జె.కె భారవికి ‘కాళోజీ స్మారక పురస్కారం’ (ఫోటోస్)
హైదరాబాద్: తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాల్ని పురస్కరించుకుని తెలుగు టెలివిజన్ రచయితల సంఘం ఆధ్వర్యంలోసంఘం కార్యాలయంలో ప్రముఖ చలన చిత్ర రచయిత జె.కె.భారవికి ‘కాళోజీ స్మారక పురస్కారం' ప్రదానం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవధాన సరస్వతీ పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ, విశిష్ఠ అతిథులుగా ప్రముఖ సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞశర్మ, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు. సభకు రచయితల సంఘం అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ అద్యక్షత వహించారు.
కాళోజీకి తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ కాళోజీ గొప్ప దార్శనికుడని, చాలా ధైర్యం, దమ్మున్న ప్రజాకవి అని, నిలువెల్లా త్యాగనిరతిని నింపుకున్న ప్రజాకవి అని తనదైన పద్యాలతో సభను అలరించారు నాగఫణి శర్మ. కాళోజీ ఏ విషయాలలోనూ రాజీపడని గొప్ప ప్రజాకవి అని కాళోజీతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు దైవజ్ఞ శర్మ. ప్రజా గళాన్ని కలంలో ఇముడ్చుకుని నిరంతరం తన జీవితాన్ని ప్రజాసాహిత్యంతో నింపుకుని తన రచనల ద్వారా జనజాగృతి చేసిన అసమాన సాహితీ పోరాటవీరుడు కాళోజీ అని ఆయన పేరిట నెలకొల్పిన పురస్కారాన్ని జె.కె.భారవికి ఇవ్వడం సముచితం అని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు...

జె.కె.భారవి మాట్లాడుతూ..
జె.కె.భారవి మాట్లాడుతూ..పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిదే అన్నది షోడషోత్తర మంత్రమని కాళోజీ సాహిత్యం సమాజాన్ని ఎంతో జాగృతపరిచిందని, కాళోజీది తనది ఒకటే జన్మస్థానమని(ఓరుగల్లు) ఈ మట్టిలో పౌరుషం, ధైర్యం, విప్లవభావాలు ఎక్కువని ఈ పురస్కరం తనకివ్వడం తన పట్ల ఎంతో బాధ్యత పెంచిందని అన్నారు.

నాగబాల సురేష్ మాట్లాడుతూ...
తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ అధ్యక్షోపన్యాసం చేస్తూ ‘కాళోజీ గొడవ, సమాజం గొడవ అని, కాళోజీ నిరాడంబర కవి అని భారవికి, కాళోజీకి ఎన్నో విషయాలలో సమీప్యత, సారూప్యత ఉందని అందుకే ఈ పురస్కారానికి ఆయన్ను ఎంపిక చేశామన్నారు.రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి రాజేంద్రరాజు మాట్లాడుతూ....తన మొదటి, రెండవ కవితా సంపుటాలను కాళోజీ ఆవిష్కరించి ప్రశంసించారని, కాళోజీగారి కవితను వినిపించి సభను ఉత్తేజపరిచారు.

ఇతరులు...
ఇలాంటి సత్సంగంలో పాల్గొనటం తన అదృష్టమని ప్రముఖ నిర్మాత శ్రీమతి నారా జయశ్రీదేవి అన్నారు. కాళోజీ వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని ప్రముఖ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, జె.కె.భారవి రచనలని, వ్యక్తిత్వాన్ని బీచరాజు శ్రీధర్ సభకు పరిచయం చేసారు.

కాళోజీ
ప్రజా రచయిత మాస్టార్ జీ, శ్రీశైలమూర్తి, దర్శకుల సంఘం కార్యదర్శి అళహరిలు ప్రసంగించారు. డాక్టర్ వెనిగళ్ల రాంబాబు వందన సమర్పణ చేసారు. ఉదయ్ భాగవతుల, రుద్రంగి రమేష్ లతో పాటు పలువురు చలన చిత్ర టి.వి. రచయితలు పాల్గొన్న సభ ఆద్యంతం సాహిత్య గుభాళింపులతో, కాలోజీ కావ్యాలతో పులకరించిపోయింది.


Click it and Unblock the Notifications











