Intinti Gruhalakshmi: బాత్రూంలో జానూతో దొరికిన విక్రమ్.. ఆయనకు తెలిసిన నిజం.. తులసిని రావొద్దంటూ!
తరాలు మారుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
గురువారం ఎపిసోడ్లో జరిగింది ఇదే:గురువారం ప్రసారమైన ఎపిసోడ్లో.. రత్నప్రభ వాళ్లు తులసిని చంపుతామని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని నందూ తల్లిదండ్రులకు చెప్తాడు. దీంతో ఆమెను సామ్రాట్ ఇంటికి దూరంగా ఉంచాలని వాళ్లు ప్లాన్ చేస్తారు. ఇక, భర్త చేసిన పనికి పొంగిపోతున్న దివ్య అతడికి ముద్దులు పెట్టాలని అనుకుంటుంది. కానీ, విక్రమ్ మాత్రం ఆమెను నమ్మనంటూ వెళ్లిపోతాడు. ఇక, కంపెనీ సీఈవోగా ధనుంజయ్ను పెట్టకపోతే హనీ ప్రాణాలకే ప్రమాదం అని రత్నప్రభ బెదిరిస్తుంది. ఎపిసోడ్ చివర్లో లాస్య.. భాగ్య ఇంట్లో తలదాచుకున్న విషయం బయట పడుతుంది.

దివ్య ముందే విక్రమ్కు హగ్:జరిగిన అవమానానికి జానూ బట్టలు సర్ధుకుని వెళ్లిపోడానికి రెడీ అవుతుంది. దీంతో రాజ్యలక్ష్మి, విక్రమ్ ఆమెను ఆపుతారు. అప్పుడు దివ్య మాత్రం జానూకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. దీంతో బసవయ్య.. విక్రమ్ను రెచ్చగొడతాడు. అప్పుడతను జానూను వెళ్లకుండా ఆపుతాడు. అంతేకాదు, 'చిన్నప్పుడు మనం ఎన్ని సార్లు అరుచుకోలేదు. మళ్ళీ హగ్ చేసుకుని అన్నీ మర్చిపోయాం కదా' అంటాడు. దీనికి జానూ 'గొడవ పడినప్పుడు కోపం తగ్గించుకోవడం కోసం నీ చెంప పగలగొట్టేదాన్ని' అనగా.. విక్రమ్ కొట్టమంటాడు. కానీ, జానూ హత్తుకోవడంతో దివ్యకు కోపం వస్తుంది.

సామ్రాట్ బాబాయిని ఆపేసి:ధనంజయ్ కంపెనీ సీఈవో అవబోతుండడంతో సామ్రాట్ బాబాయ్ తులసిని కలవడానికి ఇంటికి వస్తాడు. అది చూసిన నందూ ఎదురుగా వెళ్లి ఆయన్ని ఆపుతాడు. తులసిని కలుసుకోకుండా అటు నుంచి అటే పంపించేయమని పరంధామయ్య చెప్తాడు. దీంతో నందూ ఆయనను గుమ్మం నుంచి బయటకి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు బాబాయి 'అర్జెంట్గా తులసితో మాట్లాడాలి. సామ్రాట్ బిజినెస్ ప్రమాదంలో పడుతుంది. ధనుంజయ్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటున్నాడు' అంటాడు. దీనికి నందూ 'దానితో తులసికి ఏం సంబంధం' అని ప్రశ్నిస్తాడు.
హక్కు కాదు... మానవత్వం:నందూ మాటలకు సామ్రాట్ బాబాయి 'అలా అనొద్దు.. వెంటనే తులసి వచ్చి కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి లేదంటే సమస్యలు వస్తాయి' అంటాడు. దీనికి నందూ 'ఏ హక్కుతో కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకోమంటున్నారు' అని ప్రశ్నిస్తాడు. అప్పుడాయన 'హక్కుతో కాదు మానవత్వంతో తీసుకోమంటున్నా' అంటాడు. దీంతో నందూ 'దయచేసి ఈ విషయంలోకి తులసిని లాగొద్దు. ఎవరు సహాయం అడిగినా తను ఆలోచించకుండా చేస్తుంది. కానీ తనని ఇబ్బంది పెట్టి సమస్యల్లో పెట్టడం కరెక్టేనా? మీరే చెప్పండి అంకుల్' అని వివరిస్తాడు.

తెలిస్తే వచ్చే వాడిని కాదు:ఆ తర్వాత నందూ 'ధనుంజయ్ వాళ్ళు కిరాతకులు. తులసి ఆ ఇంటి వైపు వస్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందేనని బెదిరించారు. ఆ సంగతి నాకు మాత్రమే తెలుసు. తులసిని ఆ ఇంటికి వెళ్ళకుండా అడ్డుపడటం కోసం కష్టపడుతున్నాం. ఆస్తి కోసం చూస్తున్న వాళ్ళు తులసి మీద అటాక్ చేస్తారు. అయినా మీరు తులసిని తీసుకెళ్తానంటే తీసుకెళ్లండి' అంటాడు. దీంతో బాబాయి 'దిక్కుతోచక తులసి దగ్గరకి వచ్చాను ఇదనీ తెలిస్తే వచ్చేవాడిని కాదు' అంటాడు. అంతేకాదు, తులసిని దూరంగా ఉంచుతానని నందూకు మాట కూడా ఇస్తాడు.

నువ్వు మా ఇంటికి రావద్దు:నందూ, సామ్రాట్ బాబాయి మాట్లాడుతుండగా తులసి వస్తుంది. అంతేకాదు, ఎందుకు అదోలా ఉన్నారని ఆయనను అడుగుతుంది. దీనికాయన సామ్రాట్ గుర్తుకు వచ్చాడు అని అబద్ధం చెప్తాడు. తర్వాత హానీకి టిఫిన్ తీసుకెళ్లాడానికి వచ్చానని మరో అబద్దాన్ని కూడా చెప్తాడు. దీంతో తులసి కొన్ని ప్రశ్నలు వేస్తుంది. చివరికి సామ్రాట్ బాబాయి 'రేపటి నుంచి హనీకి టిఫిన్ పంపించాలని అనుకోకు. అప్పుడే ఒంటరిగా ఉంది. చదువు మీద ధ్యాస పెడుతుంది' అంటూ వెళ్లిపోతాడు. దీంతో తులసికి ఏమీ అర్థంకాక అయోమయంగా ముఖం పెడుతుంది.

బాత్రూంలో జానూ, విక్రమ్:విక్రమ్ స్నానం చేస్తుండగా దివ్య.. జానూ గురించి ఆలోచిస్తుంటుంది. అప్పుడు బాత్రూంలో వాటర్ ఆగిపోతాయి. దీంతో దివ్యను పిలిచి వాటర్ తీసుకు రమ్మని చెప్తాడు. ఆమె అలా వెళ్లగానే జానూ గమనించి బకెట్ పట్టుకుని రెడీ అవుతుంది. అంతేకాదు, రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి దివ్యను రాకుండా ఆపమని చెప్తుంది. దీంతో ఆమె దివ్యను ఆపగా.. జానూ వెళ్లి విక్రమ్ వీపు రుద్ది స్నానం చేయిస్తుంది. ఆ తర్వాత దివ్య వెళ్లగానే జానూ బాత్రూంలో నుంచి బయటకు వస్తుంది. అది చూసి కోపంతో రగిలిపోతుంది. తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఆ సమయంలో జానూకు దివ్య వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఆమె కూడా ధీటుగానే బదులిస్తుంది.

తులసి కోసం హనీ రిస్క్:తులసి వాళ్ళు కెఫేకు వెళ్తుండగా అటుగా స్కూల్కు వెళ్తున్న హనీ కారులో నుంచి చూస్తుంది. వెంటనే తులసిని కలిసేందుకు ట్రాఫిక్లో దిగి పరుగులు పెడుతుంది. అంతలోనే ఆ చిన్నారికి యాక్సిడెంట్ అవబోతుంది. కానీ, తృటిలో ప్రమాదం తప్పిపోతుంది. ఆ తర్వాత తులసిని హనీ టిఫిన్ ఎందుకు తీసుకురాలేదని అడుగుతుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. నందూ మాత్రం భయపడుతూ ఉంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











