Brahmamudi December 11th Episode : ముక్కలు కాబోతున్న దుగ్గిరాల ఫ్యామిలీ .. కావ్య ఆఖరి ప్రయత్నం
కిచెన్లో పడుకున్న కావ్యని తల్లి కోరిక మేరకు బెడ్ రూంలోకి తీసుకెళ్తాడు రాజ్. కానీ బెడ్ను రెడ్ కలర్ టేపుతో రెండుగా విడగొట్టి నువ్వు నా వైపు రావొద్దని చెబుతాడు. ఆ మాటలతో కళావతి బాధపడి చాప, దిండు తెచ్చుకుని నేలపై పడుకుంటుంది. ఆస్తిని ముక్కలు చేయడానికి రాహుల్- రుద్రాణి కలిసి కొత్త పన్నాగం పన్నుతారు. దీనిలో భాగంగా చెక్ తీసుకెళ్లి రాజ్ను 2 కోట్లు అడుగుతాడు రాహుల్. రాజ్ ఇస్తానన్నా నేను ఇవ్వనివ్వనని ప్రకాష్ అంటాడు.
ఆ వెంటనే రాహుల్ని వెంట బెట్టుకుని ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్తుంది రుద్రాణి. నువ్వే రాజ్ని అడిగి నా బిజినెస్కి హెల్ప్ చేయమని అడుగుతాడు రాహుల్. నీ బిజినెస్ సక్సెస్ అయ్యాక కళ్యాణ్ని పార్ట్నర్గా చేసుకుంటానని ఆమెకు మాయ మాటలు చెబుతాడు. అయితే ధాన్యలక్ష్మీ ఏదో ఆలోచిస్తుండగా రుద్రాణి ఆమెను రెచ్చగొడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 11వ తేదీ.. ఎపిసోడ్ 590లో ఏం జరిగిందంటే..

రుద్రాణి మాటలతో రెచ్చిపోయిన ధాన్యలక్ష్మీ.. చెక్కును తీసుకుని రాజ్ దగ్గరికి వెళ్తుంది. వాళ్లను ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టడమే ఎక్కువని, అయినా లక్షో , రెండు లక్షలో కాదు ఏకంగా రెండు కోట్లా అని సుభాష్ మండిపడతాడు. ఆ నోట్లు తీసి తల్లి లెక్కపెట్టేసరికి కొడుకు మాయం చేస్తాడని .. నీ కొడుకు మీద మాకు నమ్మకం లేదని అంటాడు. ఈ ఇంట్లో నా మాటకే కాదు , నీ మాటకూ విలువ లేదని రుద్రాణి అంటుంది. ఒకప్పుడు అనామిక తండ్రికి నువ్వే రెండు కోట్లు ఇచ్చావ్ కదా.. ఇప్పుడు నేను అడుగుతున్నాను నాకు రెండు కోట్లు కావాలి అని డిమాండ్ చేస్తుంది ధాన్యలక్ష్మీ.
ఆ రెండు కోట్లు నా తమ్ముడి పెళ్లి ఆగిపోకూడదని ఇచ్చాను పిన్ని అని చెబుతాడు రాజ్.. ఈ రెండు కోట్లు నీ కోసమే, కళ్యాణ్ కోసమో అడిగి ఉంటే ఎవ్వరూ కాదనేవాళ్లు కాదని చెబుతాడు. ఆ డబ్బు రాహుల్ నిలుపుకోలేడని, అది అపాత్ర దానం అవుతుందని అంటాడు. రుద్రాణి చెబితేనే వచ్చానని.. ఇప్పుడు పంతం కోసమే అడుగుతున్నానని నా వాటా నాకు పంచండి అని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నావని.. ఈ గొడవల వల్లే మా నాన్న ఆసుపత్రి పాలయ్యాడని, ఆయన కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత చూద్దామని సుభాష్ అంటాడు. ఒకవేళ నాన్న తిరిగి రాకపోతే అని రుద్రాణి ప్రశ్నించగా.. ఇందిర వచ్చి చెంప పగలగొడుతుంది.
ఈ ఇంటి ఉప్పు తిని బతికిన నువ్వు, ఈ ఇంటి పెద్ద చావునే కోరుకుంటున్నావా అని మండిపడుతుంది. నేను తలచుకుంటే కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెడతానని ఇందిర వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలతో మండిపడిన రుద్రాణి ఆస్తి పంచాల్సిందే అని అడుగుతుంది. నా కొడుకుని అమాయికుడిని చేసి నా నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని.. దీనిని ఇక్కడితో వదలనని అవసరమైతే కోర్టుకైనా వెళ్తానని ధాన్యలక్ష్మీ వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు నేనే కోర్టుకు వెళ్లి మీ ఇద్దరిని జైల్లో పెట్టిస్తానని అంటాడు ప్రకాష్. భార్యాభర్తలు పోట్లాడుకుంటూ ఉండటంతో సుభాష్ కోప్పడి .. మా నాన్న చావు బతుకుల మధ్య ఉంటే ఆస్తుల కోసం కొట్టుకు చస్తున్నారని అంటాడు.
మీలాంటి వాళ్ల మధ్య ఉండే కంటే విడిపోయి హాయిగా ఉండటమే మంచిదని.. లాయర్ని పిలిపించి ఎవరి వాటా వాళ్లకి పంచేస్తానని చెబుతాడు సుభాష్. ఆ మాటలతో అంతా షాక్ అవ్వగా.. ధాన్యలక్ష్మీ, రుద్రాణి సంతోషిస్తారు. కోపంతో బయటికొచ్చి పూలకుండీని కొడతాడు సుభాష్.. ఆ వెంటనే కావ్య వచ్చి మావయ్యకి నచ్చజెప్పాలని చూస్తుంది. తాతయ్య రెండ్రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లు ముక్కలైపోయిందని బాధపడుతుంది. రేపు ఆయనకి కోలుకుని ఇంటికొచ్చాక ఈ విషయం తెలిస్తే ఆయన కోలుకోగలడా అని కావ్య ప్రశ్నిస్తుంది. ఒకటికి వందసార్లు ఆలోచించినా.. ప్రతిసారి ఆస్తుల పంపకం గురించి అడుగుతుంటే ఏం చేయమంటావ్ అని సుభాష్ ప్రశ్నిస్తాడు.
బెడ్రూంలో ఒంటరిగా బాధపడుతున్న కావ్యను రాజ్ ఏమాత్రం పట్టించుకోడు.. దీంతో కళావతి కోప్పడుతుంది. ఇల్లు ముక్కలు కావడం , అంతా ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోవడం మీకు ఇష్టమా అని అడుగుతుంది. ఇల్లు ముక్కలైతే తాతయ్య, నాయనమ్మ తట్టుకోలేరని.. నేను ఎంత ప్రయత్నించినా మావయ్య వినిపించుకోవడం లేదని అంటుంది కావ్య. ఇల్లు విడిపోకూడదని నేను కూడా ఎంతో ప్రయత్నించానని.. కానీ నాన్న తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని అంటాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











