టీవీ TRP లలో 'గ్యాంగ్ రేప్' నంబరు వన్
న్యూఢిల్లీ : సోనీ టీవీ ప్రసారం చేసే ధారావాహిక కార్యక్రమం క్రైం పెట్రోల్ గత వారాంతంలో నిర్భయ ఘటనపై చేసిన దాన్ని అత్యధికమంది ప్రేక్షకులు చూశారు. ఆ వారానికి ఇదే నంబరు వన్ షోగా నిలిచింది. ఈ ధారావాహికకి మొత్తం 10.4 మిలియన్ టీవీటీలు (టెలివిజన్ వ్యూయర్షిప్ ఇన్ థౌంజడ్స్) వచ్చాయని సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ వైస్ ప్రెసిడెంట్ స్నేహ రజని చెప్పారు. ఛానెల్ నిర్భయ ధారావాహికని మళ్లీ ప్రసారం చేయడానికి నిర్ణయించింది. జాతిని మేల్కొల్పిన కేసు ఇదని రజని అన్నారు.
దేశం నలుమూలలా ఆగ్రహావేశాలు రగిలించిన, ఆందోళన కలిగించిన ఢిల్లీ అత్యాచార ఉదంతంలో దోషులుగా నిర్ధారించిన నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ ఫాస్ట్ట్రాక్ కోర్టు తీర్పు వెలువరించింది. పట్టుబడిన మరో నిందితుడు విచారణ కాలంలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, ఇంకొక నిందితుడిని బాలనేరస్థుడిగా పరిగణించి జువైనల్ బోర్డు మూడేళ్ల శిక్ష విధించింది. నిరుడు డిసెంబర్ 16 రాత్రి ఢిల్లీ వీధుల్లో నడుస్తున్న బస్సులో 23 ఏళ్ల యువతిపై వీరంతా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ప్రతిఘటించిన యువతిపై అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. ఆమెతోపాటు ఆమె స్నేహితుణ్ణి కూడా తీవ్రంగా గాయపరిచారు. నెత్తురోడుతున్న ఆ ఇద్దరినీ ఒంటిపై దుస్తులు కూడా మిగల్చకుండా నడుస్తున్న బస్సులో నుంచే బయటకు నెట్టేశారు. ఆ నిశిరాతిరి వణికించే చలిలో ఆ ఇద్దరూ అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. ఢిల్లీలో అత్యాచారాలు కొత్త కాదు. ఈ ఘటన తర్వాత కూడా అవి నిత్యమూ కొనసాగుతూనే ఉన్నాయి.
కానీ, ఈ కేసులో నిందితులందరూ ఆ ఇద్దరిపై, ప్రత్యేకించి ఆమెపై సాగించిన దుర్మార్గం అందరినీ కలచివేసింది. కేవలం క్రూరమృగాలతో మాత్రమే పోల్చగల ప్రవర్తనతో నిందితులందరూ సమాజం మొత్తాన్ని దిగ్భ్రాంత పరిచారు. అందువల్లే ఈ ఘటనపై దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి.


Click it and Unblock the Notifications











