Brahmamudi March 8th Episode: లోయలోకి రాజ్ కారు.. చావు బతుకుల్లో కావ్య, కనిపించని రాజ్ ఆచూకీ
కావ్యని తీసుకుని హనీమూన్కి వెళ్లమని దుగ్గిరాల కుటుంబ సభ్యులంతా కలిసి రాజ్ను బతిమలాడతారు. అయితే ఇదంతా కావ్య ప్లానేనని రాజ్ అనడంతో కళావతి అలిగి బెడ్రూమ్లోకి వెళ్తుంది. కిందా మీద పడి కావ్యను ఎలాగోలా కులుమనాలి వెళ్లడానికి ఒప్పిస్తాడు రాజ్. ఈ ప్లానింగ్ అంతా నాదేనని, నేను చెబితేనే ఇంట్లో వాళ్లు ఈ ఏర్పాట్లు చేశారని కావ్య చివరికి ఒప్పుకుంటుంది. అయితే కులుమనాలి కంటే ముందే మీరు నిర్దోషిగా విడుదలై క్షేమంగా తిరిగి వస్తే శ్రీశైలం వస్తానని మొక్కుకున్నానని చెబుతుంది. దీంతో ముందు శ్రీశైలం వెళ్లి తర్వాత కులుమనాలి వెళ్దామని రాజ్ చెబుతాడు.
ఓ ఫేమస్ కిల్లర్ని పిలిపించి అతనితో కావ్యను చంపేందుకు బేరం కుదుర్చుకుని సుపారీ ఇస్తుంది యామిని. ఆనవాళ్లు కూడా మిగలకుండా పని పూర్తి చేస్తానని ఆ కిల్లర్ చెబుతాడు. కారులో శ్రీశైలం బయల్దేరిన కావ్యతో పాత విషయాలన్నీ మాట్లాడతాడు రాజ్. ఇంతలో కారుని బూత్ బంగ్లాలోకి తీసుకొస్తాడు . ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక మార్చి 8వ తేదీ .. ఎపిసోడ్ 664లో ఏం జరిగిందంటే..

బూత్ బంగ్లాలోకి కావ్యని తీసుకొచ్చేసరికి అక్కడ అంతా అందంగా డెకరేట్ చేసి ఉంటుంది. అదంతా చూసి ఈరోజు నా బర్త్ డే కాదు, మీ బర్త్ డే కాదు ఏంటీ ఇదంతా అంటుంది కావ్య. రెండేళ్ల క్రితం తాతయ్య మిమ్మల్ని ఎండీగా చేసిన రోజని అనగా కాదు అంటాడు రాజ్. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వేంటో నాకు అర్ధమైందని, కానీ నిన్ను ఇష్టపడుతున్న విషయం ఎక్కడ ఆపేస్తావోనని నీకు ఏం చెప్పలేదని అంటాడు. నిన్ను ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు అవమానించినా నాకు కష్టం అనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి నా వైపు నిలబడ్డావని చెబుతాడు.
కానీ నేను నీకు ఏం చేయలేకపోయానని.. నిన్ను ఇంట్లో వాళ్లు అవమానిస్తుంటే నీకు అండగా నిలబడలేకపోయానని బాధపడతాడు రాజ్. నీ కన్నీళ్లకు కారణమయ్యానని.. నీ కష్టానికి కేరాఫ్ అడ్రస్ అయ్యానని చెబుతాడు. నీ అంత గొప్పగా ప్రేమించలేక పోయినా.. ఈ రోజు నుంచి నీ కన్నీటికీ కారణం మాత్రం కానని అంటాడు. ఆ వెంటనే ఉంగరం తీసుకుని మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేస్తాడు. నన్ను లైఫ్ లాంగ్ ఇంతే ప్రేమగా చూసుకుంటావా అని అడుగుతాడు. నాలో ఉన్న మూర్ఖత్వాన్ని వదిలేస్తానని , నన్ను వదలవు కదా అని ప్రశ్నిస్తాడు రాజ్.
మన పెళ్లి మనకి ఇష్టం లేకుండా జరిగిపోయిందని.. ఇప్పుడు నా ఇష్టపూర్వకంగా , మనస్పూర్తిగా చెబుతున్నానని మళ్లీ మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. ఆ వెంటనే ఉంగరాన్ని ఆమె చేతికి తొడుగుతాడు రాజ్. దీంతో భర్తని గట్టిగా హగ్ చేసుకుంటుంది కావ్య. అనంతరం ఇద్దరూ కలిసి శ్రీశైలం వెళ్తారు. ఇంతలో కిల్లర్కి యామిని ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చిందని అడుగుతుంది. పది నిమిషాల్లో కావ్యని పైకి పంపేసి మీకు ఫోన్ చేస్తానని చెబుతాడు కిల్లర్. ఇంతలో కారులో వెళ్తున్న కావ్యకి గురిపెట్టి కాల్చగా అది పొరపాటున టైర్కి తగిలి కారు లోయలోకి దూసుకెళ్లి పేలిపోతుంది. ఈ విషయాన్ని కిల్లర్ .. యామినికి ఫోన్ చేసి చెప్పగా ఆమె షాక్ అవుతుంది.
ఇంట్లో కావ్య - రాజ్ల ఫోటో కిందపడి పగిలిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టెన్షన్ పడతారు. అపర్ణ , స్వప్నలు ఫోటో తీసుకుని ఏదో కీడు జరగబోతోందని భయపడతారు. పగిలింది ఫోటోనే కదా అని రుద్రాణి అనగా.. ఏం కాదులే అని ఇందిర అంటుంది. శుభమా అని వాళ్లిద్దరూ సంతోషంగా హనీమూన్కి వెళ్లబోతున్నారని .. వాళ్లు లేని సమయంలో ఇలా ఫోటో పగలడం నా మనసుకు ఏదో కీడు శంకిస్తోందని చెబుతుంది అపర్ణ. దానికి అంతగా ఆలోచించాల్సి అవసరం లేదని, ఒకసారి నా మనవడికి ఫోన్ చేసి మాట్లాడితే నీ టెన్షన్ పోతుంది కదా అని అంటుంది ఇందిర.
అయితే అపర్ణ ఫోన్ చేయబోతుండగా సుభాష్ అడ్డుపడతాడు. మా అమ్మ చెప్పడం నువ్వు ఫోన్ చేయడం కరెక్ట్ కాదని.. పెద్దవాళ్లుగా పిల్లల్ని అర్ధం చేసుకోవాలని అంటాడు. ఫోన్ చేస్తే తప్పేముంది అన్నయ్య .. పాపం వదిన కంగారు పడుతోందని చెబుతాడు. వాళ్లిద్దరూ సరదాగా గడపాలని వెళ్లారని, ఈ టైంలో కూడా వాళ్లని డిస్ట్రబ్ చేయడం సరికాదని మండిపడతాడు సుభాష్. భార్యాభర్తల బంధం గురించి అంత అర్ధం చేసుకున్న వాడివి మరి ఇప్పటి వరకు నీ భార్యను తీసుకుని హనీమూన్కి ఎందుకు వెళ్లలేదు అని ప్రశ్నిస్తుంది ఇందిర. దాంతో అంతా నవ్వుకుంటారు.
బావగారు అక్కని కనీసం గుడి, గోపురానికి తీసుకెళ్తారు.. మా ఆయన కనీసం నాంపల్లి ఎగ్జిబిషన్కి కూడా తీసుకెళ్లలేదని అంటుంది ధాన్యలక్ష్మీ. ఎగ్జిబిషన్ ఎందుకు మీ వూళ్లో జరిగే జాతరకు తీసుకెళ్తాను, అక్కడ రంగుల రాట్నం ఎక్కుదువుగానీ అంటాడు ప్రకాశం. ఆ మాటలతో అంతా నవ్వేస్తారు. ఇంతలో సుభాష్కి ఫోన్ వస్తుంది. యాక్సిడెంటా ఎక్కడ అని అనేసరికి అంతా ఉలిక్కిపడతారు. ఏం జరిగిందని అపర్ణ ప్రశ్నించగా.. కావ్య వాళ్లకి యాక్సిడెంట్ అయ్యిందని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్పేసరికి అంతా బయల్దేరతారు.
ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉంటుంది కావ్య. వారిద్దరినీ బెడ్పై చూసేసరికి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఏడుస్తారు. ఇంతలో కనకం కూడా ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అయితే కావ్య ఒక్కటే కనిపించగా.. రాజ్ ఎక్కడ అని ప్రశ్నిస్తుంది అపర్ణ. ఆ మాటలతో అంతా ఉలిక్కిపడతారు. డాక్టర్ వచ్చి కావ్యకి మేజర్ యాక్సిడెంట్ జరిగిందని, బ్లడ్ ఎక్కించాలని చెబుతాడు. మా కోడలు మాత్రమే ఉందని, మా అబ్బాయి ఎక్కడ అని ప్రశ్నిస్తాడు సుభాష్. అమ్మాయిని మాత్రమే ఆసుపత్రికి తీసుకొచ్చారని.. ఆమెతో పాటు ఇంకెవ్వరినీ అడ్మిట్ చేయలేదని డాక్టర్ చెప్పేసరికి అంతా షాక్ అవుతారు.
ఆసుపత్రిలో వేరే వార్డులో అపాయింట్ చేశారా అని అడగ్గా.. అంబులెన్స్లో ఈ అమ్మాయిని మాత్రమే తీసుకొచ్చారని చెబుతాడు డాక్టర్. దీంతో రాజ్ ఏమైపోయాడని అంతా కంగారు పడతారు. యాక్సిడెంట్ స్పాట్ నుంచి అమ్మాయిని తీసుకొచ్చిన పోలీసులు బయటే ఉన్నారని వాళ్లని అడగమని చెబుతాడు వైద్యుడు. ఇంతలో అప్పూ వెళ్లి పోలీసులను కనుక్కుంటానని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











