Brahmamudi December 28th Episode : ఇరుక్కుపోయిన రాహుల్ .. రాజ్- కావ్య ఎస్కేప్, గుట్టువిప్పే పనిలో రుద్రాణి
రుద్రాణి, ధాన్యలక్ష్మీలు కావ్య చేస్తోన్న ఆరోపణలకు కౌంటరిచ్చి తన భార్యను లోపలికి తీసుకెళ్తాడు రాజ్. తనను అందరి ముందు అవమానించిందని కావ్యపై రగిలిపోతుంది స్వప్న. దీంతో ఆమెను మరింత రెచ్చగొట్టాలని రాహుల్ - రుద్రాణిలు ప్రయత్నించగా స్వప్న కౌంటర్ ఇస్తుంది. చెల్లి దగ్గరికి వెళ్లి నన్ను ఎందుకు తిట్టావని అడుగుతుంది స్వప్న. కానీ కావ్య అలాగే సీరియస్గా ఉండటంతో స్వప్న బాధపడుతుంది.
తిండికి, బట్టకి కూడా అడుక్కోవాల్సి వస్తుందని ప్రకాశంతో ధాన్యలక్ష్మీ గొడవ పడగా రేపు అన్నయ్యతో మాట్లాడతానని ప్రకాశం అంటాడు. నువ్వు స్వప్నతో అంత కఠినంగా ఎందుకు ఉంటున్నావని కావ్యని నిలదీస్తాడు రాజ్. నేను అలా ఉండకపోతే కుటుంబం మొత్తానికి 100 కోట్ల గురించి నిజం చెప్పాల్సి వస్తుందని అంటుంది కళావతి. తాతయ్య హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలో తెలియక కావ్య - రాజ్లు బాధపడతారు. ఉదయాన్నే ఆస్తి గురించి సుభాష్ని అడగమని ప్రకాశ్ని రెచ్చగొడుతుంది ధాన్యలక్ష్మీ. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక డిసెంబర్ 28వ తేదీ.. ఎపిసోడ్ 605లో ఏం జరిగిందంటే..

నీతో ఓ విషయం గురించి మాట్లాడాలని సుభాష్తో అంటాడు ప్రకాశం. కావ్య తీసుకొచ్చిన రూల్స్ వల్ల ఇంట్లో అంతా ఇబ్బంది పడుతున్నారని అనడంతో సుభాష్- అపర్ణలు షాక్ అవుతారు. ధాన్యం- రుద్రాణి బయటపడుతున్నారు కానీ మిగతా వాళ్లు బయటపడటం లేదని.. కొన్ని విషయాలు చూసి చూడనట్లుగా వదిలేయాలని, ఒక మాట నువ్వు చెబితే బాగుంటుందని అంటాడు ప్రకాశం. ఇంతలో చెక్ క్లియర్ కాలేదంటూ సుభాష్కు హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది . దాంతో వెంటనే కావ్యని పిలిచి హాస్పిటల్ బిల్ ఎందుకు క్లియర్ కాలేదని అడుగుతాడు సుభాష్.
తనకు మంచి ఛాన్స్ దొరికిందని భావించిన రుద్రాణి వెంటనే రంగంలోకి దిగి కావ్యని నానా మాటలు అంటుంది. ఇంతలో హాస్పిటల్ బిల్ ఆపే అధికారం ఈవిడకి ఎక్కడిదని కావ్యని ప్రశ్నిస్తుందని ధాన్యలక్ష్మీ. మా మావయ్య గారి హాస్పిటల్ బిల్ కూడా నీకు అనవసరం అనిపించిందా? టిఫిన్ ఒకటే రకం, కాఫీ రెండు సార్లు, భోజనంలోకి ఒకటే కూర ఇన్నింటికి నువ్వు ఆంక్షలు పెట్టినా ఊరుకున్నాం.. కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఆపేస్తారని తెలిసినా బిల్ ఎందుకు కట్టలేదని ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది.
ఇదంతా పై నుంచి చూస్తున్న రాజ్.. అసలు విషయం బయటపడేలా ఉందని భయపడతాడు. అన్నింటికి సమాధానం నేను చెబుతానంటూ గట్టిగా అరుస్తాడు. అసలేంటీ మీ బాధ.. హాస్పిటల్ బిల్ కట్టలేదు, ఇంత వరకు చెక్ హోల్డ్లోనే పెట్టారట ఎందుకు అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఇంత ఆస్తి, ఐశ్వర్యం సంపాదించి దానిని మొత్తం ఈ అనామకురాలి చేతిలో పెట్టిన పెద్ద మనిషి ఆసుపత్రిలో ఉంటే బిల్ కట్టాల్సిన పని లేదా అని అంటుంది. డబ్బుంతా విదేశాల్లో దాచుకుంటుందా లేక పుట్టింటికి తరలిస్తుందా ఏం చేస్తోందని నిలదీస్తుంది రుద్రాణి.
అసలు ఇందులో నా భార్య ప్రమేయం ఉందని నీకు ఎవరు చెప్పారు, అన్ని తీసుకొచ్చి కళావతి నెత్తిమీద రుద్దకండి అంటాడు. ఎవరు ఏమన్నా , ఎన్ని అన్నా నోరు మూసుకుని పడేది ఈవిడ ఒక్కతే అనేనా అంటాడు. ఇందులో కావ్య ప్రమేయం లేకపోతే నీ ప్రమేయం ఉన్నట్లేనా అని ప్రశ్నిస్తుంది అపర్ణ. అసలేం జరిగింది? లక్ష అవసరాలున్నా ముందు తాతయ్య హాస్పిటల్ బిల్ క్లియర్ చేయాలి కదా? ఎందుకు చేయలేదు అని అడుగుతుంది. ఇదంతా ఆయన సంపాదించిందే కదా, ఆయన ట్రీట్మెంట్ ఆగే పరిస్ధితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తుంది ఇందిర. ఐదు లక్షలు కూడా మన దగ్గర లేవా? మనకి ఆ స్థాయి లేదా అని ఆమె బాధపడుతుంది. లేదంటే అంత ఖరీదైన వైద్యం ఎందుకు చేయించాలని అనుకుంటున్నారా అని ధాన్యం అనడంతో అంతా షాక్ అవుతారు.
చిన్నత్తయ్య.. ఎంత మాట అన్నారు, కోపంలో కూడా మీరు అలా ఎలా అనగలుగుతున్నారు అంటూ కావ్య బాధపడుతుంది. జరిగింది ఏంటో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు అని కావ్య చెప్పబోతుండగా రాజ్ వారిస్తాడు. అసలేం జరిగిందో నేనే చెబుతానని అంటాడు. మీరే చెప్పండి.. అందరూ నన్ను దోషిని చేసి నిలదీస్తున్నా మౌనంగానే ఉన్నానని కావ్య అంటుంది. మిమ్మల్ని కూడా అనుమానించే పరిస్ధితి వస్తే నేను తట్టుకోలేకపోతున్నానని బాధపడుతుంది.
ఇద్దరూ కలిసి ఏం చెప్పాలని అనుకుంటున్నారని సుభాష్.. ఏదో పెద్ద విషయమే దాస్తున్నారని అపర్ణ నిలదీస్తారు. ఆఫీసులో ఆడిటింగ్ జరుగుతోంది, అందుకే ట్రాన్సాక్షన్స్ అన్ని ఆగిపోయాని చెబుతాడు రాజ్. ఇప్పుడు ఆడిటింగ్ ఏంట్రా, మార్చిలో కదా జరిగేది అని అడుగుతాడు ప్రకాశం. దాంతో అన్నయ్యని మెచ్చుకున్న రుద్రాణి.. ఇప్పుడెందుకు ఆడిటింగ్ జరుగుతుందని అడుగుతుంది. దానికి నీ కొడుకే కారణం అంటాడు రాజ్. మధ్యలో నేనేం చేశాను.. నన్నెందుకు లాగుతున్నారు అని రాహుల్ షాక్ అవుతాడు. మధ్యలో నా కొడుకేం చేశాడని రుద్రాణి ప్రశ్నించగా.. మధ్యలో వెళ్లి సీఈవో చైర్లో కూర్చొన్నాడుగా, అప్పుడు మొదలైంది ఇదంతా . లెక్కలు, లెడ్జర్స్, చెక్లు ఏం లేవు.. అంతా అస్తవ్యస్తం చేసిపడేశాడు.
అకౌంట్స్ అన్ని పెండింగ్లోనే ఉంటే.. అవన్నీ గందరగోళంగా కనిపించాయని చెబుతాడు. మధ్యలో కళావతిని సీఈవోని చేశారని.. తను కొంత క్లారిటీ తీసుకొచ్చిందని, కానీ ఇదంతా రాహుల్ వల్ల జరిగిందని ఇంట్లో ఎవరికీ చెప్పలేదని అంటాడు రాజ్. ఇప్పటికైనా చెప్పేవాడిని కాదని.. మీరు నన్ను , నా భార్యని నిలదీస్తుంటే కళావతిని చెప్పకుండా ఆపానని అంటాడు. ఆడిటింగ్ మొదలయ్యాక.. అకౌంట్స్ హోల్డ్ చేసి, ట్రాన్షాక్షన్స్ అన్ని ఆపేసి లెక్కలేనన్ని క్లియర్ చేయాలని అనుకున్నానని చెబుతాడు రాజ్. ఇందులో కళావతి తప్పేం లేదని, దీనికి బాధ్యుడిని నేను అని అంటాడు .
సడెన్గా నీ భార్య మీద ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో తెలియడం లేదని.. కావ్యని వెనకేసుకుని రావడమే ఎక్కువైందని అంటుంది రుద్రాణి. తాను న్యాయం వైపే ఉంటానని.. నాకు ఒకరు ఎక్కువ కాదు, తక్కువ కాదు అని చెబుతాడు రాజ్. గార్డెన్లో కూర్చొని ఒంటరిగా బాధపడుతున్న ఇందిర దగ్గరికి వస్తుంది కావ్య. తాతయ్య హాస్పిటల్ బిల్ కట్టలేదని నా మీద కోపం వచ్చిందా అని అడుగుతుంది. ఇన్ని కోట్ల వ్యాపారం చేసే మనం కేవలం 5 లక్షల బిల్ కట్టలేకపోవడం ఏంటా అని ఆలోచిస్తున్నానని చెబుతుంది ఇందిర. ఆఫీస్లో అకౌంట్స్ , ఆడిటింగ్ వల్ల ఆగిందని కావ్య చెబుతుండగా అది మీరు సృష్టించిన అబద్ధం అని ఇందిర అనడంతో కళావతి షాక్ అవుతుంది. తాతయ్య మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయొద్దని ఇందిర అడగ్గా.. అలా ఎప్పటికీ జరగనివ్వనని చెబుతుంది కావ్య.
కొద్దిలో రహస్యం బయటపడేదని.. ఏదో ఒకటి చేసి 5 లక్షలు కట్టేయాలని రాజ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సుభాష్ రావడంతో రాజ్ షాక్ అవుతాడు. ఏమైంది , ఎందుకిలా ఉన్నావ్ అని అడుగుతాడు. కింద అందరి ముందు నువ్వు చెప్పింది అబద్ధం కదా అని అనడంతో రాజ్ బిత్తరపోతాడు. నువ్వేదో దాస్తున్నట్లు.. మాతో పంచుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తోందని సుభాష్ అంటాడు. నీ కంటే ముందే నేను ఆ కంపెనీని నడిపానని.. ఏదైనా సమస్యల్లో ఉంటే చెప్పమని అడుగుతాడు. రాజ్ చెప్పిన ఆన్సర్ ఏదో తేడాగా ఉందని రుద్రాణి - ధాన్యలక్ష్మీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











