Guppedantha Manasu: జగతి కళ్లముందే రిషికి యాక్సిడెంట్.. వసుకు తెలిసిపోయిన శైలేంద్ర క్రూరత్వం!
సౌజన్య రావును రిషి, శైలేంద్ర కలుస్తారు. రిషిపై దాడి సౌజన్య రావు చేయించలేదని చెబుతాడు. నీ మెత్తటి మాటల వెనుక ఉన్న స్వార్థం నాకు చాలా బాగా తెలుసు. మర్యాదగా చెప్పు.. లేదంటే అంటూ సౌజన్య రావుపైకి దూసుకెళ్తాడు రిషి. ఇంతలో అడ్డుపడిన శైలేంద్ర వీడిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు అంటాడు. అది కాదు అన్నయ్యా వీడు.. అని రిషి అంటే.. నేను మాట్లాడతానని అంటున్నా కదా. వెళ్లు కారులో కూర్చో అని రిషిని పంపిస్తాడు శైలేంద్ర. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మే 10 బుధవారం నాటి ఎపిసోడ్ 759లో ఇంకా ఏం జరిగిందంటే?
పర్ఫామెన్స్ అదిరిపోతుంది:బెస్ట్ ప్లే మాస్టర్ వి నువ్వు ఎమ్ఎస్ఆర్ అని శైలేంద్ర నవ్వుతూ అంటాడు. థ్యాంక్యూ సార్ అని ఎమ్ఎస్ఆర్ అంటాడు. ముందు ముందు కూడా ఇలానే ఉండాలి. టైమ్ చూసి నిన్ను పిలుస్తాను. ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉండు అని శైలేంద్ర అంటాడు. చూస్తూ ఉండండి సార్.. నా పర్ఫామెన్స్ అదిరిపోతుంది అని సౌజన్య రావు అంటాడు. తర్వాత ఎమ్ఎస్ఆర్ కి వేలు చూపిస్తూ.. ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తున్నట్లుగా నటిస్తాడు శైలేంద్ర. దానికి ఎమ్ఎస్ఆర్ కూడా అలాగే చూసుకుందాం. మీరు ఎంత దాకా వెళ్తే నేను అంతదాకా వెళ్తాను అని ఎమ్ఎస్ఆర్ అంటాడు. తర్వాత రిషి, శైలేంద్ర కారులో వెళ్లిపోతారు.

అక్కా చెల్లెల్లుగా:రిషి, శైలేంద్ర ఇంట్లో నిలబడి, ఫణీంద్ర, మహేంద్ర హాల్లో మాట్లాడుకుంటారు. ఇంతలో అక్కడికి నలుగురు మహిళలు కుంకుమ తీసుకుని వచ్చి.. దేవయాని గారు లేరా అని అడుగుతారు. దేవయానిని ఫణీంద్ర పిలవడంతో వస్తుంది. జగతి, వసుధార కూడా వస్తారు. దేవయాని గారు మా ఇంట్లో దంపతుల వ్రతం చేస్తున్నాం. అందుకే దంపతులందరినీ పిలుస్తున్నాం. మీరంతా తప్పకుండా రావాలి. జగతి గారు మీరు చాలా గొప్పవారు. పిల్లలకు పాఠాలతోపాటు జీవిత సత్యాలను నేర్పిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయినా మీ ఇద్దరూ తోడి కోడళ్లల కాకుండా సొంత అక్కా చెల్లెల్లా కలిసి ఉంటారు కదా అని పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఇక పిలిచే క్రమంలో దేవయాని, జగతిలకు బొట్టు పెట్టి, తాళికు కూడా కుంకుమ పెడుతుంది ఓ మహిళ.

తాళి ఎలా వచ్చింది?:ఇంతలో వసుధార దగ్గరికి కూడా వెళ్లి బొట్టు పెట్టి.. తాళి ఏదమ్మా అని అడుగుతుంది. దానికి వసుధార షాక్ అవుతుంది. తర్వాత తాళి లేదండి. మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని వసుధార చెబుతుంది. అదేంటి మీరు భార్యాభర్తలు కదా.. మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటీ, మొన్నటి దాకా తాళి ఉంది కదా అని వెనుక ఉన్న మరో మహిళ అంటుంది. అంటే వాళ్లు సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోలేదు. అందుకే మేము ఇప్పుడు జరిపించాలనుకుంటున్నాం అని జగతి అంటుంది. అలా అయితే తాళి ఎలా వచ్చింది. ఏంటీ జగతి గారు ఏదేదో చెబుతున్నారు. వీళ్లకు ఇంకా పెళ్లి కాలేదు అంటున్నారు. కానీ ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఇలా ఎక్కడైనా ఉంటుందా. అంటే మీ గురించి విన్నదంతా అబద్ధమేనా అని ఆవిడ అరుస్తుంది.

మీరు ఏం నేర్పుతున్నారు?:ఇంతలో కలుగ జేసుకున్న శైలేంద్ర.. ఏంటండీ అలా మాట్లాడతారు. ఇప్పుడు జనరేషన్ మొత్తం మారిపోయింది. అంతా మీలానే ఉండాలి అనుకుంటే ఎలా. కోర్టు కూడా చెప్పేసింది అందులో తప్పేముంది అని అంటాడు. ఇది జీవితం బాబు. విడిపోయేందుకే ఆ చట్టాలు. కలిసి ఉండాలంటే సాంప్రాదాయం పాటించాల్సిందే. మనసాక్షిగా భార్యభర్తలు అయినప్పుడు మళ్లీ పెళ్లి ఎందుకు. మహేంద్ర గారు ఇదంతా మీరు ఎలా ఒప్పుకున్నారు అని అంటుంది. వాళ్లు చేసింది తప్పు కాదు. అందుకే సపోర్ట్ చేస్తున్నాం అని మహేంద్ర అంటాడు. తర్వాత దేవయాని ఏంటండి ఇది అని అడుగుతారు. దానికి నేను చెబితే వినేవాళ్లు ఎవరూ లేరు అని దేవయాని అంటుంది. మళ్లీ ఓ బొట్టు పెట్టిన ఆవిడ మీరు పిల్లలకు ఏం నేర్పుతున్నారు అని అంటుంది.

పెట్టుడు ముహుర్తం పెట్టి:వ్రతానికి పిలవడానికి వచ్చారు. నచ్చితే పిలవండి, లేకుంటే లేదు అని ఫణీంద్ర అంటాడు. ఇంకా ఏంటండి పిలిచేది. భార్యాభర్తలు కలిసి ఉండాలని వ్రతం చేస్తున్నాం. వీళ్లోస్తే కలిసి ఉండటం కాదు. మా జీవితాలకే ముప్పు వస్తుంది. వ్రతానికి రాకపోవడమే మంచిది అని వెళ్లిపోతారు. ఇక దేవయాని అందుకుంటుంది. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. నా మాట ఒక్కరైనా విన్నారా. సంతోషంగా ఉందా మీకు అంటూ రెచ్చిపోతుంది. ఇంతలో వాళ్లను అనడం మానేసి వీళ్ల మీద అరుస్తావేంటీ అని శైలేంద్ర అంటాడు. అందరూ నన్ను అనేవాళ్లే అని దేవయాని అంటే.. గోల చేయకు మమ్మీ.. ఇప్పుడు ముహుర్తాలు లేకుంటే ఏదో పెట్టుడు ముహుర్తం చూసి ఎంగేజ్ మెంట్ చేపిద్దాం అని చెబుతాడు శైలేంద్ర. దీంతో అంతా సంతోషంతో ఒప్పుకుంటారు. కానీ జగతి మాత్రం శైలేంద్ర ఏం ప్లాన్ వేశాడు, రిషికి మంచి జరిగేది చేయడు కదా అని తన గదిలోకి వెళ్లి ఆలోచిస్తుంది.
ఇంకో రింగ్ ఏంటీ?:ఇంతలో వసుధార వచ్చి మేడమ్ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంగేజ్ మెంట్ అంటే సగం పెళ్లి అయినట్లే కదా అంటుంది. నీకో విషయం చెప్పాలి వసు అని జగతి చెప్పబోతుంటే రిషి వస్తాడు. వసుధార షాపింగ్ కు వెళ్లమని పెద్దమ్మా చెప్పింది అని వసును తీసుకెళ్తాడు. జగతి డల్ గా ఉండటం చూసి ఏమైంది, ఎంగేజ్ మెంట్ మీకు ఇష్టమే కదా అని అడుగుతాడు. ఏం లేదు రిషి. మీకు ఎంగేజ్ మెంట్ అయితే మొదట సంతోషపడేది నేనే అని జగతి లేని నవ్వు తెచ్చుకుని చెబుతుంది. వసుధారను రిషి గదిలోకి తీసుకెళ్తే ఇక్కడికి తీసుకొచ్చారేంటీ అని అడుగుతుంది. అప్పుడు వీఆర్ ఉంగరం తీసుకుని ఇలాంటివి రెండు రింగ్స్ తీసుకోవాలి. ఒకటి వీఆర్ అని ఉండేది.. ఇంకోటి నువ్వు చెప్పు ఏంటో అంటాడు రిషి. వసు ఆలోచనలో పడిపోతుంది. చూస్తుంటే ఇంకో రింగ్ SR (శైలేంద్ర-రిషి) అయి ఉంటుందని అనిపిస్తుంది.

మే 11 నాటి ఎపిసోడ్ లో :శైలేంద్ర.. రిషికి ఏమైనా జరిగితే నేను ఏమాత్రం ఊరుకోను అని గట్టిగా అరుస్తూ జగతి అంటుంది. చెప్పాను కదా పిన్నీ. నాకు కావాల్సింది డీబీఎస్టీ కాలేజీ ఛైర్మన్ సీట్. అందులో మీరే కూర్చోబెట్టాలి. లేకుంటే రిషి ప్రాణాలు ఉండవు అని బెదిరిస్తాడు శైలేంద్ర. ఈ మాటలు వసుధార విని షాక్ అవుతుంది. మరోవైపు రిషి, వసుధార కారులో వెళ్తుంటే లారీ చేత యాక్సిడెంట్ ప్లాన్ చేయిస్తాడు శైలేంద్ర. అంతేకాకుండా దాన్ని జగతిని కారులో ఎక్కించుకుని మరి చూపిస్తాడు. అది చూసి రిషి అని జగతి గట్టిగా అరుస్తుంది.


Click it and Unblock the Notifications











