Gundeninda Gudigantalu February 7th Episode: బాలుకు ఎదురుతిరిగిన మీనా.. ఆలుమగల మధ్య ప్రభావతి చిచ్చు.
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రభావతి తిన్నది జీర్ణం కాక తీవ్ర అస్వస్థతకు గురవుతుంది. ఇదే అవకాశంగా భావించిన రోహిణి, వెంటనే మీనాపై నిందలు మొదలుపెడుతుంది. కావాలనే హోటల్లో బిర్యానీ కొనిపెట్టి అత్తయ్య ఆరోగ్యాన్ని పాడుచేసిందంటూ నోరు జారుతుంది. దీనికి తోడు ప్రభావతి కూడా "ఇంట్లో వండిన బిర్యానీ కాకుండా బయటది పెట్టింది" అంటూ మీనాపై ఆరోపణలు చేస్తుంది.
ఈ సమయంలో బాలు ఎంట్రీ ఇచ్చి అసలు విషయం ఏంటని ప్రశ్నిస్తాడు. ప్రభావతి వెంటనే హోటల్ బిల్లును చూపిస్తూ మీనానే కారణమని చెబుతుంది. బిల్లు చూసిన బాలు నవ్వుతూ అసలు నిజాన్ని బయటపెడతాడు. అది ఈరోజు బిల్లు కాదని, 31వ తేదీన రాజేష్ దగ్గర తాను బిర్యానీ తెచ్చుకున్నప్పుడు వచ్చిన పాత బిల్ అని క్లారిటీ ఇస్తాడు. అనుకోకుండా ఆ బిల్ మీనా క్యారీ బ్యాగ్లో పడిందని చెప్పడంతో రోహిణి మాటలు ఒక్కసారిగా ఆగిపోతాయి. మెల్లగా అక్కడి నుంచి జారుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ మీనా గట్టిగా నిలదీస్తూ, ఇప్పటివరకు నిందలు చేసి ఇప్పుడు మౌనంగా వెళ్లిపోతావా అంటూ ప్రశ్నిస్తుంది. ప్రభావతినీ తీవ్రంగా నిలదీస్తుంది.

ఇంతలో సత్యంకు రంగా నుంచి ఫోన్ రావడం మరో కీలక మలుపు తీసుకొస్తుంది. వంటలో పచ్చ కర్పూరం బదులు కర్పూరం వేసిన కారణంగానే ప్రభావతికి మోషన్స్, వామిటింగ్స్ వచ్చాయని రంగా చెప్పడంతో అసలు కారణం బయటపడుతుంది. దీంతో సత్యం ప్రభావతిని గట్టిగా హెచ్చరిస్తూ, నిజాలు తెలియకుండా ఎదుటివారిపై నిందలు వేయడం మానేయాలని చెబుతాడు. మీనా కూడా ప్రభావతి, రోహిణిలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ, "బయట ఏది పడితే అది తిని నా మీద నిందలా? ఇకనైనా ఆలోచించి మాట్లాడండి" అంటూ ఖచ్చితంగా చెబుతుంది. బిల్లు ట్విస్ట్తో మీనా నిర్దోషిత్వం రుజువు అవుతుంది.
మరోవైపు మనోజ్ నిద్రలో ఉలిక్కిపడి లేచాడు. లెటర్లో రాసినట్టే ప్రభావతికి హార్ట్ ఎటాక్ రావడం, తాను ఆత్మహత్య చేసుకోవడం కలలో కనిపించడంతో తీవ్రంగా కంగారుపడతాడు. ఈ విషయం దాచుకోలేక అర్ధరాత్రే తల్లికి ఫోన్ చేసి ధాబాపైకి రమ్మని కోరుతాడు. ప్రభావతి వచ్చిన వెంటనే జరిగినదంతా చెప్పి లెటర్ చూపిస్తాడు. అందులో ఉన్న భయంకరమైన మాటలు చూసి ప్రభావతి కూడా భయంతో వణికిపోతుంది. లెటర్ ఎవరు ఇచ్చారో అడిగితే, అతను దొంగ, హంతకుడు, తరచూ జైలుకు వెళ్లి వచ్చే వ్యక్తి అని మనోజ్ చెబుతాడు.
అదే సమయంలో ధాబాపై ఏదో అలికిడి వినిపించడంతో ఇద్దరూ దొంగేనని ఫిక్స్ అవుతారు. ప్రభావతి ఇటుక పట్టుకుని దాడికి సిద్ధమవుతుంది. కానీ అక్కడికి వచ్చినది రోహిణి. మనోజ్ కోసం వెతుకుతూ వచ్చిన ఆమెపై ప్రభావతి దాడి చేయబోయేలోపే రోహిణి గట్టిగా అరుస్తుంది. విషయం తెలిసిన తర్వాత మనోజ్ లెటర్ రోహిణికి ఇస్తాడు.
చదివిన రోహిణి నవ్వుతూ, ఇది ఎవరో బ్లాక్మెయిల్ చేయడానికి రాసిన లెటర్ అయి ఉంటుందని, అనవసరంగా భయపడొద్దని ధైర్యం చెబుతుంది. అయితే లోలోపల ఈ లెటర్ తన మాజీ బాయ్ఫ్రెండ్ దినేష్ ఇచ్చి ఉండొచ్చని భయపడినా బయటకు చెప్పకుండా షాప్కు అదనపు సెక్యూరిటీ పెట్టాలని సూచిస్తుంది.
ఇదే సమయంలో బాలుకూ పీడకల వచ్చి ఉలిక్కిపడతాడు. మీనా ఏమైందని అడిగితే, కలలో ఇద్దరూ గొడవపడినట్టు చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తాడు. మీనా మాత్రం ఆలుమగల మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఏమీ కాదంటూ సర్దిచెబుతుంది. తర్వాత ఇద్దరూ దగ్గరవ్వగా భావోద్వేగ క్షణాలు చోటుచేసుకుంటాయి.
మరోవైపు రోహిణి తన ప్లాన్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలుపెడుతుంది. తల్లి-కొడుకులను తన దగ్గరకు తీసుకురావాలన్న ఉద్దేశంతో అద్దె ఇల్లు వెతుకుతుంది. ఒక ఇల్లు నచ్చినా ఓనర్ ప్రవర్తన చూసి ఫ్రెండ్ దివ్య సందేహం వ్యక్తం చేస్తుంది. అయినా రోహిణి ముందుకు వెళ్లి ఇల్లు ఫిక్స్ చేస్తుంది. నెలకు రూ.20 వేల అద్దె, అడ్వాన్స్గా లక్ష రూపాయలు కావాలనడంతో షాక్ అవుతుంది. అయినా పరిస్థితుల దృష్ట్యా కొంత అడ్వాన్స్ ఇచ్చి మిగతాది రెండు రోజుల్లో ఇస్తానని ఒప్పుకుంటుంది.
ఇక అప్కమ్మింగ్ ఎపిసోడ్ లో ట్యాక్సీ స్టాండ్ వద్ద రాజేష్ మద్యం మత్తులో తూలుతూ కనిపించడంకీలక మలుపుగా మారబోతోంది. అక్కడ రాజేష్ పరిస్థితిని చూసిన బాలు ఒక్కసారిగా చలించిపోతాడు. కుటుంబ బాధలతో పూర్తిగా కుంగిపోయిన రాజేష్ కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో, అతని తల్లిదండ్రులకు షష్టిపూర్తి చేయాలని నిర్ణయిస్తాడు. ఆ ఖర్చు మొత్తం తానే భరిస్తానని రాజేష్కు మాట ఇస్తాడు.
ఈ విషయంలో మీనాకు చెప్పడంతో అసలు డ్రామా మొదలవుతుంది. "మనం ఇంటికి పోగుచేసుకుంటున్న డబ్బే రాజేష్కు ఇస్తాను" అని బాలు చెప్పడంతో మీనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తమ భవిష్యత్తు కోసం దాచుకుంటున్న డబ్బును ఇలా ఖర్చు చేయడం సరికాదని స్పష్టంగా చెబుతుంది.
కానీ ఈ మాటలన్నింటినీ ప్రభావతి దొంగచాటుగా వింటుంది. ఇదే అవకాశంగా భావించిన ఆమె... "దొరికిందిరా ఛాన్స్" అన్నట్టు లోలోపల సంబరపడుతూ బాలు-మీనా మధ్య చిచ్చు పెట్టాలని ఫిక్స్ అవుతుంది. తర్వాత బాలు దగ్గరికి వెళ్లి మీనాపై విషం చిమ్మడం మొదలుపెడుతుంది. "ఏంట్రా నీ పరిస్థితి... నువ్వు సంపాదించిన డబ్బునే నీకు ఇవ్వనంటుందా? తర్వాత తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో" అంటూ మీనా మీద బాలు మనసులో అనుమానాలు పెంచేలా మాటలు పెడుతుంది. దీంతో బాలు కూడా కన్ఫ్యూజ్లో పడే అవకాశం కనిపిస్తోంది.
ఇక రోహిణి కూడా తన ప్లాన్లతో ముందుకు వెళ్తుండటంతో, రాబోయే ఎపిసోడ్ల్లో బాలు-మీనా మధ్య అపార్థాలు ఎంతవరకు పెరుగుతాయో, ప్రభావతి పన్నాగాలు ఎంతవరకు ఫలిస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది. కుటుంబ బంధాల మధ్య డబ్బు, అనుమానం, మానవత్వం వంటి అంశాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications










