Intinti Gruhalakshmi: విక్రమ్ను నిజం చెప్పిన తాత.. దివ్యకు నిజం చెప్పాలనుకున్న ప్రియ.. అంతలోనే షాక్
చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
గురువారం ఎపిసోడ్లో జరిగింది ఇదే:గురువారం ప్రసారమైన ఎపిసోడ్లో.. విక్రమ్ అందరి ముందు నలుగు పెట్టించుకోడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి నీ పెళ్లి గ్రాండ్గా చేయడం లేదు అనగా.. తనకు కూడా ఇలాగే చేసుకోవడం ఇష్టం అంటాడు. మరోవైపు, దివ్యను కూడా పెళ్లి కూతురుని చేస్తారు. అప్పుడు ఆమెకు బట్టలు పెట్టడానికి మాధవి వాళ్లు రాగా.. వాళ్లను ఆపి దీపక్ వాళ్లతో పెట్టిస్తాడు నందూ. అది చూసి తులసి సంతోషిస్తుంది. అనంతరం దివ్య, తులసి మధ్య ఎమోషనల్ మాటలు కనిపిస్తాయి. చివర్లో దివ్యకు విక్రమ్ వీడియో కాల్ చేయగా.. అతడి మాటలను అందరూ వినేస్తారు.

విక్రమ్ మాటలకు తల్లి సంతోషం:తన తల్లి మీద ప్రేమ గురించి విక్రమ్ చెప్తుండగా.. బసవయ్య ఇంకా రెచ్చగొడుతుంటాడు. అప్పుడు అతడు కోపంతో 'నేను మనసున్న మనిషిని. చెప్పే మాటకి కట్టుబడే మనిషిని' అంటాడు. దీంతో బసవయ్య 'ఈ ప్రపంచంలో కన్నతల్లి ప్రేమ మీద పోటీపడేది భార్య ప్రేమ మాత్రమే' అని అంటాడు. దీనికి విక్రమ్ 'ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. నా జీవితంలోకి ఎవరు వచ్చినా అమ్మ స్థానం తర్వాతే. నాకు అమ్మ మాట తర్వాతే ఏదైనా' అంటూ ఆవేశంతో చెబుతాడు. ఆ మాటలకు రాజ్యలక్ష్మి సంతోష పడి అతడిని తిప్పేసుకుంటుంది.
తండ్రిని చూసి విక్రమ్ కన్నీళ్లతో:పెళ్లి కొడుకులా రెడీ అయిన తర్వాత విక్రమ్ తన తాతయ్యతో కలిసి తండ్రిని ఉంచిన రూమ్లోకి వెళ్తాడు. అతడినలా చూసి తండ్రి సంతోషిస్తాడు. ఆ సమయంలో అక్షింతలు ఇచ్చి దీవించమనగా.. ఆయన నిస్సహాయ స్థితిని చూసి విక్రమ్, వాళ్ల తాతయ్య ఏడుస్తారు. అప్పుడు తాత 'మీ నాన్న చేతులతో దీవించలేడు. మాటలతో దీవించలేడు. మనసుతో మాత్రమే దీవిస్తాడు.' అనడంతో విక్రమ్ ఎమోషనల్ అవుతాడు. తర్వాత అలాగే విక్రమ్ ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ సమయంలో వాళ్ల తాతయ్య 'తల్లి లేని కొడుక్కి తల్లి కావాలని మీ నాన్న పెళ్లి చేసుకున్నాడు. కాదు కాదు నేనే బలవంతంగా చేయించాను' అని అంటాడు.

తల్లి వైపునే మాట్లాడిన విక్రమ్:అనంతరం విక్రమ్ తాతయ్య 'ఆ మహాతల్లి నీ తండ్రిని కూడా దూరం చేసింది. ఇదిగో ఇలా తయారు చేసింది' అని అంటాడు. దీనికి విక్రమ్ 'అనవసరంగా మీరు అమ్మను అనుమానిస్తున్నారు. అమ్మ మీరు అనుకునేలాంటిది కాదు' అంటాడు. దీంతో వాళ్లిద్దరూ విక్రమ్ అమాయకత్వానికి బాధ పడుతుంటారు. తర్వాత తండ్రి పాదాల దగ్గర కూర్చున్న విక్రమ్ 'నిజం చెప్తున్నాను నాన్నా.. నన్ను సంజయ్ కంటే అమ్మ బాగా చూసుకుంటుంది. దేవత లాంటి అమ్మను నాకు ఇచ్చారు' అని అనగా.. వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు.
దివ్యను చూసి నందూ ఏడుస్తూ:అందరూ పెళ్లి సందడిలో సరదాగా ఉండగా తులసి వచ్చి దివ్య ఇంకా రాలేదా అని అడుగుతుంది. దీంతో అనసూయ నీ కూతురు అప్పుడే రెడీ అవుతుందా అని అంటుంది. ఆ సమయంలోనే దివ్య రెడీ అయిపోయి కిందకు వస్తుంది. ఆమెను పెళ్లికూతురిలా చూసి అందరూ సంతోషిస్తూ ఉంటారు. అలాగే, దివ్యను ఏడిపిస్తూ మాట్లాడుతారు. తర్వాత దివ్య వెళ్ళి నందూను హత్తుకోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఒకవైపు నందూ, మరోవైపు దివ్య ఒకరినొకరు ఓదార్చుకుంటూనే ఏడేస్తుంటారు. ఆ సమయంలో పక్కన ఉన్న వాళ్లందరూ వాళ్ల ప్రేమను చూసి ఎమోషనల్ అవుతారు.

తప్పులను ఒప్పుకున్న నందూ:ఆ తర్వాత నందూ 'నా కూతురు ఇంత పెద్దది అయిపోయింది. త్వరలోనే ఒక ఇంటికి కోడలు కాబోతోంది. తెలియకుండానే అమ్మ నాన్నలకు దూరం పెంచుకుంటుంది' అని ఎమోషనల్గా మాట్లాడతాడు. అంతేకాదు, గతంలో తులసి విషయంలో, పిల్లల విషయంలో చేసిన తప్పులను అన్నింటినీ ఒప్పుకుంటాడు. దీంతో తులసి ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటుంది. అప్పుడు లాస్య మనసులో 'ఈ ఆనందాలు, ముచ్చట్లు అన్ని కొన్నాళ్ల వరకే. దివ్య ఒకసారి ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఈ చిరునవ్వులు అన్నీ మాయం అయిపోతాయి' అని అనుకుంటుంది.
ప్రేమ చచ్చిపోయింది అంటూ:ఇక, ఇంట్లో ఒంటరిగా ఉన్న సంజయ్కు ప్రియ కాఫీ తీసుకుని వస్తుంది. అప్పుడతను 'ఎప్పుడూ అడిగితే ఎప్పుడు తీసుకొస్తున్నావు? నాకు ఇప్పుడు కాఫీ తాగే మూడు లేదు. అవసరం కూడా లేదు. దాన్ని నువ్వే తీసుకొని పో' అని అరుస్తాడు. దీంతో ప్రియ 'ప్రేమగా తీసుకొని వచ్చాను తాగు' అంటుంది. దీనికి సంజయ్ 'ఎప్పుడైతే నాతో బలవంతంగా తాళి కట్టించుకున్నావో అప్పుడే నీ మీద ప్రేమ చచ్చిపోయింది. ఇప్పుడు బలవంతంగా కాపురం చేయాల్సి వస్తోంది' అని అంటాడు. అప్పుడు పనిమనిషి వచ్చి విక్రమ్ బాబు పిలుస్తున్నాడు అనగా సంజయ్ వెళ్తాడు.

ప్రియను బంధించిన అత్తయ్య:విక్రమ్ పిలవగానే సంజయ్ కంగారుగా వెళ్లిపోతాడు. కానీ, మొబైల్ను అక్కడే మర్చిపోతాడు. అప్పుడు ప్రియ ఎలా అయినా దివ్యకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాలి అనుకుంటూ ఉంటుంది. అంతలోనే రాజ్యలక్ష్మి అక్కడికి వచ్చి ఫోన్ లాక్కొని ప్రియను ఒక గదిలో బంధిస్తుంది. అంతేకాదు, 'చూస్తూ ఊరుకుంది కదా ఏం చేయలేదులే అనుకుంటున్నావా? నా జోలికి వచ్చావంటే నేను నిన్ను చంపించాల్సి వస్తుంది. పెళ్లి అయిపోయే వరకు నోరు మూసుకుని పడి ఉండు. లేదంటే నేనేంటో నాకు చూపిస్తాను' అని వార్నింగ్ ఇస్తుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











