Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి ప్లాన్ చెడగొట్టిన దివ్య.. ముహూర్తం లేకపోయినా ఫస్ట్ నైట్ అంటూ!
ఈ మధ్య కాలంలో కొత్త కొత్త షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్లో జరిగింది ఇదే: బుధవారం ప్రసారమైన ఎపిసోడ్లో.. వ్రతం చేయడానికి సమయం దగ్గర పడినా తులసి వాళ్లు రారు. దీంతో బసవయ్య భార్య దివ్యను దెప్పిపొడుస్తూ మాట్లాడుతుంది. ఆ తర్వాత దివ్య కంగారులో దీపం కూడా సరిగా వెలిగించలేదు. అప్పుడే అక్కడకు తులసి వాళ్లు వస్తారు.
వాళ్లను చూసి దివ్య ఏడుస్తుంది. పనులు చేయడం రావట్లేదు అంటుంది. ఇక, వ్రతం పూర్తైన తర్వాత దివ్య, విక్రమ్.. తులసి, నందూకు నమస్కరించబోతుండగా బసవయ్య అవమానిస్తాడు. దీంతో విక్రమ్ అతడిపై సీరియస్ అవుతాడు. ఆ తర్వాత ఈ విషయమై తులసి వాళ్లకు రాజ్యలక్ష్మి క్షమాపణలు చెప్తుంది.

బసవయ్యకు విక్రమ్ వార్నింగ్: ఫస్ట్ నైట్కు ముహూర్తాలు లేవని పంతులు అనడంతో తులసి 'అదేంటి మొదటి రాత్రి ఈరోజు అనుకున్నాము కదా' అని అంటుంది. దీంతో బసవయ్య 'అంటే ఏంటి? మా అక్క కావాలని మొదటి రాత్రి జరుపుకుండా చేస్తుందా' అని అడుగుతాడు. దీంతో పరందామయ్య 'మేము అలా అనట్లేదు తప్పుగా అర్థం చేసుకోవద్దు' అని అంటాడు.
అప్పుడు బసవయ్యను విక్రమ్ 'మీరు ఆగండి మావయ్య.. మధ్యలో మాట్లాడొద్దు' అంటాడు. దీనికతడు మీ సొంత మేనమామనురా అని అనగా.. అక్కడ ఉన్నది నాకు పిల్లనిచ్చిన అత్తమావలు మధ్యలో దూరొద్దని హెచ్చరిస్తాడు.

రాజ్యలక్ష్మికి షాకిచ్చిన నందూ: తులసి వాళ్ల మాటలకు రాజ్యలక్ష్మి 'ముహూర్తం బాలేకపోతే మనమేం చేస్తాము. పోని ముహూర్తంతో సంబంధం లేకుండా మొదటి రాత్రి జరిపిద్దామా? మీరు సరే అంటే చేసేద్దాము' అని అంటుంది. దీంతో నందూ సరే అంటాడు. అప్పుడామె ఒక్కసారిగా షాకైపోతుంది. ఆ తర్వాత తులసి 'మీకేం తెలీదు ఊరుకోండి. పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి.
ఎప్పుడు మంచిదైతే అప్పుడే చేయిద్దాము' అని రాజ్యలక్ష్మితో అంటుంది. దీంతో అందరూ కామ్ అయిపోతారు. కానీ, విక్రమ్ మాత్రం ఢీలా పడిపోతాడు. ఫస్ట్ నైట్ కోసం అన్ని రోజులు ఆగాలా అనుకుంటాడు.

విక్రమ్ కోసం రాజ్యలక్ష్మి ప్లాన్: వ్రతం పూర్తైన తర్వాత రాజ్యలక్ష్మి, బసవయ్య భోజనాల దగ్గర కూర్చుంటారు. అప్పుడు బసవయ్య 'ఇప్పుడు చూడక్కా.. విక్రమ్ కింద కూర్చుంటాడు. అది చూసిన దివ్య పైన కూర్చోమని విక్రమ్ను బలవంతం పెడుతుంది. విక్రమ్ కచ్చితంగా పైకి రాడు. అప్పుడు ఇక్కడ జరిగే గొడవ చూడాలి' అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి 'విక్రమ్ ధనవంతుడు.. మంచి అల్లుడు అనుకుంటున్నారు. వాడు నా కాళ్ళ కింద చెప్పుతో సమానం అని ఈరోజు చూపిస్తాను. వాళ్ల స్థానం ఏంటో వాళ్ళకి తెలియజేస్తాను' అంటుంది. ఆ తర్వాత అందరూ భోజనాలకు వస్తుంటారు.
రాజ్యలక్ష్మికి ఝలక్ ఇచ్చారు: అందరూ భోజనాలు చేస్తుండగా.. విక్రమ్ చివర్లో వచ్చి కింద కూర్చుంటాడు. దీంతో తులసి 'అదేంటి బాబు కింద కూర్చుంటున్నారు' అని అడగ్గా.. నాకు అలవాటేనండి ఏమి పర్వాలేదు అంటాడు. అప్పుడు బసవయ్య 'నిజం చెప్పు బాబు. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. చిన్నప్పుడు మా అక్కకు ఒంట్లో బాగోకపోతే నయం కావడానికి జీవితాంతం నేల మీద భోజనం చేస్తాను అని మొక్కుకున్నాడు.
అందుకే ఇలా కింద భోజనం చేస్తున్నాడు' అంటాడు. అప్పుడు రాజ్యలక్ష్మి 'ఇప్పుడు దివ్య గొడవ చేస్తుంది' అనుకుంటుంది. కానీ, ఆమె వెళ్లి విక్రమ్ పక్కన కింద కూర్చుంటుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు అనసూయ ఆమెను పొగుడుతుంది. దీంతో అంతా సంతోషిస్తారు. కానీ, నందూ మాత్రం అనుమానంగా చూస్తుంటాడు.

అనసూయ డౌట్ పడడంతో: ఆ తర్వాత అనసూయ 'దివ్య చిన్న పిల్లలా నా ముందే తిరుగుతూ ఉండేది. ఇప్పుడు ఒక ఇంటికి కోడలు అయి ఇంత బాధ్యతగా ఉన్నది. అయినా అక్కడ ఏదో తేడా జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ అత్తయ్య సరిగ్గా చూసుకోవడం లేదేమో అని నాకు భయంగా ఉంది' అంటుంది.
అప్పుడు తులసి 'అలా ఎందుకు అనుకుంటారు? అత్తింటికి వెళ్లిన తర్వాత ఇలాంటివి తప్పవు. మొదట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్న వాళ్లందరి దగ్గర అలవాటైపోతుంది' అని చెబుతుంది. దీంతో అనసూయ కూడా ఆలోచనలో పడిపోతుంది.
నందూ ఆలోచన.. లాస్య డౌట్: వాళ్ల మాటలు విన్న నందూ మనసులో 'వీళ్ళకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదా? లేకపోతే నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా? అక్కడ తప్పు జరుగుతుంది. దివ్యకి అన్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది' అని అనుకుంటూ యాక్సిడెంట్ చేయబోతాడు. ఆ తర్వాత తేరుకుని ఇంటికి వెళ్లిపోతారు. ఇక, ఇంట్లో ఉన్న లాస్య 'ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? కొంపతీసి అక్కడ ఏవైనా గొడవ జరిగిందా' అని అనుకుంటుంది.
ఇంతలో వాళ్ళందరూ ఇంటికి వస్తారు. వచ్చిన వెంటనే నందూ కళ్లు తిరుగుతున్నాయని అంటాడు. దీంతో లాస్య 'ఏమైంది? వాళ్ళు ఏమైనా అన్నారా' అని వాళ్లను అడుగుతుంది. దీంతో అనసూయ 'వాళ్ళు అన్నారని అనుమానమా లేకపోతే వాళ్లు ఏమైనా అనాలని కోరుకుంటున్నావా' అనగానే లాస్య వెళ్లిపోతుంది.
డ్యూటీకి వెళ్తానంటూ వద్దని: ఇంట్లో ఒంటరిగా ఉన్న రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చిన దివ్య 'ఇంట్లో ఊసిపోవడం లేదు. హాస్పిటల్కు వెళ్లి డ్యూటీలో జాయిన్ అవుతాను' అని అడుగుతుంది. దీనికి అత్త 'కాళ్ళ మీద పారాణి ఆరకముందే గడప దాటడం ఏంటి? 16 రోజుల పండగ అయిన తర్వాతే బయటికి వెళ్లాలి. ఇంకా పెళ్లి ముచ్చట్లు కూడా ఏం మాట్లాడుకోలేదు కదా. నా కళ్ళ ముందు నువ్వు తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు ఉంటుంది' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











