‘2 కోట్లు తెస్తావా.. నీ ప్రైవేట్ వీడియోలు లీక్ చేయమంటావా’
ప్రేక్షకులకు వినోదాన్ని పంచే నటీనటులు ఇటీవలి కాలంలో నేరాల్లో చిక్కుకుంటున్నారు. నేరస్తులు కూడా భయపడే రేంజ్లో దారుణాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్, స్మగ్లింగ్, కిడ్నాప్లు, అత్యాచారాలు, హత్యలు, మోసాలు ఇలా అన్ని రకాల నేరాల్లో నటీనటుల పాత్ర బయటపడుతోంది. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో నటి రన్యా రావు పోలీసులకు దొరికిపోయారు. ఇక తన వీరాభిమాని అయిన రేణుకా స్వామిని కన్నడ స్టార్ హీరో దర్శన్ దారుణంగా హత మార్చి ప్రస్తుతం జైలులో ఉంటున్నారు. ఇక డ్రగ్స్ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన వారి సంఖ్యకి లెక్కే లేదు.
నేరాల్లో నటీనటులు
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది నటీనటులపై సివిల్, క్రిమినల్ కేసులు ఎన్నో ఉన్నాయి. అయితే సినీనటులే కాదు.. బుల్లితెర నటులు కూడా తాము తక్కువేం కాదు అని నిరూపిస్తున్నారు. తాజాగా కన్నడ బుల్లితెరకు చెందిన నటి చేసిన పని కలకలం రేపుతోంది. తాను కోరినంత డబ్బులు ఇవ్వకుంటే ప్రైవేట్ ఫోటోలు బయట పెట్టేస్తానని నటి బ్లాక్మెయిలింగ్కు దిగింది. ఆమె వేధింపులు తారాస్థాయికి చేరడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

మోడల్ నుంచి నటిగా
కన్నడ బుల్లితెరపై పాపులర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆశా జోయిస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోడలింగ్ నుంచి వినోద రంగం వైపు ఈ ముద్దుగుమ్మ అడుగులు వేసింది. 2016లో మిస్ ఇండియా ప్లానెట్ పోటీలలో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ పాపులారిటీతో ఆమెకు సినీ రంగం నుంచి అవకాశాలు క్యూకట్టాయి. ఈ క్రమంలో హరీశ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ సత్యనారాయణ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కుడువల్లి చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన కెంపామన కోర్ట్ కేసు సినిమాలో నటించారు. అనంతరం 2024లో మనసు అనే సినిమాలో నటించారు.
2 కోట్లు ఇస్తావా? లేదా?
కాగా.. పార్వతి అనే 61 ఏళ్ల మహిళతో ఆశా జోయిస్ స్నేహం పెంచుకుంది. తాను నటినని చెప్పి మరింత క్లోజ్ అయ్యింది. ఈ క్రమంలోనే పార్వతికి చెందిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను దొంగతనం చేసింది. 2 కోట్ల రూపాయల డబ్బు ఇవ్వాలని బాధితురాలి భర్తను ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీనికి బాధితురాలి కుటుంబం ఒప్పుకోకపోవడంతో తన నిజ స్వరూపం చూపించింది ఆశా. డబ్బు ఇవ్వకుంటే ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తానని చెప్పింది.. చివరికి అన్నంత పని చేసింది. పార్వతి ఫోటోలు, వీడియోలు, వాయిస్ రికార్డ్లను బాధితురాలి బంధుమిత్రులకు పంపింది ఆశా. నటి వేధింపులు ఎక్కువ కావడంతో పార్వతి... బెంగళూరు నగరంలోని తిలక్ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆరోపణలపై స్పందించని ఆశా జోయిస్
ప్రస్తుతం ఈ వ్యవహారం కన్నడ బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఇప్పటి వరకు ఆశా జోయిస్ స్పందించలేదు. పోలీసులు మాత్రం త్వరలోనే ఆమెను విచారణకు పిలిచి, స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తామని చెబుతున్నారు. సైబర్ క్రైమ్ నిపుణుల ద్వారా పార్వతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు విశ్లేషించి తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ కేసు ద్వారా నటీనటుల చీకటి కోణాలు, దారుణాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రజలకు తెలుస్తున్నాయి.


Click it and Unblock the Notifications











