Brahmamudi January 1st Episode : నందగోపాల్ వెనుక అనామిక.. వేట మొదలెట్టిన రాజ్, ఇంట్లో రుద్రాణి చిచ్చు
కాఫీ కోసం పనిమనిషి శాంతతో గొడవ పడుతుంది రుద్రాణి. ఇంతలో కావ్య - రాజ్లు బయటికి వచ్చి ఇంట్లో ఉన్న అద్దెకారులను పంపించేస్తారు. జగదీష్ చంద్రప్రసాద్ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కావాల్సిన డబ్బు లేకపోవడంతో రాజ్ టెన్షన్ పడుతుండగా కావ్య కూల్గా ఉంటుంది. ఇంతలో జగదీష్ చంద్రప్రసాద్ వచ్చి అడ్వాన్స్గా 5 కోట్లు ఇస్తాడు. ఆయన వెళ్లిన వెంటనే కావ్యని గాల్లోకి తిప్పుతాడు రాజ్.
కావ్య అద్దె కారులను పంపేసిన విషయాన్ని గమనించిన రుద్రాణి.. వెంటనే ఇంట్లో చిచ్చుపెట్టాలని ప్లాన్ చేస్తుంది. నేరుగా ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి బయటికి వెళ్దామని చెప్పి తీసుకొస్తుంది. ఇంటి బయటికి వచ్చేసరికి గ్యారేజ్లో ఒక్క కారు కూడా లేకపోవడంతో రాహుల్ వచ్చి రుద్రాణికి జరిగింది చెబుతాడు. ఆ మాట వినగానే ధాన్యలక్ష్మీ ఇంట్లో మహాకాళిలా రెచ్చిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక జనవరి 1వ తేదీ.. ఎపిసోడ్ 608లో ఏం జరిగిందంటే..

కావ్య ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత అన్ని విషయాలు కనుక్కుంటానని అపర్ణ చెబుతుంది. డ్రైవర్ల ముందు కూడా మమ్మల్ని చులకన చేస్తోందని.. కావ్య ఒక్కతే వాళ్లకి మేడం అంట అంటూ రుద్రాణి మరింత రెచ్చగొడుతుంది. ఇన్నాళ్లు ఈ ఇంటి కోడలిగా ఉన్న ధాన్యలక్ష్మీ వాడికి పనిమనిషిలా కనిపిస్తుందా అని ప్రశ్నిస్తుంది. వాడు అంత మాట అన్నాడంటే మీరు అంతకుమించి ఏదో అని ఉంటారని, ముందు మనం మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలని అపర్ణ కౌంటర్ ఇస్తుంది.
ఆవిడ గారు వచ్చి అనవసరమైన ఖర్చులు తగ్గించడానికే ఇలా చేస్తున్నానని అంటే మాత్రం ఊరుకునేది లేదని ధాన్యలక్ష్మీ వార్నింగ్ ఇస్తుంది. ఇలాంటి గొడవలన్నీ వస్తాయనే కావ్య తాళాలు నాకు వద్దు అని చెప్పిందని.. ఆమె చేతికి తాళాలు వచ్చాయో లేదో అప్పటి నుంచి ఇది మొదలైందని అపర్ణ మండిపడుతుంది. అనవసరమైన ఖర్చులన్నీ ఆపేసి ఈ కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు డబ్బును జాగ్రత్తగా వాడమని మేనేజర్కి ఆర్డర్స్ వేస్తుంది కావ్య.
ఇంతలో ఓ ఉద్యోగి అక్కడికి వచ్చి తనకు రూ.50 వేల అడ్వాన్స్ కావాలని అడుగుతాడు. అనవసరమైన ఖర్చులన్నీ ఆపేయమన్నారని.. నీకు ఇవ్వడం కుదరదని మేనేజర్ తేల్చి చెబుతాడు. తన కెరీర్లో ఎప్పుడూ అడ్వాన్స్ తీసుకోలేదని.. అవసరం అని వస్తే అలా అంటారేంటి అని ఆ ఉద్యోగి నిలదీస్తాడు. ఆఫీసు నడవటమే కష్టంగా ఉందని.. ఖాతాలో డబ్బులు లేవని ఉద్యోగులంతా మాట్లాడుకుంటూ ఉండగా కావ్య అది వింటుంది. మన కంపెనీ అంత లాస్లో నడుస్తుందని.. కొంపదీసి మూసేస్తారా అంటూ ఉద్యోగులు చర్చించుకుంటూ ఉంటారు.
ఆ మాటలతో మండిపడిన కావ్య.. కంపెనీ లాస్లో ఉందని ఎవరు చెప్పారు? ఈ కంపెనీ నిన్న గాక , మొన్ననే స్థాపించారా అని నిలదీస్తుంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీ మీ అడ్వాన్స్ కోసం బోర్డ్ తిప్పేస్తుందా అని ప్రశ్నిస్తుంది. ఈ కంపెనీ మిమ్మల్ని ఉద్యోగుల్లా చూసిందా.. పండగలకి బోనస్లు, లాభాల్లో వాటాలు పంచలేదా అని నిలదీస్తుంది కావ్య. మీ పిల్లల చదువులు, మీ తల్లిదండ్రుల హాస్పిటల్ బిల్స్ అన్నింటిని కంపెనీయే భరిస్తుందని.. అన్నం పెట్టే కంపెనీని ఇంత తక్కువ చేసి మాట్లాడతారా అని మండిపడుతుంది. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి చెడుగా మాట్లాడేవాళ్లు ఉండాల్సిన అవసరం లేదని.. ఎవరి జీతం వారు తీసుకుని వారు వెళ్లిపోవాలని అనడంతో ఉద్యోగులంతా క్షమాపణలు కోరతారు. ఇదంతా రాజ్ చూస్తాడు.
అనామిక- సామంత్లను నందగోపాల్ వచ్చి కలుస్తాడు. మీరు చెప్పారని బోర్డు తిప్పేశానని.. క్షణక్షణం భయంతో వణికిపోతున్నానని అంటాడు. నా కంపెనీలో చిట్స్ వేసిన క్లయింట్స్, పోలీసులు నా కోసం వెతుకుతున్నారని దొరికితే చంపేస్తారని భయపడతాడు. 100 కోట్లు ఎగనామం పెట్టానని ఆ రాజ్ నా కోసం వెతుకుతున్నాడని నందగోపాల్ చెబుతాడు. ఆల్రెడీ నువ్వు ఇవ్వాల్సిన దాంట్లో 20 కోట్లు రాజ్ కట్టేశాడని అనామిక చెబుతుంది. వాళ్ల తాతయ్య మాట కోసమైనా అప్పులు చేసి మిగిలిన 80 కోట్లు కట్టేస్తాడని చెప్పగా.. తర్వాత అంతా నా కంపెనీ గురించి మరిచిపోతారని నందగోపాల్ ఆనందపడతాడు. అప్పటి వరకు నీ పాత గెస్ట్ హౌస్లో ఎంజాయ్ చేసి, తర్వాత ఫారిన్లో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయమంటుంది అనామిక. బయటికొచ్చిన నందగోపాల్ 3 నెలలు ఒక్కడే ఉండలేక తన ప్రియురాలికి ఫోన్ చేస్తాడు.
జగదీష్ చంద్ర ప్రసాద్ ఇచ్చిన చెక్ను చూసుకుంటూ రాజ్ మురిసిపోతుండగా కావ్య బాధపడుతుంది. ఎందుకలా ఉన్నావ్ అని రాజ్ ప్రశ్నించగా.. ఈ 100 కోట్ల అప్పులో మనం ఒక్క రూపాయి కూడా తిన్నది కాదని, ఎవరో బోర్డ్ తిప్పేస్తే మనకి సంబంధం లేకపోయినా కడుతున్నామని చెబుతుంది. తాతయ్య ష్యూరిటీని అడ్డం పెట్టుకుని మనల్ని మోసం చేసిన ఆ నందగోపాల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడని అంటుంది కావ్య. అలాంటి వాడిని వదిలేసి , డబ్బుల కోసం ఇంట్లో వాళ్లని ఇబ్బంది పెట్టడం బాలేదని అంటుంది. నేను వాడిని అంత తేలిగ్గా వదిలిపెట్టనని, వాడి బినామీ ఆస్తులన్నింటిని జప్తు చేసైనా సరే 100 కోట్లు కక్కిస్తానని అంటాడు రాజ్.
ఓ పోలీస్ ఆఫీసర్ మనకు వాడి గురించి అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడని చెబుతుండగా.. ఆ పోలీస్ ఆఫీసర్ నుంచి ఫోన్ వస్తుంది. నందగోపాల్ ఫారిన్ వెళ్లలేదని ఇండియాలోనే ఉన్నాడని అంటాడు. ఇప్పుడే సెల్ ఆన్ చేశాడని.. మల్కాజ్గిరి ఏరియాల్ సిగ్నల్స్ కనిపించాయని చెబుతాడు. దాంతో కావ్య - రాజ్లు నందగోపాల్ కోసం బయల్దేరతారు. ధాన్యలక్ష్మీ, రుద్రాణిలు వచ్చి శాంతను కాఫీ అడుగుతారు. కార్ల మేటర్ను అడ్డం పెట్టుకుని కావ్య గురించి తాడో పేడో తేల్చేయాలని ధాన్యంతో రుద్రాణి అంటుంది.
రాజ్ - కావ్యలు నందగోపాల్ను వెతుకుతూ బయల్దేరతారు. ఈ మధ్య నీకు పొగరు బాగా ఎక్కువైందని రాజ్ చెప్పగా.. అయితే అసలు రహస్యం చెప్పి మా ఆయనని లక్షలు తీసుకోమని చెబుతానని సెటైర్లు వేస్తుంది కావ్య. వీళ్లిద్దరూ గొడవ పడుతూ కారును ఆపడానికి ట్రై చేస్తూ ఓ వ్యక్తిని గుద్దబోతారు. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నానని , నా కారు ట్రబుల్ ఇచ్చిందని కొంచెం లిఫ్ట్ ఇవ్వమని అంటాడు ఆ వ్యక్తి. నీకు బ్యాచిలర్ లైఫ్ ఇష్టం లేదా, ప్రశాంతంగా బతకాలని లేదా అంటూ ప్రశ్నిస్తాడు రాజ్.
రిపేర్ చేస్తే నీ కారు బాగుపడుతుంది కానీ.. పెళ్లి చేసుకుంటే మాత్రం నీ భవిష్యత్తును బాగుచేయడానికి ఏ మెకానిక్ లేడని అంటాడు. పెళ్లి చేసుకుంటేనే ఆస్తి మొత్తం వస్తుందని మా తాత వీలునామా రాశాడని అందుకే చేసుకుంటున్నానని అంటాడు ఆ వ్యక్తి. మా తాత కన్నా శాడిస్ట్లా ఉన్నాడని బాధపడ్డ రాజ్.. అతనిని కారు ఎక్కించుకుంటాడు. మీరిద్దరూ భార్యాభర్తలా అని ఆ వ్యక్తి అడగ్గా.. నాకు ఇంకా పెళ్లి కాలేదని, ఆవిడ మా బాస్ అని అంటాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











