శ్రీముఖికి బయటి విషయాలు ఎలా తెలుస్తున్నాయ్.. వాళ్ల పైనే అనుమానాలు.. అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్' రియాలిటీ షోలో రోజు రోజుకూ వివాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ షో ఆసక్తికరంగా సాగుతోంది. వాస్తవానికి గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈ సారి కంటెస్టెంట్లలో అంతగా పేరున్న వాళ్లు లేకపోయినా.. షో మాత్రం ప్రేక్షకాదరణను పొందుతోంది. దీనికి కారణం ఇంట్లో జరిగే రచ్చే. సీజన్ ప్రారంభమైన మొదటి వారంలోనే కంటెస్టెంట్లు గొడవలు పెట్టుకుని గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈ నేపథ్యంలో ఏ టాస్క్ జరిగినా.. ఏ పోటీ జరిగినా శ్రీముఖి హైలైట్ అవుతోంది. బుధవారం ఆమె ఆమె మరోసారి హాట్ టాపిక్ అయింది. దీంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

కెప్టెన్సీ టాస్క్
మంగళవారం జరిగిన ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్మేట్స్కు కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా రెండు రాజ్యాలుగా ఏర్పడాలని సూచించాడు. తమ జెండాలను పక్క రాజ్యంలో పెట్టిన వారే విజేతలని చెప్పాడు. అదే సమయంలో అక్కడ ఉన్న మూడు డ్రాగన్ ఎగ్స్ ఎవరు సొంతం చేసుకుంటారో.. వాళ్లే తదుపరి రౌండ్కు వెళ్తారని వెల్లడించిన విషయం తెలిసిందే.

ముగ్గురే మిగిలారు
రెండు రాజ్యాల్లో.. శ్రీముఖి టీమ్.. హిమజ జట్టు కంటే ఎక్కువ జెండాలను పాతింది. అయితే, బజర్ మోగే సమయానికి ఇరు టీమ్లలో ఒక్క సైనికుడు కూడా మిగలకపోవడంతో ఏ జట్టూ విజయం సాధించలేదని బాస్ చెప్పాడు. అయితే, అప్పటికి డ్రాగన్ ఎగ్స్ దక్కించుకుని ఉన్న అలీ, రవి, రాహుల్ కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడతాడని వివరించాడు. దీంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసిపోయింది.

సింహాసనంపై కూర్చోవాలి
బుధవారం ఎపిసోడ్లో స్టార్ట్ బజర్ మోగిన వెంటనే అలీ రెజా పరుగున వెళ్లి సింహాసనంలో కూర్చున్నాడు. అతనికి అండగా శ్రీముఖి, బాబా భాస్కర్ అండగా నిలిచారు. అలీ అయితే సింహాసనాన్ని చాలా గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. అలీని దించడానికి రాహుల్ అండ్ టీం విశ్వప్రయత్నాలు చేసింది. ఆఖరికి రాహుల్, రవికృష్ణ మాత్రమే 15 నిమిషాల పాటు అలీని సింహాసనం నుంచి దించడానికి ప్రయత్నించారు. కానీ, అలీని దించలేక తప్పుకున్నారు. దీంతో అలీనే కెప్టెన్గా ఎన్నికయ్యాడు.

శ్రీముఖి - రోహిణి మధ్య వాదన
బుధవారం ఎపిసోడ్లో శ్రీముఖి, రోహిణి మధ్య ఎలిమినేషన్ విషయంలో ఒక సంభాషణ జరిగింది. ఇది సీరియస్ అయిపోయింది. రోహిణితో శ్రీముఖి మాట్లాడుతూ.. ‘నా అంచనా ప్రకారం ఈ వారం నువ్వు వెళ్లిపోతావే' అని అంది. దీంతో రోహిణికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తర్వాత ఏడుస్తూ కూర్చుంది. ఆ తర్వాత ఇద్దరూ కూర్చుని మాట్లాడుకున్నారు. శ్రీముఖి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. రోహిణి మాత్రం నేను హర్ట్ అయ్యాను అని చెప్పి వెళ్లిపోయింది.

శ్రీముఖికి చెప్పినట్లే జరుగుతోంది
బిగ్ బాస్లో ఓటింగ్ హాట్ స్టార్ యాప్ ద్వారా జరుగుతోంది. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని షో నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినా.. గూగుల్లో చాలా మంది ఓటింగ్ కండెక్ట్ చేస్తున్నారు. ఈ ఓటింగ్లో గురువారం నాటికి కూడా రోహిణినే అందరి కంటే చివర్లో కొనసాగుతోంది. దీంతో శ్రీముఖి చెప్పినట్లే జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది.

ఆమెకెలా తెలుసు.?
బయట జరుగుతున్న వ్యవహారం గురించి శ్రీముఖికి ఎలా తెలుసని ఆమెను వ్యతిరేకించే వాళ్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు చేస్తున్నారు. బిగ్ బాస్ షో నిర్వహకులు శ్రీముఖికి సహాయం చేస్తున్నారని అంటున్నారు. అందుకే ఆమె మైండ్ గేమ్ ఆడుతోందని ఆరోపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











