Intinti Gruhalakshmi Today Episode: తులసికి అనసూయ సారీ.. చనిపోయే ముందు మారి.. నిజం తెలుసుకున్న నందూ
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్లో.. పరందామయ్య తన మాట వినకపోవడంతో అనసూయ దారిలోకి వచ్చి బ్రతిమాలడం మొదలు పెడుతుంది. కానీ, ఆయన మాట్లాడడు. దీంతో తులసిని నిందిస్తుంటుంది. అప్పుడు పరందామయ్యకు కోపం వచ్చి బయటకు వస్తాడు. అంతేకాదు, ఆమెపై ఓ రేంజ్లో ఫైర్ అవుతాడు. అలాగే, తనను ప్రశాంతంగా వదిలి వెళ్లకపోతే ప్రాణాలు తీసుకుంటానని బెదిరిస్తాడు. మరోవైపు, ఎవరూ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో డౌట్ వచ్చిన నందూ.. ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు అభి ప్రవర్తన చూసి అతడికి డౌట్లు పెరుగుతాయి.

వెళ్లిన అనసూయ.. అభి మెసేజ్
అనసూయతో గొడవ జరిగిన తర్వాత పరందామయ్య మరింత ధీనంగా మారిపోతాడు. అంతేకాదు, 'నన్ను ఇక్కడ ప్రశాంతంగా బతకనివ్వు.. ప్రశాంతంగా చావనివ్వు. ఇది నా ఆఖరి కోరిక అనుకో' అని అంటాడు. దీంతో అనసూయకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే లాస్యకు నందూ ఇంటికి తిరిగి వచ్చాడని అభి మెసేజ్ చేస్తాడు. ఈ విషయం లాస్య చెప్పగానే తులసి 'మీరేమీ కంగారు పడకండి. మామయ్య ఊరు వెళ్లారని చెప్పండి. ప్రేమ్ నువ్వు కూడా వెళ్లి ఏదో ఒకటి చెప్పు. మామయ్యను జాగ్రత్తగా చూసుకోండి' అని అంటుంది.

చావబోయిన అత్తను కాపాడింది
ఆ తర్వాత తులసి అత్తయ్య ఎక్కడికి వెళ్లారో చూస్తా అంటూ బయటకు వస్తుంది. అలా వెతుకుతూ ఉండగా అనసూయ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. అలా ఓ బావిలో పడాలని అనుకుంటుంది. అప్పుడే తులసి అక్కడకు చేరుకుని ఆమెను కాపాడుతుంది. అంతేకాదు, 'ఏంటి అత్తయ్యా.. ఏం చేస్తున్నారు? నేను రావడం కొంచెం ఆలస్యం అయితే ఏం జరిగి ఉండేదో తెలుస్తుందా' అంటూ అనసూయతో అంటుంది. అప్పుడామె 'నేను ఇక్కడ ఉండడానికి అర్హురాలిని కాదు. నన్ను చావనివ్వు తులసి' అని ఏడుస్తుంది. దీంతో తులసి ఆమెను ఓదార్చుతోంది.

50 ఏళ్లు నిలబడ్డ బంధం మీది
అనసూయను కాపాడిన తులసి 'ప్రాణ సమానంగా ప్రేమించిన వాడికి చేసిన గాయాన్ని మానేలా చేయడం ఎవరి వల్ల కాదు. అలాంటి గాయాన్ని ఎవ్వరూ మానేలా చేయలేరు. మామయ్యకు మీరే ఆ గాయం చేశారు. మేమంతా నిన్నా మొన్నా మీ మధ్యకు వచ్చిన వాళ్లం. అసలు బంధం మీది.. మీ ఇద్దరిదీ. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని 50 ఏళ్లు నిలబడ్డ ఆ బంధం మీది. చేసిన ఆ వాగ్దానం అంత తేలికగా తెగిపోదు అత్తయ్యా. ఎవరో నా లాంటి దురదృష్టవంతురాలికి మాత్రమే అలా జరుగుతుంది. బాధ అనేది జీవిత ప్రయాణంలో ఒక అనుభూతి.. గమ్యం కాదు' అంటుంది.

మీరు చేసిన తప్పు అదే అంటూ
అనంతరం తులసి 'కొద్దిగా ఓపిక పడితే కాలానికి కొద్దిగా సమయం ఇస్తే మీరిద్దరూ మళ్లీ దగ్గరవుతారు. మామయ్య పట్ల మీ ప్రవర్తనకు మొదటి సారి కోపం తెచ్చుకున్నారు. మీరు నన్ను అర్థం చేసుకోలేదంటే అర్థం ఉంది. కానీ, మామయ్యను కూడా అర్థం చేసుకోలేకపోవడం ఏంటి అత్తయ్యా. మీరు చేసిన తప్పు అది' అని చెబుతుంది. దీంతో అనసూయ 'అయ్యో అయ్యో.. నువ్వు చెప్పినట్టు పెద్ద తప్పు జరిగిపోయింది. నా భర్తను కష్టపెట్టాను.. బాధపెట్టాను. దేవుడిని ఆయన గుడిలో నుంచి తరిమేశాను. ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోవడం.. జీవితంలో నుంచి వెళ్లిపోవడం తట్టుకోలేకపోయాను' అని విలపిస్తుంది.

తులసిపై కోపానికి కారణం చెప్పి
ఆ తర్వాత అనసూయ ఏడుస్తూ 'నేనే నా మనసును ఒప్పించుకోలేకపోయాను. సామ్రాట్ నా కళ్ల ముందు ఎప్పుడు కనబడినా పట్టరానంత కోపం వచ్చేది. మీ ఇద్దరి మధ్య ఏం లేదని, కేవలం స్నేహమే అని తెలుసు. అయినా కూడా నా మనసుకు నచ్చజెప్పుకోలేకపోయేదాన్ని. ఎందుకో కూడా నాకు తెలియదు. 26 ఏళ్లుగా నువ్వు నాకు అలవాటు అయ్యావు. ఆ అలవాటుకు హక్కును వదులకోలేకనే ఇదంతా చేశాను. నా చేతులతోనే నా సంతోషాన్ని కాల్చేసుకున్నాను' అని చెప్తుంది. దీంతో ఏడవద్దు అత్తయ్య. బాధపడింది చాలు అత్తయ్యా అని తులసి ఓదార్చుతుంది.

క్షమించమని అడిగిన అత్తయ్య
తులసి చెప్పినా వినని అనసూయ 'ఆయన లేకుండా నేను ఉండలేను చచ్చిపోతాను. ఇన్నాళ్లుగా నేను ఎప్పుడైనా ఆయన కళ్లలో కోపం చూశాను. కానీ, ధ్వేషం చూడలేదు. మొదటిసారిగా చూస్తున్నాను. ఆ ద్వేషాన్ని చూస్తూ నేను బతకలేను. చచ్చిపోతాను. ఆయన్ను చివరిసారిగా క్షమాపణ అడుగుతాను. ఒక్కసారి ఆయన్ను ఇంటికి తీసుకొస్తావా. ఇన్నేళ్లుగా నిన్ను అది తీసుకురా.. ఇది తీసుకురా అంటూ టార్చర్ పెట్టాను. ఇప్పుడు నాకు నా భర్త కావాలి.. ఆయనే నాకు ప్రపంచం. ఆయనే నాకు లోకం. ఆయన లేని జీవితం నాకు వద్దు. నా దేవుడిని నా దగ్గరికి చేర్చు. అమ్మా.. నన్ను క్షమిస్తావు కదూ.. నా బతుకు మాత్రం ఆయనే. ఆయన లేకపోతే నా ప్రాణం పోతుంది. తెచ్చివ్వు' అని తులసిని వేడుకుంటుంది.

విషయం తెలిసి ఫైరైన నందూ
ఇక, అందరూ ఇంటికి చేరుకోవడంతో పరందామయ్య గురించి నందూ ప్రశ్నిస్తాడు. అప్పుడు లాస్య జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది. దీంతో నందూకు కోపం వస్తుంది. అప్పుడు 'అసలు ఆయన్ను ఎలా వెళ్లనిచ్చావు? నువ్వు ఏం చేస్తున్నావు' అంటూ లాస్యపై ఫైర్ అవుతాడు. మధ్యలో అభి రావడంతో 'నోరు మూసేయ్.. అబద్ధం చెప్పి నన్ను మాయ చేద్దామనుకున్నావు. ఇదేనా నువ్వు చూసుకున్న బాధ్యత. ఇదేనా మాట నిలుపుకునే పద్ధతి. యూజ్ లెస్ ఫెలో. మిమ్మల్ని ఎవ్వరినీ నమ్మను' అంటాడు. మరోవైపు అనసూయ, తులసి కలిసి వెళ్లడం చూసి కాలనీలోని వాళ్లు కామెంట్ చేస్తారు. దీంతో అనసూయకు కోపం రాగా.. తులసి కూల్ చేస్తుంది. ఇక, నందూ ఇంట్లో వాళ్ల మీద అరుస్తుండగానే వీళ్లు ఇంటికి చేరుతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











