Brahmamudi weekly roundup: అప్పూ- కళ్యాణ్లపై రుద్రాణి పగ.. దుగ్గిరాల ఫ్యామిలీలో ఆస్తుల పంచాయతీ
Photo Courtesy: JioHotstar
పాపని చంపేయమని రౌడీలను ఆపరేషన్ థియేటర్లోకి పంపిస్తుంది రుద్రాణి. దాంతో రాజ్, కావ్యలు వారిని అడ్డుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మేంద్ర.. వెంటనే రుద్రాణిని లాగిపెట్టి కొట్టి రాజ్ని కాపాడటానికి వెళ్తాడు. తన బిడ్డను కాపాడటానికి మీరిద్దరూ మీ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారని.. రాజ్, కావ్యలకు క్షమాపణలు చెబుతాడు మినిస్టర్. ఇదంతా చూసిన తులసి.. కావ్య బిడ్డను వారికి ఇచ్చేస్తుంది. బిడ్డను తీసుకుని ఇంటికెళ్తారు రాజ్ - కావ్య. బిడ్డల్ని మార్చింది నువ్వేనన్న విషయం బయటకు రాకుండా చూడమని రుద్రాణికి రాహుల్ - రేఖలు వార్నింగ్ ఇస్తారు. బిడ్డల్ని మార్చడం వెనుక మినిస్టర్కి ఎవరో సలహా ఇచ్చారని కళ్యాణ్తో అప్పూ అంటుంది. వెంటనే మినిస్టర్ ఇంటికి వెళ్లి అతనిని నిలదీస్తుంది. ఇదంతా చాటుగా విన్న రుద్రాణి.. తన గురించి చెప్పొద్దని బతిమలాడుతుంది. ధర్మేంద్ర ఇంటి నుంచి బయటకు వస్తున్న రుద్రాణిని అప్పూ చూస్తుంది. పనిమనిషి శాంత పాపకి ఆపరేషన్ చేయించిన కావ్య.. మనమే ట్రస్ట్ పెట్టాలని భర్తకు, దుగ్గిరాల కుటుంబానికి చెబుతుంది. ట్రస్ట్ కోసం సగం ఆస్తిని ఇవ్వడానికి ధాన్యలక్ష్మీ ఒప్పుకోదు. దాంతో కళ్యాణ్ పేరు మీదకి సగం ఆస్తిని రాసి.. తమ వాటా ఆస్తిని ట్రస్ట్కి ఇచ్చేస్తారు రాజ్, కావ్య. అప్పూ - కళ్యాణ్లను రుద్రాణి కిడ్నాప్ చేయించి ఓ చోట దాస్తుంది.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు .. 951వ ఎపిసోడ్ నుంచి 956వ తేదీ వరకు ఏం జరిగిందంటే?
ఫిబ్రవరి 9వ తేదీ 951వ ఎపిసోడ్లో ..
పాపని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లడంతో కావ్య, రాజ్లు తల్లడిల్లిపోతారు. పాపకు ఏం కాదు కదా? ప్రాణాలతో తిరిగొస్తుంది కదా అని కావ్య అడుగుతుంది. దాంతో రాజ్ ఆమెకు ధైర్యం చెబుతాడు. ఇంతలో రుద్రాణి తన మనుషులకు ఫోన్ చేసి ఆసుపత్రిలో పాపని చంపేయమని చెబుతుంది. వెంటనే హెడ్ నర్స్ నీలవేణికి ఫోన్ చేసి నా మనుషులు వస్తున్నారు.. పాపని చంపేస్తారు, వాళ్లకి హెల్ప్ చేయమని అంటుంది. తాను చేయనని నీలవేణి చెప్పగా.. నీ బిడ్డల్ని చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. వెంటనే మినిస్టర్ దగ్గరికి వెళ్లిన రుద్రాణి.. ఇక శాశ్వతంగా పాప అడ్డు తొలగించే ప్లాన్ వేశానని, పాపను చంపేస్తున్నానని చెబుతుంది. ఆ మాటలు వినగానే ధర్మేంద్ర కోపం కట్టలు తెంచుకుని రుద్రాణిని లాగిపెట్టి కొడతాడు. నా బిడ్డ ఎక్కడైనా క్షేమంగా ఉంటే చాలు అనుకున్నాను కానీ, చంపాలని అనుకోలేదని వెంటనే ఆసుపత్రికి బయల్దేరతాడు. మరోవైపు... పాపను చంపడానికి ధర్మేంద్ర రౌడీలను పంపుతున్నట్లు కావ్య, రాజ్లకు నీలవేణి చెబుతుంది. ఇంతలో రౌడీలు ఆసుపత్రికి రాగా.. వారిని కాసేపు నీలవేణి అడ్డుకుంటుంది. ఆ వెంటనే ఐసీయూ రూమ్లోకి వెళ్లగా... అక్కడ పాపకు బదులు బొమ్మ ఉంటుంది. దాంతో రౌడీలు షాక్ అవుతారు.
ఫిబ్రవరి 10వ తేదీ 952వ ఎపిసోడ్లో..
రౌడీల బారి నుంచి పాపను కాపాడబోతుండగా రాజ్ను కత్తితో పొడిచి చంపాలని రౌడీలు వస్తారు. ఇంతలో కావ్య వచ్చి కత్తిని పట్టుకోవడంతో ఆమెకు తీవ్రగాయం అవుతుంది. ఇంతలో ధర్మేంద్ర వచ్చి రౌడీలను తరిమేస్తాడు. కన్నబిడ్డ ప్రాణం తీయాలనుకున్న నువ్వు కన్నతండ్రివేనా అని ధర్మేంద్రపై మండిపడతాడు రాజ్. నా భార్య కోసం కావ్య దగ్గరి నుంచి బిడ్డను దూరం చేశానని చెబుతాడు ధర్మేంద్ర. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టానని రాజ్ కాళ్లపై పడతాడు. ఇంతలో తులసి అక్కడికొచ్చి జరిగినదంతా తెలుసుకుంటుంది. నీకు బిడ్డను దూరం చేసినా నువ్వు మాత్రం మా బిడ్డకు ప్రాణాలు పోశావని కావ్యకు దండం పెడుతుంది తులసి. అనంతరం పాపని కావ్య చేతిలో పెట్టి వెళ్లిపోతారు తులసి, ధర్మేంద్ర. కన్నబిడ్డతో ఇంటికొచ్చిన కావ్య, రాజ్లకు దుగ్గిరాల కుటుంబం హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తుంది. నీ కన్నపేగుని అర్ధం చేసుకోలేకపోయామని అపర్ణ, ఇందిరలు కావ్యకు క్షమాపణలు చెబుతారు. త్వరలోనే నా పాపకు, అప్పూ పాపకి బారసాల చేద్దామని కావ్య అంటుంది. తన ప్లాన్ ఫెయిల్ కావడం, కావ్య దగ్గరికి బిడ్డ చేరిపోవడంతో రుద్రాణి రగిలిపోతుంది. నువ్వే బిడ్డల్ని మార్చిన విషయం కావ్య, రాజ్లకు తెలియదని.. ముందు ఆ రహస్యం బయటపడకుండా చూడమని రాహుల్, రేఖలు తల్లికి వార్నింగ్ ఇస్తారు.

Photo Courtesy: JioHotstar
ఫిబ్రవరి 11వ తేదీ 953వ ఎపిసోడ్లో..
బిడ్డను పట్టుకుని జరిగినదానిని తలచుకుంటూ రాజ్ బాధపడుతుంటాడు. ఇంతలో కావ్య రావడంతో నువ్వు ఎంత చెబుతున్నా నేనే పట్టించుకోకుండా పరాయి బిడ్డను నీ బిడ్డేనని మూర్ఖంగా ప్రవర్తించానని కుమిలిపోతాడు రాజ్. మీరు నిజం తెలుసుకుని నాకు అండగా నిలవకపోతే మన బిడ్డ మనకి దక్కేది కాదని అంటోంది కావ్య. అప్పూ దేని గురించో ఆలోచిస్తుండగా కళ్యాణ్ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఆసుపత్రిలో ఆరోజు ఎంతోమంది డెలివరీలు జరిగితే కావ్య అక్క బిడ్డనే మినిస్టర్ ఎందుకు మార్చాడు? తన బిడ్డను చంపమని రౌడీలను పంపి.. తనే కాపాడటానికి ఎందుకొచ్చాడు? ధర్మేంద్ర వెనుక ఎవరో ఉన్నారని అనుమానపడుతుంది అప్పూ. ఆ శత్రువుని గుర్తించకపోతే మన కుటుంబానికి పెను ప్రమాదం తప్పదని అప్పూ చెప్పడంతో కళ్యాణ్ కంగారుపడతాడు. ఆ శత్రువు ఎవరో కనిపెట్టాలని చెప్పగా కళ్యాణ్ సరేనని అంటాడు. ఉదయాన్నే పనిమనిషి శాంత ఏడుస్తుండగా ఏం జరిగిందని అడుగుతుంది కావ్య. తన బిడ్డ అనారోగ్యంతో ఉందని సర్జరీ చేయాలంటే 4 లక్షల రూపాయలు కావాలని చెప్పడంతో కావ్య- రాజ్లు సాయం చేస్తారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి మనం ఏదైనా ట్రస్ట్ లాంటిది పెట్టాలని భర్తతో చెప్పగా రాజ్ సరేనని అంటాడు. నేనే బిడ్డను మార్చిన విషయం రాజ్కు చెప్పొద్దని మినిస్టర్ ఇంటికి వచ్చి వేడుకుంటుంది రుద్రాణి.
ఫిబ్రవరి 12వ తేదీ 954వ ఎపిసోడ్లో..
నేను మా ఇంట్లో తిరిగి అడుగుపెట్టాలి.. బిడ్డల్ని మార్చడం వెనుక నేను ఉన్నానని రాజ్, కావ్యలకు చెప్పొద్దని ధర్మేంద్రను బతిమలాడుతుంది రుద్రాణి. ఇంతలో మినిస్టర్ ఇంటికి కళ్యాణ్ - అప్పూ రావడంతో రుద్రాణి తలుపు చాటున దాక్కొంటుంది. హాస్పిటల్లో అంతమంది బిడ్డలు ఉండగా.. మా అక్కకు పుట్టిన పాపనే ఎందుకు మార్చారు? ఇది మీ ఆలోచనేనా? మీ వెనుక ఎవరైనా ఉన్నారా అని అప్పూ ప్రశ్నించడంతో ధర్మేంద్ర, రుద్రాణిలు షాక్ అవుతారు. నా భార్యను కాపాడుకోవడానికి నాకు ఆరోజున అంతకుమించిన ఆలోచన రాలేదని చెబుతాడు ధర్మేంద్ర. బిడ్డల్ని మార్చిన ఆలోచన నాదేనని.. దీని వెనుక ఎవరూ లేరని చెప్పడంతో అప్పూ, కళ్యాణ్లు వెళ్లిపోతారు. ఆ వెంటనే రుద్రాణి వచ్చి మినిస్టర్కు థ్యాంక్స్ చెప్పి బయటకు వెళ్లిపోతుండగా.. కారులో వెళ్తున్న అప్పూ అద్దంలోంచి చూస్తుంది. మినిస్టర్ ఇంట్లో రుద్రాణికి పనేంటీ? ఆమెకు ధర్మేంద్రకు సంబంధం ఏంటీ? అని కళ్యాణ్తో అంటుంది. పేదలకు సాయం చేయడానికి దుగ్గిరాల వారి ఛారిటబుల్ ట్రస్ట్ పెడదామని కావ్య చెప్పగా అందరూ సంతోషిస్తారు. కానీ ధాన్యలక్ష్మీ మాత్రం మన ఆస్తుల్లో నుంచి డబ్బులు ఖర్చుపెట్టి ఇవ్వడానికి ఒప్పుకోను అంటుంది. ఆ మాటలతో రాజ్, కావ్య, దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.

Photo Courtesy: JioHotstar
ఫిబ్రవరి 13వ తేదీ 955వ ఎపిసోడ్లో..
ఆస్తిలో సగభాగం వదులుకుని ట్రస్ట్ పెట్టడానికి నేను ఒప్పుకోనని తేల్చేస్తుంది ధాన్యలక్ష్మీ. కోడలి మాటలతో సీతారామయ్య బాధపడతాడు. ఇన్నాళ్లకు నా కలను కావ్య, రాజ్లు తీరుస్తుంటే ధాన్యలక్ష్మీ అడ్డుపడుతోందని అంటాడు. రాజ్, కావ్యలు ఖచ్చితంగ మీ కోరిక తీరుస్తారని చెబుతుంది ఇందిర. అర్ధరాత్రి ఇంటికొచ్చిన అప్పూ - కళ్యాణ్లకు జరిగినది చెబుతాడు ప్రకాశం. దాంతో కోపంతో ఊగిపోయిన కళ్యాణ్.. తన తల్లికి క్లాస్ పీకుతాడు. నాకు ఆస్తుల మీద ఏమాత్రం ఆశలేదని.. అన్నా వదినలు ఏం కావాలంటే అది చేసుకోమని చెబుతాడు కళ్యాణ్. ఆస్తిని రెండు వాటాలుగా విభజించి మన వాటాను ట్రస్ట్కి, మరో వాటాను కళ్యాణ్ పేరు మీద రాసేద్దామని కావ్య చెప్పడంతో రాజ్ ఎమోషనల్ అవుతాడు. కావ్య బిడ్డను మార్చింది ఎవరో మినిస్టర్ చెప్పలేదని అప్పూ ఆలోచిస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆసుపత్రిలోని సీసీకెమెరా ఫుటేజ్ను పరిశీలించమని చెబుతుంది. ఇదంతా చూసిన కళ్యాణ్.. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటాడు. మన శత్రువు ఎవరో కనిపెట్టాల్సిందేనని అంటుంది అప్పూ
ఫిబ్రవరి 14వ తేదీ 956వ ఎపిసోడ్లో ..
పాప మీద అటాక్ చేసిన వాళ్లను పట్టుకుంటే అసలు బిడ్డల్ని మార్చిందెవరో తెలిసిపోతుందని కళ్యాణ్తో అంటుంది అప్పూ. ఇంట్లో జరుగుతున్నదంతా రుద్రాణికి చెబుతారు రాహుల్ - రేఖ. నువ్వు వేసిన ప్లాన్స్ సరిగా వర్కవుట్ కావడం లేదని ఇలాగే వదిలేస్తే మనకి మిగిలేది చిప్పేనని అంటారు. సగం ఆస్తిని కావ్య ట్రస్ట్కు రాసేస్తోందని చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఇంతో రుద్రాణికి రౌడీలు ఫోన్ చేసి తమను పోలీసులు వెంటాడుతున్నారని చెప్పడంతో అప్పూ- కళ్యాణ్లను కిడ్నాప్ చేయించాలని అనుకుంటుంది రుద్రాణి. పాప మీద అటాక్ చేయించిన రౌడీలను పోలీసులు పట్టుకుని అప్పూకి ఫోన్ చేస్తారు. దాంతో కళ్యాణ్ని తీసుకుని అప్పూ అక్కడికి బయల్దేరుతుండగా దారి మధ్యలో రుద్రాణి మనుషులు వాళ్లని కిడ్నాప్ చేస్తారు. ఉమ్మడి ఆస్తిలో మా వాటాను ట్రస్ట్కి రాసిస్తున్నామని.. మిగిలిన ఆస్తిని కళ్యాణ్కు రాసిస్తున్నామని కావ్య, రాజ్లు చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. నా కొడుకు, కోడలు ఈ కుటుంబం కోసం ఎంతో చేశారు.. రూపాయిగా ఉన్న ఆస్తిని 10 రూపాయలు చేశారని, వాళ్లు చేస్తోన్న మంచి పనిని నువ్వు అడ్డుకుంటున్నావని ధాన్యంపై సుభాష్ మండిపడతాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











