Brahmamudi October 31st episode : ఫలించిన కావ్య స్కెచ్ .. వేలంలో రెచ్చిపోయిన కనకం, నిండా మునిగిన అనామిక
అరవింద్ కంపెనీ వేలం పాటలో కొంటున్నట్లు రాజ్తో కావ్య చెప్పడంతో అతను మండిపడతాడు. సీఈవోగా నాదే ఫైనల్ డెసిషన్ అని చెబుతుంది. రుద్రాణి ద్వారా అనామికను చావు దెబ్బ కొట్టాలని అనుకున్న కావ్య .. స్వప్న ద్వారా ప్లాన్ అమలు పరుస్తుంది. స్వప్న మాటలు నమ్మిన రుద్రాణి వేలం పాట విషయాన్ని అనామికకు చేరవేస్తుంది. సామంత్ వద్దన్నా వినకుండా వేలం పాటకు రెడీ అవుతుంది అనామిక.
నష్టాల్లో ఉన్న అరవింద్ కంపెనీని కావ్య వేలంలో కొనడానికి నిర్ణయం తీసుకుందని ఇంట్లో వాళ్లకి చెబుతాడు రాజ్. కానీ ఎవ్వరూ అతని మాటలను పట్టించుకోరు. కావ్య కంపెనీకి సీఈవో అని ఆమె నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఇంట్లో ఎవ్వరికీ లేదని సీతారామయ్య తేల్చిచెబుతాడు. ఇంతలో భోజనం చేస్తున్న కావ్యకి సీతారామయ్య ఫోన్ చేసి వేలం పాట గురించి అడుగుతాడు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 31వ తేదీ .. ఎపిసోడ్ 555లో ఏం జరిగిదంటే ..

వేలం పాట గురించి ఏం కంగారు పడొద్దని సీతారామయ్యతో కావ్య చెబుతుంది. మన ప్రయత్నం సరిగా ఉన్నా .. మన చుట్టూ ఉన్న వాళ్లు మోసం చేసే ప్రమాదం ఉందని సీతారామయ్య హెచ్చరిస్తాడు. అనామిక విషయంలో ఒకసారి అనుకోని ప్రమాదం జరిగిందని గుర్తుచేసి ఫోన్ పెట్టేస్తాడు. వేలం పాటకు నేను కూడా వెళ్తానని కూతురిని అడుగుతుంది కనకం. తల్లి పోరు భరించలేక ఓకే అంటుంది కావ్య. అరవింద్ కంపెనీని వేలం పాటలో కొనడం ఇష్టం లేక రాజ్ రాత్రంతా దాని గురించే ఆలోచిస్తాడు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో కంపెనీకి ఇది మరింత నష్టమే తప్పించి లాభం కాదని అనుకుంటాడు. ఏదో జరుగుతోందని.. ఎలా తెలుసుకోవాలా అని ఆలోచించి కావ్య అసిస్టెంట్ శృతికి ఫోన్ చేస్తాడు.
వేలం పాట ఎందుకు అని అడగ్గా.. నేను కంపెనీ విషయాలను పరాయి వాళ్లకు షేర్ చేయనని అంటాడు. మీరు మేనేజర్ పోస్ట్ తీసుకుని ఉంటే చెప్పేదాన్ని అని శృతి అంటుంది. రేపు నేను మేనేజర్ అయ్యాక నీకు సీటు లేకుండా చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. కావ్య తప్పు చేస్తే నాకే మంచి జరుగుతుందని.. అది తీసుకున్న పనికిమాలిన నిర్ణయంతో ఇంట్లో వాళ్లు తెలుసుకుని నన్ను తీసుకెళ్లి తిరిగి ఎండీ చైర్లో కూర్చోబెడతారని అనుకుంటాడు రాజ్. ఎంత పొద్దెక్కినా సుభాష్ ఇంకా నిద్రలేవకపోవడంతో అపర్ణని అడుగుతుంది ఇందిర. తనకేం తెలియదని , మీరే వెళ్లి చూసుకోండి అంటుంది అపర్ణ. ఆమె వెళ్లేసరికి సుభాష్ జ్వరంతో దుప్పటి కప్పుకుని వణికిపోతూ కనిపిస్తాడు. డాక్టర్కి ఫోన్ చేస్తానని చెప్పి.. బయట హాల్లో అపర్ణ దగ్గరికొచ్చి కడిగిపారేస్తుంది.

జ్వరంతో బాధపడుతున్న వాడిని వదిలేస్తావా అని అడుగుతుంది. కావ్య విషయంలో రాజ్ తప్పుచేశాడని వాడిని రోజు ప్రశ్నిస్తున్నావు.. సుభాష్ను పట్టించుకోవా అంటూ మండిపడుతుంది. కా కొడుక్కి ఆయనకీ పోలికా.. నా కొడుకు తప్పు చేశాడు, మీ కొడుకు చేసింది మోసం అని అపర్ణ ఆన్సర్ ఇస్తుంది. నీ కొడుకు తప్పు చేశాడని తెలిసి కావ్యని బతిమలాడి ఆఫీస్కి రప్పించావ్.. నువ్వు మారనప్పుడు, నిన్ను చూస్తూ పెరిగిన నీ కొడుకు మాత్రం ఎందుకు మారతాడని అపర్ణని నిలదీస్తుంది.
వేలం పాట జరిగే వేదిక దగ్గరకి కావ్య - కనకం రాగానే అరవింద్ వచ్చి పలకరిస్తాడు. మిమ్మల్నే నమ్ముకుని వేలం పాటకు వచ్చానని, భారం మీదేనని కావ్యతో అంటాడు. అంతా నేను చూసుకుంటానని ధైర్యంగా ఉండమని చెబుతూ ముందుకు వెళ్లగా అక్కడ అనామిక వారికి ఎదురవుతుంది. తల్లీకూతుళ్లు ఇద్దరూ కలిసి వచ్చారు.. ఇక్కడేమైనా ముగ్గుల పోటీ జరుగుతుందా అని సెటైర్లు వేస్తుంది. మేం ముగ్గులు వేస్తాం.. నువ్వు బాగా డబ్బున్న వాడిని ముగ్గులోకి దింపు అంటూ కనకం మండిపడుతుంది. మా అత్తగారికి మండితే ఏదో ఒక రోజు నీ ఇల్లు కూడా ఇలాగే వేలం వేస్తారని కావ్య హెచ్చరిస్తుంది. వేలం పాట అంటే వేలల్లో కాదు కోట్లలో పాడాలి.. ఇప్పటికే మీ కంపెనీ నష్టాల్లో ఉంది, ఇంకో నష్టాల్లో ఉన్న కంపెనీని కొంటే మీ పరిస్ధితి దారుణంగా ఉంటుందని అనామిక చెబుతుంది.
నీ బతుక్కి కంపెనీయే లేదని.. మనిషిగా దిగజారి ఓ మెట్టు ఎక్కానని అనుకోవడం నీ భ్రమ అంటూ కావ్య అంటుంది. నీతులు చెబితే నీకేం మిగిలింది.. ఇంట్లో నుంచి గెంటేశారని అనామిక అంటుంది. నేను బయటికొచ్చినా ఆ కంపెనీకి సీఈవోని చేశారని, నిన్ను బయటికి గెంటేసి జైలుకు కూడా పంపారని చెబుతుంది. ఇంతలో రుద్రాణితో కలిసి వేలం దగ్గరకి వస్తాడు రాజ్. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందని రాజ్తో అంటుంది అనామిక. మిమ్మల్నే పక్కనపెట్టి కావ్యని సీఈవోని చేశారంటూ సూటిపోటి మాటలు అంటుంది. ఇవాళ్టీతో సీఈవో పరిస్ధితేంటో తెలిసిపోతుందని రుద్రాణి చెబుతుంది. రాజ్ని పిలిచిన కావ్య వేలం పాటకి కావాల్సిన ఏర్పాట్లు చేశారా అని అడుగుతుంది.. దీనికి మండిపడిన రాజ్ ఎస్ మేడం అంటాడు. ఎట్టి పరిస్దితుల్లోనూ కావ్య గెలవకూడదని అనామికని రెచ్చగొడుతుంది రుద్రాణి.
ఇంతలో వేలం పాట మొదలుపెడతారు. సినిమాల్లో చూశాను కానీ, నేనెప్పుడూ వేలం పాట పాడలేదని కావ్యని అడుగుతుంది. ఇది కూరగాయాల బేరం కాదని వేలం పాట అంటూ రుద్రాణి మండిపడుతుంది. ఇది నీ కొడుకు సొమ్మేం కాదు కదా.. మా అల్లుడుగారి సంపాదనే అంటు కౌంటరిస్తుంది కనకం. కావ్య జోక్యం చేసుకుని నీ ఇష్టం వచ్చినంత పాడమని తల్లికి చెబతుతుంది. కూతురు చెప్పడంతో కనకం రెచ్చిపోతుంది.. దీంతో రాజ్ - రుద్రాణి షాక్ అవుతారు. తాతయ్య కోరి తెచ్చిపెట్టాడని.. ఈ దెబ్బతో కళావతి అంటే ఏంటో తెలిసిపోతుందని అంటాడు రాజ్. చివరికి అనామిక రూ. 40 కోట్లకు వేలంలో అరవింద్ కంపెనీని దక్కించుకుంటుంది. దీంతో అనామిక, రుద్రాణి సంబరపడిపోతారు. ఇంకో కోటి చెబితే మనం గెలిచేవాళ్లమని కనకం కూతురితో అంటుంది.

వేలంలో ఓడిపోవడంతో కావ్యని నానా మాటలు అంటుంది రుద్రాణి. ఇంతలో అనామిక వచ్చి మీరేదో జరుగుతుందని చెప్పారు కదా అంటూ మాట్లాడుతుంది. నన్ను గెలిపించడానికే మీరిద్దరూ వచ్చారా అంటూ సెటైర్లు వేస్తుంది అనామిక . ఛాన్స్ దొరికింది కదా అని కావ్యని ఇరికించడానికి రుద్రాణి ఆమెపై లేనిపోని మాటలు చెబుతుంది. ఆ రోజు అవార్డ్ మా కంపెనీకి రాకుండా మీకు వచ్చేలా చేసిందని, ఇప్పుడు ఈ కంపెనీని వేలం పాటలో మాకు దక్కనీయకుండా చేసిందని కావ్యపై రుద్రాణి నిందలేస్తుంది. కావ్య మీతో చేతులు కలిపిందా అని అనామికని అడుగుతుంది. ఈలోపు కనకం జోక్యం చేసుకుని .. నిప్పు లేని చోట కూడా పొగ పెట్టే రకానివి అంటూ మండిపడుతుంది. భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టడానికి నీకు కారణాలు బాగానే దొరుకుతాయని ఫైర్ అవుతుంది. నేను అనామికతో చేతులు కలిపానో లేదో కొద్దిసేపట్లో మీకే తెలుస్తుందని కావ్య అంటుంది. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










