Intinti Gruhalakshmi: విక్రమ్కు రెండో పెళ్లి.. నిజం తెలుసుకున్న దివ్య.. అత్త వాళ్లపై పోలీస్ కేసు
చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
బుధవారం ఎపిసోడ్లో జరిగింది ఇదే:బుధవారం ప్రసారమైన ఎపిసోడ్లో.. దివ్య బాధను చూడలేక విడాకుల నోటీసులు తీసుకుని తులసి రాజ్యలక్ష్మి ఇంటికి వెళ్తుంది. అక్కడ విక్రమ్ను అడగ్గా.. నిజం తెలియని అతడు తల్లి వాళ్లకు సపోర్టు చేసి మాట్లాడతాడు. అంతేకాదు, దివ్య కోరిక మేరకు విడాకులకు సిద్ధం అంటాడు. అప్పుడు లాస్య వచ్చి మొత్తం తనే చేశానని చెప్పి షాకిస్తుంది. అంతేకాదు, నందూకు తనకు మళ్లీ పెళ్లి చేయమని అడుగుతుంది. ఇక, బాధ పడుతున్న దివ్యకు నందూ ధైర్యం చెబుతాడు. అలాగే, తులసిలా సైలెంట్గా ఉండొద్దని హితవు పలుకుతాడు. ఇదంతా తులసి చాటుగా వింటుంది.

దివ్యకు నందూ హితబోధ చేసి:దివ్యకు నందూ హితబోధ చేస్తూ.. 'ఏ తండ్రీ తన కూతురు జీవితాన్ని రిస్క్ చేయమని చెప్పడు. కానీ నేను చెప్తున్నా. నీకు అసలు విక్రమ్ అంటే ప్రేమ ఉందా? లేదా? నీపై విక్రమ్కు ప్రేమ ఉందా లేదా' అని ప్రశ్నిస్తాడు. దీనికి దివ్య 'విక్రమ్ అంటే నాకు చచ్చేంత ఇష్టం కాబట్టే ఇలా కుములి కుములి ఏడుస్తున్నా.. కేవలం వాళ్ల అమ్మ వల్లే విక్రమ్ ఇలా మాట్లాడుతున్నాడు. తప్పితే విక్రమ్కు నేనంటే చాలా ఇష్టం నాన్నా' అంటుంది. దీంతో నందూ 'అంత ప్రేమ ఉన్నప్పుడు.. ఎవరి గురించో విక్రమ్ను వదులుకోవాలని అనుకోవడం పిచ్చితనం కాదా' అంటాడు.

తిరగబడ్డావు మరి సాధించావు:నందూ మాటలకు దివ్య 'వదులుకోవాలని అనుకున్నది నేను కాదు' అనగా.. నందూ 'ఆ ఇల్లు వదిలి వచ్చింది నువ్వే కదా.. ఎందుకు ఓపిక పట్టలేకపోయావు' అని ప్రశ్నిస్తాడు. దీనికి దివ్య 'మీ గురించి అమ్మ గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటే వింటూ ఊరుకోమంటారా' అని అడగ్గా.. నందూ 'సరే తిరగబడ్డావ్.. ఏం సాధించావ్.. వచ్చేశావ్.. తెగే వరకూ లాగావు అంతే కదా. మీ అమ్మ నాకు విడాకులు ఇచ్చేప్పుడు నాకు తనపై ప్రేమలేదు. కాబట్టే కలిసే ప్రయత్నాలు చేయలేకపోయాను. కానీ విక్రమ్ అలా కాదు. తనకు నువ్వేంటే ఇష్టం. నీకు విక్రమ్ అంటే ఇష్టం. బయటపడే మార్గం ఆలోచించు. ఆ రాజ్యలక్ష్మి చూపించే తల్లి ప్రేమ అబద్ధం అని నిరూపిస్తే చాలు.. మీ కాపురం చక్కబడ్డట్టే హాయిగా కలిసి ఉండొచ్చు' అని చెబుతాడు.
వచ్చింది నోటీసులే కదా అని:నందూ మాటలకు దివ్య 'ఆ సంగతి నాకు తెలుసు నాన్నా.. ప్రతి క్షణం నేను అదే పనిలో ఉన్నాను. నేను ఏం చెప్పినా వింటాడు. ఒక్క వాళ్ల అమ్మ విషయంలో తప్ప. దాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ల అమ్మ రెచ్చిపోతుంది. నాతో ఆడుకుంటోంది' అని ఏడుస్తుంది. దీంతో నందూ 'అయినా సరే వెనక్కి తగ్గొద్దు.. నువ్వు నీ అత్తతో యుద్దం చేయాల్సిందే. భార్యా భర్తలు విడిపోయే జీవితాలు ఎంత దారుణంగా మారతాయో.. మీ నాన్నే నీకు పెద్ద ఉదాహరణ. నీ బతుకు అలా కావడానికి వీళ్లేదమ్మా.. విడాకులు అంటే బొమ్మలాట కాదు. ఆట నచ్చకపోతే ఆగిపోవడానికి. దాని తాలూకా బాధ జీవితాంతం పీక్కుని తింటుంది. నీకు వచ్చింది విడాకుల నోటీసులే. ఇప్పటికీ నువ్వు ఆ ఇంటి కోడలివి. నీకు హక్కు ఉంది.. నిన్ను ఎవరూ ఆపలేరు' అని అంటాడు.

గాయపరుచుకున్న విక్రమ్:దివ్య అన్న మాటలను తలచుకుని విక్రమ్ అద్దం పగలగొడతాడు. ఆ సౌండ్ విన్న రాజ్యలక్ష్మి, లాస్య అక్కడకు వెళ్తారు. అప్పుడు రాజ్యలక్ష్మి నటిస్తూ 'ఎందుకు ఇలా చేశావురా? నీకు నువ్వే మనస్పూర్తిగా చెప్పావు కదా విడాకులకు సిద్దపడ్డానని. ఎవరిపై కోపంరా? ఇప్పటికైనా చెప్పరా? నేనే దివ్య దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకుని తీసుకుని వస్తాను. నాకు నీకంటే ఎవరూ ఎక్కువ కాదురా.. నీ మనసు ఎలా చెప్తే అలాగే నడుచుకో నాన్నా' అంటుంది. దీంతో విక్రమ్ 'దివ్యను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించా.. గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాను' అని బాధపడతాడు.

రెండో పెళ్లి చేయాలంటూ:ఆ తర్వాత విక్రమ్ 'దివ్య ఎందుకు ఇలా మారిపోయింది? ఎందుకు మనల్ని దూరం చేసుకుంటుంది? నేనేం తప్పు చేశానమ్మా' అని ఏడుస్తాడు. దీంతో రాజ్యలక్ష్మి 'నువ్వేం తప్పు చేయలేదు నాన్నా.. గుండెల్లో పెట్టి చూసుకుంటున్నావు. నాపై ద్వేషంతోనే నిన్ను బాధపెడుతుంది. నేను కూడా దివ్యని గుండెల్లో పెట్టే చూసుకుంటున్నా.. కానీ నాపై ఎందుకు ఇంత ద్వేషమో నాకు అర్ధం కావడం లేదు.. అయినా నీకోసం నేను తులసితో మాట్లాడతా' అని నటిస్తుంది. కానీ విక్రమ్ వద్దంటాడు. అప్పుడు లాస్య విక్రమ్కు రెండో పెళ్లి చేద్దామని అనగా.. అతడు కోపంతో వెళ్లిపోతాడు.

తులసికి ప్రామిస్ చేసింది:తండ్రి మాటలకు ప్రభావితం అయిన దివ్య ఉదయాన్నే తన ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటుంది. దీంతో అందరూ సంతోషిస్తారు. అప్పుడు దివ్య 'నేను పడుతున్న బాధలు చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే ఏమీ చెప్పలేదమ్మా. కానీ, నాన్న నాలో ధైర్యాన్ని నింపారు. నా ఇంటికి వెళ్లి తేల్చుకోమని చెప్పారు. అందుకే వెళ్తున్నానమ్మా. అక్కడే తేల్చుకుంటాను. నా కాపురాన్ని నిలబెట్టుకుంటాను. ఈ సారి చుట్టుం చూపుకు వస్తా కానీ, ఇంట్లో శాశ్వతంగా ఉండేలా రాను. నీకు ప్రామిస్ చేస్తున్నా' అని అంటుంది. దీంతో తులసి ఆమెకు సారె పెట్టి పంపిస్తుంది.

నిజం తెలిసి.. కేసు అంటూ:ఇంటి నుంచి దివ్య నేరుగా అత్తగారింటికి వెళ్తుంది. అయితే, ఆమెను విక్రమ్ గుమ్మం దగ్గరే ఆపి ఎందుకు వచ్చావని నిలదీస్తాడు. దీంతో దివ్య అతడికి కఠువుగానే సమాధానం చెప్తుంది. తర్వాత ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరుగుతుంది. ఆ సమయంలో విక్రమ్ 'విడాకులు నోటీసులు నువ్వే ముందు పంపించావుగా' అంటాడు. దీంతో దివ్యకు నిజం తెలుస్తుంది. కానీ, మౌనంగా ఉండడమే బెటర్ అనుకుంటుంది. తర్వాత లాస్య 'విక్రమ్.. దివ్యను మెడపట్టి బయటకు గెంటేయ్' అనగా.. దివ్య 'నో ఛాన్స్ ఆంటీ. మీ దగ్గరే నేర్చుకున్నా.. ఎవరైనా ఎక్కువ చేస్తే గృహ హింస కేసు పెడతాను' అని బెదిరిస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











