Gunde Ninda Gudi Gantalu Weekly: బాలుకి ఘోర అవమానం.. మీనా హెచ్చరిక.. రోహిణి లక్ష డ్రామా.. దినేష్ బ్లాక్ మెయిల్
photo courtesy: jio hotstar:
Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
గుండె నిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ ప్రారంభంలో బాలు తన ఫ్రెండ్ రాజేష్ను టాక్సీ స్టాండ్లో మద్యం మత్తులో పడిపోయి ఉండటం చూసి షాక్ అవుతాడు. ఆగ్రహంతో రాజేష్పై చేయి చేసుకుంటాడు. అయితే రాజేష్ తన పేదరికం, కుటుంబ పరిస్థితులు, సమాజంలో డబ్బుకు ఉన్న విలువ గురించి ఆవేదనగా మాట్లాడుతాడు. ఇటీవల తన పెదనాన్నకు ఘనంగా షష్టిపూర్తి జరిపారని, మరో వారం రోజుల్లో తన తండ్రికి కూడా షష్టిపూర్తి ఉందని చెబుతాడు. తండ్రికి జీవితంలో గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలని అనుకుంటున్నానని, కానీ డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నానని ఎమోషనల్ అవుతాడు. దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చవుతుందని, ఎవరూ అప్పు ఇవ్వక ముఖం చాటేస్తున్నారని చెప్పడంతో బాలు కదిలిపోతాడు. చివరికి ఆ డబ్బులు తానే ఇస్తానని మాట ఇచ్చి రాజేష్ను ఆనందపరుస్తాడు.

photo courtesy: jio hotstar
ఇక మరోవైపు మనోజ్ తన షోరూమ్కు సెక్యూరిటీ గార్డ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తాడు. విచిత్రమైన డైట్ కండిషన్లతో వచ్చిన భారీ కాయుడిని చూసి మనోజ్ షాక్ అవుతాడు. అయితే అతని బలం చూసిన తర్వాత, రోహిణి సూచనతో చివరికి అతడిని సెక్యూరిటీగా పెట్టుకోవడానికి ఓకే చెబుతాడు. ఈ సన్నివేశాలు కామెడీగా ఆకట్టుకున్నాయి. ఇక బాలు-మీనా మధ్య రాజేష్ విషయంలో గొడవ మొదలవుతుంది. కాంపిటీషన్లో గెలిచిన డబ్బును ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్నామని మీనా అభ్యంతరం తెలుపుతుంది. అనవసర ఆర్భాటాలకు ఖర్చు పెట్టవద్దని సూచిస్తుంది. బాలు మాత్రం మాట ఇచ్చానని వెనక్కి తగ్గడు. ఈ సంభాషణను ప్రభావతి చాటుగా విని చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ బాలు ముందే అప్రమత్తమై ఆమెను ఆపేస్తాడు. చివరికి లక్ష రూపాయల కోసం బాలు స్నేహితుల దగ్గర తిరుగుతూ ఉండటంతో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగుస్తుంది.
మంగళవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, ఆర్థిక ఒత్తిళ్లు, వ్యక్తిగత సంఘర్షణలతో ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది. కథ ఆరంభంలోనే బాలు తన ఫ్రెండ్ రాజేష్ కోసం డబ్బులు సమకూర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అయితే మీనా మాత్రం దీనికి గట్టిగా వ్యతిరేకిస్తూ.. అనవసర ఆర్భాటాల కోసం అప్పులు చేయొద్దని, నేరుగా రాజేష్తో మాట్లాడమని సూచిస్తుంది. అయినా ఇచ్చిన మాట కోసం బాలు వెనక్కి తగ్గకుండా స్నేహితుల దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుతాడు. అక్కడ కూడా నిరాశే ఎదురవడంతో బాలు మరింత మథనంలో పడిపోతాడు. ఇదే సమయంలో రోహిణి ట్రాక్ మరో ఉత్కంఠను తెచ్చింది. అర్ధరాత్రి దివ్య నుంచి వచ్చిన కాల్తో లక్ష రూపాయల అడ్వాన్స్ సమస్య బయటపడుతుంది.
ఈ విషయమై మనోజ్తో రోహిణికి తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. "గర్ల్ఫ్రెండ్కు లక్షలు ఇచ్చావు... నాకు ఇవ్వవా?" అన్న రోహిణి మాటలతో మనోజ్ కోపంతో బయటికి వెళ్లిపోతాడు. అక్కడ బాలు, రవి మాటలతో వడ్డీకి డబ్బు ఇచ్చే ఐడియా మనోజ్కు క్లిక్ అవుతుంది. మరోవైపు వంటగదిలో మీనా-శృతి-రోహిణి సంభాషణ కీలక మలుపు తిప్పింది. ఇద్దరి సమస్యలు డబ్బుతో ముడిపడ్డాయని గుర్తించిన శృతి, "వేరే వాళ్ల దగ్గర అప్పు చేసి ఇచ్చామని చెప్పితే డబ్బు త్వరగా తిరిగి వస్తుంది" అంటూ సలహా ఇస్తుంది. దీంతో రోహిణికి పరిష్కారం దొరికినట్టవుతుంది. మరుసటి రోజు మీనా రాజేష్ను కలిసి అవసరం-ఆర్భాటం మధ్య తేడా చెప్పి హితవు పలుకుతుంది. మరోవైపు మనోజ్ రోహిణికి లక్ష రూపాయలు వడ్డీతో ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అయితే ఫ్రెండ్ పేర్ల విషయంలో వచ్చిన గందరగోళం మనోజ్లో అనుమానాలను పెంచుతుంది. ఇలా బాలు-మీనా మధ్య భావోద్వేగాలు, రోహిణి-మనోజ్ మధ్య డబ్బు డ్రామాతో ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది.
బుధవారం ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. ప్రారంభంలో మనోజ్, రోహిణి ఫ్రెండ్ దివ్యకు లక్ష రూపాయలు అప్పుగా ఇస్తూ ప్రతి నెల మొదటి వారంలో వడ్డీ చెల్లించాలని షరతు పెడతాడు. రోహిణి షూరిటీగా నిలుస్తుంది. అయితే కొద్ది సేపటికే దివ్య వచ్చి తన తల్లికి అత్యవసర ఆపరేషన్ కోసం 75 వేల రూపాయలు కావాలని ఏడుస్తూ అడుగుతుంది. మొదట రోహిణి వద్దని చెప్పినా, మనోజ్ విషయం తెలుసుకుని తానే డబ్బు ఇస్తానని మాట ఇస్తాడు. వెంటనే 75 వేలు ట్రాన్స్ఫర్ చేస్తాడు. కానీ తర్వాత ఇది చింటూ స్కూల్ ఫీజు కోసం రోహిణి వేసిన డ్రామా అని తెలుస్తుంది. ఇలా మనోజ్ దగ్గర నుంచి లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు వెళ్లిపోతాయి. అయినా అతడు విషయం గ్రహించకుండా వడ్డీ వ్యాపారం గురించి కలలు కంటుంటాడు.
ఇక మరోవైపు బాలు తన స్నేహితుడు రాజేష్ కోసం లక్ష రూపాయలు అప్పు తీసుకువస్తాడు. కానీ రాజేష్ ఫంక్షన్ చేయనని చెప్పడంతో బాలు కోపంతో డబ్బు తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తాడు. రాజేష్ తండ్రి షష్టిపూర్తి వేడుకలు జరపాలని నిర్ణయిస్తాడు. దీనిపై మీనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్భాటాల కంటే అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం మంచిదని అంటుంది. ప్రభావతి వచ్చి గొడవను మరింత పెంచే ప్రయత్నం చేస్తుంది. అయినా బాలు తల్లిని ఆపేస్తాడు. మరుసటి రోజు ఫంక్షన్కు వెళ్లిన బాలు, మీనా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవని గమనిస్తారు. రాజేష్ భార్య కన్నీటి పర్యంతమై మాట్లాడుతుండగా ఎపిసోడ్ ముగుస్తుంది.
గురువారం ఎపిసోడ్ భావోద్వేగాలు, షాకింగ్ సన్నివేశాలతో సాగింది. బాలు-మీనా కలిసి రాజేష్ తల్లిదండ్రుల షష్టిపూర్తి వేడుకలకు చేరుకున్నా.. అక్కడ కనిపించిన దృశ్యాలు ఇద్దరినీ షాక్కు గురిచేశాయి. కనీస ఏర్పాట్లు లేకపోవడం, ఆకలితో ఉన్న రాజేశ్ తల్లిదండ్రులు 'అమ్మా... అన్నం పెట్టండి' అని అడగడం పరిస్థితి తీవ్రతను చాటిచెప్పింది. రాజేష్ భార్య కన్నీళ్లతో తన బాధ చెప్పగా, అసలు నిజం బయటపడుతుంది. లోపలికి వెళ్లిన బాలు-మీనాలకు మద్యం మత్తులో ఊగుతున్న రాజేష్, అతని గ్యాంగ్ను చూసి విస్తుపోతారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా, మద్యం ను ఏరులై పారించడం, డబ్బును వృథాగా ఖర్చు చేయడంతో రాజేష్ ప్రవర్తన బాలును తీవ్రంగా కలచివేస్తుంది. పైగా 'నీ లక్ష రూపాయలతో ఎంత గ్రాండ్గా చేశానో చూడు'అంటూ బాలుకి గొప్పలు చెప్పడం ఆగ్రహాన్ని మరింత పెంచుతుంది.
అలాగే..తిన్నేటప్పుడు మటన్ ముక్కలు రాలేదని గొడవ జరగడం. ఈ క్రమంలో బాలు మీద దాడి జరగడం, పరిస్థితి అర్థం చేసుకుని మీనా అతడిని బయటకు తీసుకువస్తుంది. చివరికి ఇద్దరూ ఒక్క ముద్ద కూడా తినకుండా ఇంటికి తిరుగుతారు. ఇంట్లో మీనా వ్యంగ్యంగా జరిగిన విషయాన్ని చెప్పగా, బాలు మాటలేక మౌనంగా మారిపోతాడు. ఇచ్చిన డబ్బు వృథా అయిందన్న నిజం అతడిని లోలోపల కుదిపేస్తుంది. మరోవైపు రోహిణి జీవితంలో ఊహించని మలుపు. దినేష్ అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చి ఆమె కొడుకుతో ఫోటోలు దిగి పంపించడం. తిరిగి ఫోన్ చేయడంతో బెదిరిస్తూ లొకేషన్ పంపిస్తాడు. భయంతో రోహిణి అయోమయంలో నిలిచిపోతుంది. చివర్లో దాబాకు వెళ్లిన బాలు.. తన అంతరాత్మ మాటలు విని ఆత్మపరిశీలనలో పడతాడు.
శుక్రవారం ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాల తుఫానులోకి నెట్టింది. ఫంక్షన్లో ఎదురైన అవమానం ఇంకా బాలు మనసును కాల్చేస్తుండగా... మళ్లీ మద్యం చేతికి తీసుకున్నాడు. ఈసారి అతని ఎదురుగా మనుషులు కాదు... అతని అంతరాత్మే నిలబడి ప్రశ్నించింది. మీనా మాట వినకుండా స్నేహితులకు అప్పులు ఇచ్చి తానే అప్పుల పాలయ్యాడని హెచ్చరించగా, "కష్టంలో ఉన్న స్నేహితుడికి సాయం చేయడం తప్పా?" అంటూ బాలు తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. కానీ అంతరాత్మ మీనాకు సారీ చెప్పమన్న క్షణంలో ఆవేశంతో సీసాను తన ప్రతిబింబంపైనే విసిరాడు. మందు నేలపై కారిపోవడంతో... "నేను ఏం చేస్తున్నాను? నా జీవితం ఎటు వెళ్తోంది?" అనే ప్రశ్న తొలిసారి అతని మనసులో మెదిలింది. మరుసటి రోజు ఉదయం రాజేష్ బాలు ఇంటికి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పూర్తిగా పశ్చాత్తాపంతో కనిపించిన రాజేష్, ఫంక్షన్ కోసం డబ్బు వృథా చేశానని ఒప్పుకుని, కట్నంగా వచ్చిన డబ్బును బాలు చేతిలో పెట్టి అప్పు తీర్చుకోవాలని హితవు పలికాడు.
అయితే రాజేష్ వెళ్లిన తర్వాత బాలు మళ్లీ బిల్డప్ ఇవ్వగా, మీనా సూటిగా "నిజమైన స్నేహం అంటే అప్పులు చేసి ఆదుకోవడం కాదు... అప్పులే రాకుండా జాగ్రత్తపడటమే" అంటూ గుణపాఠం చెప్పింది. ఇక మరోవైపు రవి పనిచేసే రెస్టారెంట్లో కొత్త ఇన్చార్జ్ ఎంట్రీతో కలకలం మొదలైంది. మొదట ఉద్యోగం పోతుందేమోనన్న భయం రవిని కుదిపేసినా, చివరకు కొత్త బాస్ అతని టాలెంట్ మెచ్చుకోవడంతో కాస్త ఊరట కలిగింది. అదే సమయంలో శృతి "మాది లవ్ మ్యారేజ్" అంటూ వార్నింగ్ ఇవ్వడం రాబోయే గొడవలకు సంకేతంగా మారింది. అటు మీనా పుట్టింట్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. శివ చెడు సహవాసాలకు బానిస అవుతుండటంతో తల్లి పార్వతి కన్నీళ్లతో మీనాకు ఫోన్ చేసి, "నీ తమ్ముడ్ని కాపాడు" అంటూ వేడుకుంది. ఇలా ఈ ఎపిసోడ్ భావోద్వేగంగా ముగిసింది.


Click it and Unblock the Notifications











