Jabardasth: జబర్దస్త్ జడ్జిగా మళ్లీ నాగబాబు ... పూనకాలు తెప్పించేలా మాస్ ఎంట్రీ
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ఓ సంచలనం. ఎన్ని షోలు ఉన్నప్పటికీ జబర్దస్త్ నెంబర్ వన్ కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఇతర వివాదాస్పద కంటెంట్ ఉన్నప్పటికీ కుటుంబ ప్రేక్షకులు ఈ షోను ఆదరిస్తూనే వచ్చారు. ఎంతో మంది ప్రతిభావంతులకు జబర్దస్త్ వేదికగా నిలిచింది. ఈ షో ద్వారానే అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్లు తెలుగువారికి సుపరిచితులై నేడు సెలబ్రెటీలుగా వెలుగొందుతున్నారు. ఇక కమెడియన్లకు అయితే లెక్కే లేదు. సుడిగాలి సుధీర్, ధనరాజ్, షకలక శంకర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, వేణు వంటి వారు సినీరంగంలో అడుగుపెట్టారు.
ఎంతోమందికి జీవితాన్నిచ్చిన జబర్దస్త్
ఒకప్పుడు పేదరికంలో మగ్గిపోయి, సినిమాలలో అవకాశాల కోసం హైదరాబాద్ రైలెక్కిన వారికి జబర్దస్త్ కడుపు నింపి, వారికి ఓ స్థాయి కల్పించింది. జబర్దస్త్ షో ద్వారా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వారు ఇప్పుడు భారీగా పారితోషికాలు అందుకుంటున్నారు. జబర్దస్త్ షోలోకి ఎంతో మంది వచ్చారు? వెళ్లారు? కానీ ఈ కార్యక్రమం మాత్రం నిరాటంకంగా సాగుతోంది. ఎందరో యాంకర్లు, జడ్జిలు, కమెడియన్లు ఇలా పుష్కరకాలంగా ఈ షోకు ఎదురులేదు. జబర్దస్త్ ఫార్ములాను కాపీ కొట్టి పలు ఛానెల్స్ అలాంటి కార్యక్రమాలను మొదలుపెట్టగా అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

జబర్దస్త్ను వీడిన నాగబాబు
జబర్దస్త్కు నాగబాబు- రోజాలు జడ్జిలుగా అద్భుతంగా వ్యవహరించారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ వారానికి రెండు రోజులు తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది ఈ కార్యక్రం. కమెడియన్ల కామెడీకి తోడు వీరిద్దరి పంచ్లతో షోకు తిరుగులేకుండా పోయింది. సక్సెస్ఫుల్గా సాగుతున్న జబర్దస్త్ షోలో నాగబాబు నిష్క్రమణ ఓ పెద్ద కుదుపు. మల్లెమాలతో ఏం విభేదాలు వచ్చాయో తెలియదు కానీ నాగబాబుతో పాటు పలువురు కమెడియన్లు జబర్దస్త్ను వీడారు. ఆ తర్వాత వేరే ఛానెల్లో జబర్దస్త్ లాంటి కార్యక్రమంలోనే నాగబాబు కనిపించారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఆ కార్యక్రమం హిట్ కాలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకు మరో జడ్జి రోజా.. జగన్ కేబినెట్లో మంత్రి కావడంతో జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. ఆ కొద్దిరోజులకే స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా వైదొలిగారు.
జబర్దస్త్లో ప్రయోగాలు
జబర్దస్త్ కార్యక్రమానికే వెలుగులు తెచ్చిన నాగబాబు, రోజా, అనసూయలు లేకపోవడంతో జడ్జిలుగా ఖుష్బూ, అలీ, మనో, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, కృష్ణ భగవాన్, మీనా, ఇంద్రజ, శివాజీలు వ్యవహరించారు. మాటి మాటికి జడ్జిలు మారడం, కమెడియన్లు కొత్తవారు కావడంతో ఒక జబర్దస్త్ ఎత్తేసి.. రెండ్రోజులు, రెండు పార్ట్లుగా నడిపిస్తున్నారు. తాజాగా జబర్దస్త్కు 12 వసంతాలు నిండుతున్న సందర్భంగా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ స్పెషల్ షో ప్లాన్ చేసింది. జబర్దస్త్ షో ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు జడ్జిలుగా, కమెడియన్లుగా వ్యవహరించిన అందరినీ ఇందుకోసం పిలిచారు.
జబర్దస్త్ వేదికపై నాగబాబు రీ ఎంట్రీ
ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు కారు దిగి జబర్దస్త్ వేదిక మీదకు స్టైలీష్ ఎంట్రీ ఇచ్చారు. అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అనే డైలాగ్ బ్యాక్ గ్రౌండ్లో వస్తుండగా నాగబాబుకి జబర్దస్త్ టీం లీడర్స్, మెంబర్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. నేరుగా జడ్జి ప్లేస్లోకి వెళ్లిన ఆయన కావాల్సిన వాడు వచ్చినప్పుడు ఆనందించాలి కానీ ఆశ్చర్యపోతారేంట్రా.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు. దీంతో నాగబాబు మరోసారి జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వచ్చారంటూ మెగా అభిమానులు, ప్రేక్షకులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే జబర్దస్త్ 12 సంవత్సరాల స్పెషల్ ఎపిసోడ్కి మాత్రమే నాగబాబు గెస్ట్గా వచ్చారని, అంతకుమించి ఏం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం నాగబాబు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. రేపో మాపో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ జబర్దస్త్ వేదికపై నాగబాబు కనిపించడం మాత్రం బుల్లితెర అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











