Intinti Gruhalakshmi Today Episode: అభి, గాయత్రికి శరత్ బిగ్ షాక్.. తులసి గురించి నిజం చెప్పడంతో!
తెలుగు బుల్లితెపై దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రసారం అవుతోన్న సీరియళ్లకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుంది. సుదీర్ఘ కాలంలో ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్లో జరిగింది ఇదే
బుధవారం ప్రసారమైన ఎపిసోడ్లో.. ఆస్తిని అంకిత పేరు మీద కాకుండా అభి పేరు మీద రాయించమని గాయత్రికి లాస్య సలహా ఇస్తుంది. ఇదే విషయాన్ని ఆమె తన భర్త శరత్కు చెబుతుంది. కానీ, ఆయన మాత్రం అంకిత పేరు మీదే రాయిద్దామని అంటాడు. దీనికి గాయత్రి మాత్రం అస్సలు ఒప్పుకోదు. మరోవైపు, తులసికి డబ్బు సహాయం చేసేందుకు రామచంద్రయ్య ఆమె ఇంటికి వస్తాడు. కానీ, దాన్ని ఆమె మాత్రం తీసుకోదు. పైగా వేరే అమెకు ఇచ్చేయమని అంటుంది. తులసి తీసుకున్న ఈ నిర్ణయంపై అటు పరందామయ్య ఎంతగానో సంతోషిస్తూ ఆమెను పొగుడుతాడు.

అంకితకు నిజం చెప్పాలన్న అభి
ఆస్తిని తన పేరు మీద రాయించుకుందామని అనుకున్న అభి.. గాయత్రితో దీనిపై మాట్లాడుతాడు. అంతేకాదు, అంకితకు అసలు విషయం చెప్పేద్దాం అని అనుకుంటాడు. అప్పుడు అత్తతో అతడు 'అంకిత ఎలా రియాక్ట్ అవుతుందో.. ఎందుకైనా మంచిది అంకుల్ రాకముందే ఈ విషయం తనకు చెప్పేద్దాం' అంటాడు. దీనికి గాయత్రి 'ఏం అవసరం లేదు. అది నిన్ను ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అటువంటప్పుడు ఆస్తి నీ పేరు మీద రాస్తే సంతోషిస్తుంది కానీ ఎందుకు బాధపడుతుంది' అంటుంది. ఇంతలో అక్కడికి అంకిత వచ్చి డాడీ ఎక్కడ అని అంటుంది.

డాక్యూమెంట్స్ చూసేసిన అంకిత
తన తండ్రి గురించి అంకిత అడగ్గానే 'పని మీద వెళ్లారు వస్తారులే. అయినా ఇప్పుడు నీకు డాడీతో ఏం పని' అని అడుగుతుంది. దీంతో అంకిత 'చెస్ ఆడుకుందామని. ఓకే.. నేను ఫోన్ చేస్తా.. అవునూ.. ఆస్తి విషయం మీద వెళ్తా అన్నారు కదా. నన్ను కూడా తీసుకెళ్తా అన్నారు. తీసుకెళ్లకుండా వెళ్లారు ఏంటి' అని అడుగుతుంది. ఇంతలో శరత్.. డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసుకొని వస్తాడు. అప్పుడు గాయత్రి ఏవీ డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వండి అంటుంది. సరిగ్గా ఆ సమయంలో అంకిత వాటిని లాక్కుని చూస్తుంటుంది. దీంతో అక్కడే ఉన్న అభికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది.

డాక్యూమెంట్లలో పేరు చూసి షాక్
డాక్యూమెంట్లను తీసుకున్న అంకిత 'కోర్టు ఆర్డర్ దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేయించాం. మరి ఈ డాక్యుమెంట్స్ కూడా పూజ చేయించాలి కదా డాడ్' అంటూ.. వాటిని ఓపెన్ చేసి లోపల చదువుతుంది. ఆ తర్వాత అంకిత మామ్.. ఇప్పుడు నీకు సంతోషమే కదా అంటుంది. దీంతో రిజిస్ట్రేషన్ పత్రాలను గాయత్రి లాక్కొని చదువుతుంది. అందులో ఉన్న పేరు చూసి షాక్ అవుతుంది. ఆ వెంటనే గాయత్రి 'నేను చెప్పిందేంటి.. మీరు చేసిందేంటి. మీకు అర్థం కాలేదా.. అర్థం అయ్యే నాటకం ఆడారా? ఆస్తిని అల్లుడి పేరు మీదకు ట్రాన్స్ ఫర్ చేయమంటే.. మళ్లీ అంకిత పేరు మీదకే ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు' అని గొడవకు దిగుతుంది. దీంతో అభి కథ ఇలా అడ్డం తిరిగిందేంటి అని అనుకుంటాడు.

తులసే చెప్పిందని అన్న శరత్
డాక్యూమెంట్లలో అంకిత పేరు చూసిన గాయత్రి తన భర్తతో 'అలా రాయిలా నిలబడటం కాదు.. ఏం జరిగింది చెప్పండి' అంటుంది. అప్పుడాయన 'అంకిత ఏదో అన్నదని అభి పేరు మీద చేద్దాం అన్నావు. నీకు సలహా ఇచ్చినట్టే.. అభి పేరు మీద వద్దు అంటూ నాకూ ఒకరు సలహా ఇచ్చారు' అని బదులిస్తాడు. దీనికి గాయత్రి ఎవరు నీకు సలహా ఇచ్చింది.. ఆ తులసేనా అని అడుగుతుంది. దీంతో అవును తులసే అంటాడు శరత్. దీంతో అభి షాక్ అవుతాడు. అప్పుడు గాయత్రి 'తులసి మిమ్మల్ని ఎందుకు కలిసింది. అసలు తను ఏం చెప్పింది' అని అడుగుతుంది. దీనికి శరత్.. తులసి ఫోన్ చేస్తే నేను కలవడానికి వెళ్లాను అంటాడు.

శరత్కు సలహా ఇచ్చిన తులసి
అసలు జరిగిన విషయాన్ని శరత్ వివరిస్తాడు. శరత్ను కలిసిన తులసి 'సమస్యను మీదాకా తీసుకురాకుండా నాస్థాయిలోనే పరిష్కరించుకుందాం అనుకున్నా కానీ.. నా వల్ల కాలేదు. మరో దారిలేక మీ ముందు ఇలా నిలబడ్డాను. ఇప్పుడు సమస్య నా గురించి కాదు.. నా బిడ్డ నీ అల్లుడు అభి గురించి' అంటుంది. దీనికి శరత్ 'అతడు చాలా సంతోషంగా ఉన్నాడు.. అతడితో ఏంటి సమస్య' అంటాడు. అప్పుడు తులసి 'కాలం మనది కానప్పుడు దురదృష్టం తలుపు పగులగొట్టుకొని వస్తుంది. నా బిడ్డ అందనంత ఎత్తుకు ఎదగడం తల్లిగా నాకు సంతోషమే కానీ.. ఆ సంతోషం వెనుక ప్రమాదం పొంచి ఉంది. అభి చుట్టూ ఏదో జరుగుతోంది. ప్రమాదం మాయలా కమ్మేసింది. ఇన్నాళ్లు వాడికి దూరంగా ఉన్నోళ్లు డబ్బు వాసన రాగానే వెనక్కొచ్చారు' అంటుంది.

శరత్ను ఒప్పించేసిన తులసి
ఆ తర్వాత తులసి 'నా బిడ్డ వాళ్ల చేతుల్లో ఎక్కడ మోసపోతాడో అని భయమేస్తుంది. వాళ్ల నాన్న నుంచి నేను వాడిని దూరం చేస్తున్నా అని అనుకుంటున్నాడు. ఆస్తి విషయంలో ఎవరి వల్ల అయినా ఏ పొరపాటు జరిగినా దాని ఫలితం నా బిడ్డ అనుభవించాల్సి వస్తుంది. ఏ తల్లి తన బిడ్డ గురించి కోరుకోనిది నేను కోరుకుంటున్నాను. దయచేసి ఆస్తి అభి పేరు మీద పెట్టకండి.. అంకిత పేరు మీద పెట్టండి. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి అన్నయ్య. డబ్బు విషయంలో మన మధ్య గొడవలు రాకూడదు. ఇది చెబుదామనే ఒక తల్లిగా ఆరాటపడుతూ మిమ్మల్ని పిలిచాను' అంటూ ఆయన ఆలోచన మార్చేస్తుంది. ఇదే విషయాన్ని ఆయన అందరికీ చెబుతాడు.
Recommended Video


తులసి మాట.. గాయత్రి కోపం
శరత్ నిజం చెప్పగానే అంకిత చాలా థ్యాంక్స్ అని మనసులో అనుకుంటుంది. కానీ, గాయత్రి మాత్రం 'అంటే.. మీ భార్య మాట కన్నా ఆ తులసి మాటే ఎక్కువైందా.. నేను చెప్పింది అంతా గాలివానకు కొట్టుకుపోయిందా. అసలు మన ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవడానికి తులసి ఎవరు? అయినా తన ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాక ఇంకేముంది' అంటూ గొడవ పడుతుంది. దీంతో అంకిత 'మామ్.. మేము తులసి ఆంటిని వద్దనుకొని రాలేదు.. తను వెళ్లమంటేనే వచ్చాం. కాదంటావా అభి' అని ప్రశ్నిస్తుంది అంకిత. అప్పుడు శరత్ 'అభి అసమర్థుడని తులసి అనలేదు. తల్లీకొడుకుల మధ్య అపార్థాలు క్రియేట్ చేయడానికి ట్రై చేయకు' అంటూ గాయత్రిపై కోప్పడతాడు. అలా ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. ఇక, ఆల్బమ్ కోసం ప్రేమ్ స్పాన్సర్ చేయమని ఓ కంపెనీకి వెళ్లగా అక్కడ అతడికి నిరాశే ఎదురవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











