హైదరాబాద్లో ఆగిపోయిన టీవీ ప్రసారాలు...కేసులు

వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సోమవారం నుంచి కేబుల్ ఆపరేటర్లు అనలాగ్ ప్రసారాలను దాదాపుగా నిలిపివేశారు. ముగ్గురు ప్రధాన ఎంఎస్ఓలలో ఇద్దరు డిజిటల్ ప్రసారాలను మాత్రమే చేస్తుండగా.. మరో ఆపరేటర్ మాత్రం అనలాగ్ సిగ్నల్స్ కొనసాగించారు. ఫలితంగా జంట నగరాల్లోని 50 శాతానికి పైగా టీవీలకు కేబుల్ ప్రసారాలు నిలిచిపోయాయి. విశాఖపట్నంలో సెట్టాప్ బాక్సుల ఏర్పాటుకు 15 రోజుల గడువు ఇస్తూ అక్కడి జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకోవడంతో.. అక్కడ అనలాగ్ ప్రసారాలు యథావిధిగా సాగాయి.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో దాదాపు 25 లక్షల టీవీలున్నాయని ఎంఎస్ఓలు చెబుతున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 8.96 లక్షల ఇళ్లలోనే టీవీలున్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ లెక్కలు వేసింది. ఆ ప్రకారం చూసుకుంటే, 10 లక్షలకు పైగా టీవీలకు సెట్టాప్ బాక్సులు, డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నాయనే భావనతో, నూరుశాతం పైగా డిజిటైజేషన్ పూర్తయిందని కేంద్రం ప్రకటించేసింది. ఈ లెక్కల గందరగోళంలో ప్రజల అవసరాలు మరుగున పడిపోయాయి. గడువుకు చివరిరోజైన మార్చి 31న ముఖ్యమంత్రి లేఖ రాసినా.. ఫలితం లేకపోయింది.
మరో ప్రక్క టీవీలకు సెట్టాప్ బాక్సులు బిగించుకునేందుకు విధించిన గడువును సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన చలసాని నరేంద్రప్రసాద్ హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గడువు విధించడంతో బాక్స్లు కోసం ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని పేర్కొన్నారు. సెట్టాప్ బాక్స్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. విస్తృతమైన ప్రజాప్రయోజనాల దృష్ట్యా హైకోర్టు సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మరో ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేర్చారు.


Click it and Unblock the Notifications











