోవాలా? ఒకరి ఉంగరాలు మార్చుకోవచ్చా? అని శాస్త్రిని అడుగుతుంది. అలాంటిదేమీ లేదని ఏంచక్కా మార్చుకోవచ్చని అంటాడు పంతులు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. నీ చేతి ఉంగరం నాకు పెట్టు.. నా చేతి ఉంగరం నీకు పెడతానని రాజ్తో అంటుంది యామిని. నీకు ఏమైనా ఇబ్బందా? అని అడగ్గా.. ఆడవాళ్ల ఉంగరం ఎలా పెట్టుకోవాలా? అని ఆలోచిస్తున్నాడేమో అని సెటైర్లు వేస్తాడు ప్రకాశం. ఇన్ని ఆటంకాలు వస్తున్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలా? వద్దా? అని అనుమానిస్తున్నాడేమో అని అంటుంది ధాన్యలక్ష్మీ. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని తన ఉంగారన్ని యామినికి తొడుగుతాడు రాజ్.
ఉంగరాలు కొట్టేసినా యామిని- రాజ్ల నిశ్చితార్ధం జరిగిపోవడంతో ప్లాన్ బీ వర్కవుట్ చేయాల్సిందే అనుకుంటుంది కనకం. వెంటనే అప్పూ- కళ్యాణ్లకు సైగ చేయడంతో కళ్యాణ్ బయటికి వెళ్తాడు. తన కళ్ల ముందే యామిని చేతికి రాజ్ ఉంగరం తొడగటంతో కావ్య బాధపడుతుంది. కళ్యాణ్ పైన బెలూన్స్ పగలగొడుతుండగా కనకం వెళ్లి రాజ్కు బదులుగా తాను ఉంగరాన్ని యామిని వేలికి తొడుగుతుంది. అది చూసిన శాస్త్రి షాక్ అవుతాడు. అర్జెంట్గా వాష్రూమ్కి వెళ్తూ చూసుకోలేదని బెలూన్స్ పగిలిపోయాని చెబుతాడు కళ్యాణ్. నిశ్చితార్ధం అయిపోయిందని కనకం చెప్పడంతో యామిని సంబరపడిపోతుంది. మీరు చెప్పినట్లుగానే నిశ్చితార్ధం పూర్తి అయ్యిందని శాస్త్రిని యామిని అడుగుతుంది. ఆ కనకం ఉంగరం పెట్టి నీకు మొగుడు అయ్యిందని మనసులో అనుకుని పెళ్లికి ముహూర్తం పెడతాడు శాస్త్రి.
రేపు ఉదయం మంచి ముహూర్తం ఉందని శాస్త్రి చెబుతాడు. తర్వాత కార్యక్రమం ఏంటని యామిని అడగ్గా.. నేనేం చేసినా చెడగొట్టడానికి వాళ్లు రెడీగా ఉన్నారని అంటాడు. ఆ మాటలతో కనకం ఉలిక్కిపడుతుంది. రాజ్- యామినిలకు కంగ్రాట్స్ చెప్పి బయటికి వెళ్లిపోతుంది కావ్య. దాంతో రాజ్ని తీసుకుని యామిని లోపలికి వెళ్లిపోతుంది. యామిని- రాజ్ల పెళ్లి ఎలాగైనా ఆపాలని కనకం - అపర్ణలు అనుకుంటారు. ఇంతలో అప్పూకి కానిస్టేబుల్ శేషు ఫోన్ చేసి.. అడవిలో కావ్య- రాజ్ల మీద అటాక్ చేయించింది యామినినే అని చెబుతాడు. ఆ మాటలతో అప్పూ షాక్ అవుతుంది. అప్రూవర్గా మారి మనం చెప్పినట్లుగా చేస్తే చిన్న కేసు పెట్టి వదిలేస్తామని చెప్పమంటుంది అప్పూ. ఆ మాటలు విన్న కళ్యాణ్.. రౌడీలను ఎందుకు వదిలేస్తానని చెబుతున్నావ్ అని అడుగుతాడు. నువ్వేం కంగారు పడొద్దని నా ప్లాన్స్ నాకున్నాయని అంటుంది అప్పూ.
నేను తలచుకుంటే ఏమైనా చేయగలనని అపర్ణ - ఇందిరలతో అంటుంది కనకం. ఇప్పుడు ఆపింది జస్ట్ నిశ్చితార్ధమేనని, ఇంకా అసలు సమస్య ముందుందని చెబుతుంది ఇందిర. పెళ్లిని ఆపడానికి కూడా ఏదో ఒక ప్లాన్ వేయాలని అంటుంది అపర్ణ. ఇంతలో అప్పూ వచ్చి.. నా దగ్గర ఒక ఐడియా ఉందని చెబుతుంది. అడవిలో అక్కాబావ మీద అటాక్ చేయించింది ఆ యామినియే అని చెబుతుంది అప్పూ. ఆ మాటలు విన్న అపర్ణ, ఇందిరలు షాక్ అవుతారు. స్టేషన్లో నాలుగు తగిలిస్తే ఆ రౌడీ నిజం చెప్పాడని అంటుంది. అయితే వెంటనే ఆ యామినిని అరెస్ట్ చేయమని అంటుంది ఇందిర. అలా చేయడానికి లేదని ఆ రౌడీ దగ్గరి నుంచి సాక్ష్యాన్ని రాబట్టాలని అప్పుడు ఆ యామిని జైళ్లో ఊచలు లెక్క పెట్టాల్సిందేనని చెబుతుంది అప్పూ. మెహందీ ఫంక్షన్ చేస్తున్నారు కదా? అక్కడే దానిని ఇరికిస్తానని అంటుంది. ఎంగేజ్మెంట్ జరిగిపోవడంతో బాధపడుతున్న రాజ్ దగ్గరికి కనకం, ఇందిర, అపర్ణలు వస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











