Brahmamudi November 27th Episode: కావ్య, రాజ్లకు సుభాష్ క్లాస్... సంచలన కేసును టేకప్ చేస్తోన్న అప్పూ
Photo Courtesy: JioHotstar
ఆర్ కంపెనీకి తనను ఛైర్మన్ను చేయడంతో రాజ్, కావ్యలకు రాహుల్ థ్యాంక్స్ చెబుతాడు. రాహుల్తో కంపెనీని పెట్టించడంతో రాజ్, కావ్యల దగ్గర సీతారామయ్య బాధపడతాడు. దుగ్గిరాల కుటుంబం మొత్తం ఒకటిగా ఉండాలన్నది నా కల.. కానీ మీరు రాహుల్ను బయటికి పంపారని చెబుతాడు. ఈ నిర్ణయం వల్ల ఏదైనా సమస్య వస్తే నేనే తట్టుకోలేనని చెబుతాడు సీతారామయ్య. ధాన్యలక్ష్మీ నగలు సర్దుకుంటుండగా రుద్రాణి వచ్చి కేజీ బంగారం ఎంత అని అడుగుతుంది.
రాహుల్ ఓ కంపెనీకి ఛైర్మన్ అయ్యాడు కాబట్టి.. నేను కూడా ఇకపై మీతో సమానం అయ్యానని అంటుంది రుద్రాణి. ఈ ఆస్తికి ఎప్పటికైనా రాజ్, కళ్యాణ్లే వారసులని.. నువ్వు, నీ కొడుకు బయటివాళ్లేనని ధాన్యం అనడంతో రుద్రాణి రగిలిపోతుంది. రాజ్ నా చేత పెట్టించిన కంపెనీ సాయంతో స్వరాజ్ కంపెనీని లాగేస్తానని చెబుతాడు రాహుల్. కొడుకు ప్లానింగ్కు రుద్రాణి మురిసిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. ఇక నవంబర్ 27వ తేదీ ఎపిసోడ్ 889లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఐస్ క్రీమ్ తినడానికి అర్ధరాత్రి కారులో ఊరంతా తిప్పుతుంది అప్పూ. మొన్న అరకేజీ ఐస్క్రీమ్ తిన్నావు... నీకు జలుబు చేయడంతో మా అమ్మ నన్ను ఫుట్బాల్ ఆడుకుందని మళ్లీ నువ్వు ఐస్క్రీమ్ తింటే నన్ను చంపేస్తుందని అంటాడు కళ్యాణ్. అదే మా బావగారైతే అక్క ఏం చెబితే చేస్తే అది చేస్తాడని విసిగిస్తుంది. దాంతో అప్పూకి ఐస్క్రీమ్ తినిపిస్తాడు కళ్యాణ్. అయితే అటు తిరిగి ఇటు తిరిగి పోలీస్ స్టేషన్ ముందుకు వస్తారు అప్పూ, కళ్యాణ్. పోలీస్ స్టేషన్ ముఖం చూసి చానాళ్లు అవుతోంది.. ఒకసారి అందరికీ హాయ్ చెప్పి వస్తానని అప్పూ విసిగించడంతో కళ్యాణ్ సరేనని అంటాడు.
అప్పూ వెళ్లేసరికి ఒక తల్లి తన బిడ్డ తప్పిపోయిందని కాపాడమని ఏడుస్తూ ఉంటుంది. వెతుకుతున్నాం.. ఆచూకీ దొరకగానే కబురు చేస్తాం, ఎన్నిసార్లు చెప్పాలంటూ కానిస్టేబుల్ శేషు ఆమెపై కోప్పడతాడు. ఆ మాటలు విన్న అప్పూ అతనిపై కోప్పడుతుంది. పబ్లిక్తో ఎలా మాట్లాడాలో తెలియదా? మనం పబ్లిక్ సర్వెంట్స్ శాంతంగా విని సాయం చేయాలని చీవాట్లు పెడుతుంది అప్పూ. ఏం జరిగిందో చెప్పమని ఆ తల్లిని అప్పూ అడుగుతుంది. సంవత్సరం నుంచి మా పాప కనిపించడం లేదని ఆమె చెప్పడంతో అప్పూ షాక్ అవుతుంది. కంప్లయంట్ ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, ఇంతవరకు మా పాప ఆచూకీ దొరకలేదని బాధపడుతుంది.
ఈ కేసు ఎందుకు పెండింగ్లో ఉందని అప్పూ నిలదీయడంతో ఈ కేసును పట్టించుకోవద్దని సీఐ గారు చెప్పారని అంటాడు శేషు. లోపలికి వెళ్లి సీఐకి సెల్యూట్ చేయగా.. చాలారోజులకు స్టేషన్ గుర్తొచ్చిందని అప్పూతో అంటాడు సీఐ. పాప కనిపించలేదని సంవత్సరం అవుతోందని చెప్పిందని, కానీ ఆ కేసు ఎందుకు కదల్లేదని అడుగుతుంది అప్పూ. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగిందని, చివరికి తేలింది ఏంటంటే ఆ పాప చనిపోయిందని చెబుతాడు సీఐ. ఈవిడ భర్త కూడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు.. కానీ ఈవిడ మాత్రం నా కూతురు బతికే ఉందని, వెతికి తీసుకురమ్మని ఇలా ప్రాణాలు తీస్తోందని చెబుతాడు సీఐ. కానీ ఆవిడ చెప్పే మాటల్లో నిజముందని అనిపిస్తోందని అంటుంది అప్పూ.
తన పాప బతికే ఉందని బలంగా నమ్ముతుందని, ఇంకో ప్రయత్నం చేద్దామని అంటుంది అప్పూ. పెద్ద పెద్ద కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయని.. అవన్నీ వదిలేసి అసలు ఏ ప్రాబ్లమ్ లేని ఇలాంటి కేసుపై దృష్టి పెట్టాలా? అని సీఐ మండిపడతాడు. అయితే లాంగ్ లీవ్ క్యాన్సిల్ చేసుకుని డ్యూటీలో జాయిన్ అయ్యి, మళ్లీ కేసును రీఓపెన్ చేయమని అప్పూపై సీరియస్ అవుతాడు సీఐ. నాకు చాలా కేసులు ఉన్నాయి... మర్యాదగా బయటికి వెళ్లిపోమ్మని అంటాడు సీఐ. అప్పూని చూసిన ఆ తల్లీ తనకు న్యాయం చేయమని వెంటపడుతుంది. కానీ అప్పూ పట్టించుకోకుండా వెళ్లిపోతుంది.
నీ బకెట్ లిస్ట్లోని అన్ని కోరికలు తీరిపోయాయి కదా? ఇంకెం లేవు కదా అని కావ్యని అడుగుతాడు రాజ్. ఓ చిన్న కోరిక మిగిలిపోయిందని కావ్య చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇంతలో అపర్ణ, సుభాష్లు వచ్చి రాహుల్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం మాకు నచ్చలేదని చెబుతారు. రాహుల్ మీద మాకు నమ్మకం లేదు.. ఇప్పటికీ తనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాం, అలాంటిది ఓ కొత్త కంపెనీని తన చేతుల్లో ఎందుకు పెట్టారని సుభాష్ అడుగుతాడు. రాహుల్ మన కింద ఉండటం వల్లే అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడని మాకు అర్ధమైందని చెబుతాడు రాజ్. వాడికి కంపెనీని నడిపేంత సామర్ధ్యం ఉందని మీరు ఎలా నమ్మారు అని నిలదీస్తుంది అపర్ణ.
రాహుల్కి బాధ్యతలు అప్పగించినా వాడి మీద ఓ కన్నేసి ఉంచుతానని చెబుతాడు రాజ్. కానీ కావ్య మాత్రం రాహుల్కి పూర్తి స్వేచ్ఛని ఇవ్వాలని అంటుంది. తనకు కూడా బాధ్యతలు తెలియాలని చెబుతుంది. ఒకవేళ రాహుల్కు చేతకాక కంపెనీ నష్టపోతే అప్పుడేం చేస్తావని అడుగుతాడు సుభాష్. ఒక సంవత్సరం ఆదాయం పోయిందని అనుకుందామని అంటుంది కావ్య. ఇంత రిస్క్ తీసుకుని రాహుల్ని మార్చాలని ఎందుకు అనుకుంటున్నారని అపర్ణ అడుగుతుంది. నాకు, అప్పూకి ఈ ఇంట్లో దక్కుతున్న హోదానే స్వప్నకి కూడా జరగాలి. రాహుల్ మారితే రుద్రాణి గారిలోనూ మార్పు వస్తుందని అంటుంది కావ్య. రాహుల్, రుద్రాణిలు మారతారంటే అంతకన్నా కావాల్సింది ఏముందని అంటాడు సుభాష్.
పోలీస్ స్టేషన్లో కనిపించిన తల్లి, ఆమె కూతురు కలలో రావడంతో అప్పూ ఉలిక్కిపడి లేస్తుంది. దాంతో కళ్యాణ్ లేచి ఏం జరిగిందని అడుగుతాడు. పాప చనిపోయినట్లు, ఆ తల్లి గుండె పగిలేలా ఏడుస్తున్నట్లు పీడకల వచ్చిందని చెబుతుంది అప్పూ. పాప చనిపోయి ఏడాది అవుతుందని నువ్వే చెప్పావు కదా అని అడుగుతాడు కళ్యాణ్. ఆవిడ పాప కోసం పాడుతున్న బాధని బట్టి పాప బతికే ఉందని అనిపిస్తోందని అంటుంది అప్పూ. మా డిపార్ట్మెంట్ ఎక్కడో తప్పు చేసి ఉంటుందని చెబుతుంది. నేను ఆ కేసుని రీ ఓపెన్ చేయాలని అనుకుంటున్నానని అప్పూ చెప్పడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. నువ్వు ప్రెగ్నెంట్వి, నువ్వు తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతావని అమ్మకి కానీ, ఈ ఇంట్లో ఎవరికి తెలిసినా ఊరుకోరని అంటాడు కళ్యాణ్. ఆ పాప బతికే ఉండి, ఆ తల్లికి సాయం చేయకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని అంటుంది అప్పూ. నీ పరిస్ధితిని నేను అర్ధం చేసుకుంటాను, కానీ అమ్మానాన్నల కళ్లుకప్పి ఎలా కేసు టేకప్ చేస్తావని అడుగుతాడు కళ్యాణ్. ఎంత కష్టమైనా సరే ఆ పాపని తల్లికి అప్పగించాల్సిందేనని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










