Brahmamudi February 25th Episode : ఉచ్చు బిగించిన అనామిక .. కావ్య సాక్ష్యంతో రాజ్కు బెయిల్ రద్దు
రాజ్ను అరెస్ట్ చేసినందుకు అనామిక దగ్గర ఎంత తీసుకున్నావంటూ అప్పూని నానామాటలు అంటుంది రుద్రాణి. ప్రాణం పోయినా నేను అలాంటి పనులు చేయనని అప్పూ చెబుతుంది. భోజనం చేయకుండా ఏడుస్తున్న అపర్ణకి కావ్య అన్నం తీసుకొస్తుంది. వీరిద్దరి బాధను చూసి ఏడుస్తున్న అప్పూకి కళ్యాణ్ ధైర్యం చెబుతాడు.
రాజ్ను తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తుంది అప్పూ. అనామిక తరపు లాయర్ కావ్య, రాజ్లను చిక్కు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో దుగ్గిరాల కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతుంటారు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 25వ తేదీ .. ఎపిసోడ్ 654లో ఏం జరిగిందంటే..

సామంత్ను బెదిరించడానికే నేను, భర్త అతని ఇంటికి వెళ్లామని చంపడానికి కాదని కోర్టులో చెబుతుంది కావ్య. ఆ వెంటనే అప్పూని బోన్లోకి పిలుస్తాడు రాజ్ తరపు లాయర్. శవాన్ని కారులో చూసినంత మాత్రాన నా క్లయింట్ మీద మర్డర్ కేసు ఎలా ఫైల్ చేస్తారని లాయర్ ప్రశ్నిస్తాడు. సామంత్ను నా క్లయంట్ హత్య చేస్తుండగా చూసినవాళ్లు లేరని, సామంత్ హత్య చేసినట్లుగా ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు పెట్టలేదని అంటాడు. కేవలం అనామిక అనుమానంతో ఇచ్చిన ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశారని చెబుతాడు.
అయితే అన్ని సాక్ష్యాలు, ఆధారాలను త్వరలోనే కోర్టుకు సమర్పిస్తామని.. ఇందుకు కొంత గడువు ఇవ్వాల్సిందిగా అనామిక లాయర్ అడుగుతాడు. నా క్లయంట్ హత్య చేసినట్లు రుజువు కాలేదని.. పోలీస్ శాఖ కూడా ఎలాంటి ఆధారాలను సమర్పించలేదు కాబట్టి రాజ్కు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరతాడు లాయర్. కానీ ముద్దాయి ఆస్తి, అంతస్తు, బలం, బలగం, పరపతి ఉన్నవాడని.. బెయిల్ మీద బయటికి వెళితే సాక్ష్యాధారాలను సమర్పించే అవకాశం ఉందని అంటాడు అనామిక లాయర్. కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దని విజ్ఞప్తి చేస్తాడు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.
నీకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని రాజ్తో చెప్పి బాధపడుతుంది అపర్ణ. ఎప్పుడు ఏమవుతుందోనని మేమంతా బతుకుతున్నామని అంటుంది. అందరూ బాగానే వెనకేసుకొస్తున్నారంటూ అనామిక వచ్చి నానామాటలు అంటుంది. నా కొడుకు నిర్దోషిగా బయటికి వస్తాడని సుభాష్ అనగా.. రాడని నాకు ఫుల్ క్లారిటీ ఉందని వాళ్లని రెచ్చగొడుతుంది అనామిక. నన్ను అవమానించి పంపేశారని, నా దారేదో నేను చూసుకుని నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతుంటే అది చూసి ఓర్వలేక సామంత్ని రాజ్ చంపేశాడని అంటుంది. నా కన్నీళ్లకి కారణమైన దుగ్గిరాల ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెడుతూనే ఉంటారని అనామిక వార్నింగ్ ఇస్తుంది.
ఇంటికొచ్చిన వెంటనే కావ్యపై మండిపడుతుంది అపర్ణ. నువ్వు చెప్పిన సాక్ష్యం వల్ల వాడి జీవితమే ప్రశ్నగా మారిపోయిందని, ఇన్నిరోజులు నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకున్నావని కానీ ఈరోజు నా కొడుకు విషయంలో తప్పు చేశావని అంటుంది. నేను ముందు నుంచి చెబుతున్నానని.. వీళ్ల ఫ్యామిలీ, వీళ్లు అందరూ తేడానేనని వీళ్ల స్వార్ధం కోసం ఎవ్వరినైనా బలిపెడతారని అంటుంది రుద్రాణి. ఇన్ని రోజులు మంచిగా నటించి.. అవకాశం దొరకగానే మొగుడిని ఇరికించేసిందని చెబుతుంది. ఆస్తి ఎలాగూ నీ పేరు మీదే ఉందని.. కంపెనీని కూడా లాగేద్దామని ఈ పని చేశావా అని ప్రశ్నిస్తుంది.
ఆ మాటలతో అప్పూ మండిపడుతుంది. అలాంటి పనులు మీకు వస్తాయేమో కానీ మాకు కాదని అంటుంది. అక్క కోర్టులో చాలా మంచి పని చేసిందని చెబుతుంది అప్పూ. నువ్వు చేయని మర్డర్ని రాజ్పై వేసి వాడిని అరెస్ట్ చేశావని, మీ అక్క భర్తకు సపోర్ట్ చేయకుండా వాడిని ఇరికించేసిందని అంటుంది ధాన్యలక్ష్మీ. మీ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఈ కుటుంబం పతనం కోసమే పుట్టారా అని మండిపడుతుంది. మా సౌభాగ్యాన్ని, మా కాపురాన్ని మేమే పతనం చేసుకుంటామా? అని ప్రశ్నిస్తుంది కావ్య. నేను కోర్టులో అబద్ధం చెబితే తప్పు కానీ నిజాలు చెబితే తప్పు ఎలా అవుతుందని అడుగుతుంది.
నువ్వేమైనా హరిశ్ఛంద్రుడి రక్తం పంచుకుని పుట్టావా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. నువ్వెప్పుడు అబద్ధాలు చెప్పలేదా? 100 కోట్ల అప్పు దాయలేదా? మాకు తెలియకుండా ఆస్తుల్ని తాకట్టు పెట్టలేదా? అని నిలదీస్తుంది . ఇంతలో ఇందిర కలగజేసుకుని రుద్రాణికి గడ్డి పెడుతుంది. రాజ్ ఏ తప్పు చేయలేదు కాబట్టి జరిగింది జరిగినట్లుగా చెప్పిందని అంటుంది. ఈ ఇంట్లో కావ్యని ఎవరైనా తప్పు పట్టొచ్చు కానీ నువ్వు తప్పుబడుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నానని చెబుతుంది. రాజ్ ఓ బిడ్డను తీసుకొచ్చి ఇతను నా బిడ్డ ఈ ఇంట్లోనే ఉంటాడని చెప్పేసరికి .. మనమంతా వాడిని అవమానించామని గుర్తుచేస్తుంది. కానీ కావ్య వాడికి తోడుగా నిలబడి నమ్మి నిజాన్ని బయటపెట్టిందని చెబుతుంది.
ఏ భార్య తన స్థానంలోకి మరో ఆడది వస్తే అంగీకరించదని.. కానీ ఆ సమయంలోనూ తన భర్త మీద నమ్మకం ఉంచిందని గుర్తుచేస్తుంది ఇందిర. అలాంటి మనిషి ఈరోజున రాజ్ జైలుకి వెళ్లడానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందని నమ్ముతున్నావా అని ప్రశ్నిస్తుంది. అక్క నిజం చెప్పకుండా అబద్ధం చెప్పి ఉంటే మనమే ఇరుక్కుంటామని అప్పూ చెబుతుంది. రాజ్ జైలుకు వెళితే నిన్ను , నన్ను ఓదార్చడానికి మన భర్తలు ఉన్నారని.. కానీ కావ్య ఒంటరిది అయిపోతుందని అంటుంది ఇందిర. దీంతో కావ్యని అపర్ణ హత్తుకుని ఓదారుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











