Gunde Ninda Gudi Gantalu February 19th Episode: మౌనికపై నీలకంఠం కుట్ర.. మీనా, బాలు ఆశలు.. రోహిణి ప్లాన్ ఫెయిల్
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ భావోద్వేగాలు, ఉత్కంఠ, కామెడీ మేళవింపుతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అర్ధరాత్రి మీనా నిద్రలేచి రోహిణి మాటలు గుర్తుచేసుకుని కలత చెందుతుంది. అది గమనించిన బాలు ప్రేమగా ఆమెను ఓదార్చుతూ, భయపడకుండా ధైర్యంగా ఉండాలని చెబుతాడు. ఈ హార్ట్ టచ్చింగ్ సీన్ ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఇచ్చింది. ఇక రవి-శృతి మధ్య అర్ధరాత్రి ఫోన్ కాల్ ఎపిసోడ్లో నవ్వులు పూయించింది. లేడీ బాస్ నీతూ ఫోన్ చేయడంతో శృతి అసహనం వ్యక్తం చేస్తుంది. రవి ఫోన్ కట్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ చెలరేగుతుంది.మరుసటి రోజు కూడా రెస్టారెంట్లో నీతూతో రవి సరదాగా మాట్లాడటం చూసి శృతి మరింత కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రవి క్షమాపణ చెప్పినా, పొరపాటున శృతిని 'నీతూ' అని పిలవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంది. ఇదిలా ఉండగా తలకు గాయం ఉన్నా మీనా వంట చేయడం చూసి బాలు ఆగ్రహిస్తాడు. అదే సమయంలో వచ్చిన భారీ పూల ఆర్డర్ కథకు ట్విస్ట్ తీసుకొస్తుంది. బాలు బైక్పై మీనాను తీసుకెళ్తుండగా గుణ కావాలనే కారుతో ఢీకొట్టమని ఆదేశిస్తాడు. ప్రమాదం తృటిలో తప్పినా ఇద్దరూ కిందపడిపోతారు. వృద్ధ దంపతులకు సహాయం చేసిన బాలు మనసు గెలుచుకుంటాడు. చివర్లో సంజు-మౌనిక హాస్పిటల్ విషయం ఇంట్లో కలకలం రేపుతుంది. నీలకంఠం మాట్లాడిన అవమానకరమైన మాటలు మౌనికను తీవ్రంగా బాధపరుస్తాయి. ఆమె కళ్లలో కనిపించిన ఆవేదనే ఎపిసోడ్కు అసలైన హైలైట్గా నిలిచింది.

గురువారం ప్రసారమైన ఎపిసోడ్ ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథ ఆరంభంలోనే నీలకంఠ తన పక్కా ప్లాన్లో భాగంగా మౌనిక, సంజును హాస్పిటల్కు టెస్టుల కోసం పంపిస్తాడు. అసలు ఎందుకు టెస్టులు చేయించాల్సి వచ్చిందని సంజు తల్లి ప్రశ్నించగా... నీలకంఠ చెప్పిన సమాధానం అందరినీ షాక్కు గురిచేస్తుంది. మౌనికకు ముగ్గురు అన్నలు ఉన్నారని, వారందరికీ పెళ్లిళ్లు అయి సంవత్సరాలు గడిచినా పిల్లలు లేకపోవడంతో అనుమానం వచ్చిందని... అందుకే మౌనికకు టెస్టులు చేయించానని నీలకంఠ చెబుతాడు. ఇది విన్న మౌనిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. 'మామయ్య ఇలా ఎలా చేశారు?' అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. దీంతో సంజు ఆగ్రహంతో మౌనికపై చేయి చేసుకునే ప్రయత్నం చేస్తాడు. 'మా నాన్నతో ఇలా మాట్లాడతావా? నీకు అంత ధైర్యమా?'అంటూ ఆమెపై కేకలు వేస్తాడు. అంతేకాదు... తనకు కూడా టెస్టులు జరిగాయని, తండ్రి వారసుడి కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పి నీలకంఠ చేసిన పనిని సమర్థించేందుకు ప్రయత్నిస్తాడు.
ఈ సమయంలో సంజు తల్లి జోక్యం చేసుకుని... ప్రేమగా భార్యాభర్తలుగా కలిసి ఉంటే పిల్లలు అవుతారని, మృగంలా ప్రవర్తిస్తే ఎలా అవుతారని ప్రశ్నిస్తుంది. ఆమె మాటలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. అయితే నీలకంఠ మాత్రం ఈ విషయాన్ని పెద్ద గొడవ చేయవద్దంటూ హెచ్చరిస్తాడు. ఇక్కడితో ఆగని నీలకంఠ... హాస్పిటల్కు ఫోన్ చేసి మరీ తన అసలు రంగు చూపిస్తాడు. టెస్ట్ రిపోర్టులు తాను చెప్పినట్టే రావాలని, భవిష్యత్తులో మౌనికకు పిల్లలు పుట్టరనే విధంగా రిపోర్ట్ ఇవ్వాలని ల్యాబ్ టెక్నీషియన్ను హెచ్చరిస్తాడు. ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పడంతో టెక్నీషియన్ కూడా సరే అంటాడు. ఈ సన్నివేశంతో నీలకంఠ మౌనికను ఇంటి నుంచి బయటకు పంపించేందుకు ఎంత దూరమైనా వెళ్తాడని స్పష్టమైంది.
ఇక మరోవైపు... బాలు, మీనా హాల్లో కూర్చొని తమ సంపాదన లెక్కలు వేసుకుంటారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ భవిష్యత్తు గురించి కలలు కంటారు. వృద్ధాప్యంలో ఎలా ఉంటారో ఊహించుకుంటూ నవ్వుకుంటారు. తమకు ఇద్దరు పిల్లలు పుట్టినట్లు, వారికి పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించినట్లు కలగంటారు. అంతేకాదు... ఆ ఊహల్లో కూడా తమ బెడ్రూమ్ ఇంకా కట్టలేదని బాధపడుతూ కనిపిస్తారు. ఈ భావోద్వేగ క్షణాల్లోనే బాలు మీనాను ఆటపట్టిస్తూ... "ఇలాంటి కలలు కనే బదులు ప్రస్తుతం చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి" అంటూ దుప్పట్లోకి లాగుతాడు. ఈ సన్నివేశం ప్రేక్షకులకు చిరునవ్వులు తెప్పించింది.
ఇక మరుసటి రోజు ఉదయం ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. రోహిణి తన ప్లాన్ను అమలు చేయాలని నిర్ణయించుకుంటుంది. బాలు సెల్ఫోన్లో ఉన్న వీడియోలను తనకు పంపించుకోవాలన్న ఉద్దేశంతో అతని ఫోన్ను దొంగిలించే ప్రయత్నం చేస్తుంది. బాలు నిద్రలో ఉండగా, పక్కనే ఉన్న సెల్ఫోన్ను నెమ్మదిగా తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఫోన్ పట్టుకోబోయే సరికి బాలు ఒక్కసారిగా లేచి టైమ్ చూసి మీనాపై అరుస్తాడు. "ట్రిప్కు వెళ్లాలి అన్న విషయం తెలుసు కదా... ఎందుకు నిద్రలేపలేదు?" అంటూ కోప్పడతాడు. మీనా తాను ఇప్పటికే రెండు మూడు సార్లు లేపానని, కానీ అతడే లేవలేదని సమాధానం ఇస్తుంది.
ఇంతలో బాలు ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉందని గమనించి, "చార్జింగ్ పెట్టొచ్చు కదా?" అని మీనాను అడుగుతాడు. తాను టిఫిన్ తయారు చేస్తున్నానని చెప్పి, బాలు తానే ఫోన్ను చార్జింగ్ పెట్టి బాత్రూమ్లోకి వెళ్తాడు. ఇదే సరైన అవకాశం అనుకున్న రోహిణి ఫోన్ దగ్గరకు వెళ్లగానే... బాలు బాత్రూమ్ నుంచి గట్టిగా మీనాను పిలుస్తాడు. వెంటనే మీనా పరుగెత్తుకుంటూ వస్తుంది. ఆ సమయంలో రోహిణి పట్టుబడకుండా మంచం కింద దాక్కుంటుంది. మీనా బాలు కోరినట్టు సబ్బు ఇచ్చి బయటకు వెళ్లగానే... మళ్లీ బాలు పిలుస్తాడు. ఈసారి మరో అవసరం చెబుతాడు. ఇలా ప్రతిసారి రోహిణి బయటకు రావాలని ప్రయత్నిస్తే, బాలు ఏదో ఒక కారణంతో మీనాను పిలుస్తూనే ఉంటాడు. అంతేకాదు, ప్రభావతి కూడా అదే గదిలోకి వచ్చి వెళ్లడంతో రోహిణి మంచం కింద ఇరుక్కుపోతుంది.
బాలు స్నానం అయిపోయాక కూడా మీనాను తలకు తుడవమని, టిఫిన్ తీసుకురమ్మని, తినిపించమని వరుసగా పనులు చెప్పడంతో రోహిణికి బయటకు రావడానికి సరైన సమయం దొరకదు. చివరకు 'సెల్ఫ్ ఫోన్ తీసుకుని వీడియోలు పంపించుకుందాం' అనుకుంటే... చార్జింగ్ లేకపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దీంతో రోహిణి ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అవుతుంది. ఇక మరోవైపు మనోజ్ తన భార్య రోహిణి కోసం వెతుకుతూ కనిపిస్తాడు. ముందుగా తన తండ్రి సత్యాన్ని అడుగుతాడు. అతడిని 500 రూపాయలు కావాలని అడగగా, సత్యం తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని చెబుతాడు. తరువాత ప్రభావతి దగ్గరకు వెళ్లి అడిగినా ఆమె అనుమానం వ్యక్తం చేస్తుంది. చివరకు బాలు దగ్గరకు వెళ్లి 500 అడగగా, బాలు వెటకారంగా మాట్లాడతాడు. దీంతో మనోజ్ నిరాశగా వెళ్లిపోతాడు.
ఈలోగా ట్రిప్కు సిద్ధమవుతున్న బాలు, చార్జింగ్ పెట్టిన చోట సెల్ఫోన్ కనిపించకపోవడంతో ఇంట్లో కలకలం రేపుతాడు. గది మొత్తం వెతుకుతాడు. మీనా కూడా వెతుకుతుంది. రూమ్లో దొరకకపోవడంతో బయటకు వస్తాడు. ఇదే సరైన సమయం అనుకుని రోహిణి మంచం కింద నుంచి బయటకు వచ్చి, ఫోన్ను తిరిగి అక్కడే ఉంచి, తాను ఏమీ తెలియనట్టు వేరే తలుపు నుంచి ఇంట్లోకి వస్తుంది. సత్యం బాలును ప్రశ్నించగా, తన సెల్ఫోన్ కనిపించడం లేదని చెబుతాడు. ఈలోగా బాలు అనుమానంతో "మనోజ్ టిఫిన్ టైమ్లో వచ్చాడు... వీడే తీసి ఉంటాడు" అని అంటాడు. అయితే మీనా మరోసారి గదిలోకి వెళ్లి వెతికితే, ఫోన్ చార్జింగ్ పెట్టిన చోటే కనిపిస్తుంది. ఇది చూసి ఆమె షాక్ అవుతుంది. ఈ విషయం బాలకు చెప్పగానే అతడు కాస్త సందేహంలో పడతాడు.
ఇదిలా ఉంటే.. రవి తన బాస్ నీతూతో కలిసి సూపర్ మార్కెట్కు వెళ్లడం అనుకోకుండా పెద్ద ట్విస్ట్కు దారి తీసింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన రవి అత్తయ్య శోభ... తన అల్లుడు మరో అమ్మాయితో కలిసి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. రవి కూడా అత్తయ్యను చూసి కంగారుపడతాడు. "అత్తయ్య మీరు ఇక్కడ?" అని అడిగితే... "నేను రావద్దా?" అంటూ శోభ వెటకారంగా సమాధానం ఇస్తుంది. ఈలోగా నీతూ "బేబీ... బేబీ..." అంటూ రవిని పిలవడంతో శోభ అనుమానం మరింత పెరుగుతుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు రవి నీతూను తన బాస్గా పరిచయం చేస్తూ, త్వరలో కొత్త రెస్టారెంట్ ప్రారంభించబోతున్నామని, అందుకే షాపింగ్ చేస్తున్నామని చెబుతాడు. కానీ నీతూ మాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా "రా బేబీ" అంటూ రవిని లాకెళ్తుంది. వారిద్దరి మధ్య ఉన్న క్లోజ్నెస్ చూసిన శోభలో అనుమానం పీక్కు చేరుతుంది.
వెంటనే తన కూతురు శృతికి ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతుంది. శృతి తాను డబ్బింగ్ స్టూడియోలో ఉన్నానని చెబుతుంది. అది విన్న శోభ కోపంతో "నేను స్టూడియోకి వస్తున్నా... మాట్లాడాలి" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తన కూతురు సంసారంలో ఏదైనా తేడా జరుగుతోందా అన్న భయం శోభను వెంటాడుతుంది. ఇక మరోవైపు మీనా తన తల్లి పూల కొట్టు దగ్గరకు పూలు తీసుకెళ్తుంది. అక్కడే తన తమ్ముడు శివ కూడా కనిపిస్తాడు. శివ ప్రవర్తన మారి రెగ్యులర్గా కాలేజీకి వెళ్తుండడం చూసి మీనా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఖర్చుల కోసం డబ్బులు కూడా ఇస్తుంది.
అదే సమయంలో ఓ మహిళ వచ్చి తన కూతురికి ఇటీవలే కవల పిల్లలు పుట్టారని, వారి బారసాలకు పూలు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చానని చెబుతుంది. పిల్లల గురించి అడిగితే మీనా సిగ్గుపడుతుంది. ఇంతలో పంతులు వచ్చి ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా బొమ్మల కొలువు పెట్టుకుంటే చెడు దృష్టి పోయి మంచి జరుగుతుందని చెబుతాడు. మీనా తల్లి కూడా అదే సలహా ఇవ్వడంతో... మీనా ఆలోచనలో పడుతుంది. తన జీవితంలో జరుగుతున్న కష్టాలు తొలగిపోవాలంటే బొమ్మల కొలువు పెట్టాలేమో అని మనసులో అనుకుంటుంది. ఇలా నేటీ ఎపిసోడ్ లో నీలకంఠం మౌనికపై కుట్రలు కొనసాగుతుండగా, రోహిణి తన ప్లాన్లో భాగంగా సెల్ఫోన్ వీడియోలను పంపించుకోవాలని ప్రయత్నించి విఫలమవుతుంది. ఇక శోభ తన కూతురు సంసారం ప్రమాదంలో ఉందేమో అన్న ఆందోళనలో ఉంటే... మీనా మాత్రం తన భవిష్యత్తుపై ఆశతో బొమ్మల కొలువు గురించి ఆలోచిస్తోంది.


Click it and Unblock the Notifications











