Intinti Gruhalakshmi: పెళ్లి విషయంలో విక్రమ్ ఊహించని నిర్ణయం.. తులసికి నందూ సర్ప్రైజ్ గిఫ్ట్
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్లో.. తులసి ఉదయాన్నే గుడికి వెళ్లి వస్తుండగా.. వాసుదేవ్, అతడి భార్య ఆపి ఎక్కడికి వెళ్లావని అడుగుతారు. అప్పుడామె విషయం చెప్పగానే.. పెళ్లిరోజున ఇద్దరూ కలిసి వెళ్లాలి కానీ.. ఒక్కదానివే ఎలా వెళ్లావని ప్రశ్నిస్తారు. ఆ తర్వాత నందూను పిలిచి క్లాస్ పీకుతారు. అలాగే, పెళ్లిరోజు పార్టీ కూడా చేయాలని అనుకుంటారు. అప్పుడే దీపక్ అక్కడికి రావడంతో అంతా షాక్ అవుతారు. తర్వాత అతడికి తులసి అంతా వివరిస్తుంది. ఇక, ఆస్పత్రిలో సంజయ్ నర్సుతో రొమాన్స్ చేస్తూ దివ్యకు మరోసారి దొరికిపోతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది.

విక్రమ్ను బ్లాక్మెయిల్ చేస్తూ
విక్రమ్ దగ్గరకు వచ్చిన బసవయ్య అతడిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. 'ఈ మధ్య నువ్వు కాదన్నంత పని చేస్తున్నావు.. వింటాను అంటూనే విననంత పని చేస్తున్నావు. కొత్త కొత్తగా ప్రవర్తిస్తున్నావు. ఇదంతా మీ అమ్మ బయటకు చెప్పుకోలేకపోతోంది. కడుపులో దాచుకొని బాధపడుతోంది. ఈ విషయం నీకు చెప్పడానికి తను ఇబ్బంది పడుతోంది' అని లేనిపోనివి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు విక్రమ్ రాజ్యలక్ష్మి గురించి నిజమే చెప్పాడని అనుకుంటాడు. వెంటనే జరుగుతున్న వాటితో తన తప్పు ఏమీ లేదని తల్లికి చెప్పే ప్రయత్నం చేస్తాడు.

ఎవరి పెద్దరిక అవసరం లేదు
తన తల్లితో విక్రమ్ 'మామయ్య అన్న మాట నిజమేనా అమ్మా? నేను ఏదైనా తప్పు చేస్తే నా ముఖం మీద అడిగి హక్కు నీకు ఉంది. మధ్యలో ఎవరి పెద్దరికం అవసరం లేదు. అయినా ఆ పెళ్లి సంబంధం కావాలని చెడగొట్టలేదమ్మా' అని వివరిస్తాడు. దీనికామె జరిగిన వాటి గురించి అనవసరంగా మాట్లాడకూడదు నాన్న అని అంటుంది. అప్పుడు విక్రమ్ 'నా పెళ్లి గురించి పక్కన పెట్టి.. తమ్ముడికి ముందుగా చేయమ్మా' అంటాడు. దీంతో రాజ్యలక్ష్మి 'అలా చేయకూడదు నాన్నా. సవతి తల్లి కాబట్టి నేను పట్టించుకోలేదని నలుగురు నానా మాటలంటారు' అంటుంది.

పెళ్లికి ఒప్పేసుకున్న విక్రమ్
తల్లి మాటలకు విక్రమ్ 'ఎవరు ఏమైనా అనని అమ్మా. నేను అవన్నీ పట్టించుకోను' అంటాడు. దీనికామె 'మీ తమ్ముడు పెళ్లి గురించి నేను వదిలేసాను. ముందు నీ పెళ్లి చేశాకే తమ్ముడు పెళ్లి చేస్తాను' అంటూ నాటకం ఆడుతూ ఏడుస్తుంది. దీంతో విక్రమ్ చలించిపోయి 'ఇలా పస్తులు ఉండద్దమ్మా. అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. ఈ పండైనా తినమ్మా' అంటాడు. దీంతో వద్దు నాన్న నన్ను వదిలేయి అంటూ మరింతగా యాక్టింగ్ చేస్తుంది. అప్పుడు విక్రమ్ ఆమె నిజమే చెప్తుందని నమ్ముతాడు. వెంటనే 'సరే అమ్మ నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను' అని మాట ఇస్తాడు. దీంతో రాజ్యలక్ష్మి లోలోపల నవ్వుకుంటూ ఉంటుంది. కానీ, విక్రమ్ మాత్రం దివ్యను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు.

నిజం చెప్తేస్తానన్న తులసి
ఇక, నందూ, తులసి పెళ్లి రోజు సందర్భంగా పార్టీని గ్రాండ్గా సెలెబ్రేట్ చేస్తుంటారు. అదంతా చూసి లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు తులసి అనసూయతో 'అనవసరంగా నటించడానికి ఒప్పుకున్నాను. ఒక్క క్షణం ఒక్కొక్క యోగంలో గడుస్తోంది. నేను వెళ్లి నిజం చెప్పేస్తాను అత్తయ్య' అంటుంది. దీంతో అనసూయ 'నువ్వు అసలు ఇలా నటించడానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది తులసి. ఇప్పుడు ఏమీ చేయలేం' అంటుంది. అప్పుడే నందూ 'నిజంగా నాకు ఈ పెళ్లి రోజు చేసుకునే ఉద్దేశం లేదు నాన్న' అంటాడు. దీంతో పరందామయ్య 'తొందరపడి నిజం చెప్పేయకు నందూ. లాస్య మళ్లీ నీకు చుక్కలు చూపిస్తుంది. ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు' అని అంటాడు.

ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసి
ఆ పార్టీకి దివ్య వచ్చి హడావిడి చేస్తుంటుంది. దీంతో తులసి ఇవన్నీ ఎందుకమ్మా అని అడుగుతుంది. అప్పుడు దివ్య 'మళ్లీ మళ్లీ ఇటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందో రాదో.. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు ఇలా వస్తే కేక్ కట్ చేద్దాం' అంటుంది. దీంతో లాస్య పెళ్ళికొడుకు ముఖంలో ఎప్పుడూ లేనంత సంతోషం కనిపిస్తోంది అనగా.. వాసుదేవ్ మొగుడికి విడాకులు ఇచ్చిన నీకు అలాంటివీ కనిపిస్తాయిలే అంటాడు. తర్వాత నందూ, తులసి ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తుండగా లాస్య 'అంత గట్టిగా చేయి పట్టుకోవాల్సిన అవసరం లేదు తులసి. అదే.. నందూ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు' అని అంటుంది. తర్వాత వాళ్లు కేక్ కట్ చేయగా.. ఒకరికొకరు తినిపించుకోమని వాసుదేవ్ చెబుతాడు.

తులసికి డైమండ్ నెక్లెస్
కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాసుదేవ్ 'కేక్ మాత్రమేనా? మా చెల్లి కోసం ఏదైనా గిఫ్ట్ తెచ్చావా' అని అడుగుతాడు. దీంతో లాస్య ఇప్పటికిప్పుడు అంటే ఏం గిఫ్ట్ తెస్తారు అని అంటుంది. అప్పుడే నందూ అందరి ముందు తులసి కోసం డైమండ్ నెక్లెస్ తీసి ఇస్తాడు. అది చూసి లాస్య షాక్ అవుతుంది. అది చూసి అంతా సంతోషిస్తుండగా.. తులసి ఇబ్బంది పడుతుంది. అప్పుడు పనిమనిషి రాములమ్మ నందూ బాబు మన లాస్యమ్మకి ఇచ్చిన నెక్లెస్ కంటే ఇది చాలా బాగుంది అనడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు నందూ ఏదేదో చెప్పి కవర్ చేస్తాడు. ఆ తర్వాత తులసి ఆ నెక్లెస్ పెట్టడానికి వెళ్లి తులసిని ఎన్నో మాటలు అంటుంది. దీంతో తులసి బాధ పడుతుంది. తర్వాత నందూ తాను చేసిన తప్పులు చెబుతూ ఫీల్ అవుతుంటాడు.

నందూ సారీ.. దివ్య నాది
తులసి విషయంలో చేసిన తప్పుల గురించి పరోక్షంగా మాట్లాడుతూనే లాస్యకు నందూ చురకలు అంటిస్తుంటాడు. తర్వాత 'ఇప్పుడు ఏం చేయలేని సహాయం స్థితిలో ఉన్నాను కాబట్టి క్షమించమని అడగడం తప్ప నేను ఏమి చేయలేను' అని నమస్కరిస్తాడు. తర్వాత తులసి కూడా నందూ మోసం గురించే మాట్లాడుతుంది. అంతేకాదు, 'నేను ప్రతి ఒక్కరినీ కోరుకునేది ఒకటే నమ్మిన వారిని మోసం చేయకండి' అంటుంది. మరోవైపు, తర్వాత విక్రమ్.. దివ్య ఫొటోను చూస్తూ ఉండగా.. దేవుడు అతడిని ఆటపట్టిస్తూ ఉంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











