Brahmamudi March 20th Episode: రాజ్ను మాయ చేస్తోన్న యామిని.. కావ్యని పిచ్చిదానిని చేసేలా రుద్రాణి ట్రాప్
ఉదయాన్నే రాజ్కు కర్మకాండ జరిపిస్తారు దుగ్గిరాల కుటుంబ సభ్యులు. అది చూసి అపర్ణ - ఇందిర కన్నీటి పర్యంతమవుతారు. ఇంతలో మంత్రాలు వినిపించడంతో తన గదిలో నిద్రపోతున్న కావ్య కిందకి వచ్చి అటు ఇటూ చూస్తుంది. గార్డెన్లో రాజ్ ఫోటోకి దండ వేసి కర్మకాండ జరిపిస్తుండటంతో షాకై గోల గోల చేస్తుంది. ఈ కార్యం జరిపించకపోతే రాజ్ ఆత్మ శాంతించదని ఎంత చెబుతున్నా వినిపించుకోదు.
బతికున్న మనిషికి కర్మకాండలు చేయడం పాపమని , మీరు నా సౌభాగ్యాన్ని తుడిపేయొద్దని వాదిస్తుంది. దీంతో కావ్యకి పిచ్చి పట్టిందేమోనని కళ్యాణ్ - అప్పూలను తీసుకుని ఆసుపత్రికి వెళ్లమంటుంది ధాన్యలక్ష్మీ. నాకేమీ పిచ్చి పట్టలేదని, నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అంటుంది కావ్య . ఎంత చెబుతున్నా వినిపించుకోకపోవడంతో రాజ్ కర్మకాండకి తీసుకొచ్చిన సామాగ్రిని విసిరి కొడుతుంది. రాజ్కు ఆసుపత్రిలో కనిపించిన అమ్మాయి పదే పదే గుర్తొస్తోందని తల్లిదండ్రులతో చెబుతుంది యామిని. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక మార్చి 20వ తేదీ .. ఎపిసోడ్ 674లో ఏం జరిగిందంటే?

రామ్ ఆసుపత్రిలో చేర్చిన అమ్మాయి గురించి యామిని, ఆమె తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్ విషయంలో ఏ ఛాన్స్ తీసుకోనని ముందు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని చెబుతుంది యామిని. రాజ్ని హాస్పిటల్కు తీసుకెళ్లాలని అనుకుంటున్నానని, తన గతం గుర్తు చేస్తానని చెబుతుంది యామిని. నువ్వే గతం గుర్తుచేస్తే ఎలా? అని వైదేహి ప్రశ్నించగా.. నేను అంత పిచ్చిదాన్ని కాదని, అది నేను సృష్టించిన గతమని యామిని చెబుతుంది. నేను చెప్పబోయే కట్టుకథని రామ్ రేపటి నుంచి నమ్మడం మొదలుపెడతాడని అంటుంది . తాను చదువుకున్న స్కూల్, తన ఫ్రెండ్స్, తను పెరిగిన వాతావరణం అన్ని కొత్తగా పరిచయం చేస్తానని చెబుతుంది.
నేను సృష్టించిన జ్ఞాపకాలే ఇకపై తన జీవితంలో సంఘటనలు అవుతాయని అంటుంది యామిని. మేం కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగామని ఎప్పుడైతే రామ్ నమ్మడం మొదలుపెడతాడో అప్పుడు నన్ను తన మనిషిగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాడని చెబుతుంది . ఈ మాటలన్నీ రాజ్ వినడంతో యామిని షాక్ అవుతుంది. ఏం మాట్లాడుకుంటున్నారు? అని రాజ్ ప్రశ్నించగా.. నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్లే విషయం గురించి చర్చించుకుంటున్నామని అంటుంది యామిని. మనం హాస్పిటల్కి వెళ్తున్నామని అక్కడ నీకో సర్ప్రైజ్ కూడా ఉంటుంది చెబుతుంది. పదే పదే ఆ అమ్మాయే ఎందుకు గుర్తొస్తోంది . నేను తెలుసుకుంటానని మనసులో అనుకుంటాడు రాజ్.
రాజ్ కర్మకాండ జరగనివ్వకుండా కావ్య చేసిన గొడవని దుగ్గిరాల కుటుంబ సభ్యులు గుర్తుచేసుకుంటారు. అసలే రాజ్ దూరమయ్యాడని బాధపడుతుంటే కావ్య ప్రవర్తన నన్ను ఇంకా భయపెడుతోందని అంటుంది అపర్ణ. నాకు ఇదే అర్ధం కావడం లేదని , కావ్యకి ఎలా నచ్చజెప్పాలో తెలియడం లేదని అంటాడు సుభాష్. మీరిద్దరూ ఎన్నో అటుపోట్లు చూశారని, కొడుకు దూరమయ్యాడని తెలిసి ఇలా చతికిలపడిపోవద్దని చెబుతుంది ఇందిర. జీవితంలో కావ్య ఏం చూసింది? చిన్న వయసులోనే భర్త దూరమయ్యేసరికి ఆ నిజాన్ని నమ్మలేక బతికే ఉన్నాడని భ్రమ పడుతోందని అంటుంది.
ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కావ్యకి ఏం ఆనందం దొరికిందని.. రాజ్, అపర్ణలు దూరం పెట్టారని , ఇంట్లో అంతా అవమానించారని గుర్తుచేస్తుంది ఇందిర. చివరికి భర్త అర్ధం చేసుకుని ప్రేమను పంచే సమయానికి శాశ్వతంగా దూరమైపోయాడని బాధపడుతుంది. భర్తే ప్రపంచం అనుకుని బతికిందని ఇప్పుడు వాడే లేడని తెలిసి మళ్లీ తిరిగొస్తాడని అనుకుంటోందని ఇందిర చెబుతుంది. కావ్య మాటలకి నాకే రాజ్ బతికే ఉన్నాడని అనుమానం వచ్చిందని అంటుంది.
పెద్దవాళ్లుగా మనమే తనకు అండగా నిలబడాలని, మనం ఉన్నామనే నమ్మకం తనకు కలిగేలా చేయాలని చెబుతుంది . కావ్యని చూస్తుంటే తను మారుతుందనే నమ్మకం నాకు లేదని అంటుంది అపర్ణ. అత్తగా నా బాధ్యతను నేను నిర్వర్తించలేదని, తనకి ఏ ఆనందాన్ని ఇవ్వలేదని బాధపడుతుంది అపర్ణ. కావ్యకి నిజం చెబితే ఈ చిన్న గుండె తట్టుకుంటుందా? అని ప్రశ్నిస్తుంది. కావ్య ముందు నేను ఓడిపోయానని చెబుతుంది.
కావ్య దగ్గరికి స్వప్న, అప్పూలు వచ్చి ఇంట్లో అంతా నీ గురించి ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు ఇలా ఎలా ఉంటున్నావని కోప్పడుతుంది స్వప్న. ఇంట్లోవాళ్లు ఏమనుకున్నా నాకేం బాధలేదని, నా కళ్లతో నేను చూసిందే నమ్ముతానని అంటుంది కావ్య. ఇప్పటికీ రాజ్ బతికే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది స్వప్న. మరి అప్పు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా ఏంటి అని అడుగుతుంది. బయటివాళ్లు ఏదో చేశారంటే ఏమో అనుకోవచ్చు.. కానీ అప్పూ అక్కడికి వెళ్లి మొత్తం తెలుసుకుని వచ్చిందని చెబుతుంది స్వప్న. మేం ఇంతగా చెబుతున్నా మొండిగా వాదిస్తావేంటీ అంటూ కావ్యని కొట్టబోతుంటే అప్పూ ఆపుతుంది.
చిన్నప్పటి నుంచి కావ్య అక్కని చూస్తున్నాం కదా? తన మాటల్ని మనమెందుకు నమ్మకూడదని ప్రశ్నిస్తుంది అప్పూ. ఒకవేళ అక్క చెప్పినట్లు బావ బతికే ఉంటే? కాసేపు మనం కావ్య అక్కలా ఆలోచిద్దామని చెబుతుంది. అధికారులతో మాట్లాడి బావ కేసును రీ ఇన్వెస్ట్గేషన్ చేయాలని పర్మిషన్ తీసుకుంటానని చెబుతుంది అప్పూ. మళ్లీ జీరో నుంచి మొదలుపెడతానని బావకి సంబంధించిన ఏ చిన్న క్లూ దొరికినా అది మనకి చాలా ఉపయోగపడుతుందని అంటుంది. నేను దానికి ఒప్పుకుంటానని.. కానీ నువ్వు ఏ నిజం బయటపెట్టినా దానిని కావ్య నమ్మాలని చెబుతుంది స్వప్న. అప్పూ ఇన్వెస్టిగేషన్ చేసేలోపు మా ఆయన్ను తీసుకొచ్చి అందరి ముందు నిలబెడతానని అంటుంది కావ్య.
కావ్య అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాడంటే నాకు కూడా రాజ్ బతికే ఉన్నాడని అనిపిస్తోందని రుద్రాణితో చెబుతాడు రాహుల్. రాజ్ బట్టలు, వస్తువులు దొరకడం చూస్తుంటే రాజ్ చచ్చాడని నీకు అర్ధం కావడం లేదా ప్రశ్నిస్తుంది రుద్రాణి. రాజ్ బతికే ఉంటే ఈ పాటికి వాడు ఇంటికి వచ్చి ఉండాలని అంటుంది. రాజ్ అధ్యాయం ముగిసిపోయిందని సింహాసనం మీద కూర్చోబోయే యువరాజు ఎవరా అనేది ముఖ్యమని చెబుతుంది రుద్రాణి. రాజ్ ఎప్పటికీ తిరిగిరాడు, కళ్యాణ్కి వాటి మీద ఆశ లేదు ఇక మిగిలింది నువ్వే కానీ.. మధ్యలో కావ్య అడ్డుగా ఉందని అంటుంది.
నువ్వు ఆ కంపెనీకి యువరాజు కావాలంటే ఆ కావ్య అడ్డు తొలగించుకోవాలని రుద్రాణి చెప్పేసరికి రాహుల్ షాక్ అవుతాడు. కావ్యకి పిచ్చిదానిలా ముద్రవేసి మూలన కూర్చోబెడితే నువ్వే రాజువి అంటుంది. ఉదయాన్నే రాజ్ ఫోటోకి దండ వేసి దీపం వెలిగించబోతుంది రుద్రాణి. దానిని దుగ్గిరాల ఫ్యామిలీ చూసి షాక్ అవుతుంది. ఈ ఇంట్లో ఇలాంటివి వద్దని కావ్య చెప్పింది కదా ఆమెను ఎందుకు బాధపెడుతున్నావని ఫైర్ అవుతుంది ఇందిర. ఆమె మాటలు నమ్మి మన బిడ్డకు చేయాల్సినవి చేయరా అని ప్రశ్నిస్తుంది ఇందిర. ఇంట్లో ఏ ఒక్కరైనా రాజ్ బతికే ఉన్నాడని నమ్ముతున్నారా? అని రుద్రాణి ప్రశ్నించేసరికి అంతా మౌనంగా ఉంటారు. దీపం వెలిగించబోతుండగా కావ్య అడ్డుకోవడంతో పాటు రుద్రాణి గొంతు పట్టుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











