Brahmamudi March 3rd Episode: జైలుకి అనామిక... దుగ్గిరాల ఫ్యామిలీలో సంబరాలు, రాజ్కి కొత్త కష్టం
ఎట్టకేలకు క్వార్టర్ కమలేష్ను పట్టుకున్న అప్పూ- కావ్యలు అతనికి జరిగినదంతా చెబుతారు. నాకు డబ్బులు ఇచ్చిన నా దేవుడిని నేను కాపాడుకుంటానన్న కమలేష్.. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటాడు. లాయర్ చెప్పినట్లుగా అప్పూ- కావ్యలు వచ్చేసరికి కోర్టు సమయాన్ని వృథా కాకుండా చూడాలని అనుకుంటాడు రాజ్.
దీనిలో భాగంగా నన్ను ఈ కేసులో ఇరికించింది అనామికేనని రాజ్ కోర్టులో చెబుతాడు. రాజ్ లాయర్ కూడా అనామిక నేర చరిత్రను బయటపెట్టడంతో న్యాయమూర్తి .. అనామికను కేసు విచారణ పూర్తయ్యే వరకు ప్రతిరోజూ కోర్టుకు రావాల్సిందిగా ఆదేశిస్తారు. దాంతో అనామిక లాయర్ తల పట్టుకుంటాడు.
నేరం రాజ్ చేశాడు అనడానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయని అతనికి శిక్ష విధించాలని అనామిక తరపు లాయర్ చెబుతుండగా క్వార్టర్ కమలేష్ను తీసుకుని కావ్య - అప్పూ కోర్టుకొస్తారు. ఆ రోజు రాత్రి జరిగినదంతా న్యాయమూర్తికి చెప్పడంతో పాటు ఫోన్లో రికార్డు చేసిన వీడియోను కోర్టకు సమర్పిస్తాడు కమలేష్. దీంతో అనామిక నేరం బయటపడి .. సామంత్ను ఎందుకు చంపాల్సి వచ్చిందో చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక మార్చి 3వ తేదీ .. ఎపిసోడ్ 659లో ఏం జరిగిందంటే..

హత్య అనామిక చేసి , సామంత్ని చంపడానికి ఉపయోగించిన ఆయుధాన్ని ఫ్యాక్టరీలో పడేసిందని రాజ్ లాయర్ అంటాదు. శవాన్ని రాజ్ కారులో పెట్టించి, ఏమీ ఏరగనట్లు రాజ్పైనే మిస్సింగ్ కేసు పెట్టిందని చెబుతాడు. మొదటి భర్తని వేధించి విడాకులు తీసుకుందని ఆ కేసును నేనే వాదించానని గుర్తుచేస్తాడు. ఆ సమయంలో అనామిక భర్త కళ్యాణ్కి స్వయంగా అన్న అయిన రాజ్ అతనికి అండగా నిలిచాడని చెబుతాడు.
ఆ కోపంతో రాజ్పై కక్ష్య పెంచుకుని, ఎన్నోసార్లు ఆయనని ఇబ్బంది పెట్టిందని లాయర్ అంటాడు. ఈ క్రమంలోనే ఈమె .. సామంత్ని దారుణంగా హత్య చేసిందని , ఇలాంటి వాళ్లు బయటి ప్రపంచంలో ఉండటానికి వీల్లేదని తన వాదనలు ముగిస్తాడు . కేసుకు సంబంధించిన పూర్వాపరాలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట అనామికే ఈ హత్య చేసిందని న్యాయమూర్తి ఆమెను దోషిగా నిర్ధారిస్తారు.
హత్య చేయడమే కాకుండా ఒక నిరపరాధిని కేసులో ఇరికించాలని చూడటం, కోర్టును, పోలీసులను పక్కదారి పట్టించాలని చూసినందుకు అనామికకు 14 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరిస్తారు న్యాయమూర్తి. ఈ కేసులో రాజ్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తారు. రాజ్ విడుదల కావడంతో అపర్ణ కంటతడి పెడుతుంది. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి నన్ను బయటికి తీసుకురావడానికి గట్టి పోరాటమే చేశారని వాళ్లిద్దరినీ మెచ్చుకుంటాడు రాజ్. నా కంటే అప్పూనే ఎక్కువగా కష్టపడిందని చెల్లెల్ని మెచ్చుకుంటుంది కావ్య.
కానీ నీ భార్యగా నా కంటే ఎక్కువగా కష్టపడిందని అక్కని ప్రశంసిస్తుంది అప్పూ. ఇల్లు, ఆఫీస్, పోలీస్ స్టేషన్ అనే తేడా లేకుండా సమస్య ఎక్కడున్నా కావ్య ముందు నిలబడుతుందని మెచ్చుకుంటాడు సుభాష్. ఇంతలో అనామికను జైలుకు తీసుకెళ్తుండగా సుభాష్ ఆపుతాడు. నిన్న నేను ఏం చెప్పానో నీకు గుర్తుందా అని ప్రశ్నిస్తాడు. మంచిగా బతకమంటే ఇక్కడి దాకా తెచ్చుకున్నావని.. 14 ఏళ్లు నీ జీవితం జైలుకే అంకితమని అంటుంది అనామిక. నన్ను మేనిప్యూలేట్ చేసి పెళ్లి చేసుకుని , తప్పుడు పనులతో విడాకులు ఇచ్చిందని ... సామంత్తోనైనా సంతోషంగా ఉందా అంటే వాడిని ఏకంగా చంపేసిందని చెబుతాడు కళ్యాణ్.
విధి ఎప్పుడూ ఒకేలా ఉండదని.. లాగి తంతే కోర్టు బోనులో పడిందని , కోర్టు 14 ఏళ్ల శిక్ష విధించిందని అంటుంది అప్పూ. 14 ఏళ్లు జైళ్లో ఉంటుంది కదా మార్పు చెందిన మనిషిగా తిరిగొస్తుందని సుభాష్ చెబుతాడు. 14 ఏళ్లు జైలు శిక్ష వేస్తే నేనే అక్కడే ఉండిపోనని.. షోరూంకి వెళ్లి వచ్చినట్లు వచ్చేస్తానని అంటుంది అనామిక. నా కథ అప్పుడే ముగిసిందని అనుకోవద్దు.. నేను అనుభవించిన దానికి అంతకంత మీరందరూ అనుభవించేలా చేస్తానని వార్నింగ్ ఇస్తుంది అనామిక. ఇంతలో ఓ అమ్మాయి రాజ్కి కనిపించగా.. అతను టెన్షన్ పడతాడు. ఆమెను వెతుక్కుంటూ వెళ్లగా కావ్య ఏమైందని ప్రశ్నిస్తుంది.
జైలు నుంచి తిరిగొచ్చిన రాజ్కు గుమ్మం దగ్గర దిష్టి తీస్తుంది కావ్య. రాజ్ విడుదల కావడంతో రుద్రాణి - రాహుల్లు రగిలిపోతుంటారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉండటం చూసి ఓర్వలేకపోతుంది రుద్రాణి. వెంటనే గార్డెన్లోకి పరిగెత్తి ఈ రాజ్ని పాములు మింగినా నిచ్చెనలు ఎక్కుతున్నాడని.. అనామిక ఇక అనామకురాలుగా మారి జైలుకు వెళ్లిపోయిందని బాధపడుతుంది. మనకు ఇక అనామిక వైపు నుంచి ఎలాంటి సాయం అందదని కొడుకుతో చెబుతుంది.
కనీసం వాళ్ల ఆనందంలో నీళ్లు పోయాలని నిర్ణయించుకుంటారు తల్లీకొడుకులు. లోపల అంతా ఆనందంగా ఉండగా వస్తారు రుద్రాణి - రాహుల్. నీ మీద నేనో కవిత రాశానని కళ్యాణ్ చెప్పగా నువ్వు అలాంటి సాహసాలు చేయొద్దని భయపెడుతుంది అప్పూ. ఏం పర్లేదు కవిగారు పాటలు, కవితలు అద్భుతంగా రాస్తారు చెప్పమని అంటుంది కావ్య. రాజ్ కూడా తమ్ముడిని మెచ్చుకుంటాడు. అందరూ ఆ కవిత ఏంటో చెప్పమని బతిమలాడేసరికి చెబుతాడు కళ్యాణ్. అతని కవిత బాగుండేసరికి అంతా మెచ్చుకుంటారు.
ఇలా అందరం కలిసి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుని ఎన్నాళ్లు అయ్యిందో అంటుంది ఇందిర. ప్రతిరోజూ ఏదో ఒక సమస్య ఈ కుటుంబాన్ని పట్టి పీడించిందని, ఎవరో ఒకరు బాధపడుతూనే ఉన్నారని.. ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయిందని అంటుంది అపర్ణ. కళ్యాణ్ కవితలో రాసినట్లు ఎన్ని సమస్యలు ఎదురైనా రాజ్ కుంగిపోలేదని అధైర్యంతో వెనకడుగు వేయలేదని మెచ్చుకుంటాడు సుభాష్. నా కోడలు వాడికి అడుగడుగునా అండగా నిలిచిందని, ఆమె సహకారంతో అన్ని సమస్యలను అధిగమించాడని చెబుతాడు.
అప్పూ- కావ్యలు రాజ్ను విడిపించడానికి ఎంతో కష్టపడ్డారని చెబుతుంది ఇందిర. ఇందులో మేం చేసిందేమీ లేదని పోలీస్గా నా కర్తవ్యాన్ని నేను, భార్యగా నేను కష్టపడ్డామని అంటారు అప్పూ- కావ్య. కానీ తలరాత దాని డ్యూటీ అది చేస్తుందని, మనం ఇంతగా సంబరపడిపోకూడదని అంటుంది రుద్రాణి. ఇప్పటికే ఎన్నో కష్టాలు చూశామని, ఎన్నో ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు కొత్తగా ఇంకో సమస్య పుట్టుకురాదని గ్యారంటీ ఏంటీ అని ప్రశ్నిస్తుంది . ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










