Guppedantha Manasu: కొడుకుపై నింద వేసిన జగతి.. కాలేజీ నుంచి రిషి బయటకు.. సాధించిన శైలేంద్ర
శైలేంద్ర ఇచ్చిన వార్నింగ్ తో రిషికి ఏం జరుగుతుందో అనే భయంతో ఉంటుంది జగతి. రాత్రి కొడుకు గదిలోకి వెళ్లి పడుకుని ఉన్న రిషిని ప్రేమగా చూస్తుంది. అప్పుడే మెళకువ వచ్చిన రిషి.. ఏంటీ మేడమ్ ఈ టైమ్ లో వచ్చారు అని అడుగుతాడు. ఓసారి చూడాలనిపించింది రిషి అని వెనక్కి తిరుగుతుంది జగతి. మేడమ్ మీరు నాకు ఏదైనా చెప్పడానికి వచ్చారా. మేడమ్ మీరు ఏదో దాస్తున్నారని నాకు ఎందుకో అనిపిస్తుంది. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారా. చెప్పండి మేడమ్. నాకైమైనా సమస్య ఉందా అని రిషి అడుగుతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ మే 24 బుధవారం నాటి ఎపిసోడ్ 771లో ఇంకా ఏం జరిగిందంటే?
ఏమైనా సమస్య: రిషి అన్న మాటలు నిజం కావడంతో దుఃఖంతో కన్నీళ్లు వస్తాయి. వాటిని తుడుచుకుంటూ ఏం లేదు రిషి అని జగతి అంటుంది. మీరు నా గురించి భయపడొద్దు మేడమ్. రేపే నేను మెడికల్ కాలేజీ ఎండీగా రాబోతున్నాను. నా కల నెరవేరే రోజు. సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నాను. మీరు ఉండగా నాకు ఏం కాదు. మీరు నాకు ఎలాంటి హానీ జరగనివ్వరు అని రిషి అంటాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన జగతి బాధపడుతుంటుంది. అది చూసిన వసుధార జగతి దగ్గరికి వస్తుంది. ఏమైంది మేడమ్. అంతా ఓకేనా. చెక్ గురించి మంత్రి గారి దగ్గరకు వెళ్లారు కదా. అదేమైంది. ఏమైనా సమస్య. దాని గురించి సార్ ను కలిసేందుకు వెళ్లారా అని వసుధార అడుగుతుంది.
గురు దక్షిణగా: అదేం లేదు వసు అని చెప్పిన వసుధారను తన గదిలోకి తీసుకెళ్తుంది జగతి. నాకు గురు దక్షిణగా అడిగింది ఇస్తావా. ఇస్తానని మాట ఇవ్వు అని జగతి అడుగుతుంది. ద్రోణా చార్యుడు ఏక లవ్యుడిని బొటన వేలు అడిగినట్లు మీరు నా ప్రాణాలు అడగరు కదా. ఒకవేళ అడిగినా సంతోషంగా ఇస్తాను మేడమ్. నా జీవితాన్ని నిలబెట్టారు మీరు. రిషి సార్ ను ఇచ్చారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మేడమ్ అని చెప్పిన వసుధార జగతి చేతిలో చేయి వేసి ప్రామిస్ చేస్తుంది. దీంతో వసుధారను హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతుంది జగతి. మరుసటి రోజు ఉదయం.. రిషి చాలా సంతోషంగా ఉంటాడు. నా కల నెరవేరే రోజు. ఆశీర్వదించండి పెద్దమ్మా, పెద్దనాన్న అని రిషి అంటాడు.

జగతి జాగ్రత్తలు: నీ కలతో పాటు నా కల కూడా నెరవేరుతుంది నాన్నా. చాలా సంతోషంగా ఉంది నాకు అని దేవయాని అంటుంది. తర్వాత వసు, రిషి కాలేజీకి బయలు దేరతారు. ఇంతలో జగతికి శైలేంద్ర మెసేజ్ చేస్తాడు. ఇదే నీకు చివరి అవకాశం. దీన్ని చేజారిస్తే తర్వాత రిషి ప్రాణాలతో దక్కడు గుర్తు పెట్టుకో అని ఉంటుంది. దీంతో రిషిని పిలిచిన జగతి వాళ్లతోపాటే కారులో వస్తానని చెబుతుంది. అప్పుడు కారులో ముగ్గురు బయలుదేరతారు. అది చూసిన శైలేంద్ర నవ్వుకుంటాడు. మరోవైపు కారులో వసు నువ్వు ఎప్పుడు రిషిని అంటిపెట్టుకునే ఉండాలి. ఇలాగే సంతోషంగా ఉండాలి. పొరబాటుని మీ మధ్య గొడవలు వస్తే సర్దుకుపోవాలి. రిషి ఏదైనా మాట తూలిన దాని వెనుక కారణం ఆలోచించు. వసు ఏదైనా పొరపాటు చేసిన అపార్థం చేసుకోకు రిషి. తనన మనసు ఏంటో నీకు తెలుసు కదా. అర్థం చేసుకో అని ఇద్దరికి జగతి చెబుతుంది.

పరోక్షంగా కీడు చేస్తున్నా: ఎందుకు మేడమ్ ఇవన్నీ చెబుతున్నారు అని రిషి అంటాడు. ఏమో తెలియదు. మీకు జాగ్రత్తలు చెప్పాలనిపించింది అని జగతి అంటుంది. ఇక ప్రెస్ మీట్ లో మాట్లాడే పాయింట్స్ రిషి చెబుతుంటే వసుధార రికార్డ్ చేస్తుంది. కాలేజీ దగ్గర దిగిన వెంటనే మేడమ్ ప్రెస్ మీట్ ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పిన రిషి ఇంజినీర్ దగ్గరు వెళ్తానని వెళ్తాడు. ఏమైంది మేడమ్ అలా ఉన్నారు అని వసు అంటే.. ఏం లేదు నువ్వు వెళ్లు నేను వస్తాను అని జగతి అంటుంది. దీంతో వసు వెళ్లిపోతుంది. నన్ను క్షమించు రిషి. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నాకు వేరే మార్గం లేదు. నిన్ను కాపాడుకోవడానికి నీకు పరోక్షంగా కీడు చేస్తున్నా అని మనసులోనే జగతి కుమిలిపోతుంది. ఇవాళ ప్రెస్ మీట్ లేదు మీడియా వాళ్లకు మెసేజ్ చేస్తుంది. ఆఫీస్ బాయ్ ను పిలిచి రిషి సార్ ను కాన్ఫరెన్స్ హాల్ కి రమ్మని చెప్పు అని పంపిస్తుంది. వెంటనే వసుధార దగ్గరకు వెళ్తుంది జగతి.
అవినీతికి పాల్పడినట్లు: వసు.. నాకు నిన్న మాట ఇచ్చావ్ గుర్తుందా. ఇప్పుడు అది అడగడానికే వచ్చాను అని జగతి అంటుంది. కాన్ఫరెన్స్ హాల్లో వసుధార అందరి ముందు చెప్పాల్సిన దాని గురించి, శైలేంద్ర బెదిరించిన దాని గురించి వివరంగా చెబుతుంది జగతి. దీంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార. రిషి సార్ కు అబద్ధం చెప్పడమా. సార్ ను మోసం చేయడం నా వల్ల కాదు. రిషి సార్ మీద నింద వేయడం. అవినీతికి పాల్పడినిట్లు నింద వేసుకుని, ఆయన ఎండీగా తప్పుకోవడం. అమ్మో ఇదంతా సరి కాదు మేడమ్. శైలేంద్ర గారికి మీరు భయపడుతున్నారు అని వసుధార అంటుంది. అలా చేయకుంటే రిషి ప్రాణాలకే ప్రమాదం వసు అని జగతి ప్రాధేయపడుతుంది.

తర్వాతి ఎపిసోడ్: ఇక తర్వాతి ఎపిసోడ్ లో కాన్ఫరెన్స్ హాల్లో మినిస్టర్, శైలేంద్ర, ఫణీంద్ర, జగతి, వసుధార, దేవయాని అంతా ఉంటారు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఫండ్స్ మెడికల్ కాలేజీకి ఉపయోగించారని అలిగేషన్ ఉంది. దానికి ఏం చెబుతావ్ అని జగతి అడిగితే.. నేను చేయడం ఏంటీ అని రిషి అంటాడు. దీంతో ఆ చెక్ చూపిస్తారు. అది చూసి షాక్ అయిన రిషి.. ఈ చెక్ నేను ఇచ్చానా వసుధార అని గట్టిగా అరుస్తాడు రిషి. దీంతో భయంగా, బాధగా, కంగారు పడుతుంది వసుధార. మొత్తానికి శైలేంద్ర తాను అనుకున్న పనిని జగతి, వసుధారలతో చేయించాడు. రిషిపై నింద వేసి కాలేజీ ఎండీ సీటు నుంచి తప్పించు బయటకు పంపించే ఏర్పాట్లు జరగనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











