Gunde Ninda Gudi Gantalu March 20th Episode: కొడుకులకు సత్యం కఠినశిక్ష.. మనోజ్కి 50లక్షల ఫైన్..కోర్టుకు డీలర్
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్ హై డ్రామా, ఉత్కంఠతో సాగింది. మనోజ్-రోహిణి వెడ్డింగ్ అనివర్సరీ పార్టీ గ్రాండ్గా జరుగుతుండగా, ముంబై నుంచి వచ్చిన చీఫ్ గెస్ట్ ముఖేష్ కోసం ఏర్పాటు చేసిన మందు పార్టీ కథకు కీలక మలుపు తీసుకొచ్చింది. 'మీరు తాగితేనే డీల్' అంటూ ముఖేష్ కండిషన్ పెట్టడంతో, మనోజ్ ఇష్టం లేకపోయినా తాగాల్సి వస్తుంది. రవిని కూడా ఒత్తిడి చేయడంతో అతడూ మద్యం సేవించి, ఇద్దరూ మత్తులోకి వెళ్లిపోతారు. ఇక బాలు మొదట పార్టీకి దూరంగా ఉన్నా, రవి కనిపించక లోపలికి వెళ్లి పరిస్థితి చూసి షాక్ అవుతాడు. అదే సమయంలో ముఖేష్ పెద్ద కాంట్రాక్ట్ డీల్ ప్రకటించి వెంటనే సైన్ చేయమంటాడు.
బాలు హెచ్చరించినా, మనోజ్ మత్తులోనే డాక్యుమెంట్ చదవకుండా సైన్ చేస్తాడు. తర్వాత బాలును కూడా తాగమని బలవంతం చేయడంతో, అతడు కంట్రోల్ కోల్పోయి వరుసగా తాగి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. మత్తులో ఉన్న సమయంలో బాలు అసలు నిజాలు బయటపెడతాడు. తన దగ్గర 40 కార్లు లేవని, మీనా పూలు అమ్ముతుందని, రవి చెఫ్ మాత్రమేనని చెబుతాడు. దీంతో ముఖేష్ షాక్ అవుతూ కోపంతో వెళ్లిపోతాడు. కానీ మిగతావాళ్లు దీనిని సీరియస్గా తీసుకోరు. ఈ గందరగోళంలో రోహిణి ప్లాన్ అమలు చేస్తూ, బాలు ఫోన్ను మనోజ్ కోట్లో పెట్టి కొత్త సమస్యకు నాంది పలుకుతుంది. చివర్లో మద్యం మత్తులో బాలు, రవి, మనోజ్ ఇంటి వద్ద హంగామా చేయడం, సత్యం కోపంతో ఊగిపోవడం ఎపిసోడ్కు హైలైట్గా నిలిచింది.

శుక్రవారం ఎపిసోడ్ పూర్తిగా వినోదంతో నిండిపోయి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. పార్టీలో ఫుల్గా తాగి ఇంటికి చేరుకున్న మనోజ్, రవి, బాలు ముగ్గురు ఇంటి ముందు చేసిన హంగామా హైలైట్గా నిలిచింది. మత్తులో ఉన్న వారు తమ తల్లి ప్రభావతిని "ఆంటీ", తండ్రి సత్యాన్ని "అంకుల్" అని పిలవడం, అంతేకాకుండా 'ఈ ఆంటీ ఇక్కడ ఎందుకు ఉంది? అంకుల్-ఆంటీకి రిలేషన్ ఏమిటి?' అంటూ రవి వేసిన ప్రశ్నలు మరింత ఫన్నీగా మారాయి. ఈ పరిస్థితిని చూసిన సత్యం తీవ్ర ఆగ్రహంతో మండిపడుతూ, 'ఇప్పుడీ స్థితిలో చెప్పినా వీళ్లకు అర్థం కాదు' అంటూ వారిని ఇంట్లోకి రానివ్వకుండా బయటే ఉండమని గట్టిగా ఆదేశిస్తాడు. మరోవైపు ప్రభావతి, మీనాపై కోపం వ్యక్తం చేస్తూ 'నీవల్లనే వీళ్లందరూ తాగారు'అని తప్పుపడుతుంది. అయితే వెంటనే రోహిణి స్పందిస్తూ 'మీనాకు ఇందులో సంబంధం లేదు' అని చెప్పడంతో, మనోజ్ కూడా రవి-బాలు తాగారని ఒప్పుకుంటాడు.
దీంతో ప్రభావతి ఒక్కసారిగా మౌనంగా మారుతుంది. ఇక సత్యం కఠిన నిర్ణయం తీసుకుంటూ, 'ఇలా వదిలేస్తే రేపు మళ్లీ ఇదే జరుగుతుంది' అంటూ ముగ్గురినీ బయటే పడుకోమని చెప్పేస్తాడు. ఎవరు జాలి చూపించినా వాళ్లను కూడా బయటికి పంపిస్తానని హెచ్చరిస్తాడు. ఇదే సమయంలో మత్తులో ఉన్న రవి "బార్కు పంపాలి" అంటూ మాట్లాడడం, మనోజ్ "మన హెలికాప్టర్ ఎక్కడ?" అంటూ అర్థంలేని మాటలు చెప్పడం నవ్వులు పూయిస్తుంది.ప్రభావతి మాత్రం తల్లి ప్రేమతో మనోజ్ను అయినా లోపలికి రానివ్వమని అడిగినా, సత్యం కఠినంగా తిరస్కరిస్తాడు. చివరికి కోడళ్లను లోపలికి పంపించి, కొడుకులను బయటే ఉంచేస్తాడు. మీనా జాలి పడుతూ వారికి చాప, దుప్పటి ఇవ్వాలని అడగగా, సత్యం కోపంతో అవి వాళ్లపైకి విసిరేస్తాడు. మత్తులో ఉన్న వారు దుప్పటిని కింద వేసుకుని చాపను కప్పుకోవడం ఎపిసోడ్ను మరింత ఫన్నీగా మార్చింది.
ఇక మరోవైపు కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. బాలు ఫోన్ను మనోజ్ కోట్లో దాచిన రోహిణి, అందులో ఉన్న శివ వీడియోను సంపాదించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ హాల్లో మీనా మేల్కొని ఉండటంతో, ఫోన్ దగ్గరకు వెళ్లే అవకాశం దొరకదు. మీనా పడుకున్న తర్వాత ఫోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తూ, రోహిణి హాల్లోనే ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ కనిపిస్తుంది. ఇంతలో మత్తు కాస్త తగ్గిన బాలు, వెక్కిళ్లు వస్తున్నాయని మీనాను నీళ్లు ఇవ్వమని అడుగుతాడు. ఇంట్లోకి రావాలని ప్రయత్నించగా, "నాన్నగారు అనుమతించలేదు" అని మీనా చెప్పడంతో బాలు బయటే కూర్చుంటాడు. ఈ సమయంలో బాలు-మీనా మధ్య సరదా సంభాషణ సాగుతుంది. బాలు తన తండ్రి సత్యంపై ఉన్న గౌరవాన్ని, మనోజ్పై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి లోనవడం సన్నివేశానికి మరింత బలం చేకూరుస్తుంది. వాస్తవానికి బాలు త్వరగానే మత్తు నుంచి బయటపడుతాడు, కానీ మనోజ్, రవి మాత్రం ఇంకా మత్తులోనే వింతగా ప్రవర్తిస్తుంటారు.
ఇక రోహిణి టెన్షన్ మరింత పెరుగుతుంది. ఈ సమయంలో దివ్య ఫోన్ చేసి "ఫోన్ తీసుకున్నావా లేదా?" అని ప్రశ్నిస్తుంది. రోహిణి జరిగిన విషయాన్ని చెప్పి, మనోజ్ బయట పడుకున్నాడని, బాలు-మీనా మేల్కొని ఉండటంతో తనకు అవకాశం దొరకలేదని చెబుతుంది. దీనిపై దివ్య గట్టిగా హెచ్చరిస్తూ "ఇవాళే ఫోన్ దక్కించుకో, లేదంటే ఇక అవకాశం రాదు" అంటుంది. అంతేకాకుండా బాలు-మీనా మధ్య జరుగుతున్న సంభాషణ గురించి ఆసక్తిగా అడగడంతో, రోహిణి కోపంతో "వాళ్ల మధ్యకు ఫోన్ పెట్టి నువ్వే విను" అంటూ అసహనం వ్యక్తం చేస్తుంది. చివరికి ఏమైనా చేసి ఫోన్ తెచ్చుకోవాలని దివ్య ఒత్తిడి పెంచడంతో, రోహిణి రాత్రంతా నిద్రపోకుండా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎంత కష్టపడ్డా ఆమెకు ఫోన్ దక్కదు.
ఇక బాలు ఫోన్ను సంపాదించుకోవాలని పట్టుదలతో ఉన్న రోహిణి, తెల్లవారగానే బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అయితే శృతి ఆమెను అడ్డుకుంటూ "డోర్ ఓపెన్ చేయొద్దని మామయ్య ఆర్డర్ ఇచ్చారు, అందుకే ఆటో లాక్ పెట్టాం" అని చెబుతుంది. "అంటే నువ్వూ బయటికి వెళ్లలేదా?" అని రోహిణి అడగగా, "ముగ్గురు మూడు పెగ్గులు వేసి పడుకున్నారు కదా!" అంటూ శృతి ఫన్నీగా సమాధానం ఇవ్వడం నవ్వులు పూయిస్తుంది. ఇంతలో సత్యం అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేయమని ఆదేశిస్తాడు. బయట పడుకున్న మనోజ్, రవి, బాలను లేపమని కోడళ్లకు చెబుతాడు.
అయితే మత్తు పూర్తిగా దిగకపోవడంతో ముగ్గురు మళ్లీ హంగామా చేస్తూ అందరినీ ఇబ్బంది పెడతారు. ముఖ్యంగా మనోజ్ ఇంకా మత్తులోనే వింతగా ప్రవర్తించడం సన్నివేశాన్ని మరింత వినోదంగా మార్చుతుంది. ఈ సమయంలో బాలు తన తండ్రిని ఇన్డైరెక్ట్గా "ఇంట్లోకి రావచ్చా?" అని అడగగా, సత్యం లోపలికి పిలుస్తాడు. హాల్లో నిలబెట్టి ముగ్గురికి ఒక్కొక్కరికి గట్టిగా క్లాస్ పీకుతాడు. తమ తప్పును ఒప్పుకుంటూ బాలు, రవి నిజం చెబుతారు. అయితే మనోజ్ మాత్రం "ఒక్క పెగ్గు ఫార్మాలిటీ కోసం తాగమంటే, పీపాలు తాగేశారు" అంటూ తప్పును తేలికగా తీసుకునే ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా పార్టీలో తాగడం వల్లే పెద్ద డీల్ ఓకే అయ్యిందని చెప్పి, అగ్రిమెంట్ పేపర్లు సత్యంకి చూపిస్తాడు.
అయితే ఇక్కడే కథలో కొత్త టెన్షన్ మొదలవుతుంది. 'నిన్న రాత్రి ముఖేష్తో ఏం మాట్లాడారు?' అని మనోజ్ అనుమానంతో బాలు వైపు చూస్తూ ప్రశ్నిస్తాడు. ఇదే సస్పెన్స్తో ఎపిసోడ్ ముగుస్తుంది. అప్కమింగ్ ఎపిసోడ్లో డ్రామా మరింత పెరగనున్నట్టు తెలుస్తోంది. మత్తులో బాలు అసలు నిజాలు బయటపెట్టాడని తెలిసి మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, ముంబై డీలర్ ముఖేష్ ఇంటికే వచ్చి మనోజ్ను నిలదీయడం ప్రధానంగా కనిపించనుంది. "50 లక్షలు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తా" అంటూ ముఖేష్ హెచ్చరించగా, పరిస్థితిని కంట్రోల్ చేయడానికి బాలు మధ్యలోకి దిగే సన్నివేశాలు రాబోతున్నాయి. దీంతో కుటుంబంలో విభేదాలు మరింత ముదురే అవకాశముందని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











