చక్రవాకం సీరియల్ హీరో ఇంట్లో పేలుడు.. ఏం జరిగిందంటే?
ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో నటీనటులు సీరియల్స్లో అడుగుపెట్టేవారు. అప్పట్లో వారికిచ్చే పారితోషికం కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్ధితులు మారిపోతున్నాయి. సినీనటులతో సమానంగా క్రేజ్, సంపాదన ఉంటోంది సీరియల్ నటులకి. తమ టాలెంట్ నిరూపించుకోవాలనే యువత ఇప్పుడు సీరియల్స్లో నటించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇలా తొలుత ధారావాహికల్లో నటించి ఇప్పుడు స్టార్స్ రాణిస్తున్న వారు ఇండియాలో ఎంతోమంది ఉన్నారు.
ఏళ్లకు ఏళ్లు సాగిన ఎన్నో సీరియల్స్ మనదేశంలో ఎన్నో ఉన్నాయి. వేలాది ఎపిసోడ్స్తో ఆయా సీరియల్స్ రికార్డు సృష్టించాయి కూడా. ఇలాంటి వాటిలో ఒకటి చక్రవాకం. తెలుగునాట సంచలనం సృష్టించిన అతికొద్ది ధారావాహికల్లో చక్రవాకం కూడా ఒకటి. జెమినీ టీవీలో 2003 నవంబర్ 3 నుంచి 2008 ఫిబ్రవరి 15 వరకు ప్రసారమైన ఈ సీరియల్ ఎన్నో రికార్డులు నెలకొల్పింది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8.30 గంటలకు చక్రవాకం.. చక్రవాకం అంటూ వచ్చే సాంగ్తో తెలుగు లోగిళ్లు హోరెత్తిపోయేవి.

కుటుంబ సభ్యులంతా పనులన్నీ ముగించుకుని సరిగ్గా 8.30కు టీవీల ముందు చేరుకునేవారు. దిగ్గజ రచయిత్రి యుద్ధనపూడి సులోచనా రాణి రచనలో మంజుల నాయుడు దర్శకత్వం వహించిన ఈ సీరియల్లో ప్రీతి అమీన్, ఇంద్రనీల్, సెల్వరాజ్, కౌశల్ మందా, సాగర్, ప్రీతి నిగమ్, రమాప్రభ, మధుమణి, నరసింహ రాజు తదితరులు కీలకపాత్ర పోషించారు. వీరంతా తర్వాతి కాలంలో సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించారు. తెలుగులో మొత్తం 1111 ఎపిసోడ్లు ప్రసారమైన చక్రవాకం సీరియల్ తర్వాత కన్నడ, మలయాళంలో డబ్బయి అక్కడి వారిని కూడా ఆకట్టుకుంది. 2016 జూలై 11 నుంచి జెమిని టీవీలో చక్రవాకం సీరియల్ పున: ప్రసారం చేస్తున్నారు.
ఈ సీరియల్లో హీరోగా నటించిన ఇంద్రనీల్ చాలా ఏళ్ల పాటు బుల్లితెరపై హల్చల్ చేశాడు. ఈ క్రమంలోనే ఆయన మరో నటి మేఘనను పెళ్లాడారు. కానీ దురదృష్టవశాత్తూ ఈ జంటకు పిల్లలు మాత్రం పుట్టలేదు. దీంతో కొందరు నెటిజన్లు వీరిని ఈ అంశపై ట్రోల్ చేస్తుంటారు. ఇంద్రనీల్ - మేఘనలు నీలి మేఘాలలో పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. దీనితో పాటు పచ్చళ్ల వ్యాపారం కూడా స్టార్ట్ చేసి వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. దీంతో చాలా వరకు బుల్లితెరకు దూరమైంది ఈ జంట. మొన్నామధ్య ఇంద్రనీల్ బిగ్బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్గా అడుగుపెడతారని రూమర్స్ వచ్చినా అవి గాలివార్తలేనని తేలింది.
అయితే ఇంద్రనీల్ - మేఘనలు తాజాగా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారట. ఈ విషయాన్ని మేఘన స్వయంగా తన యూట్యూబ్ ఛానెల్లో పంచుకున్నారు. తాను హాల్లో కూర్చొన్న సమయంలో వంట గదిలో నుంచి భారీ శబ్ధం వినిపించిందని.. ఏసీ గానీ పేలిందా అన్న భయంతో ఇళ్లంతా పరుగులు తీశానని.. అయితే కిచెన్లోకి వెళ్లి చూడగా.. గ్యాస్ స్టవ్ పగులుతూ కనిపించిందని మేఘన చెప్పారు. మూడేళ్ల క్రితం దానిని తీసుకున్నామని.. జరగరానిది జరిగి తన ముఖానికి డ్యామేజ్ అయ్యుంటే నా కెరీర్ పరిస్ధితి ఏంటి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము ఖచ్చితంగా కోర్టుకెక్కుతామని.. ఇకపై స్టీల్ స్టవ్నే వాడతామని, అందరూ జాగ్రత్తగా ఉండాలని మేఘన - ఇంద్రనీల్ సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











