Gunde Ninda Gudi Gantalu Weekly: మనోజ్ వేరు కాపురం, ప్రభావతి వింత పూజలు, మీనాకి పెళ్లి ప్రాపోజల్,
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఏప్రిల్ 20వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా మనోజ్ జీవితంలో కొత్త టెన్షన్ మొదలైనట్టు చూపించిన సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి. షాప్ ఎదుట కోడిగుడ్లు కనిపించడంతో భయపడిన మనోజ్, స్వామీజీని కలిసి విషయం చెబుతాడు. అవి సాధారణ గుడ్లు కావని, ఎవరో చేతబడి చేశారని స్వామీజీ చెప్పడంతో మనోజ్ షాక్ అవుతాడు. త్వరలో పేరు ప్రతిష్టలు పోతాయని, కష్టాలు ఎదురవుతాయని హెచ్చరిస్తాడు. పరిహారంగా కులదైవానికి ఉపవాసంతో పూజ చేయాలని, తల్లి ప్రభావతితో కలిసి నిష్టగా ఉండాలని చెబుతాడు. దీంతో మనోజ్ మరింత ఆందోళనకు గురవుతాడు. ఇంటికి చేరుకున్న మనోజ్, తల్లి ప్రభావతిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె మాత్రం ఇవన్నీ మూఢనమ్మకాలేనంటూ తిరస్కరిస్తుంది. కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

అదే సమయంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. ప్రభావతి హాల్లోకి వెళ్లగానే సీలింగ్ ఫ్యాన్ ఊడిపడి ఆమె కాళ్ల ముందే పడుతుంది. ప్రమాదం తృటిలో తప్పడంతో మనోజ్ భయంతో ఇది హెచ్చరిక మాత్రమేనంటూ మరలా పూజ చేయమని వేడుకుంటాడు. అయినా ప్రభావతి మాత్రం పట్టించుకోదు. ఈ సన్నివేశాలు కథలో మరింత ఆసక్తిని పెంచాయి. మరోవైపు బాలు ట్రాక్ పూర్తిగా వినోదభరితంగా సాగింది. ప్రేమలో పడిన ఫ్రెండ్ తమ్ముడికి బాలు లవ్ గురువుగా మారి అమ్మాయిలను ఎలా ఇంప్రెస్ చేయాలో టిప్స్ ఇస్తాడు. తరువాత ఇంట్లో నీళ్ల మోటార్ చెడిపోవడంతో గందరగోళం మొదలవుతుంది. అందరూ నీళ్లు మోస్తూ కామెడీ సృష్టిస్తారు. చివరికి మోటార్ రిపేర్ సమయంలో మనోజ్ మెయిన్ స్విచ్ ఆన్ చేయడంతో ఇంట్లో అందరికీ కరెంట్ షాక్ తగులుతుంది. మీనా తెలివిగా కర్రతో ఒక్కొక్కరిని విడదీసి అందరినీ కాపాడుతుంది. అసలు విషయం తెలిసిన ప్రభావతి, మనోజ్ను పట్టుకొని చితకబాదడంతో ఎపిసోడ్ నవ్వుల్లో ముగిసింది.
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ వినోదం, భావోద్వేగం, సస్పెన్స్ కలయికగా సాగింది. గతంలో జరిగిన కరెంట్ షాక్ ఘటన ప్రభావం ఇంకా ఇంట్లో కనిపించింది. మీనా సమయస్ఫూర్తితో అందరినీ కాపాడినా, ప్రభావతి మాత్రం చేతి నొప్పితో బాధపడుతూ కనిపించింది. ఇదే సమయంలో మనోజ్, రోహిణి కలిసి ఇంట్లో జరుగుతున్న సమస్యలన్నీ చేతబడి కారణమని నమ్మించి పూజలు చేయించాలని ప్రభావతిని ఒప్పించారు. మరోవైపు మీనా జీవితంలో ఆనంద క్షణం చోటుచేసుకుంది. ఆమె ప్రారంభించిన డెకరేషన్ బిజినెస్కు తొలి ఆర్డర్ రావడంతో ఉప్పొంగిపోయింది. ఫంక్షన్ హాల్ యజమాని ఆమె పనిపై నమ్మకం వ్యక్తం చేస్తూ రూ.10 వేల అడ్వాన్స్ ఇచ్చాడు. ఇంటికి చేరిన మీనా స్వీట్లు పంచుతూ ఈ శుభవార్త చెప్పగా, ప్రభావతి హేళనగా మాట్లాడింది. అయితే సత్యం మాత్రం మీనాను అభినందిస్తూ ప్రభావతికి పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. రవి, శృతి కూడా మీనాకు మద్దతుగా నిలిచారు.
ఇక బాలు ఇంటికి రాగానే ఈ సంతోషాన్ని బిర్యానీతో సెలబ్రేట్ చేద్దామని ప్రకటించాడు. కానీ అదే రోజు ఉపవాసం పేరుతో ప్రభావతి బిర్యానీ వండనివ్వకుండా అడ్డుకుంది. బాలు మాత్రం బయట వండుకుంటామని చెప్పి సెటైర్లు వేయడంతో ఇంట్లో నవ్వులు పూశాయి. చివరికి బాలు, మీనా, రవి, శృతి కలిసి బిర్యానీ వండి అందరితో కలిసి తిన్నారు. ప్రభావతి, మనోజ్ మాత్రం పస్తులే మిగిలారు. ఇదే సమయంలో కథలో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. మటన్ కొనడానికి వెళ్లిన మీనాను చూసి షాప్ యజమాని మాణిక్యం ముఖం దాచుకోవడం అనుమానాలకు తావిచ్చింది. తరువాత రోహిణితో మాట్లాడిన మేక మామ, "మటన్ మా షాప్ నుంచే వెళ్లింది.. మీ నాన్నే తీసుకొచ్చాడు" అని చెప్పడంతో రోహిణి షాక్ అయ్యింది. దీంతో రాబోయే ఎపిసోడ్లో రోహిణి గతం బయటపడుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠ, కామెడీ, ఎమోషన్ మేళవింపుగా సాగింది. రోహిణి దాచిపెట్టిన గతం బయటపడే సూచనలు కనిపించగా, మటన్ కొట్టు మాణిక్యం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీనా తన షాప్కు వచ్చి వెళ్లడంతో తాను ప్రమాదంలో పడిపోయానని, ఇకపై అబద్ధాలు చెప్పనని తేల్చి చెప్పాడు. రోహిణి షాప్ మార్చేయమని చెప్పగా, అది తమ తాతల కాలం నాటి వ్యాపారమని తిరస్కరించి, మళ్లీ మీనా వస్తే నిజం చెబుతానని హెచ్చరించాడు. దీంతో రోహిణి షాక్కు గురైంది.మరోవైపు మీనా బిజినెస్ ఎదగాలని బాలు చేసిన ప్రయత్నాలు ఆకట్టుకున్నాయి. ఆమె కోసం ప్రత్యేకంగా విజిటింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించి, కస్టమర్లకు పంచుతానని చెప్పాడు. భార్య విజయాన్ని తన విజయంగా భావించిన బాలు మాటలకు మీనా భావోద్వేగానికి లోనైంది.
ఇక మనోజ్ తనపై చేతబడి చేశారనే అనుమానంతో ప్రభావతిని తీసుకుని గుడిలో వింత పూజలు చేయించాడు. వేపాకులు కట్టుకుని, నిప్పుల కుంపటితో ప్రదక్షిణలు చేస్తూ ఇద్దరూ నానా అవస్థలు పడ్డారు. అదే సమయంలో గుడికి వచ్చిన బాలు, మీనా వారిని చూసి షాక్ అయ్యారు. బాలు ఆ దృశ్యాలను వీడియో తీసి ఇంట్లో ప్లే చేయడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. చివరగా కోడిగుడ్ల రహస్యం బయటపడింది. అవి చేతబడి కోసం పెట్టినవి కాదని, ఓ చిన్నారి బొమ్మలు గీసి అక్కడే మరిచిపోయాడని తెలిసి ప్రభావతి మనోజ్పై మండిపడింది. ఇక ఎపిసోడ్ చివర్లో మీనాను ఓ యువకుడు ఫాలో అవుతూ అసభ్యంగా మాట్లాడడంతో ఆమె బాలుకు ఫోన్ చేసింది. దీంతో కొత్త ట్రాక్పై ఆసక్తి పెరిగింది.
గురువారం ఎపిసోడ్ ఉత్కంఠ, కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో ఆకట్టుకుంది. ఎపిసోడ్ ప్రారంభంలో మీనా తీవ్ర భయంతో బాలుకు ఫోన్ చేసి, ఓ వ్యక్తి కొంతకాలంగా తన వెంటపడుతున్నాడని చెప్పింది. దీంతో బాలు ఆగ్రహంతో ఆమెకు ధైర్యం చెప్పి, ముందు జాగ్రత్తగా పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోమని సూచించాడు. అదే సమయంలో మురళి మళ్లీ మీనా దగ్గరకు రావడంతో, ఆమె ధైర్యంగా పెప్పర్ స్ప్రే చూపించగానే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. మరోవైపు మనోజ్ షాప్లో సరదా సన్నివేశాలు నవ్వులు పూయించాయి. ఓ వ్యక్తి ప్రభావతి ఫోటోతో తయారు చేసిన దిష్టిబొమ్మను అమ్మడానికి రావడంతో మనోజ్ షాక్ అయ్యాడు. ఆ ఫోటో దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉందని చెప్పడంతో ఇంట్లో వారంతా ఆశ్చర్యపోయారు. బాలు, శృతి, సత్యం కలిసి ప్రభావతిపై పంచులు వేయడంతో కామెడీ ట్రాక్ హైలైట్గా నిలిచింది.
ఇదే సమయంలో మనోజ్కు ముఖేష్ నుంచి ఫోన్ వచ్చి, బిజినెస్లో లాభాలు వస్తున్నాయని, త్వరలో 10 లక్షలు పంపిస్తామని చెప్పడంతో అతడు ఆనందంతో మురిసిపోయాడు. రోహిణి కూడా అతడిని పొగడ్తలతో ముంచెత్తింది. వెంటనే 5 కోట్ల విలువైన విల్లాను 3 కోట్లకే ఇస్తున్నారని విని, ఎలాగైనా కొనాలని మనోజ్ నిర్ణయించుకున్నాడు. ఎపిసోడ్ చివర్లో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలు ఇచ్చిన సలహా ప్రకారం మురళి పూలు, పండ్లు, చీరతో నేరుగా మీనా ఇంటికి వచ్చాడు. సత్యం కాళ్లపై పడుతూ, తాను సాఫ్ట్వేర్ ఉద్యోగి అని, నెలకు 50 వేల జీతం వస్తుందని చెప్పి అల్లుడిగా పరిచయం చేసుకున్నాడు. ఇంతలో మీనా కిందికి రావడంతో అతడే తన వెంటపడుతున్న వ్యక్తి అని బయటపడింది. రవి "వదినను నీకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాడు" అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక్కడితో ఎపిసోడ్ ముగియగా, తర్వాత ఏమవుతుందో అన్న ఆసక్తి పెరిగింది.
శుక్రవారం ఎపిసోడ్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. మురళి పూలు, పండ్లు, చీరతో సత్యం ఇంటికి వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నానని, నెలకు మంచి జీతం వస్తుందని చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ వెంటనే మీనాను పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో ఇంట్లో ఒక్కసారిగా షాక్ నెలకొంది. కోపంతో ఊగిపోయిన మీనా అతడు తెచ్చిన బుట్టను నేలకేసి కొట్టింది. ఇదే సమయంలో ఇంటికి వచ్చిన బాలు పరిస్థితి చూసి ఏమైందని అడగగా, మురళి అతడిని "అన్నయ్య" అని పిలిచి, వెంటనే "ఇకనుంచి బావవు" అన్నాడు. దీంతో అందరూ అవాక్కయ్యారు. చివరకు మీనా తన భార్యేనని బాలు చెప్పడంతో అసలు నిజం బయటపడింది. సోషల్ మీడియాలో మీనా ఫోటో చూసి తాళి కనిపించకపోవడంతో పెళ్లి కాలేదనుకున్నానని మురళి అమాయకంగా చెప్పాడు.
ఇక మీనా వెంటపడటానికి బాలు దగ్గరే ప్రేమ సలహాలు తీసుకున్నాడని తెలిసి బాలు తల పట్టుకున్నాడు. చివరకు మురళిని ఇంటి దగ్గరకు కూడా రాకూడదని హెచ్చరించి పంపించారు. తర్వాత మీనా బాలుకు గట్టిగా క్లాస్ తీసుకుంది. మరోవైపు మనోజ్, రోహిణి ఇంట్లో కొత్త డ్రామా మొదలుపెట్టారు. తన బిజినెస్లో 10 లక్షల లాభం వచ్చిందని, త్వరలో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నానని మనోజ్ చెప్పడంతో ప్రభావతి ఆనందంలో మునిగిపోయింది. తన కొడుకే వంశానికి పేరు తెస్తాడని పొగిడింది. అయితే బాలు మాత్రం ఇది నిజమా లేక కొత్త నాటకమా అని అనుమానం వ్యక్తం చేశాడు.మనోజ్ తన తల్లికి బంగారు గాజులు గిఫ్ట్గా ఇవ్వడంతో ప్రభావతి మరింత సంతోషపడింది. కానీ బాలు "ఇంట్లో 40 లక్షలు పోగొట్టి నాలుగు గాజులు తెచ్చాడు" అంటూ సెటైర్ వేశాడు. ఇక త్వరలో విల్లా కొనబోతున్నానని మనోజ్ చెప్పడంతో మీనా ఆలోచనలో పడింది. కుటుంబం విడిపోతుందేమోనని బాధపడింది.


Click it and Unblock the Notifications