Intinti Gruhalakshmi Today Episode: చివరి నిమిషంలో లేడీ విలన్ ఎంట్రీ.. లాస్య ప్లాన్తో అందరూ షాక్
మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్లో.. పండుగ కోసం తన ప్రమేయం లేకుండానే ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన పిల్లలందరినీ తులసి అభినందిస్తుంది. మరోవైపు, లాస్యను అందంగా ఉన్నావని పొగిడిన తర్వాత హగ్ చేసుకుంటాడు నందూ. దీంతో చెమట వాసన వస్తుందని అతడిపై సీరియస్ అవుతుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన లాస్య.. తులసితో గొడవ పడుతుంది. అనంతరం నందూ రెడీ అయి రాగానే అతడిపై ప్రేమ ఒలకబోస్తుంది. కానీ, అతడు లైట్ తీసుకుంటాడు. అంతేకాదు, పూజ కోసం ఉండమన్నా ఉండకుండా నందూ... లాస్యను వదిలేసి వెళ్లిపోతాడు.

నందూ ప్లాన్ సక్సెస్.. కేఫ్ అంతా ఫుల్
తులసి ఐడియా మేరకు పండుగ సమయంలోనే కేఫ్ను ఓపెన్ చేయాలనుకున్న నందూ.. కస్టమర్ల కోసం చూస్తుంటాడు. కానీ, చాలా సమయం పాటు ఒక్క కస్టమర్ కూడా రాడు. దీంతో ఏం చేయాలో అతడికి అర్థం కాదు. చాలా సేపటి నుంచి చూస్తున్నా ఒక్క కస్టమర్ కూడా రాలేదేంటని అనుకుంటున్న సమయంలోనే ఓ జంట వస్తుంది. ఆ తర్వాత లైనుగా కస్టమర్లు వస్తూనే ఉంటారు. దీంతో నందు చాలా ఖుషీ అవుతాడు. కేఫ్ మొత్తం కస్టమర్లతో నిండిపోతుంది. అందరూ కాఫీ ఆర్డర్ చేసి తాగుతుంటారు. ఇది చూసిన నందూ ఎంతగానో మురిసిపోతుంటాడు.

ప్రకాశ్ ప్రశంసలు.. తులసికి థ్యాంక్స్
కేఫ్ నిండా కస్టమర్లు ఉండడంతో నందూ తెగ సంతోష పడుతుంటాడు. అంతలో ఓనర్ కమ్ ఫ్రెండ్ ప్రకాశ్ అక్కడకు వస్తాడు. వచ్చీ రావడమే అతడు ‘కంగ్రాచ్యులేషన్స్ నందూ.. నువ్వు ఇచ్చిన ఐడియా సూపర్గా వర్కవుట్ అయింది. నీలాగా ఐడియాలు ఇచ్చేవాళ్లు ముందు నుంచి నాతో ఉండి ఉంటే నేను ఇప్పటికే 10 బ్రాంచ్లు ఓపెన్ చేసేవాడిని. ఓకే కీప్ ఇట్ అప్' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అతడికి థ్యాంక్స్ చెబుతాడు నందూ. ఆ తర్వాత తులసి ఐడియానే అని గుర్తు తెచ్చుకున్న నందూ.. ఆమెకు కూడా మనసులో థ్యాంక్స్ అని చెబుతాడు.

పూజ కోసం లాస్య కన్నింగ్ ప్లాన్ రెడీ
ఎలాగైనా ఈసారి పూజలో తానే కూర్చోవాలని అనుకుంటుంది లాస్య. దాని కోసం ఏం చేయాలి అని అనుకుంటుంది. ఇంతలో ఆమెకు అంకిత తల్లి గాయత్రి గుర్తొస్తుంది. వెంటనే ఆమెకు ఫోన్ చేస్తుంది. అప్పుడామె ‘ఏంటి లాస్య.. కొత్త కోడలుగా ఇంట్లో పండుగ చేస్తూ నన్ను పిలవడానికి ఫోన్ చేశావా' అంటుంది. దీంతో పుండు మీద కారం చల్లుతున్నావా అంటుంది లాస్య. ఏమైంది అని గాయత్రి అడగ్గా.. స్టోరీ మొత్తం చెబుతుంది. అంతేకాదు, ‘చివరకు నీ కూతురు అంకితను పనిమనిషిగా మార్చేసింది తులసి' అంటూ లేనిపోనివి అన్నీ ఎక్కేసి చెబుతుంది లాస్య.

గాయత్రి కోసం లాస్య ఎదురుచూపు
లాస్య చెప్పిన మాటలకు రెచ్చిపోయిన గాయత్రి మరింత కోపంగా ఉంటుంది. అప్పుడు లాస్య ‘నువ్వు రేపు ఇక్కడికి వచ్చి ఒక పని చేసి పెడితే.. ఆ తర్వాత నేను నీ కూతురు అంకితకు అత్తగా ఉంటాను. తనకు అండగా ఉంటాను' అంటూ డీల్ చేసుకుంటుంది. దీంతో సరే నేను వచ్చి చూసుకుంటానని చెబుతుందామె. ఇక, పండుగ రోజు గాయత్రి కోసం లాస్య వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు అనసూయ ‘ఈ ధాన్యలక్ష్మి పూజ ఇప్పటిది కాదు. మా అత్తగారు కంటే ముందు నుంచి వచ్చేది' అని చెబుతుంది. తర్వాత పూజ గురించి తులసి వివరించి చెబుతుంది.

పండగ రోజూ గొడవకు దిగిన లాస్య
ఇంట్లో వాళ్లంతా పూజ గురించి మాట్లాడుకుంటూ ఉండగా.. లాస్య కూడా అక్కడకు వస్తుంది. వచ్చీ రావడమే ఆమె వాళ్లతో గొడవకు దిగుతుంది. అప్పుడామె ‘మీరే కావాలని నన్ను బాధపెడుతున్నారు. దాని కోసం మీకు ఏదో ఒక వంక కావాలి కదా' అంటుంది. అప్పుడు పండుగ రోజు గొడవ ఎందుకు అంటుంది తులసి. అంతేకాదు, కావాలంటే నువ్వు కూడా మాతో పాటు వచ్చి పూజలో కూర్చో అంటుంది. దీంతో లాస్య ‘పూజ నువ్వు కాదు.. ఈరోజు నేను చేస్తున్నా' అని మనసులో అనుకుంటుంది లాస్య. ఆ తర్వాత అందరినీ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

గాయత్రి ఎంట్రీ.. గొడవలు పెట్టాలని
లాస్య ఇంట్లో వాళ్లతో గొడవ పడుతోన్న సమయంలోనే గాయత్రి ఎంట్రీ ఇస్తుంది. రావడం రావడమే ఆమె నేరుగా వెళ్లి లాస్యను పలకరిస్తుంది. ఆ తర్వాత అంకితతో మాట్లాడుతుంది. అనంతరం ‘ఇంట్లో ఇంకో కోడలు వచ్చాక కూడా మాజీ కోడలు ఇంకా ఇక్కడే ఉందేంటి? అవసరానికి తగ్గట్టు బంధాలు మారిపోతుంటాయి. మనుషులను బట్టి మర్యాదలు మారిపోతుంటాయి. ఇష్టం ఉంటే ఒకలా.. ఇష్టం లేకపోతే ఒకలా. వాళ్ల బంధం సరే.. నీ బంధం ఏంటి లాస్య? కొత్త కోడలు కోరికలు తీరుస్తున్నారా లేదా' అంటుంది గాయత్రి. దీంతో అక్కడున్న అందరూ నొచ్చకుంటారు.
Recommended Video

గాయత్రి సీరియస్.. లాస్యే చేయాలని
ఇక, శృతి, అంకితతో పూజ చేయిస్తున్నారని లాస్య చెప్పడంతో అనసూయపై సీరియస్ అవుతుంది గాయత్రి. ‘అన్యాయం ఎక్కడ జరిగినా అన్యాయమే.. అడిగి తీరాల్సిందే. న్యాయం మాట్లాడాలి.. లాస్యతో పోలిస్తే అంకిత, శృతి పాత కోడళ్లు. లాస్య ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత జరుగుతున్న మొదటి పూజ ఇది. పాపం ఒంటరిది.. తన తరుపున అడిగే వాళ్లు ఎవరూ లేరని ఇలా చేస్తారా?' అంటూ ఎలాగోలా లాస్య పూజ చేసేలా అందరినీ ఒప్పిస్తుంది గాయత్రి. అప్పుడు లాస్య అత్తయ్య, మామయ్య ఆశీర్వాదం తీసుకొని పూజ మొదలు పెడతా అంటుంది. దీంతో ముందు వాళ్లకు అక్షింతలు ఇచ్చి కాళ్లకు దండం పెట్టాలి అని ఆపుతుంది తులసి. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.


Click it and Unblock the Notifications











