Brahmamudi November 15th episode : మంట పెట్టిన అనామిక .. ధాన్యలక్ష్మీ నిరాహారదీక్ష, ఆఫీస్ని విడగొట్టిన రాజ్
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 15వ తేదీ ఎపిసోడ్ : రాజ్ - కావ్యల మధ్య పందెం గురించి కళ్యాణ్కి చెబుతుంది అప్పూ. ఖచ్చితంగా మా వదినే గెలిచి, ఇంటికి తిరిగి వెళ్తుందని అంటాడు. అటు ఈ పందెం గురించి తెలుసుకున్న కనకం.. త్వరలో కూతురు అత్తారింటికి వెళ్లిపోతుందని సంబరపడుతుంది. ధాన్యలక్ష్మీలో వేడి చల్లారకుండా ఆమెను రెచ్చగొడుతుంది రుద్రాణి. పందెం గురించి అనామికకు చెబుతుంది. కావ్య గెలిస్తే సీఈవో అవుతుందని, రాజ్ ఓడిపోతే కళావతికి ఇంటి వస్తుందని అంటుంది.
ఇంతలో జగదీష్ చంద్ర ప్రసాద్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న అనామిక ఈ కాంట్రాక్ట్ రాజ్ గ్రూప్కి రాకుండా చేస్తానని చెబుతుంది. ఆఫీస్కి వెళ్తున్న రాజ్కి ఇంటి సభ్యులు కనీసం ఆల్ ది బెస్ట్ చెప్పరు. అంతా కావ్య గెలవాలని కోరుకుంటారు. డ్రాయింగ్ బోర్డ్స్, పేపర్స్తో వస్తున్న రాజ్ని చూసి శృతి షాక్ అవుతుంది. పాపం ఈ మేనేజర్ పోస్ట్ కూడా పోతుందని దీనిని కాపాడుకోవడానికి తిప్పలు పడుతున్నారో చూశావా అంటూ కళావతి సెటైర్లు వేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా మిగిలాయి.. ఇక నవంబర్ 15వ తేదీ .. ఎపిసోడ్ 568లో ఏం జరిగిదంటే ..

బూత్ బంగ్లా ఏంటని శృతి అడగ్గా.. నీకు తెలియదా? జూబ్లీహిల్స్లో ఓ బూత్ బంగ్లా ఉంటుందని అక్కడ భూతాలు, దయ్యాలు, పిశాచాలు ఉంటాయని కావ్య చెబుతుంది. సీఈవో రూమ్లోకి వెళ్లబోతుండగా ఆమెను రాజ్ అడ్డుకుంటాడు. నువ్వు నిన్నటి వరకే సీఈవో అని తాతయ్య పందెం కట్టిన తర్వాత ఇద్దరం సమానమని.. ఈ పందెంలో గెలిచినవాళ్లు మాత్రమే సీఈవో అవుతారని అంటారు. పందెంలో ఎవరో ఒకరు గెలిచే వరకు పాత వాళ్లే సీఈవోగా ఉంటారని అంటుంది కావ్య. చివరిసారిగా ఆఫీస్ చూస్కో గెలిచేది నేనే, ఓడిపోయేది నువ్వేనని అంటాడు రాజ్. బూత్ బంగ్లాలో గెలిచినంత మాత్రాన ప్రతి చోటా మీరే గెలవరని అంటుంది కావ్య.
స్టాఫ్ మొత్తాన్ని మీటింగ్ హాల్లోకి తీసుకురమ్మని శృతికి చెబుతాడు రాజ్. ఉద్యోగులందరినీ పిలిచి గ్రాంథికంలో ఏదేదో మాట్లాడతాడు. ముందు అర్ధమయ్యేలా తెలుగులో చెప్పమంటూ కావ్య చురకలు వేస్తుంది. ఛైర్మన్ గారు పందెం పెట్టారని.. నేను, మీ సీఈవో మా టాలెంట్ మేం నిరూపించుకుంటామని చెబుతాడు. నా టీమ్లో చేరాలని అనుకున్న వారు ఇటు, ఆవిడ వైపు వెళ్లాలని అనుకున్న వారు అటు ఉండమని అంటాడు. దీంతో స్టాఫ్ మొత్తం కావ్య వైపు వెళ్లడంతో రాజ్ షాక్ అవుతాడు. నా కింద పనిచేసి బోనస్లు, ఇంక్రిమెంట్లు తీసుకుని ఇప్పుడు ఆ వైపు వెళ్తారా అని మండిపడతాడు రాజ్.
నా ప్లాన్లు నాకున్నాయని.. సెక్యూరిటీ గార్డ్ని పిలిచి లక్కీ డ్రా పెడతాడు. అందులో ఎవరి పేరొస్తే వాళ్లు చచ్చినట్లు నా టీమ్లోకి రావాల్సిందేనని అంటాడు. చీటీలు చూసుకున్న స్టాఫ్ రెండు టీమ్స్గా విడిపోతారు. నా వైపుకు వచ్చినవాళ్లు బెస్ట్ డిజైన్లు వేసి ఆ కాంట్రాక్ట్ మనకే వచ్చేలా చేస్తే నేనే సీఈవోనని అంటాడు రాజ్. అలా జరిగితే మీ అందరికీ జీతం పెంచుతానని.. ఇప్పటి నుంచి ఆ టీమ్ మెంబర్స్తో ఏమీ మాట్లాడకూడదని ఆర్డర్స్ వేస్తాడు. మీరంతా ఎలాంటి డిజైన్లు వేయాలో చెబుతానంటూ వారిని లోపలికి తీసుకెళ్తాడు.
ఇంతలో జగదీష్ చంద్ర ప్రసాద్ని అనామిక కలుస్తుంది. తన పేరు అనామిక అని .. సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పార్ట్నర్ని అని చెబుతుంది. ఆ కాంట్రాక్ట్ని ఆల్రెడీ స్వరాజ్ కంపెనీకి ఇచ్చేశానని జగదీష్ చంద్రప్రసాద్ చెబుతాడు. అలా ఇచ్చి తప్పు చేశారని... మార్కెట్లో ఆ కంపెనీ ఇప్పుడు నెంబర్వన్ కాదని, బెస్ట్ డిజైనర్ అవార్డ్ కూడా మా కంపెనీకే వచ్చిందని అనామిక అంటుంది. దీనికి దుగ్గిరాల ఫ్యామిలీలో గొడవలే కారణమని.. దాని వల్ల రాజ్ సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడని చెబుతుంది. దాంతో ఇంట్లో వాళ్లు కావ్యని సీఈవోని చేశారని అనామిక చెబుతుంది. రాజ్ - కావ్యలు పేరుకే భార్యాభర్తలని .. కావ్యని రాజ్ ఎప్పుడో వదిలేశాడని ఆమె పుట్టింటి నుంచే ఆఫీస్కి వస్తుందని చెబుతుంది.
మీరు పెద్ద బిజినెస్మెన్ అని.. ఏదైనా బెస్ట్ కావాలని అనుకుంటారని పైగా మీ పూర్వీకులు కట్టించిన గుడిని ఘనంగా జీర్ణోద్ధరణ చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అంటుంది. అలాంటి కంపెనీ చేతికి కాంట్రాక్ట్ ఇచ్చి మీ పరువు పొగొట్టుకుంటారా అని అనామిక ప్రశ్నిస్తుంది. నాకు నా పరువే ముఖ్యమని, నిజం చెప్పి కళ్లు తెరిపించావని .. కానీ కాంట్రాక్ట్ విషయంలో ఆలోచించుకోవడానికి తనకు కొంచెం టైం కావాలని జగదీష్ చంద్రప్రసాద్ చెబుతాడు. మీరొక్క ఫోన్ చేస్తే మీ పని చేసి పెట్టడానికి మా కంపెనీ సిద్ధంగా ఉంటుందని చెప్పి విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్లిపోతుంది అనామిక.
రైటర్ లక్ష్మీకాంత్ దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. నీ గురించి టీవీల్లో మారుమోగిపోయిందని కళ్యాణ్తో రైటర్ అంటాడు. కోట్లకు వారసుడివి, ఆటో నడుపుకుంటావా అని ప్రశ్నిస్తాడు. నిన్ను అసిస్టెంట్గా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నానని లక్ష్మీకాంత్ చెప్పడంతో కళ్యాణ్ సంతోషిస్తాడు. కానీ నిన్ను అసిస్టెంట్గా పెట్టుకోవడానికి కొన్ని కండీషన్స్ ఉన్నాయని చెబుతాడు లక్ష్మీకాంత్. నా దగ్గర పనిచేసినవాళ్లంతా నా దగ్గర వర్క్ నేర్చుకుని బయటికి వెళ్లిన తర్వాత వారి పాటలు నేను వాడేసుకున్నానని చెడ్డ పేరు తీసుకొచ్చారని చెబుతాడు. మూడేళ్ల పాటు నా దగ్గరే పనిచేస్తానని అగ్రిమెంట్ రాయాలని లక్ష్మీకాంత్ అనడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. అగ్రిమెంట్ రాయడానికి ఓకే చెప్పి కళ్యాణ్ సంతకం చేస్తాడు. కోట్ల ఆస్తిని కూడా వదులుకుని కళ కోసం కష్టపడుతున్నాడని ఏదో ఒకరోజు గొప్పవాడు అవుతాడని లక్ష్మీకాంత్ అంటాడు.
తన స్టాఫ్ మొత్తాన్ని పిలిచి హిత బోధ చేస్తాడు రాజ్. బోనస్లు ఇప్పిస్తానని, ఇంక్రిమెంట్లు పెంచుతానని, హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి ఇళ్లు కట్టిస్తానని రాజ్ హామీ ఇస్తాడు. ఆ మాటలతో వాళ్లంతా సంతోషించి మీరు సీఈవో కావడానికి కష్టపడతామని చెబుతారు. ఈ తతంగాన్ని శృతి వింటుంది. మరోవైపు.. మేం పందెం కట్టుకున్నామని, మీరు హడావుడిగా పనిచేయాల్సిన అవసరం లేదని తన టీమ్ మెంబర్స్కి కావ్య చెబుతుంది. నేను మీకు ఇన్పుట్స్ ఇస్తానని దాని ప్రకారం చేస్తే చాలని అంటుంది. ఇంతలో శృతి అక్కడికొచ్చి కావ్యని పక్కకి తీసుకెళ్తుంది. బోనస్లు ఇస్తానని, ఇంక్రిమెంట్లు ఇస్తానని చెప్పి స్టాఫ్ మొత్తాన్ని రాజ్ సర్ రెచ్చగొడుతున్నారని చెబుతుంది. మీరు గెలవాలంటే మీరు కూడా అలాంటి వాగ్థానాలు చేయమని కావ్యని అడుగుతుంది.
నేను కూడా మీలాగా ఒక ఉద్యోగినని.. కానీ ఆయన ఎప్పటికైనా ఈ కంపెనీకి వారసుడని, ఎన్ని వాగ్థానాలు చేసినా వాటిని నిలబెట్టుకునే ఆస్కారం ఆయనకుందని కావ్య అంటుంది. తీసుకుంటున్న జీతానికి న్యాయంగా పనిచేస్తే చాలని శృతితో చెబుతుంది. పిచ్చి పిచ్చి వాగ్ధానాలు చేసి నా మన:సాక్షిని నేను చంపుకోలేనని అంటుంది. మీ మాటలు చాలా తీయ్యగా ఉన్నాయని మెచ్చుకుంటుంది శృతి.
ఇంట్లో అంతా భోజనం చేస్తుండగా ధాన్యలక్ష్మీ కనిపించకపోవడంతో ఆమె ఎక్కడ అని పనిమనిషిని అడుగుతుంది అపర్ణ. తనకు భోజనం అవసరం లేదని తిట్టి తన ముఖంపైనే తలుపు వేశారని చెబుతుంది పనిమనిషి. దీంతో సీతారామయ్య బాధపడుతూ.. మీలో ఎవరూ ఒకరు వెళ్లి ఆమెను పిలవొచ్చు కదా అని అంటాడు. తాను అడిగినట్లుగా ఆస్తి పంపకాలు చేయలేదని కోపంతో ఇలా చేస్తుందని ఇందిర అంటుంది. మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు ధాన్యలక్ష్మీ కోపం చల్లారదని అపర్ణ చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











