Don't Miss!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అలా చేస్తే పాదాభివందనం చేస్తా!' టాప్ డైరక్టర్స్ కు దాసరి ఛాలెంజ్
దాసరి నిర్మించిన ‘అభిషేకం’ సీరియల్ జనవరి 22 నాటికి 2500 ఎపిసోడ్స్ పూర్తి అవుతున్న సందర్భంలో దాసరి మాట్లాడారు.
హైదరాబాద్:తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వెండితెర మీద ఎన్నో సంచలనాలు సృష్టించి ఎంతో కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకున్నారు దాసరి. అంతేకాకుండా బుల్లితెరపై ప్రవేశించి ఆరోజుల్లోనే 'విశ్వామిత్ర' సీరియల్ని నిర్మించి అరుదైన రికార్డ్ని సాధించారు.
తాజాగా దాసరి నిర్మించిన 'అభిషేకం' సీరియల్ జనవరి 22 నాటికి 2500 ఎపిసోడ్స్ పూర్తి అవుతున్న సందర్భంలో దర్శకరత్న డా॥ దాసరి మాట్లాడుతూ పై విదంగా స్పందించారు.
''టీవీ సీరియళ్లు నిర్మించడం, దర్శకత్వం వహించడం మామూలు విషయం కాదు. ఇప్పటి స్టార్ దర్శకులెవరైనా ఓ సీరియల్కి దర్శకత్వం వహించి వంద ఎపిసోడ్లు పూర్తి చేయమనండి. వాళ్లకు పాదాభివందనం చేస్తా'' అన్నారు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు.
'అభిషేకం' ధారావాహిక 2500 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి లలితకళా పరిషత ఆధ్వర్యంలో నటీనటులను, సాంకేతిక నిపుణులను ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్కరించారు. సుబ్బరామిరెడ్డి, మోహనబాబు, మురళీమోహన, తమ్మారెడ్డి భరద్వాజ, హేమాలయకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంగ్లీష్ సినిమా పేరు చెప్తాం...
మన గొప్పతనం మనకు తెలియదు. తెలుగువాడు అరుదైన ఘనత సాధిస్తే పట్టించుకోం. ‘మీ అభిమాన దర్శకుడు ఎవరు' అని ఏ తెలుగువాణ్నైనా అడగండి. మణిరత్నం పేరో బాలచందర్ పేరో చెబుతారు. కెవి రెడ్డి లాంటివాళ్లు గుర్తుకురారు. ‘మీ అభిమాన చిత్రం ఏది' అంటే వూరు పేరు తెలియని దర్శకుడు తీసిన ఇంగ్లిషు సినిమా పేరు చెబుతారు అన్నారు ఆవేదనగా దాసరి.
ఇలాంటి దశలోనూ ..
తమిళం వాళ్లు, కర్నాటక వాళ్లు, కేరళ వాళ్లు మనలా కాదు. ‘ముందు మేం.. మా తరవాతే ఎవరైనా' అంటారు. మనల్ని మనమే మరుగుజ్జులం చేసుకొంటున్నాం. ఇలాంటి దశలో ఓ టీవీ సీరియల్ బృందాన్ని సత్కరించాలన్న సుబ్బరామిరెడ్డి ఆలోచన గొప్పది. ఆయనకు కృతజ్ఞతలు. ‘అభిషేకం' డబ్బుల కోసం తీయలేదు. ఓ అభిరుచితో తీశా అన్నారు దాసరి.
5 వేల ఎపిసోడ్స్ వరకూ...
ఒక సినిమా పోయినా, మరో సినిమా తీయొచ్చు. ఓ ధారావాహిక వరుసగా రెండు ఎపిసోడ్లు సరిగా తీయకపోతే.. ఇక ఆ సీరియల్ చరిత్రలో కలిసిపోయినట్టే. ఈరోజు బుల్లితెరపై పోటీ పెరిగింది. దాన్ని తట్టుకోవడం కష్టమైపోతోంది. ఈ దశలో 2500 ఎపిసోడ్లు పూర్తి చేయడం ఓ అద్భుతం. దీన్ని 5 వేల ఎపిసోడ్ల వరకూ నడిపిస్తా. తొలి ఎపిసోడ్ కోసం ఎంత కష్టపడ్డామో.. ఇప్పటి నుంచి అంత కంటే ఎక్కువ కష్టపడి ఆ మైలురాయిని అందుకొంటాం'' అన్నారు దాసరి.
నాక్కూడా టీవీల్లో ..
మోహన్బాబు చెబుతూ ‘‘నాకు టీవీ అంటే గౌరవం. నాక్కూడా అందులో నటించాలని ఉండేది. కానీ ఓపిక, సమయం లేక కుదరడం లేదు. మంచి కథ వస్తే తప్పకుండా చేస్తా. సీరియళ్లు అన్నీ బాగుంటాయి. ఒక్క విషయం మాత్రం నచ్చదు. మహిళల్ని మరీ విలన్లుగా చూపిస్తుంటే ఇబ్బందిగా ఉంటోంది. ఆడవాళ్లు గొప్పవాళ్లు. వాళ్లని అలానే చూపిద్దాము''అన్నారు.
మైలురాయి అందుకుందంటే..
‘‘ఇదివరకటి రోజుల్లో ఓ సినిమా వంద రోజులు ఆడిందంటే గొప్ప. శతదినోత్సవాలు జరిపేవారు. ఇప్పుడు టీవీ సీరియల్ వంద ఎపిసోడ్లు చేస్తే విశేషం. అలాంటిది ‘అభిషేకం' 2500 ఎపిసోడ్ల మైలురాయిని అందుకొందంటే.. అదంతా దాసరి గారి ఘనతే'' అన్నారు మురళీమోహన్.
ఓ క్లైమాక్స్ , రెండు విరామాలు
ఈటీవీ సీఈఓ బాపినీడు మాట్లాడుతూ ‘‘ప్రతి సినిమాకీ ఓ విశ్రాంతి ఘట్టం, ఓ పతాక సన్నివేశం ఉంటుంది. ధారావాహికలకు అలా కాదు. ప్రతి ఎపిసోడ్కీ రెండు విశ్రాంతులు, ఓ పతాక సన్నివేశం ఉంటాయి. విరామం తరవాత ఏం జరుగుతుందో చూడాలన్న ఆసక్తి కలిగించాలి. ఆ విషయంలో ‘అభిషేకం' విజయం సాధించింది. అందుకే ఇంతటి ఆదరణ దక్కింది. ఈ ధారావాహిక 5000 ఎపిసోడ్లు పూర్తి చేసి వరల్డ్ రికార్డు సృష్టించాలి''అని ఆకాంక్షించారు.
ఎక్కువ మైలురాళ్లు
‘‘ఈ సంచలనం కేవలం దాసరి గారి వల్లే సాధ్యమైంది. ఈ ప్రయాణంలో నటీనటులు, సాంకేతికనిపుణుల కష్టాన్ని వేరు చేసి చూడలేం. ‘అభిషేకం' ఇంత కంటే ఎక్కువ మైలురాళ్లు అందుకోవాలి''అని ఆకాంక్షించారు ఈటీవీ క్రియేటివ్ హెడ్ అజయ్శాంతి.
అలాంటి ఆలోచనే...
నేను విశ్వామిత్ర కంటే ముందుగానే రామాయణం, మహాభారతం సీరియల్స్ చేశాను. మొదటిసారి బీటా కెమెరాలో విశ్వామిత్ర సీరియల్ చేశాను. నా భార్య పద్మకి సీరియల్స్ అంటే చాలా ఇష్టం. నన్ను సీరియల్స్ తీయమని అంటుండేది. నేను సీరియల్ తీయాలని అనుకున్నప్పుడు వచ్చిన ఆలోచనలే అభిషేకం.
ఆమె కోరిక
‘‘యాభై సంవత్సరాలుగా డైరెక్టర్గా వున్న నన్ను ప్రజలు, ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదిస్తే ఈ స్ధాయికి వచ్చాను. 150 చిత్రాల దర్శకుడుగా రికార్డ్స్ సృష్టిస్తే అందరి ఆశీస్సులతో గిన్నిస్బుక్ రికార్డ్స్లో కూడా చేరాను. అది పెద్ద తెర. ఫస్ట్ నుండి నా భార్య పద్మకి టీవీ సీరియల్స్ నిర్మించాలని కోరిక. ఆమె కోరికతోనే ‘విశ్వామిత్ర' సీరియల్ని నేషనల్ నెట్వర్క్లో స్టార్ట్ చేశాం. దాని తర్వాత సౌత్ ఇండియన్ టీవీ సీరియల్గా మహాభారతం, రామాయణం సీరియల్స్ నిర్మించాం. అవి మంచి పేరు తెచ్చాయి.
ఈటీవీ వాళ్లు..
అదేస్ధాయిలో మళ్లీ సీరియల్స్ నిర్మించాలని 20 సంవత్సరా తర్వాత పద్మ రచయితకి, డైరెక్టర్స్కి ఎంతో మందికి అడ్వాన్స్లు కూడా ఇచ్చింది. ఏదీ కార్యరూపం దాల్చలేదు. రెగ్యులర్గా సీరియల్స్ నిర్మించానే ఆమె యాంబిషన్ అలాగే ఉండిపోయింది. పద్మ కోరికను నెరవేర్చాలనే సంకల్పంతో ‘అభిషేకం' కథ రెడీ చేశాను. కొమ్మనాపల్లి గణపతిరావు ట్రీట్మెంట్ రాశాడు. సీరియల్ ప్రారంభం అయింది. ఈటివి వాళ్లు సీరియల్ చేయడానికి ముందుకొచ్చారు. ప్రేక్షకులు ఆదరించి పెద్ద సక్సెస్ చేశారు.
అదే రికార్డ్ అనుకున్నాం
2500 ఎపిసోడ్స్ ఆడుతుందని మేము ఊహించలేదు. 1000 ఎపిసోడ్స్ ఆడితేనే అరుదైన రికార్డ్ అనుకున్నాం. కానీ అది 2000 ఎపిసోడ్స్ దాటి మూడు వేల వరకు వెళ్తుందని బాపినీడుగారు చెప్పారు. ఒక సీరియల్ 2500 ఎపిసోడ్స్ దాటడం అనేది ఇండియన్ రికార్డ్. ఇంకో 500 ఎపిసోడ్స్ దాటితే గిన్నిస్ రికార్డ్ అవుతుంది.
దాసరి గారు కూడా అలాగే..
టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ` ‘‘సినీ పరిశ్రమలో ఏ లాంగ్వేజ్లో అయినా హీరో డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. దానిని బ్రేక్చేసి డైరెక్టర్ కూడా ఒక హీరోనే అని చెప్పిన దర్శకుడు కె.వి. రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు నిరూపించారు. ఆ కోవలోనే దాసరిగారు దర్శకుడు అనే పదానికి నిజమైన అర్ధాన్ని చెప్పారు. రచయిత, దర్శకుడు, నిర్మాత, నటుడుగా నిరూపించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఏకైక వ్యక్తి దాసరి. ఆయన జీవితంలో ఎన్నో లక్ష్యాల్ని సాధించారు. ఇప్పుడు సమాజంలో బుల్లితెర అనేది చాలా ముఖ్యమైనది. మోస్ట్ పవర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీడియా. బుల్లి తెరని మరింత ప్రోత్సహించాలి. నటీనటులకు, సాంకేతిక నిపుణులకూ ఇచ్చే పారితోషికం పెంచి వాళ్లనీ గౌరవించాలి''అని టి.సుబ్బరామిరెడ్డి కోరారు.
జనం ఆనందపడ్డారు
పద్మగారు ‘విశ్వామిత్ర' సీరియల్ స్టార్ట్ చేశారు. ‘అభిషేకం' సీరియల్ 2500 ఎపిసోడ్స్ పూర్తవడం ఇదొక మిరకిల్. నాకు చిన్నప్పటి నుండి కళలు, నటులు అంటే చాలా ఇష్టం. వారిని దైవశక్తి నడిపిస్తుందనే నా నమ్మకం. నేను 14 సినిమాలు నిర్మించాను. తోటి కళాకారులను సత్కరిస్తే అది చూసి జనం ఆనందపడ్డారు. వారి ఆనందాన్ని చూడానేదే నా కోరిక. అదే నా సీక్రెట్. 1975 నుండి 30 సంవత్సరాలుగా ఎంతోమంది నటీనటుల్ని సత్కరించి సన్మానాలు చేశాను అన్నారు సుబ్బిరామిరెడ్డి.
ఆయనలో ఓ ప్రత్యేకత
దాసరి, నేను ఇద్దరం నెంబర్వన్ పొజిషన్లో వుండాలనుకుంటాం. అలాగే మా పనులు మేము చేస్తూ వచ్చాం. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేసి డైరెక్టర్కి ఒక రెస్పెక్ట్ని క్రియేట్ చేశారు దాసరి. ఆర్టిస్టులు అందరూ ఆయన్ని చూసి భయంతో చేస్తారు. అది ఆయన స్పెషాలిటీ. గంభీరంగా కనిపించినా ఆయన చాలా సాఫ్ట్గా ఉంటారు. ప్రతి ఒక్కరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. ఆయన ఏది సాధించినా ఒక ప్రత్యేకత ఉంటుంది. మా ఇద్దరి స్నేహం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. మానవ జీవితంలో ఎదుటి మనిషిలో టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేయడమే గొప్ప వ్యక్తిత్వం'' అన్నారు సుబ్బిరామిరెడ్డి.
ఈ పోగ్రాంలో ఎవరంటే..
ఈ కార్యక్రమంలో రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు, తమ్మారెడ్డి భరద్వాజ, గీతాంజలి, జయప్రసాద్ రెడ్డి, రాజేంద్ర, హరి చరణ్, రమణబాబు, కోటారెడ్డి, రామకృష్ణ ప్రసాద్, డా.రఘునాథ్ బాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత హేమాలయ కుమారితో పాటు ‘అభిషేకం' నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.