Gundeninda Gudigantalu March 23th Episode:బాలు నిజాయితీతో మనోజ్కు డీల్.. రోహిణి,గుణ కుట్ర.. శివ వీడియో వైరల్.
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu: శుక్రవారం ఎపిసోడ్ హాస్యంతో పాటు భావోద్వేగాలను కలగలిపి ఆసక్తికరంగా సాగింది. పార్టీ నుంచి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మనోజ్, రవి, బాలు ముగ్గురూ గేటు దగ్గర తూలుతూ కనిపించగా, ప్రభావతి ఆందోళనతో పరుగెత్తుకుంటూ వస్తుంది. అయితే మత్తులో ఉన్న రవి తన తల్లినే గుర్తుపట్టకుండా "ఈ ఆంటీ ఎవరు?" అని అడగడం షాకింగ్గా మారుతుంది. మనోజ్ కూడా అదుపు తప్పి మాట్లాడడంతో సత్యం తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. వెంటనే వారిని ఇంట్లోకి రానివ్వొద్దని ఆదేశించి తలుపులు మూయిస్తాడు. ప్రభావతి వేడుకున్నా సత్యం కఠినంగా వ్యవహరించడంతో ముగ్గురు కొడుకులు బయటే ఉండాల్సి వస్తుంది.
చలిలో పడుకున్న వారి పరిస్థితి బాధ కలిగిస్తూనే, దుప్పటి కింద వేసుకుని చాపను కప్పుకుని నిద్రపోవడం కొంత హాస్యాన్ని కూడా తెస్తుంది. కొంతసేపటికి బాలు మత్తు దిగి తన తప్పును గ్రహించి పశ్చాత్తాపంతో మీనాతో మాట్లాడడం ఎపిసోడ్కు ఎమోషనల్ టచ్ ఇస్తుంది.ఇక రోహిణి ట్రాక్ కథలో ఉత్కంఠను పెంచుతుంది. శివ దొంగతనం వీడియో కోసం మనోజ్ ఫోన్ను తీసుకోవాలని ప్రయత్నించగా, మీనా మేల్కొని ఉండటం వల్ల సాధ్యం కాదు. దివ్య ఫోన్ కాల్తో రోహిణి టెన్షన్ మరింత పెరుగుతుంది. మరుసటి రోజు ఉదయం సత్యం ముగ్గురినీ గట్టిగా మందలిస్తాడు. రవి, బాలు క్షమాపణలు చెప్పినా, మనోజ్ మాత్రం తన తప్పును సమర్థించుకుంటూ రూ.50 లక్షల డీల్ గురించి చెప్పడం కథకు కొత్త ట్విస్ట్ తీసుకొస్తుంది.

Photo courtesy: Jio Hotstar
సోమవారం ఎపిసోడ్లో కథ ఉత్కంఠభరిత మలుపు తిరిగింది. ఇంటి పెద్ద సత్యం తన కుమారులు బాలు, రవిని గట్టిగా నిలదీస్తూ ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. 'ఎందుకురా తాగారు?'అంటూ ప్రశ్నించగా, మనోజ్ బలవంతంగా "పార్టీ కల్చర్" అంటూ తాగించాడని వారు చెప్పడంతో సత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. కుటుంబ విలువలు మరిచి ఇలాంటి పనులు చేయడం సరైంది కాదని తీవ్రంగా మందలిస్తాడు. ఇక మనోజ్ మాత్రం తనకు తాగడం వల్లే మంచి జరిగిందని చెప్పుకుంటూ, డీలర్షిప్కు సంబంధించిన పేపర్స్ను చూపిస్తూ గర్వపడతాడు. కానీ అదే సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. మద్యం మత్తులో బాలు, రవి మాట్లాడిన విషయాలు మనోజ్కు గుర్తుకువస్తాయి. వెంటనే వారిని ప్రశ్నించగా, వారు అసలు నిజాన్ని బయటపెడతారు.
డీలర్తో మాట్లాడినప్పుడు తాము చెప్పిన అబద్ధాలు కూలిపోయాయని ఒప్పుకుంటూ, 'మాకు 40 కార్లు లేవు, రెండు కార్లు మాత్రమే ఉన్నాయి... మనోజ్కు రెస్టారెంట్లు లేవు, ఒక హోటల్లో చెఫ్గా పనిచేస్తున్నాడు' అని చెప్పేశామని వెల్లడిస్తారు. ఈ మాటలు విన్న మనోజ్ షాక్కు గురై, బాలు కాలర్ పట్టుకుని 'నా కొంప ముంచారు కదరా!'అంటూ కోపంతో ఊగిపోతాడు. ఈ ఘటనతో సత్యం మరింత ఆగ్రహంతో మనోజ్పై విరుచుకుపడతాడు. 'ఇంత ఫ్రాడ్కు దిగుతావా? కుటుంబం మొత్తాన్ని దొంగలుగా మార్చేశావు' అంటూ తీవ్రంగా మందలిస్తాడు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారుతుంది.
ఇదిలా ఉండగా, మనోజ్ డాక్యుమెంట్స్ను మళ్లీ చదివి మరింత షాక్కు గురవుతాడు. డీలర్షిప్ క్యాన్సల్ అయితే 50 లక్షల రూపాయల ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని తెలుసుకుని తల పట్టుకుంటాడు. 'ఇక నా పని అయిపోయింది... డీల్ క్యాన్సిల్ అయితే 50 లక్షలు ఎలా కడతాను?' అంటూ తీవ్ర ఆందోళనకు గురవుతాడు. ఈ సమయంలో రవి, 'అందుకే ముందే చదివి సంతకం చేయమన్నాం... నువ్వే తొందరపడి సంతకం చేశావు' అంటూ మనోజ్ను తప్పుపడతాడు. మరోవైపు ప్రభావతి .. బాలు మీద కోపపడుతుంది 'నీ వల్లేనే మనోజ్ కు నష్టం.. ఇంటికి దరిద్రం తీసుకొచ్చావు'అంటూ తీవ్రంగా దూషిస్తుంది.
ఇక పరిస్థితి పూర్తిగా తన చేతిలో నుంచి జారిపోవడంతో మనోజ్ తీవ్ర నిరాశలోకి వెళ్తాడు. 'ఇది అంతా బాలు వల్లే జరిగింది... వాడు నిజం చెప్పకపోతే నాకు ఈ పరిస్థితి రాదు. ఇప్పుడు 50 లక్షలు కట్టకపోతే జైలుకే వెళ్లాలి' అంటూ బాధతో తన గదిలోకి వెళ్లిపోతాడు. మనోజ్ తీవ్ర ఆందోళనలో ఉండగా, రోహిణి అతనిని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. 'జరిగింది మన మంచికే అనుకోవాలి... నువ్వు ముందు వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రా' అంటూ అతనిని వాష్రూమ్కి పంపిస్తుంది. అయితే ఈ సమయంలో మనోజ్ కోట్లో ఉన్న బాలు ఫోన్ను తీసుకుని తన బ్యాగ్లో పెట్టడం కథలో కొత్త సస్పెన్స్కు దారితీస్తుంది.
ఇక మరోవైపు, 50 లక్షల ఫైన్ ఎలా చెల్లించాలి అన్న దానిపై కుటుంబ సభ్యులు తీవ్రంగా చర్చిస్తుంటారు. ఈ సమయంలో ప్రభావతి మరోసారి తన కోపాన్ని బయటపెడుతుంది. 'తాగితే నిజం చెప్పాలా? నువ్వు నా ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్లిపోతే... అప్పుడే నాకు శాంతి' అంటూ బాలు పై తీవ్రంగా మండిపడుతుంది. ఇదే సమయంలో డీలర్ ముఖేష్ ఇంటికి చేరుకోవడం కథలో కీలక మలుపు. అతన్ని చూసిన సత్యం మర్యాదగా స్వాగతం పలుకుతాడు. కానీ ముఖేష్ మాత్రం కోపంతో 'మీ మర్యాదల కోసం రాలేదు... అబద్ధాలు చెప్పిన మనోజ్ ఎక్కడ?' అంటూ గట్టిగా ప్రశ్నిస్తాడు. దీంతో ప్రభావతి వెంటనే మనోజ్ను కిందికి పిలుస్తుంది.
మనోజ్ను నిలదీస్తూ 'ఎందుకిలా చేశావు?' అని అడగగా, తాను వ్యాపారంలో త్వరగా ఎదగాలనే ఉద్దేశంతో అబద్ధాలు చెప్పాల్సి వచ్చిందని ఒప్పుకుంటాడు. అయితే ముఖేష్ ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుంటూ 'ఇది సరైన పద్ధతి కాదు... నేను డీల్ క్యాన్సిల్ చేస్తున్నాను. 50 లక్షలు కట్టాల్సిందే'అంటూ షాకింగ్ నిర్ణయం ప్రకటిస్తాడు. ఈ సమయంలో సత్యం ముందుకు వచ్చి తన కుమారుడి తరఫున క్షమాపణ కోరుతాడు. 'ఇదే నా ఇల్లు... ఇదే నా కుటుంబం... నాకు ఇంతకంటే పెద్ద వ్యాపారం లేదు. మనోజ్ చేసిన తప్పుకు నేను క్షమాపణ కోరుతున్నాను'అంటూ వినమ్రంగా అభ్యర్థిస్తాడు. బాలు కూడా తన అన్న కోసం మాట్లాడుకుంటూ 'మా అన్నయ్యకు అర్హతలు ఉన్నా కాలం కలిసి రావడం లేదు... అందుకే మేమందరం ఇలా తప్పు చేశాం'అంటూ ముఖేష్ను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.
ఈ మాటలు విన్న ముఖేష్ మనసు మార్చుకుంటాడు. 'నిజం ఎప్పుడూ గెలుస్తుంది... సత్యమేవ జయతే'అంటూ సత్యం, బాలు నిజాయితీని ప్రశంసిస్తాడు. 'అబద్ధాలు చెప్పేవారిని సహించను... కానీ మీ ఇద్దరి వల్లనే ఈ నిర్ణయం మారింది' అంటూ 50 లక్షల ఫైన్ను మాఫీ చేసి, మనోజ్కు డీలర్షిప్ ఇస్తానని ప్రకటిస్తాడు. ఇది విన్న కుటుంబ సభ్యులు ఆనందంతో మునిగిపోతారు. ముఖేష్ వెళ్లే ముందు 'జీవితంలో ఎదగాలని కోరిక ఉండాలి... కానీ జారుడు మెట్లు ఎక్కకూడదు. మీ బాలు ఈ కుటుంబాన్ని నిలబెడతాడు' అంటూ బాలును ప్రత్యేకంగా మెచ్చుకుంటాడు.
తర్వాత సత్యం తన కుమారుడు బాలును గర్వంగా హగ్ చేసుకుని భావోద్వేగానికి లోనవుతాడు. ఈ సమయంలో మీనా, ప్రభావతిని ప్రశ్నించగా, ఆమె మాత్రం "నేను చచ్చేదాకా వాడు మారడు" అంటూ ఇంకా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే సత్యం మాత్రం స్పష్టంగా చెబుతాడు 'బాలు నీతి, నిజాయితీ వల్లే ఈరోజు డీల్ మళ్లీ వచ్చింది' అంటూ బాలును ప్రశంసిస్తాడు. డీలర్షిప్ తిరిగి రావడంతో ఆనందంలో ఉన్న బాలు, మీనా దగ్గరకు వెళ్లి పాటలు పాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. 'చూసావా... నీతి, నిజాయితీగా ఉంటే ఎలా ఫలితం వస్తుందో! నావల్లే మనోజ్కు మళ్లీ డీల్ వచ్చింది'అంటూ గర్వంగా చెబుతాడు.
అయితే మీనా మాత్రం చురకలు అంటిస్తుంది. 'ఎంత సంతోషంగా ఉన్నా... తాగితే నిజాలు చెబుతారా?' అని ప్రశ్నించగా, బాలు ఫన్నీగా 'ఏమో... అలా వచ్చేస్తాయి' అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. దీంతో మీనా మరింత అనుమానం వ్యక్తం చేస్తూ 'నా దగ్గర ఏమైనా దాచుతున్నావా?' అని అడుగుతుంది. దీనికి బాలు 'దాచుతున్నాను... కానీ అది చాలా సీక్రెట్'అంటూ సస్పెన్స్ క్రియేట్ చేస్తాడు. ఇదే సమయంలో మరో ట్విస్ట్ బయటపడుతుంది. ఉదయం నుంచి తన ఫోన్ కనిపించకపోవడంతో బాలు టెన్షన్ పడుతున్న విషయం బయటపడుతుంది. మీనా 'నాకేం తెలుసు... నేనూ వెతుకుతాను'అంటూ తన గదిలోకి వెళ్లిపోతుంది. కానీ బాలు మాత్రం ఆ ఫోన్లో ఉన్న 'ముఖ్యమైన వీడియో'గురించే ఆందోళన చెందుతాడు. ఇదే ఎపిసోడ్ను సస్పెన్స్తో ముగించే కీలక పాయింట్గా నిలుస్తుంది.
అప్కమింగ్ ఎపిసోడ్ హైలైట్స్
రాబోయే ఎపిసోడ్లో కథ మరింత థ్రిల్లింగ్గా మారనుంది. రోహిణి చేతిలోకి వెళ్లిన బాలు ఫోన్ అసలు సమస్యకు కారణమవుతుంది. ఆ ఫోన్లో ఉన్న శివ చేసిన దొంగతనం వీడియోను రోహిణి తనకు కాపీ చేసుకుని, దాన్ని గుణకు పంపిస్తుంది. దీంతో గుణ ఈ వీడియోను ఉపయోగించి తన రివెంజ్ ప్లాన్ను అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలు తన ఫోన్ కోసం తీవ్రంగా వెతుకుతాడు. తన ఫ్రెండ్ సహాయంతో ఫంక్షన్ హాల్ మొత్తం సర్చ్ చేసినా ఫోన్ కనిపించదు. ఈ సమయంలో సత్యం 'పోయిన ఫోన్ పోయిందే... కొత్త ఫోన్ తీసుకుందాం' అని చెప్పినా, బాలు మాత్రం 'అందులో చాలా ముఖ్యమైన వీడియో ఉంది' అంటూ ఆందోళన వ్యక్తం చేస్తాడు. ఇది విన్న మీనా వెంటనే అనుమానంతో 'ఏంటి ఆ ముఖ్యమైన వీడియో?' అని ప్రశ్నిస్తుంది. ఇక్కడే కథ కీలక మలుపు తిరుగుతుంది. బాలు నిజం చెబుతాడా? లేక ఆ విషయం దాచిపెడతాడా? అన్నది పెద్ద సస్పెన్స్గా మారింది.


Click it and Unblock the Notifications




















