రెండేళ్ల తర్వాత టీవీల్లోకి దేవర.. జూనియర్ ఎన్టీఆర్ మూవీని ఏ ఛానెల్లో చూడొచ్చంటే?
ప్రస్తుతం సినిమాల రిలీజ్లు, ఓటీటీల స్ట్రీమింగ్, టెలివిజన్ ప్రీమియర్స్ చాలా వేగంగా జరిగిపోతున్నాయి. థియేటర్లో సినిమా హిట్ అయితే ఓపికగా ఎదురుచూసే ఓటీటీ, టీవీ సంస్థలు.. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం వెంటనే ఆయా సినిమాలను వెంటనే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తాయి. అలాంటి భారీ హిట్గా నిలిచిన ఓ సినిమా దాదాపు రెండేళ్లుగా టీవీలో ప్రీమియర్స్కు నోచుకోవడం లేదు. అది కూడా చిన్నా చితకా హీరో సినిమా కాదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా.
కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించిన దేవర పార్ట్ 1 థియేటర్లో బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత ఓటీటీలోకి కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ బుల్లితెరపై ఇప్పటి వరకు సినిమా ప్రసారం కాకపోవడం ఎన్టీఆర్ అభిమానులను, ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. నిన్నగాక మొన్న వచ్చిన సినిమాలే టీవీలలోకి వస్తుంటే.. తమ అభిమాన హీరో సినిమాని ఎందుకు తీసుకురావడం లేదంటూ వారు సోషల్ మీడియాలో ఘాటుగా పోస్ట్లు పెట్టారు. తాజాగా ఈ రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. త్వరలోనే దేవర పార్ట్ 1ని టెలివిజన్ ప్రీమియర్స్కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్రామ్లు సంయుక్తంగా దేవర పార్ట్ 1ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించారు. ఆమెకు ఇదే తొలి సినిమా. ఇక బాలీవుడ్ సూపర్స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో విలన్గా నటించారు. ఆయనకు కూడా ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్, అజయ్, షైన్ టామ్ చాకో, శృతి మరాఠే, తాళ్లూరి రామేశ్వరి తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా, ఏ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా వ్యవహరించగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.
400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన దేవర పార్ట్ 1 మూవీని సెప్టెంబర్ 27, 2024న వరల్డ్ వైడ్గా విడుదల చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. తెలుగు రాష్ట్రాలలో 239 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 40 కోట్ల రూపాయలు, తమిళనాడులో 10 కోట్ల రూపాయలు, కేరళలో 2 కోట్ల రూపాయలు, హిందీలో 84 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 51.2 కోట్ల రూపాయలు చొప్పున ఈ సినిమా 450 కోట్ల రూపాయల గ్రాస్.. 256 కోట్ల రూపాయల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.
థియేట్రికల్ రన్ ముగిసిన వెంటనే నవంబర్ 8, 2024న దేవర పార్ట్ 1 ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యింది. ఓటీటీలోనూ ఎన్టీఆర్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నాటి నుంచి నేటి వరకు దేవర టెలివిజన్లో టెలికాస్ట్ కాకపోవడం చర్చనీయాంశమైంది. శాటిలైట్ రైట్స్ అమ్మకాల విషయంలో ఆలస్యం కావడమే ఇందుకు కారణంగా వార్తలు వచ్చాయి. నిర్మాతలు దేవర శాటిలైట్ రైట్స్ను భారీ ధరకు ఫిక్స్ చేయడంతో సుదీర్ఘకాలంగా బేరసారాలు జరుగుతున్నాయి. దాంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ను ఎవరు దక్కించుకున్నారు? అసలు టీవీలోకి దేవర వస్తుందా? రాదా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి.
తాజాగా ఈ సస్పెన్స్కు తెరపడింది. ప్రముఖ తెలుగు ఛానెల్ ఈటీవీ.. దేవర శాటిలైట్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే డీల్ వాల్యూ ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. త్వరలోనే దేవర వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ప్రసారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోవడం, మెజారిటీ ప్రజలు ఓటీటీలో చూసేసిన నేపథ్యంలో దేవర మూవీ బుల్లితెరపై ఎలాంటి రేటింగ్ దక్కించుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications



