Intinti Gruhalakshmi Today Episode: తులసిపై దివ్య కంప్లైంట్.. లాస్యకు భారీ షాక్ ఇచ్చిన లక్కీ
చాలా దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ నుంచి అతి భారీ స్థాయిలో స్పందన దక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్లో.. తులసి మారడాన్ని చూసి అనసూయ, పరందామయ్య ఎంతగానో మురిసిపోతుంటారు. ఆ తర్వాత దివ్య తన ల్యాబ్ ఫీజు కోసం ఇరవై వేలు కావాలని అంటుంది. దీంతో తులసి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అనంతరం ప్రవళ్లిక ఆమెను పాడడం మళ్లీ మొదలు పెట్టమని సలహా ఇస్తుంది. ఇక, తులసి అలా మాట్లాడడంతో నందూ, లాస్య రగిలిపోతూ ఉంటారు. అనంతరం అంకిత, తులసి దగ్గరకు వెళ్లి వస్తుంది. అప్పుడు అభి, గాయత్రి దగ్గర డబ్బులు తీసుకోవడాన్ని చూసిన అంకిత అతడిపై ఫైర్ అవుతుంది.

తులసిపై కంప్లైంట్ చేసేసిన దివ్య
పరందామయ్య, అనసూయ ఇంట్లో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. కాఫీ తీసుకొచ్చిన ఆమెతో షుగర్ సరిపోలేదని అంటాడు. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు పనులు చెప్పుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే దివ్య అక్కడకు వస్తుంది. వచ్చీ రావడమే 'ఏంటి నానమ్మ.. మా మామ్ ఎక్కడెక్కడికో వెళ్తుంది. ఎప్పుడో వస్తుంది. అసలు మిమ్మల్ని, నన్ను పట్టించుకోవడం లేదు. అలా చూస్తూ ఊరుకుంటారేంటి? మీరు తనను ప్రశ్నించరా' అని అడుగుతుంది. దీనికి అనసూయ 'మా మధ్య పుల్లలు పెట్టాలని చూస్తున్నావా? కొంచెం బాధ నుంచి బయటపడనీ' అంటుంది.

మదర్స్ డే.. తల్లిని కలిసిన తులసి
దివ్య అలా తన తల్లి కోసం ఎదురు చూస్తుండగా.. నానమ్మ, తాతయ్య ఏమైందని అడుగుతారు. అప్పుడామె 'ఈరోజు మదర్స్ డే. మామ్ను గట్టిగా హగ్ చేసుకుని విష్ చేయాలి. కానీ, తను మాత్రం ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదు' అని నిరుత్సాహపడుతుంది. మరోవైపు, తులసి తన తల్లిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్తుంది. వెళ్లగానే 'మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా. నీకు ఇలా ఎప్పుడూ చెప్పలేదు. నా బాధల్లో పడి నిన్ను పట్టించుకోలేదు. అందుకే కొత్తగా ఉన్నా ఇప్పుడు నీకు శుభాకాంక్షలు చెబుతున్నా' అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుతారు.

లక్కీ ఎంటర్.. నందూ అలా అనగా
చాలా రోజుల తర్వాత లాస్య దగ్గరకు కొడుకు లక్కీ వస్తాడు. వచ్చీ రావడమే తన తల్లితో ప్రేమగా మాట్లాడతాడు. అప్పుడామె ఆ చిన్నారిని తీసుకుని వెళ్లి నందూతో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు లక్కీ.. నందూను అంకుల్ అంటాడు. దీంతో లాస్య 'ఇంకా అంకుల్ అంటావేంట్రా. తను మీ డాడీ. ఇక నుంచి నువ్వు అలాగే పిలవాలి' అంటుంది. కానీ, లక్కీ మాత్రం గతంలో నందూ అతడిని తిట్టింది ఊహించుకుని భయపడతాడు. అంతేకాదు, నందూ 'అంకుల్ చెబితేనే డాడీ అని పిలుస్తాను' అని అంటాడు. కానీ, నందూ మాత్రం ముందుకు రాడు.

టైమ్ కావాలన్న నందూతో గొడవ
లక్కీ ఆ మాట అనగానే లాస్య 'ఏంటి నందూ ఆలోచిస్తున్నావు? నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడం అంటే కొడుకుగా వాడిని కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. నేను నీ భార్యను అయినప్పుడు.. వాడు నీకు కొడుకు కాడా' అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ 'వాడిని కొడుకుగా యాక్సెప్ట్ చేయడానికి నాకు కొంచెం టైమ్ కావాలి లాస్య. ముందు వాడిని నాకు కొంచెం దగ్గరవనివ్వు. ఆ తర్వాత మాట్లాడతా' అంటాడు. దీంతో లాస్య సంతృప్తి చెందుతుంది. అనంతరం లక్కీ కూడా తనకు చాక్లెట్ కావాలని అడుగుతాడు. దీనికి నందూ ఓకే అనడంతో అందరూ సరదాగా నవ్వుకుంటారు. ఆ తర్వాత నందూ మదర్ థెరిస్సా ఆర్గనైజేషన్ ఈవెంట్ చేస్తుందని, దానికి ఆర్డర్ తమకే ఇచ్చారని నందూ చెప్తాడు. దీనికి లక్కీతో పాటు లాస్య కూడా వస్తానని అంటుంది.

ఇంటికొచ్చిన తులసి... ఫోన్ కాల్
తల్లి దగ్గరకు వెళ్లిన తులసి.. ఆ వెంటనే ఇంటికి తిరిగి వస్తుంది. దీంతో వెంటనే దివ్య వెళ్లి తన తల్లిని హత్తుకుంటుంది. అంతేకాదు, మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతుంది. అప్పుడు అందరూ సరదాగా నవ్వుతూ గడుపుతారు. ఆ సమయంలో ప్రవళ్లిక.. తులసికి ఫోన్ చేస్తుంది. 'మదర్ థెరిస్సా ఫౌండేషన్ వారు ఈవెంట్ చేస్తున్నారు. దీనికి నువ్వు కూడా మీ వాళ్లను తీసుకుని రావాలి' అని చెబుతుంది. ముందు రాలేనని చెప్పిన తులసి.. ఆ తర్వాత అక్కడకు వెళ్లడానికి ఒప్పుకోవడంతో పాటు ఇంట్లో వాళ్లతో కూడా ఈ విషయాన్ని చెబుతుంది.

ఎదురుపడిన తులసి, లాస్యలు
ఇక, మదర్స్ డే సందర్భంగా మదర్ థెరిస్సా ఫౌండేషన్ వాళ్లు ఈవెంట్ చేస్తుండగా.. ప్రవళ్లిక అక్కడకు చేరుకుంటుంది. ఆ తర్వాత తులసి వాళ్ల కోసం ఎదురు చూస్తుంటుంది. అప్పుడు వాళ్లంతా అక్కడకు చేరుకుంటారు. అప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండగా.. లాస్య, నందూ, లక్కీలు కూడా అక్కడకు వస్తారు. అప్పుడు తులసిని చూసిన లక్కీ.. వెంటనే ఆమె దగ్గరకు వెళ్తాడు. దీంతో ఆ చిన్నారని తులసి దగ్గరకు తీసుకుని క్షేమ సమాచారం తెలుసుకుంటుంది. దీంతో లాస్య కోపంతో రగిలిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











