Brahmamudi October 17th episode : కావ్యకి భార్య స్థానమిచ్చిన రాజ్ .. టైం చూసి దెబ్బకొట్టిన రుద్రాణి
కృష్ణమూర్తి - కనకం కేక్ కట్ చేసిన తర్వాత రాజ్ - కావ్యలు వారిద్దరికి కేక్ తినిపిస్తారు. అనంతరం ఇందిర, అపర్ణ, ప్రకాశం, కనకం, స్వప్న, కళ్యాణ్, అప్పూ, రాజ్లు తమ వివాహ బంధం గురించి గొప్పగా చెబుతారు. కానీ కావ్య మాత్రం తనపై తన భర్తకు నమ్మకం లేదని చెబుతుంది. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఇంతలో పంతులుగారు వచ్చి దాంపత్య వ్రతం కోసం ఏర్పాట్లు ఇంకా పూర్తి చేయలేదా అని అడుగుతాడు. అపర్ణ , కనకం కలగజేసుకుని కావ్య - రాజ్, కళ్యాణ్ - అప్పూ, రాహుల్ - స్వప్నలు వ్రతంలో కూర్చొంటారని చెబుతారు.
ఇంతలో కావ్య లేచి ఇక్కడ దాంపత్యమే సరిగా లేదని, అలాంటప్పుడు దాంపత్య వ్రతం ఎందుకని వెళ్లిపోతుంది. ఆమె మాటలతో రాజ్ సహా కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. కూతురిని , అల్లుడిని నోములో కూర్చోబెట్టాలని అనుకున్న కనకం .. రాజ్ ముందు దగ్గుతున్నట్లుగా నటిస్తుంది. తనకు పూజలో కూర్చోవడానికి ఏ అభ్యంతరం లేదని, కానీ మీ కూతురు కొండ మీద కూర్చొని ఉందని అంటాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 17వ తేదీ .. ఎపిసోడ్ 543లో ఏం జరిగిదంటే ..

ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు అల్లుళ్లతో కలిసి దాంపత్య వ్రతం చేసుకుంటుంటే చూసే అదృష్టం నాకు లేదని కనకం సెంటిమెంట్ డ్రామా ప్లే చేస్తుంది. కళ్ల ముందే నా కలలన్నీ కూలిపోతున్నా ఏం చేయలేకపోతున్నానని దగ్గుతూ చెబుతుంది. నేనే ఏదో ఒకటి చేసి మీ అమ్మాయిని పూజకి ఒప్పిస్తానని చెప్పి బయల్దేరుతుంది కనకం. ఇంతలో అపర్ణ, ఇందిరలు రాజ్ని పిలిచి మీ అత్తగారి ఆరోగ్య పరిస్ధితి చూస్తుంటే బాధగా ఉందని అంటారు. దాంపత్య వ్రతంలో కూర్చోమని అపర్ణ అడగ్గా.. నాకేమీ అభ్యంతరం లేదని, కానీ ఆ కళావతి ఒప్పుకోవడం లేదని అంటాడు రాజ్. ఏదో ఒకటి చేసి కళావతిని ఒప్పిస్తానని అంటాడు. మాట్లాడాలని చెప్పి కావ్యని గదిలోకి తీసుకెళ్తాడు రాజ్. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో కనకం, అపర్ణ, ఇందిరలు దొంగచాటుగా వింటారు.
గుడిలో గంట కొడితే తేళ్లు, జెర్రులు పాకుతున్నాయని అన్నారు కదా.. అలాంటప్పుడు నా చేయి పట్టుకున్నారేంటని అడుగుతుంది కావ్య. వసుదేవుడు అంతటివాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడని , నేను నీ చెయ్యి పట్టుకుంటే ఏముంది అంటాడు రాజ్. నీకు నాకు మధ్య ఏదైనా ఉంటే మనిద్దరం తర్వాత చూసుకుందామని .. నాతో పాటు వచ్చి వ్రతంలో కూర్చోమని అడుగుతాడు. దాంపత్య వ్రతంలో దంపతులే కూర్చొంటారని, నాకు మీకు ఏ సంబంధం లేదని మీరే కదా చెప్పింది అని అంటుంది కావ్య. నన్ను ఏమైనా అను పర్లేదు.. కానీ మీ అమ్మని ఒక్క మాటన్నా ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు రాజ్. తనపై అల్లుడుగారు చూపించే ప్రేమకు కనకం ఎమోషనల్ అవుతుంది.

అసలు మా ఇంట్లో మీ హడావుడి ఏంటీ, మా అమ్మానాన్నల పెళ్లిరోజును ఎందుకు చేస్తున్నారని కావ్య ప్రశ్నిస్తుంది. తెలిసే రోజు వస్తే అదే తెలుస్తుందని అంటాడు రాజ్. ఆ రాహులే ముసుకుని కూర్చొంటాడని రాజ్ చెప్పగా.. రాహుల్కి నాకు పోలిక అంటూ కావ్య సీరియస్ అవుతుంది. మాట్లాడితే మీ అమ్మ మీ అమ్మ అంటున్నారు .. అసలు మా అమ్మకి ఏమైందని నిలదీస్తుంది. ఇన్ని ప్రశ్నలకు ఆన్సర్ చెప్పలేనని.. దయచేసి వ్రతంలో కూర్చోమని రాజ్ బతిమలాడతాడు. పూజలో మీ పక్కన ఏ స్థానంలో కూర్చోవాలని కావ్య అడగ్గా.. నా భార్య స్థానంలో కూర్చో అని ఆన్సర్ ఇస్తాడు రాజ్. మీ అమ్మ, మా అమ్మ ఆనందం కోసమే కాదు.. మన గురించి కూడా ఆలోచించి మాట్లాడుతున్నానని చెప్పగా కావ్య షాక్ అవుతుంది. తాను అన్ని మరిచిపోయి పిలుస్తున్నానని, నువ్వు అన్ని గుర్తుపెట్టుకుని రావాలని.. తాను వెళ్లి పీటలపై కూర్చొంటానని , నువ్వు వస్తావో రావో తేల్చుకో అని వెళ్లిపోతాడు.
అప్పూ రెడీ అవుతుండగా బంటి వచ్చి పెద్దమ్మ చాలా తెలివైనదని, బావని దారిలోకి తీసుకొచ్చిందని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్పూ వాడిని గట్టిగా పిలుస్తుంది. అది విన్న రుద్రాణి కిటికీ దగ్గరికి వచ్చి వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంది. మా అమ్మ ఏం చేసిందో , వెనుక నుంచి ఏం నడిపిస్తుందో చెప్పు అని బంటిని నిలదీస్తుంది. కావ్య అక్కని, రాజ్ బావని కలపడానికి పెద్దమ్మ తనకి క్యాన్సర్ అని త్వరలోనే చనిపోతానని అబద్ధం చెప్పిందని బంటి అసలు నిజం చెప్పేస్తాడు. పెద్దమ్మ ఆఖరి కోరిక తీర్చడానికి రాజ్ బావ దగ్గరుండి ఈ ఏర్పాట్లు చేశాడని చెప్పడంతో అప్పూ, రుద్రాణి షాక్ అవుతారు. నిజం తెలియడంతో రుద్రాణి సంబరాలు చేసుకుంటుంది.

కళ్యాణ్ - అప్పూ, రాహుల్ - స్వప్నలు వ్రతంలో కూర్చొంటారు. అక్కా, చెల్లి పూజలో కూర్చొంటే ఆవిడకెందుకు అంత టెక్కు అంటూ కావ్యను ధాన్యలక్ష్మీ సూటిపోటీ మాటలు అంటుంది. ఇంతలో కళావతి తలుపు తెరిచి రాజ్ పక్కనే కూర్చొంటుంది. ఇది చూసి రుద్రాణి , ధాన్యలక్ష్మీ తప్పించి అంతా సంతోషిస్తారు. మూడు జంటలు ఒకరికొరకు బొట్టు పెట్టుకుని ఆనందంగా ఉంటారు. దాంపత్య వ్రతం పూర్తయ్యిందన్న పంతులు గారు వారికి కంకణాలు ఇచ్చి కట్టుకోమని చెబుతాడు.
కావ్య చేతికి రాజ్ కంకణం కట్టబోతుండగా రుద్రాణి గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఎందుకిలా చేస్తున్నావని కనకం ఆమెను అడుగుతుంది. నాటకం ముగిసిన తర్వాత ప్రేక్షకులు చప్పట్లు కొడతారని రుద్రాణి ఆన్సర్ ఇస్తుంది. నీ నాటకం గురించి తెలిసే మాట్లాడుతున్నానని చెప్పడంతో రాజ్ కోప్పడతాడు. తాను ఒక అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నానని చెబుతుంది రుద్రాణి. నువ్వెలా మోసపోయావో, మనమంతా ఎలా ఫూల్స్ అయ్యామో దాని గురించి బయటపెడతానని అంటుంది. ఏదైనా ఉంటే ఇంటికెళ్లి మాట్లాడుకుందామని అపర్ణ మండిపడుతుంది. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











