కళ్లు తెరిచేసరికి హాస్పిటల్లో... యాక్సిడెంట్పై పండు మాస్టర్ ఫస్ట్ రియాక్షన్
తెలుగులో పాపులర్ డ్యాన్స్ షో అయిన ఢీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పండు మాస్టర్ బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో మిత్రులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఆయన రెండు కాళ్లకు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. 6 నెలల వరకు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. అయితే ఈ ప్రమాదం తర్వాత స్పృహలోకి వచ్చిన పండు మాస్టర్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
పండు మాస్టర్ అసలు పేరు జీ. షణ్ముఖ్. విశాఖపట్నానికి చెందిన ఈ కుర్రాడి తండ్రి ఆటోడ్రైవర్, తల్లి పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళ. ఆయనకు మూడేళ్లు ఉన్నప్పుడే అతని తల్లి కన్నుమూశారు. దీంతో బంధువుల ఇంట్లో పెరిగిన పండు.. ఐఐటీ మద్రాస్లో గ్రాడ్యుయేషన్ చేశారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో డ్యాన్స్పై మక్కువతో ఓ గ్రూప్లో జాయిన్ అయిన పండు.. నాటి నుంచి డ్యాన్స్నే కెరీర్గా తీసుకుని కష్టపడుతున్నాడు. 2014లో డ్యాన్స్ తమిజ డ్యాన్స్ సీజన్ 1లో పండు పార్టిసిపేట్ చేశాడు. ఆ తర్వాత కింగ్స్ ఆఫ్ డ్యాన్స్లో సెమీ ఫైనల్ వరకు చేరుకున్నాడు. 2017లో జితు మాస్టర్ ఢీ 10లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం వెతుకుతుండగా.. ఒక స్నేహితుడి ద్వారా పండుకు ఢీలో అడుగుపెట్టే అవకాశం దక్కింది.

ఢీలో తన డ్యాన్స్లతో అలరిస్తూనే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోలలో కామెడీ టైమింగ్తోనూ నవ్విస్తున్నాడు. ఈ షోలతో పాటు బయట ఈవెంట్స్లోనూ పాల్గొంటున్నాడు పండు. ఈ క్రమంలోనే అనకాపల్లికి చెందిన బాలు రైడర్స్ అనే డ్యాన్స్ గ్రూప్ భీమిలీలో ఏర్పాటు చేసిన ఈవెంట్ పూర్తి చేసుుని వస్తుండగా విశాఖ జిల్లా ఆనందపురం మండలం లొడగలవాని పాలెం వద్దకు వచ్చేసరికి డ్యాన్స్ ట్రూప్కి చెందిన ఓ మహిళకు వాంతులు కావడంతో కారును పక్కకి నిలిపారు. దాంతో పండు మాస్టర్ మరికొందరు కారులోంచి దిగారు.
సరిగ్గా అదే సమయంలో కోళ్ల లోడ్తో వస్తున్న బోలేరో వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దాంతో కారులో వెనుక నిలబడిన పండు మాస్టర్, లిఖిత ప్రియ, హారికలు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వీరిని మరో కారులో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పండు మాస్టర్కు రెండు కాళ్లు, తుంటి ఎముక వద్ద తీవ్రగాయాలు కావడంతో సర్జరీ నిర్వహించారు వైద్యులు. దాంతో ఆయన ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఇదిలాఉండగా.. ప్రమాదం తర్వాత కళ్లు తెరిచిన పండు మాస్టర్ హాస్పిటల్ బెడ్ మీద నుంచే ఓ వీడియో విడుదల చేశారు. ఈవెంట్ చేసుకుని బయల్దేరాం. దారిలో వాంతులు వచ్చేలా అనిపించడంతో ఆనందపురం వద్ద ఓ చోట ఆగాం. వాంతు చేసుకుని నిలబడగా వెనుక నుంచి కోళ్ల లోడుతో వస్తున్న వెహికల్ మా కారుని గుద్దింది. మా కారు నా మీదకి ఎక్కడంతో నా రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయా. హాస్పిటల్కి వెళ్లి వచ్చాకే నాకు రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయినట్లు తెలిసిందని పండు మాస్టర్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. పండు మాస్టర్ కోలుకోవాలని అభిమానులు, బుల్లితోర ప్రముఖులు సోషల్ మీడియా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications


