సొంత అక్కాచెల్లెలే అలా చేశారు.. 'జబర్దస్త్' వర్ష ఎమోషనల్
బుల్లితెర నటి, జబర్దస్త్ కమెడియన్, యాంకర్ వర్ష (Varsha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై పలు సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రజలకు దగ్గరైంది వర్ష. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చి తన కామెడీ టైమింగ్ తో దుమ్మురేపింది. ఇదే షోలో కామెడియన్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి కామెడీ లవ్ ట్రాక్ చేసి మరింత పాపులర్ అయ్యారు. అలాగే ఈ కామెడీ షోతోపాటు బయట ఈవెంట్స్, సోషల్ మీడియాలో క్రేజీ గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు 'కిసిక్ టాక్స్'షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఈ షోలో యాంకర్ వర్ష తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని భావోద్వేగ విషయాలను తాజాగా పంచుకున్నారు.
'కిసిక్ టాక్స్' కార్యక్రమంలో ఈసారి పటాస్ ప్రవీణ్ అతిథిగా పాల్గొన్నారు. అయితే ఎప్పటిలా అతిథిని ప్రశ్నించకుండా, ఈసారి ప్రవీణ్ యాంకర్గా మారి వర్షనే ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఈ సందర్భంగా వర్ష తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలు, కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన నిరాకరణ గురించి ఎమోషనల్గా మాట్లాడారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో తనకు కుటుంబం నుంచి పెద్దగా మద్దతు లభించలేదని వర్ష వెల్లడించారు. ముఖ్యంగా తన సొంత అక్కాచెల్లెలు కూడా తనతో సరిగా మాట్లాడేవారు కాదని చెప్పారు. మొదట సినిమాల్లో, ఆ తర్వాత సీరియల్స్లో అవకాశాలు వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు వాటిని పెద్దగా పట్టించుకోలేదన్నారు. అంతేకాదు, "నువ్వు మా చెల్లివి అని బయట ఎవరికీ చెప్పొద్దు" అని కూడా తనను హెచ్చరించేవారని గుర్తుచేసుకున్నారు.

వర్ష మాట్లాడుతూ.. "ఆ సమయంలో వారి మాటలు నన్ను చాలా బాధించాయి. బంధువుల మధ్య కూడా నన్ను తక్కువగా చూసేవారు. అయితే వాళ్లను పూర్తిగా తప్పుపట్టలేను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గురించి వారికి ఉన్న అభిప్రాయం అలాంటిది. చుట్టుపక్కల వాళ్లు కూడా ఇండస్ట్రీపై నెగెటివ్గా మాట్లాడటంతో నాపై చెడు అభిప్రాయం ఏర్పడింది" అని అన్నారు. అయితే తన జీవితంలో అసలు మార్పు 'జబర్దస్త్' షోతోనే వచ్చిందని వర్ష తెలిపారు. ముఖ్యంగా హైపర్ ఆది టీమ్లో కనిపించడం ప్రారంభించిన తర్వాత ప్రేక్షకుల్లో తనకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు.
క్రమంగా అభిమానులు పెరగడం, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరగడం ప్రారంభమైందని చెప్పారు. తన గురించి ప్రజలు మంచి మాటలు చెప్పడం మొదలుపెట్టారని, అదే సమయంలో కుటుంబ సభ్యుల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చిందని వెల్లడించారు. "జబర్దస్త్లో నేను కనిపించిన తర్వాత మా ఇంటికి, బంధువులకు చాలా మంది ఫోన్ చేసి నా గురించి ప్రశంసించారు. మీ చెల్లెలు చాలా బాగా చేస్తోందని, షోలో అదరగొడుతోందని చెప్పేవారు. ఆ తర్వాత మా అక్కాచెల్లెలు కూడా నాతో మళ్లీ దగ్గరయ్యారు. కుటుంబ సభ్యులంతా నాకు మద్దతుగా నిలబడ్డారు" అని వర్ష తెలిపారు.
ఈ సమయంలో తన తల్లి మద్దతు గురించి వర్ష ప్రత్యేకంగా ప్రస్తావించారు. "మా అమ్మ ఎప్పుడూ నన్ను ప్రోత్సహించారు. మా అమ్మ నన్ను కంటికి రెప్పలా చూసుకునేది. నేను ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్లినా నాకు అండగా నిలిచేది" అని భావోద్వేగానికి గురయ్యారు. ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రారంభ రోజుల్లో సొంత అక్కాచెల్లెలే తనతో మాట్లాడకపోవడం తనను ఎంతో బాధించిందని, అయితే ఫేమ్ వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. "ఇప్పుడు బంధువుల మధ్య నాకు గౌరవం పెరిగింది. కుటుంబ సభ్యులందరూ నన్ను గర్వంగా పరిచయం చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే జబర్దస్త్ వల్లే నేను నా కుటుంబాన్ని మళ్లీ దగ్గర చేసుకున్నాను" అని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి అడిగిన ప్రశ్నకు కూడా వర్ష ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారని, అందువల్ల ట్రోల్స్ లేదా నెగెటివ్ కామెంట్లను పెద్దగా పట్టించుకోరని చెప్పారు. సినిమా, టెలివిజన్ రంగాల్లో ఇలాంటి విమర్శలు సహజమని వారికి తెలుసని అన్నారు. తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు, అవమానాలు, కన్నీళ్లు ఎదుర్కొన్నానని వర్ష తెలిపారు. "ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దాని వెనుక చాలా కష్టం ఉంది. రేయింబవళ్లు శ్రమించి ఈ స్థాయికి చేరుకున్నాను. నా ప్రయాణంలో నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను" అని అన్నారు.
అలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు యాంకరింగ్ వైపు వెళ్లాలని సలహా ఇచ్చిన వారిలో పటాస్ ప్రవీణ్ కూడా ఒకరని వెల్లడించారు. తనపై నమ్మకం ఉంచి ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు చెబుతూ, ప్రేక్షకుల ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని వర్ష పేర్కొన్నారు. చివరగా "జబర్దస్త్ నాకు కేవలం పేరు మాత్రమే ఇవ్వలేదు.. నా కుటుంబాన్ని కూడా తిరిగి ఇచ్చింది. అందుకే ఆ షో అంటే నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది" అంటూ ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications





