Gunde Ninda Gudi Gantalu Weekly: రోహిణి ఒంటరి పోరాటం, ప్రభావతి వార్నింగ్, బాలు తీర్పు, మీనాకు ఎదురుదెబ్బ
Photo courtesy: Jio Hotstar
Gunde Ninda Gudi Gantalu Weekly: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే మే 11వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకూ 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
సోమవారం ఎపిసోడ్ పూర్తిగా భావోద్వేగాలతో నిండిపోయింది. 40 లక్షల రూపాయల మోసం విషయం బయటపడటంతో ఇంట్లో భారీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులంతా రోహిణినే తప్పుబడుతుండగా, తనకు అండగా ఉంటాడని భావించిన మనోజ్ కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడం రోహిణిని తీవ్రంగా కలిచివేసింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం హద్దులు దాటింది. మనోజ్ అసమర్థుడు అంటూ రోహిణి అవమానించగా, తన కష్టంతోనే షోరూమ్ స్థాయికి వచ్చామని మనోజ్ చెప్పాడు. అయితే "మీ అమ్మ నన్ను కొట్టినా నువ్వు సపోర్ట్ చేయలేదు" అంటూ రోహిణి కన్నీళ్లు పెట్టుకోవడం ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. చివరకు ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడం కుటుంబాన్ని మరింత షాక్కు గురిచేసింది.

Photo courtesy: Jio Hotstar
ఇక సత్యం-ప్రభావతి మధ్య కూడా ఘర్షణ తీవ్రంగా మారింది. రోహిణిని అందరి ముందు కొట్టడం తప్పు అని సత్యం ప్రశ్నించగా, ప్రభావతి మాత్రం తన కోడలు మోసం చేసిందని సమర్థించుకుంది. మనోజ్ను ఎందుకు మందలించలేదని సత్యం అడగడంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇదే సమయంలో రోహిణి తన తల్లి సుమతి దగ్గరకు వెళ్లి బాధ చెప్పుకుంది. కానీ సుమతి కూడా కూతురినే తప్పుపడుతూ, "భర్తను అందరి ముందు అవమానించడం భార్య తప్పు" అంటూ గట్టిగా మందలించింది. చివరకు తల్లి మాటల్లో నిజం గ్రహించిన రోహిణి తిరిగి ఇంటికి వచ్చి ప్రభావతిని క్షమించమని వేడుకుంది. అయినా ప్రభావతి ఆమెను క్షమించకుండా తీవ్రంగా హెచ్చరించింది. చివర్లో ప్రభావతి ప్రవర్తన చూస్తుంటే, రోహిణి దాచిన మరో పెద్ద నిజం త్వరలో బయటపడబోతుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోయింది.
మంగళవారం ఎపిసోడ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. ప్రారంభంలోనే ప్రభావతి గట్టిగా రోహిణిని పిలవడం ఇంట్లో కొత్త తుఫాన్కు నాంది పలికింది. మనోజ్ తడబడుతూ మాట్లాడడంతో ప్రభావతి మరింత కోపంగా స్పందించి రోహిణిని ఎదిరించింది. శృతి తల్లి వద్ద అమర్యాదగా మాట్లాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ రోహిణిని గట్టిగా మందలించింది. రోహిణి తన వాదన వినిపించినా ప్రభావతి వినకపోవడంతో పరిస్థితి మరింత కఠినంగా మారింది. ఇదిలా ఉండగా, శృతి-మీనా మధ్య జరిగిన సంభాషణలో రోహిణి ఎంట్రీ ఇచ్చి గొడవను మరింత పెంచింది. శృతి తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరిస్తూ "నిజం చెప్పాను" అని స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా.. మీనా కూడా రోహిణిని గట్టిగా నిలదీసింది. దీంతో రోహిణి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇక మరోవైపు మనోజ్పై ప్రభావతి పూర్తి కంట్రోల్ చూపించింది. రోహిణి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవద్దని, ఇంటికి కూడా రాకూడదని ఆదేశించింది. తల్లి మాటకు లోబడిన మనోజ్ షాప్లోనే ఉండిపోవడం కథలో కీలక మలుపు. తర్వాత రోహిణితో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నిజాన్ని దాచడంతో ఆమెకు అనుమానం పెరిగింది. ఇంట్లో మీనా మానవత్వం చూపిస్తూ రోహిణికి భోజనం పెట్టగా.. ఆమె మాత్రం వ్యంగ్యంగా మాట్లాడటం పరిస్థితిని మరింత కఠినతరం చేసింది. చివరకు మీనా తన సహనాన్ని కోల్పోయి రోహిణిపై ఘాటుగా విరుచుకుపడింది. అబద్ధాలు, మోసాలు, డబ్బుల వ్యవహారం అన్నింటినీ బయటపెడుతూ ఆమెకు షాక్ ఇచ్చింది. ఈ ఘర్షణతో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగిసింది.
బుధవారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. మీనా జాలి చూపించి రోహిణికి భోజనం పెట్టగా.. ఆమె కృతజ్ఞత లేకుండా వ్యంగ్యంగా మాట్లాడటం పరిస్థితిని మలుపుతిప్పింది. దీంతో ఆగ్రహించిన మీనా "నిజాయితీగా జీవించడం నేర్చుకో" అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ సంఘటన తర్వాత ప్రభావతి అనుమానాలు మరింత పెరిగి, మీనాపై ఆరోపణలు చేస్తుంది. అయితే మీనా ధైర్యంగా స్పందిస్తూ "బంధాలను కలపడం మాత్రమే నాకు తెలుసు" అని చెప్పడంతో ప్రభావతి షాక్కు గురవుతుంది. మరోవైపు బాలు తన అన్న మనోజ్ వద్ద ఎదురైన అవమానాన్ని చెప్పుకుంటాడు. బిర్యానీ తీసుకెళ్లినా అనుమానం పెట్టుకోవడం అతన్ని బాధపెడుతుంది.
దీంతో బాలు-మీనా ఇద్దరూ ఇకపై ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకుంటారు. ఇక కథలో కీలక ట్విస్ట్గా శివ చెప్పిన సీక్రెట్ హైలైట్ అయింది. రోహిణి తరచూ గుణ దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు తీసుకెళ్తుందని చెప్పడంతో మీనా షాక్ అవుతుంది. దీంతో రోహిణి అసలు ఉద్దేశ్యంపై కొత్త అనుమానాలు మొదలవుతాయి. ఇదే విషయాన్ని మీనా బాలుతో పంచుకోగా.. అతడూ సీరియస్గా తీసుకుని నిజం బయటకు తేల్చాలని నిర్ణయించుకుంటాడు. ఇంట్లో పరిస్థితి మరోవైపు మరింత టెన్షన్గా మారుతుంది. ప్రభావతి కఠిన ఆంక్షలు విధిస్తూ రోహిణిపై కన్నేసి ఉంచుతుంది. సత్యం కూడా రోహిణి చేసిన పనిని తీవ్రంగా తప్పుపట్టడంతో ఆమె పూర్తిగా ఒంటరిగా మారుతుంది. చివరగా డైనింగ్ టేబుల్ వద్ద రోహిణి అడుగులు ఆగిపోవడం ఎపిసోడ్కు సస్పెన్స్ను జోడించింది. తదుపరి ఎపిసోడ్పై ఆసక్తి పెరిగింది.
గురువారం ఎపిసోడ్లో కుటుంబం, బిజినెస్ ట్రాక్లతో హై వోల్టేజ్ డ్రామా నడిచింది. ఉదయం టిఫిన్ సమయంలో రోహిణి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోవడంతో ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను అవమానకరంగా వెళ్లిపోవమంది. శృతి, మనోజ్ సపోర్ట్ చేసినా ప్రభావతి వినకపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. మనోజ్ సైలెంట్గా ఉండటం రోహిణిని బాధపెట్టగా, ఆమె ఇంటిని వదిలి మీనాక్షి వద్దకు వెళ్లి తన బాధను పంచుకుంది. అక్కడ రోహిణి తన తప్పును సమర్థించుకుంటూ, ప్రభావతిని తిరిగి ఒప్పించేందుకు ప్లాన్ వేస్తుంది. మీనాక్షి మొదట హెచ్చరించినా చివరకు ఆమెకు సపోర్ట్ చేయడానికి ఒప్పుకుంటుంది.
ఇక బాలు-మీనా బిజినెస్ ట్రాక్లో, మీనా తన డెకరేషన్ మోడల్స్తో ఆర్డర్ దక్కించుకునే దశలో చింతామణి ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని తారుమారు చేస్తుంది. తన ఏరియాలో బిజినెస్ చేయొద్దని వార్నింగ్ ఇస్తూ, గుండాలతో మీనా డిజైన్స్ను ధ్వంసం చేయిస్తుంది. అయినా వెనక్కి తగ్గని మీనా ధైర్యంగా నిలబడి, తన ప్రతిభతో ఎదిగి సమాధానం ఇస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు ప్రభావతి-మీనాక్షి మధ్య సంభాషణలో రోహిణి చేసిన మోసం బయటపడుతుంది. మీనాక్షి రోహిణిని క్షమించమని ఒప్పించే ప్రయత్నంలో ఆస్తి అంశాన్ని ప్రస్తావించడంతో ప్రభావతి ఆలోచనలో పడుతుంది. ఇదే సమయంలో సత్యం కూడా జోక్యం చేసుకుని, రోహిణి-మనోజ్ ఇద్దరికీ సమానంగా చూడాలని హెచ్చరిస్తాడు. దీంతో ప్రభావతి గందరగోళానికి గురవుతుంది. కుటుంబం మళ్లీ కలుస్తుందా లేదా అన్న ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.
శుక్రవారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా డబ్బుల విషయంలో ప్రభావతి చూపించిన కఠిన వైఖరి ఇంట్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసింది. మనోజ్ చేసిన తప్పును పక్కన పెట్టి రోహిణిపైనే కోపం చూపడంతో సత్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇద్దరికీ సమాన తప్పు ఉందని చెప్పి వారిని విడదీయొద్దని ప్రభావతిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రభావతి మాత్రం తన బాధను తగ్గించుకోలేక రోహిణి తన నమ్మకాన్ని ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అవమానంతో కుంగిపోయిన రోహిణి దివ్య ఇంటికి వెళ్లి తన బాధను పంచుకుంటుంది. కానీ దివ్య మాత్రం ఆమెకు కఠినంగా రియాలిటీ చెక్ ఇస్తూ, తన తప్పులనే గుర్తు చేస్తుంది. మనోజ్ కూడా సరైన సమయంలో సపోర్ట్ ఇవ్వలేదని ప్రశ్నించడంతో రోహిణి మరింత మానసికంగా కుంగిపోతుంది.
ఇదే సమయంలో ప్రభావతి, రోహిణి ఇంటికి రావాలని మనోజ్తో ఫోన్ చేయించగా, కొంత ఆలోచన తర్వాత రోహిణి తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఇంటికి చేరుకున్న రోహిణిని మొదట ప్రభావతి అంగీకరించకపోయినా, ఆమె క్షమాపణతో చివరకు మనసు మార్చుకుని అంగీకరిస్తుంది. అయితే ఇక్కడితో సమస్య ముగియకుండా, బాలు 'పెద్దరాయుడు తీర్పు' అంటూ డబ్బులపై కీలక నిర్ణయం తీసుకుని సత్యాన్ని షాప్ ఓనర్గా ప్రకటిస్తాడు. దీంతో మనోజ్-రోహిణి షాక్కు గురవుతారు. చివరగా ఈ నిర్ణయం కారణంగా మనోజ్-రోహిణి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. పరస్పర ఆరోపణలు, బాధలు బయటపెడుతూ ఇద్దరూ దూరమవుతారు. ఇలా దంపతుల మధ్య పెరుగుతున్న విభేదాలతో కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది.


Click it and Unblock the Notifications







