Intinti Gruhalakshmi Today Episode: తులసి ఊరమాస్ వార్నింగ్.. మామ కోసం యుద్ధానికి సిద్ధం
తరాలు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్లో.. తులసి ఇంటికి వచ్చిన పరందామయ్య 'అన్నింటికీ తెగించి నేను ఇక నా మనసుకు నచ్చిన పని చేస్తున్నాను. అందుకే నా వాళ్ల మధ్య పుట్టినరోజు జరుపుకోవాలని వచ్చాను' అని చెప్తాడు. దీంతో అందరూ సంతోషంగా పూజ జరుపుకుని ఎంజాయ్ చేస్తుంటారు. దీంతో కోపంతో ఉన్న అనసూయ అక్కడకు వచ్చి పెద్ద గొడవ చేస్తుంది. తులసిని తిడుతుంది. దీంతో పరందామయ్య ఆమెపై ఫైర్ అవుతాడు. అప్పుడు అనసూయ భర్తను కూడా తన ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంది. చివరికి అక్కడ వస్తువులన్నీ కింద పడేస్తుంది.

అనసూయను వెళ్లిపోమన్న భర్త
కోపంతో వచ్చిన అనసూయ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో పరందామయ్య ఆమెను ఎదురించి మాట్లాడడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోమని అంటాడు. కానీ, అనసూయ మాత్రం అస్సలు వినదు. అప్పుడాయన 'వద్దు అనసూయ.. ఇక్కడి నుంచి వెళ్లిపో' అని బతిమిలాడుతాడు. అప్పుడామె 'మీరు భర్తగా చేతకానివాడిలా మిగిలారు. నెలకు వచ్చిన 400 జీతంతో మీరు చేసిందేంటి? నేను నానా సంకలు నాకి ఆ జీతం డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. మీకు చేతకాని వాళ్లు ఎందుకు పెళ్లి చేసుకున్నారు. నాకీ గతి ఎందుకు పట్టించారు' అని ప్రశ్నిస్తుంది.

తిండి కూడా పెట్టలేదు అంటూ
అనసూయ మాటలకు పరందామయ్య 'నీ గురించి తెలిసే.. నీ త్యాగం తెలిసే కదా.. నేను సైలెంట్గా ఉంది. నన్ను చాలామంది హేళన చూసినా కూడా ఎందుకు పట్టించుకోలేదు. నోరు లేని భర్త అని కామెంట్లు చేశారు. అయినా నేను మౌనంగానే ఉన్నాను. దానికి కారణం నీ త్యాగమే. నీ త్యాగానికి నేను ఇచ్చిన గౌరవమే' అంటాడు. దీంతో అనసూయ మరింత రెచ్చిపోతుంది. 'మీ చేతకాని తనం వల్ల పచ్చడి మెతుకులు తినాల్సి వచ్చింది. ఇప్పుడు నా కొడుకు కూడా సంపాదించి పెట్టినా మీరు వాడిని గుర్తించరు' అంటూ ఓ రేంజ్లో సీరియస్ అవుతూనే మాట్లాడుతుంది.

సామ్రాట్పైనా అనసూయ ఫైర్
అనసూయ మాటలకు సామ్రాట్ 'కొందరు పచ్చడి మెతుకులు తినొచ్చు. మరికొందరు పంచభక్ష పరమాన్నాలు తినొచ్చు. పచ్చడి మెతుకులు కష్టపడి సంపాదించిన వాళ్లకు మాత్రమే వస్తాయి. పంచభక్ష పరమాన్నాలు మాత్రం అదృష్టం ఉంటేనే దొరుకుతాయి. మీరు పచ్చడి మెతుకులు తిన్నారంటే ఆయన కష్టపడడం వల్లే. అయినా ప్రతిదానికి భర్తను నిందించడం చాలా తెలివి తక్కువ పని' అంటాడు. దీంతో అనసూయకు కోపం వచ్చి 'అసలు నువ్వు ఎవరయ్యా మా భార్యభర్తల మధ్యలోకి రావడానికి? నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావ్' అని ప్రశ్నిస్తుంది.

అనసూయకు ఎదురు తిరిగారు
అనసూయ మాటలకు తులసి మధ్యలోకి రాగా ఆమెను కూడా అనసూయ తిడుతుంది. అప్పుడు అంకిత 'అమ్మమ్మా.. మీరు ఎలా ప్రవర్తిస్తారో తర్వాత మీకు అదే ఎదురు అవుతుంది. ఇప్పటి నుంచి నేను కూడా అభిని మీరు తాతయ్యను అన్నట్లే అంటాను' అంటుంది. తర్వాత ప్రేమ్ 'ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నట్లే నీ కోడలు లాస్య కూడా రేపు డాడ్ను అంటే ఊరుకుంటావా' అని అంటాడు. అలాగే, మాధవి కూడా ఏదో అంటుంది. అప్పుడు అనసూయ సీరియస్ అవగా.. ప్రేమ్ అరుస్తాడు. దీంతో వెంటనే వెళ్లి అనసూయ అతడి చెంపపై కొట్టి అందరినీ హెచ్చరిస్తుంది.

బాధతో పడిన పరందామయ్య
ఎంత చెప్పినా అనసూయ వినకపోవడంతో పరందామయ్య 'నేను రాను.. నేను ఆ ఇంటికి రాను. నేను ఒంటరిగా మిగిలాను. నాకంటూ ఏం లేదు. ఫుట్పాత్ మీద ఉంటాను. గుడి మెట్ల మీద అడుక్కుంటాను. చెప్పులు పాలిస్ చేసి తినేందుకు సంపాదించుకుంటాను. నీ దగ్గర ఉండటం కంటే అదే ఎక్కువ గౌరవం ఉంటుంది. నీ కొడుకు ఇంటికి నువ్వు వెళ్లు. నేను మాత్రం అస్సలు రాను. నేను ఆ ఇంటికి అస్సలు రాను. ఈ లోకంలో డబ్బుకే ఎక్కువ విలువ ఉంది' అంటూ ఉక్రోషంగా మాట్లాడతాడు. దీంతో పరందామయ్యకు కళ్లు తిరగడంతో కుర్చీలో కూర్చోబెడతారు.

అత్తకు తులసి మాస్ వార్నింగ్
పరందామయ్యకు ఏమైందో అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ సమయంలో కూడా అనసూయ అతడిపై ఫైర్ అవుతూ.. 'మీ నాటకం చాలు ఇక ఇంటికి వెళ్దాం పదా' అంటుంది. దీంతో తులసికి చిర్రెత్తుకొస్తుంది. ఆ వెంటనే 'అత్తయ్యా షు.. షూ.. ఆపండి. మీకు మాత్రమే కోపం ఉందా? మీరు ఇంకో మాట మాట్లాడితే అస్సలు బాగుండదు. మామయ్య గారి మీద ఒట్టేసి చెబుతున్నా. ఇంకో మాట.. ఇంకో మాట ఆయనను అనండి చూద్దాం. ఇక చూసుకుందాం పదా.. ఇక చూసుకుందాం. నీ కంటే ఎక్కువగా నేను అరవగలను. ఇప్పుడు మాట్లాడండి.. తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి' అని అనసూయకు మాస్ వార్నింగ్ ఇస్తుంది.

తన దగ్గరే ఉంచుకుంటానని
ఆ తర్వాత తులసి 'నాకు మా మామయ్య.. తండ్రి కంటే ఎక్కువ. మీలాంటి మామయ్య ఎవరికి ఉంటారో.. వాళ్లు ఈ ప్రపంచంలోనే అదృష్టవంతులు. మీ కూతురు ఇంకా బతికే ఉంది మామయ్యా. తండ్రికి అండగా నిలబడటానికి కూతురు కొడుకుగా ఉండాల్సిన అవసరం లేదు. కూతురు కూతురుగానే ఉండొచ్చు. నా మామయ్యకు నేను ఉంటే చాలు. ఇప్పుడు నా ఇల్లు నా మామయ్యకు ఇస్తాను' అంటుంది. దీంతో పరందామయ్య 'నాకు ఇక్కడ చోటిస్తావా? నన్ను మళ్లీ పంపించవు కదా' అంటూ చిన్నపిల్లాడిలా అడుగుతాడు. దీంతో తులసి ఇక్కడే ఉంచుకుంటానని హామీ ఇస్తుంది. దీంతో అనసూయ అందరూ కలిసి గంగలో దూకండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











