Brahmamudi November 25th Episode : కనకానికి పనిమనిషిలా అపర్ణ .. మెట్టు దిగని రాజ్, కావ్యపై నిందలు
మోసం చేసి పందెంలో గెలవడమే కాకుండా కావ్యని రాజ్ ఇంటికి తీసుకురాకపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా భోజనం చేయడం మానేసి బాధపడుతుంది. మీరంతా నిరాహార దీక్ష చేస్తున్నారా అని రాజ్ ప్రశ్నించగా.. మర్యాదగా కావ్యని తీసుకొస్తావా లేదా అని కుటుంబ సభ్యులు నిలదీస్తారు. జీవితంలో ఆమెని తిరిగి తీసుకొచ్చేది లేదని తెగేసి చెబుతాడు రాజ్. ఉదయాన్ని సుభాష్ కంగారుగా వచ్చి అపర్ణ కనిపించడం లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా అవుతారు.
కొడుకే చెప్పిన మాట వినకుంటే ఏ తల్లికైనా బాధగానే ఉంటుందని అందుకే అక్క వెళ్లిపోయిందని ధాన్యలక్ష్మీ చెప్పగా రాజ్ మరింత కంగారు పడతారు. పొద్దుపొద్దున్నే లగేజ్ తీసుకుని ఇంటి ముందు ప్రత్యక్షమైన అపర్ణని చూసి కనకం, కృష్ణమూర్తి, కావ్య షాక్ అవుతారు. అమ్మ ఎక్కడుందో నాకు తెలుసునంటూ వెంటనే స్వప్నతో కనకానికి ఫోన్ చేయిస్తాడు రాజ్. ఇంటికి వచ్చేయమని అడగ్గా.. నువ్వు కోడలిని తీసుకెళ్లడానికి వస్తే, ఆమెతో పాటు ఇంటికొస్తానని లేదంటే ఇక్కడే ఉండిపోతానని బెదిరిస్తుంది అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా మిగిలాయి.. ఇక నవంబర్ 25వ తేదీ.. ఎపిసోడ్ 576లో ఏం జరిగిందంటే..

నాతో ఎవరు మాట్లాడాలన్నా , ఏం మాట్లాడాలన్నా ఇక్కడికొచ్చి మాట్లాడాలని ఫోన్లో రాజ్తో అంటుంది అపర్ణ. కనకం ఫోన్ పెట్టేశాకా.. నువ్వు కాళ్లు పట్టుకుని వేడుకుంటావో, ఏం చేస్తావో కానీ నువ్వు ఇంటికొస్తే మాత్రం మీ అమ్మతోనే రావాలని రాజ్తో అంటాడు సుభాష్. మమ్మీ అంత మొండిగా ఉంటే నేనేం చేయలేనని అంటాడు రాజ్. నీ పెళ్లాన్ని వదిలి నువ్వు ఉంటావేమో కానీ.. నా పెళ్లాన్ని వదిలి ఉండటం నాకిష్టం లేదని చెబుతాడు సుభాష్. అయితే నువ్వే వెళ్లొచ్చుగా అని రుద్రాణి చెప్పగా.. తప్పు చేసింది వాడైతే నేను ఎందుకు వెళ్లాలని ఆన్సర్ ఇస్తాడు.
నాకు అంత మొండితనం, పొగరు ఉంటే.. కావ్యని సీఈవోని చేసినప్పుడు నేనేందుకు మేనేజర్గా ఉంటానని ప్రశ్నిస్తాడు రాజ్ . తను రాకముందు అంతా నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకున్నారని అంటాడు. అప్పుడు రాముడిలా ఉండేవాడివని, ఇప్పుడు రాక్షసుడిలా మారిపోయావని చెబుతుంది ఇందిర. వదిన తనంతట తాను ఇల్లు విడిచి పోలేదని.. కావ్యే రెచ్చగొట్టి వాళ్లింటికి రప్పించుకుందని అంటుంది రుద్రాణి. నా చెల్లెలు అలా అనుకుని ఉంటే పందెం విషయాన్ని అప్పుడే బయటపెట్టి కంపెనీకి సీఈవోగానే ఉండేదని కౌంటర్ ఇస్తుంది స్వప్న.
కుటుంబ సభ్యులంతా కలిసి కనకం ఇంటికి రాజ్ని పంపిస్తారు . ఈ విషయాన్ని అపర్ణకి ఇందిర ఫోన్ చేసి చెబుతుంది. రాజ్ బయటికి వెళ్లిన తర్వాత రాహుల్ - రుద్రాణిలు మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య తిరిగి రాకుండా ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తుంటారు. తల్లిని తీసుకెళ్లడానికి కనకం ఇంటికి వస్తాడు రాజ్. కారు దిగి లోపలికి వెళ్తుండగా కావ్య అతనికి ఎదురొస్తుంది. నీ పంతం నెగ్గించుకోవడానికి మా అమ్మకి మాయ మాటలు చెప్పి మరో డ్రామా ఆడతావా అంటూ రాజ్ ఆమెపై మండిపడతాడు. ఇందులో నా ప్రమేయం ఏం లేదని, ఆవిడ వస్తానంటే తీసుకెళ్లమని కళావతి తేల్చిచెబుతుంది.
ఏ ఇంట్లో అయినా తల్లి మీద అలిగి కొడుకులు వెళ్లిపోతారని.. కానీ మీ ఇంట్లో మాత్రం కొడుకు మీద అలిగి తల్లి వచ్చేసిందని అంటుంది కావ్య. ఆమెను వెళ్లిపోమ్మని చెప్పమని.. ఆవిడకి ఇష్టమొచ్చినన్ని రోజులు ఉంటుందని చెబుతుంది. పందెంలో నువ్వు ఓడిపోయావు కాబట్టి.. ఇంకెప్పటికీ నేను నిన్ను తీసుకెళ్లనని , మా అమ్మని తెలివిగా ఇక్కడికి రప్పించారు కదూ అని రాజ్ నానా మాటలు అంటాడు. నేను వేసిన డిజైన్లను టేబుల్ కింద దాక్కుని మరి దొంగతనం చేయడం పెద్ద మనుషుల లక్షణమా అని ప్రశ్నిస్తుంది కావ్య. మీరు దొంగతనం చేయడం నేను చూశానని అంటుంది. నేను నోరు విప్పితే, సీసీటీవీ ఫుటేజ్ బయటపెడితే మీరు ఏమయ్యేవారని ప్రశ్నిస్తుంది. గెలిచినా ఓడిపోయిన దానిలా తిరిగిస్తే నా మీద నిందలు వేస్తున్నారని అని అంటుంది. నన్ను ఎప్పటికీ అర్ధం చేసుకుంటారని చెప్పి వెళ్లిపోతుంది కావ్య.
రాజ్ ఇంట్లోకి వెళ్లేసరికి అపర్ణ కూరగాయాలు కోస్తూ కనిపిస్తుండగా.. కనకం కాలు మీద కాలు వేసుకుని టీ తాగుతూ ఉంటుంది. బాగా ఉక్కపోస్తుంది ఫ్యాన్ వేసుకుంటానని అపర్ణ అడగ్గా.. కరెంట్ బిల్ ఎక్కువ వస్తే ఎవరు కడతారని అడుగుతుంది కనకం. కాఫీ ఏమైనా ఇస్తావా అని అపర్ణ అడగ్గా.. మా మధ్యతరగతి ఇళ్లలో రోజుకు రెండు సార్లే తాగుతామని చెబుతుంది కనకం. ఈ మాటలన్నీ విన్న రాజ్ కోపంగా లోపలికి వచ్చి కనకం మీద కేకలు వేస్తాడు. ఇన్ని అవమానాలు పడుతూ ఇక్కడేందుకు అని అడుగుతాడు రాజ్ . మన ఇంట్లో కావ్య కూడా ఎన్నో అవమానాలు పడి అక్కడే ఉందని గుర్తుచేస్తుంది అపర్ణ.
ఎలా బతికావ్ నువ్వు.. ఎలాంటి బతుకు కోరుకుంటున్నావ్ అని అడుగుతాడు రాజ్. పెద్దవాళ్లు చేసిన పాపాలు పిల్లలకు చుట్టుకుంటాయ్ అని అంటారు. కానీ ఇక్కడ మాత్రం అంతా రివర్స్లో జరుగుతుంది. కొడుకు చేసిన పాపం తల్లికి చుట్టుకుందని చెబుతుంది అపర్ణ. నా మీద కోపంతో ఇలాంటి ఇంట్లో ఉండొద్దని అంటాడు రాజ్. నేను రావాలంటే నువ్వు దిగి రావాలి.. చేసిన తప్పు ఒప్పుకోకపోయినా పర్లేదు .. కావ్యని భార్యగా ఒప్పుకుని మనింటికి రమ్మంటే చాలు, కావ్యతో పాటే వచ్చేస్తానని అంటుంది అపర్ణ. అది తప్పించి ఏ కండీషన్ పెట్టినా ఓకేనని అంటాడు రాజ్.
నువ్వు నా కోసం వచ్చినట్లే కావ్య కోసం కూడా వచ్చావని అనుకున్నానని అంటుంది అపర్ణ. నీకు తల్లి కావాలి కానీ , భార్య మాత్రం అక్కర్లేదా అని ప్రశ్నిస్తుంది . వస్తే కావ్యతో పాటే వస్తానని లేదంటే నేను కూడా ఇక్కడే ఉండి మట్టి బొమ్మలకు రంగులు వేసుకుంటూ నా శేష జీవితం గడిపేస్తానని చెబుతుంది అపర్ణ. నువ్వు ఎన్ని రోజులు ఇక్కడే ఉంటావో నేను చూస్తానని చెప్పి వెళ్లిపోతాడు రాజ్. ఆవిడ మా అమ్మ అని కాస్త మర్యాదగా ప్రవర్తించండి అని కనకానికి వార్నింగ్ ఇస్తాడు .
రాజ్ వెళ్లిపోయాక మీతో అడ్డమైన పనులన్నీ చేయించానని అంటుంది కనకం. మీరు కొంచెం తగ్గి ఉంటే అల్లుడు గారు కూడా తగ్గేవాళ్లని అపర్ణతో అంటుంది. వాడు బతిమలాడితే నెత్తికెక్కే రకమని, అందుకే ఇలా ట్రీట్మెంట్ ఇచ్చానని చెబుతుంది అపర్ణ. రాజ్- అపర్ణల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది. ఇంతలో రాజ్ రాగానే.. అమ్మ అక్కడ ? తీసుకురాలేదా? అని అడుగుతాడు సుభాష్. వాడి ముఖం చూస్తేనే తెలుస్తోంది.. వాళ్ల అమ్మ చేతుల్లో నాలుగు చీవాట్లు తిని వచ్చాడని ఇందిర అంటుంది.
నేనేం తిట్లు తినలేదు.. కావ్యని తిట్టేసి వచ్చానని చెబుతుంది. నా మనవరాలిని ఎందుకు తిట్టావని సీతారామయ్య ప్రశ్నించగా.. తన వల్లే కదా మా అమ్మ నన్ను వదిలి వెళ్లిపోయిందని అంటాడు రాజ్. తనను ఇంటికి తీసుకురాలేదని మా అమ్మని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసిందని చెబుతాడు. వదిన లేకపోతే ఇంట్లో అన్ని పనులు చూసుకునేది ఎవరని ప్రకాశం అడుగుతాడు. పిన్ని ఉంది కదా అని రాజ్ అడగ్గా.. ఇంటితో సంబంధం లేదని తన వంట తానే వేరుగా వండుకుంటోందని చెబుతాడు ప్రకాశం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











