Gunde Ninda Gudi Gantalu January 21th Episode: మీనా వింత ప్రవర్తన.. బాలు మానవత్వం.. రోహిణి జీవితం రోడ్డుపాలేనా
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్లో మీనా చేసిన చికెన్ వాసనకే కుటుంబ సభ్యులంతా టేబుల్ చుట్టూ చేరి లొట్టలు వేసుకుంటూ తింటారు. మీనా వంటను అందరూ తెగ మెచ్చుకుంటే, ప్రభావతి మాత్రం ఎప్పటిలాగే వంకలు పెడుతుంది. ఉప్పు ఎక్కువైందని విమర్శలు చేస్తూనే కడుపునిండా తినేస్తుంది. శృతి, సత్యం చురకలతో ఆ సీన్ను మరింత సరదాగా మార్చగా, రవి కూడా మీనా వంటను ఆకాశానికెత్తుతూ రెస్టారెంట్ స్పెషల్గా పెట్టాలంటాడు. ఈ మాటలు ప్రభావతికి మరింత మంట పుట్టిస్తాయి. ఇక బాలు మీనా కోసం స్వీట్ తీసుకుని రావడం, ఇద్దరూ ఒకేసారి ఒకరినొకరు పిలుచుకోవడం కథలో కీలక మలుపుగా మారుతుంది. నిన్నటి గొడవకు బాలు క్షమాపణ చెప్పడంతో మీనా-బాలు మధ్య దూరం తగ్గుతుంది.
బాలు కోసం మీనా ముందే దాచిపెట్టిన చికెన్ చూసి బాలు ఇంప్రెస్ అవుతాడు. ఈ మధుర క్షణాలతో ఇద్దరి గొడవకు ఫుల్స్టాప్ పడగా, ప్రభావతి మాత్రం తన ప్లాన్ ఫెయిల్ కావడంతో కుళ్లుకుంటుంది. మరుసటి రోజు మీనా స్నేహితులు బాలు-మీనాల జంటను పొగడ్తలతో ముంచెత్తుతారు. అయితే అదే సమయంలో సుమతి నుంచి వచ్చిన ఫోన్ కాల్తో కథ ఒక్కసారిగా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. హాస్పిటల్లో రోహిణి రెండో ప్రెగ్నెన్సీ కోసం కన్సల్టేషన్కు వస్తోందని తెలిసి మీనా షాక్కు గురవుతుంది. ఈ నిజం ఆమెను తీవ్ర ఆలోచనల్లో ముంచెత్తి, చివరికి బాలు కూడా ఆమె ప్రవర్తనలో మార్పును గమనించే స్థితికి తీసుకొస్తుంది. ఇలా ఎపిసోడ్ చివర్లో సస్పెన్స్ మరింత పెరిగింది.

Photo Courtesy: jiohotstar
బుధవారం ఎపిసోడ్లో రోహిణి విషయం తెలిసినప్పటి నుంచి మీనా ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఆ షాకింగ్ నిజాన్ని ఎవరికీ, ఎలా చెప్పాలో అర్థం కాక ఆమె తనలో తానే మదనపడుతూ అయోమయానికి లోనవుతుంది. అదే సమయంలో బాలుకు ఒక అర్జెంట్ కాల్ వస్తుంది. ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ కోసం హాస్పిటల్కు తీసుకెళ్లాలని సమాచారం అందుతుంది. అయితే ఈ సమయంలో మీనా నాన్సింక్గా మాట్లాడటం, స్పష్టంగా స్పందించకపోవడం బాలును మరింత కన్ఫ్యూజ్ చేస్తుంది. దీంతో బాలు, తన భార్యకు ఏదో అయిందేమో, 'గాలి సోకిందా?' అన్నట్లుగా ఫీలవుతాడు.
అయోమయంలోనే ఉన్న మీనా వింతగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లడం ప్రభావతి గమనిస్తుంది. దీనికి ఏమైంది అని అనుమానం వచ్చి, వెంటనే మీనాను పిలిచి టీ పెట్టుకుని రమ్మని ఆదేశిస్తుంది. కానీ మీనా మాత్రం స్పందించకుండా టీవీ ఆన్ చేస్తుంది. దీంతో ప్రభావతి ఒక్కసారిగా మండిపడి, 'నేను ఏం చెబితే ఏం చేస్తున్నావ్? అసలు మైండ్ ఎక్కడ పెట్టావు?' అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది. ఆ మాటలకు మనసు నొచ్చిన మీనా ఏమి మాట్లాడకుండా ఒంటింట్లోకి వెళ్లిపోతుంది.
ఇదే సమయంలో రోహిణి, మనోజ్ స్వీట్స్ తీసుకుని ఇంటికి వస్తారు. 'శుభవార్త' అంటూ ప్రభావతికి సర్ప్రైజ్ ఇస్తారు. స్వీట్స్ చూడగానే ప్రభావతి, రోహిణి తల్లి కాబోతుందేమో అన్న అనుమానంతో ప్రశ్నిస్తుంది. అయితే మనోజ్ మాత్రం అసలు విషయాన్ని వేరేలా చెబుతూ, ఈసారి షాప్లో ఎన్నడూ లేనంతగా సేల్స్ పెరిగాయని, లక్షల్లో టర్నోవర్ వచ్చిందని సంతోషంగా వివరిస్తాడు. అసలు విషయం ఇలా బయటపడటంతో ప్రభావతి నిష్టూరంగా స్పందిస్తుంది. తాను నానమ్మను కాబోతున్నానని, వాళ్లు తల్లిదండ్రులు కాబోతున్నారని అనుకోవాలా లేక సేల్స్, బిజినెస్ గురించే వినాలా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది.
దీనికి మనోజ్, ఈరోజు స్వామిజి చెప్పినట్లు షర్ట్ వేసుకున్నందువల్లే వ్యాపారం బాగా కలిసొచ్చిందని, అన్నీ స్వామీజీ చెప్పినట్లే జరుగుతున్నాయని అంటాడు. అంతేకాదు, కలిసివచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడని స్వామిజి చెప్పాడని, త్వరలో తామూ తల్లిదండ్రులం కావొచ్చని తన ఊహల్లో తేలిపోతూ చెబుతాడు. దీంతో మనోజ్ చెప్పిన మాటలు తనకు వేరే అర్థాల్లో వినిపిస్తున్నాయని ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఏదో అనుకుంటే ఏదో మ్యాటర్ చెబుతున్నారని కోపంగా మాట్లాడుతుంది. ఇదే సమయంలో మీనాను పిలిచి, 'టీ తీసుకురావడానికి ఇంత టైమ్ పట్టిందా?' అంటూ గట్టిగా అరుస్తుంది. కంగారుపడిన మీనా పరుగెత్తుకుంటూ వచ్చి టీ కాకుండా కాఫీ ఇస్తుంది. దీనిని పెద్ద తప్పులా తీసుకున్న ప్రభావతి మరింత అరుస్తూ హడావుడి చేస్తుంది.
ఈ గొడవ పెద్దదవుతుండగా మనోజ్, రోహిణి మధ్యలో కలగజేసుకుంటారు. రోహిణి 'ఏమైంది అత్తయ్య?' అని అడిగితే, టీ అడిగితే కాఫీ తెచ్చిందని ప్రభావతి చెప్పి, కావాలంటే తాగి చూడమంటూ కప్పును రోహిణికి ఇస్తుంది. అయితే మనోజ్ వెంటనే అది తాగొద్దని, హైజెనిక్ కాదని అడ్డుకుంటాడు. దీంతో ప్రభావతి మరింత రెచ్చిపోయి, మనోజ్ చిన్నప్పటి చిలిపి పనులన్నింటినీ గుర్తుచేస్తూ ఎద్దేవా చేస్తుంది.
ఇంతలో రవి, శృతి వచ్చి మీనాను పిలుస్తారు. మీనా మళ్లీ కంగారుగా హాల్లోకి వస్తుంది. వచ్చీ రాగానే రవి, శృతి ఇద్దరూ అసలు విషయం చెప్పకుండా ఆటపట్టిస్తూ సస్పెన్స్ పెడతారు. ఈ విషయం చెప్పనే లేదు.. అన్నయ్య ఫోన్ చేయలేదా? అంటూ మరింత ఉత్కంఠ సృష్టిస్తారు. దీంతో ప్రభావతి బాలుని అపార్థం చేసుకుని, మళ్లీ ఏదైనా గొడవ చేశాడేమో, ఎవడైనా కొట్టాడేమో అంటూ తిట్ల దండకం మొదలుపెడుతుంది. ఈ సమయంలో సత్యం ఎంట్రీ ఇచ్చి, అనవసరంగా అపార్థం చేసుకోవద్దని, అసలు విషయం చెప్పమని రవిని మందలిస్తాడు.
అంతలోనే బాలు పూలదండ మెడలో, చేతిలో స్వీట్ బాక్స్తో ఇంట్లోకి వస్తాడు. ఈ అనూహ్య ఎంట్రీతో అందరూ షాక్ అవుతారు. బాలు ముందుగా మీనాకు స్వీట్ తినిపించి, తర్వాత అందరికీ పంచుతాడు. మొదట తనకు స్వీట్ ఇవ్వలేదని ప్రభావతి కాస్త ఫీల్ అయినా, బాలు బలవంతం చేయడంతో తీసుకుని తింటుంది. అసలు విషయం ఏంటని సత్యం అడగ్గా, బాలు జరిగినదంతా వివరిస్తాడు. డెలివరీ కేసులో ట్రాఫిక్ జామ్ కారణంగా హాస్పిటల్కు వెళ్లలేని పరిస్థితిలో మార్కెట్లోనే ప్రసవం జరిగిందని, అక్కడి మహిళలు సహాయం చేయడంతో తల్లి-బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని చెబుతాడు. మొదటిసారి చిన్న పాపను ఎత్తుకున్నప్పుడు తన మనసు పులకరించిందని, ఆ కుటుంబం తనను దేవుడిలా భావించి కృతజ్ఞతలు తెలిపిందని భావోద్వేగంగా చెప్పడం ఎపిసోడ్ కు హైలెట్ గా మారింది.
బాలు చేసిన మానవత్వపు పనిని విన్న వెంటనే ఇంట్లో అందరూ ఆనందంతో అతడిని మెచ్చుకుంటారు. తల్లి-బిడ్డలను కాపాడిన తీరు, ఆ సమయంలో చూపిన ధైర్యం కుటుంబ సభ్యుల హృదయాలను తాకుతుంది. బాలు చేసిన పుణ్యానికి గర్వపడేలా సత్యం సహా అందరూ అతడిని అభినందిస్తారు. అయితే ఈ సంతోష వాతావరణంలోనూ ప్రభావతి మాత్రం తన మనస్తత్వాన్ని బయటపెడుతుంది. ఎవరెవరో పిల్లలు కంటుంటే తన ఇంట్లో మాత్రం ఎవరికీ ఆ ఆలోచన లేదంటూ ప్రభావతి బాధపడుతుంది. ముగ్గురు కోడళ్లు ఉన్నా తన బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని వాపోతుంది. దీనికి సత్యం పాజిటివ్గా స్పందిస్తూ, బాలు చేసిన పుణ్యం ఊరికే పోదని, తప్పకుండా ఈ ఇంట్లో కూడా పిల్లల సందడి వస్తుందని ధైర్యం చెబుతాడు. కానీ ప్రభావతి మాత్రం ఇక్కడే తన అసలు కోరికను బయటపెడుతుంది. మొదట పిల్లలు కంటారు వారికి మీ అమ్మగారు ఆస్తి ఇస్తానన్నారని గుర్తు చేస్తూ, తన లోపలి ఆశను బహిర్గతం చేస్తుంది.
ఈ మాటలు విన్న సత్యం ఒక్కసారిగా మండిపడతాడు. 'నీ బాధకు అసలు కారణం ఇదా?' అంటూ ప్రభావతిని చీదరించుకుంటాడు. కుటుంబంలో ఆనందం కన్నా ఆస్తి, వారసత్వంపైనే ఆమె దృష్టి ఉందని సత్యం స్పష్టంగా చెప్పడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారుతుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్స్లో కథ మరింత సంచలన మలుపు తిరగనుందని తెలుస్తోంది. ప్రభావతికి రోహిణి భాగవతం తెలిసినట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. నేరుగా రోహిణి గదికి వెళ్లి హాల్కు రమ్మంటూ వార్నింగ్ ఇవ్వడం, అందరి ముందు 'మనోజ్తో జరిగినదే నీకు మొదటి పెళ్లినా? పెళ్లికాకముందే నువ్వు తల్లివయ్యావా? ఇలా ఎంతమందిని మోసం చేశావు?' అంటూ నిలదీయడం జరిగేలా ఉంది.
ఈ క్రమంలో మనోజ్ కూడా ప్రశ్నించగా, రోహిణి తన తప్పును ఒప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలతో ఇంట్లో తుఫాన్ తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రోహిణి రహస్యం నిజంగానే బయటపడుతుందా? దీని ప్రభావం బాలు-మీనాలపై ఎలా ఉంటుంది? వచ్చే ఎపిసోడ్స్లో ఎలాంటి ట్విస్ట్లు ఉంటాయన్నది ఇప్పుడు ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచుతోంది.


Click it and Unblock the Notifications










