Karthika Deepam August 3rd episode: నర్సింహను మెడపెట్టి గెంటేసిన కార్తీక్.. దీప తరపున లాయర్ జ్యోతి వాదనలు!
హాస్పిటల్ కి వచ్చి జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ గొడవ చేస్తారు. దాంతో దీప ఇంటికి రాకుండా వేరే ఎక్కడికైనా వెళ్లిపోతాను అంటుంది. విషయం సుమిత్ర కి చెప్పే హాస్పిటల్ కి రమ్మంటాడు కార్తీక్. దీప ని ఒప్పించి ఇంటికి తీసుకు వస్తుంది సుమిత్ర. అప్పుడు కూడా జ్యోత్స్న గొడవ చేస్తుంది. కూతురు కావాలని దీపకి కోర్టు నోటీసులు పంపిస్తాడు నర్సింహ. తన కూతుర్ని ఎలాగైనా కాపాడమని సుమిత్ర దంపతుల కాళ్లు పట్టుకుంటుంది దీప. లాయర్ దగ్గరికి వెళ్తున్న దీప కార్తీక్ నర్సింహ ట్రాప్ లో చిక్కుకుంటారు. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగిన కధ. ఆగష్టు 3వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 114వ ఎపిసోడ్లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
శౌర్య ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. అంతలోనే నర్సింహ గొంతు విని బయటికి వస్తాడు. తాగి వచ్చిన నర్సింహ నా కూతుర్ని నాకు ఇవ్వకుండా అడ్డుపడ్డావు కదా ఇప్పుడు ఎలా అడ్డుకుంటావో నేను చూస్తాను అంటాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో కోర్టులో కేసు వేసావు కదా అక్కడే చూసుకుందాం అంటాడు కార్తీక్. జరుగుతున్న గొడవకి శ్రీధర్, కాంచన బయటకు వస్తారు. వాడితో మాటలు ఏంటి బయటికి తోసేయ్ అంటాడు శ్రీధర్, వాడు మానాన వాడే పోతాడు నువ్వు లోపలికి వచ్చేయ్ అంటుంది కాంచన.

వాళ్ళిద్దర్నీ వారిస్తాడు కార్తీక్. నేను నీతో గొడవ పడటానికి రాలేదు, నీతో చాలెంజ్ చేయడానికి వచ్చాను రేపు ఈపాటికి నా కూతుర్ని నేను ఎత్తుకొని తీసుకు వెళ్తాను అంటాడు నర్సింహ. అలా జరగనివ్వను అంటూ నరసింహ కాలర్ పట్టుకుని ఇంటి నుంచి బయటకు నెట్టేస్తాడు కార్తీక్. తర్వాత శ్రీధర్ కార్తీక్ తో ఈ గొడవలు అన్నీ మనకి అవసరమా రేపు కోర్టుకు నువ్వు వెళ్ళవద్దు అంటాడు. వెళ్ళటం చాలా అవసరం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు కార్తీక్. ఏం చేద్దాంమండి అంటుంది కాంచన. చూస్తూ ఉండటం తప్ప ఏమి చేయలేము అంటాడు శ్రీధర్.
మరోవైపు తాగి ఇంటికి వచ్చిన నర్సింహ తల్లితో కోర్టులో కేసు గురించి చెప్తాడు. మనకి ఈ గొడవలు అన్నీ వద్దు రా, నయానో, భయానో నచ్చజెప్పి పిల్లని ఇంటికి తెచ్చుకుందాం అంటుంది అనసూయ. చెప్తే వినే రకమేనా మీ మేనకోడలు అని నిష్ఠురంగా మాట్లాడుతుంది శోభ. నేను లాయర్ తో మాట్లాడేసానమ్మ నువ్వేమీ భయపడకు రేపు ఈ సమయానికి నా కూతురు నా దగ్గర ఉంటుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు నర్సింహ.
మరోవైపు జ్యోత్స్న కోర్టులో ఏం జరుగుతుందో అని కంగారు పడుతూ ఉంటుంది. కేసు గెలవటం కోసం హాస్పిటల్ లో శౌర్య నా కూతురు అని చెప్పినట్లు కోర్టులో ఆ దీప నా భార్య అని చెప్తాడు అంటుంది పారిజాతం. ఆ మాటలకి పారిజాతం పై కోప్పడుతుంది జ్యోత్స్న. రేపు కోర్టులో దీప వాళ్లు గెలిచే పరిస్థితి వస్తే అడ్డు పుల్ల వేయటానికి మనం ఉంటాం కదా, రేపు మనం కూడా కోర్టుకి వెళదాము ఎవరికి చెప్పకు అంటుంది పారిజాతం. అందుకు సరే అంటుంది జ్యోత్స్న.
మరుసటి రోజు కోర్టు దగ్గర కార్తీక్ దీప కి ధైర్యం చెప్తూ ఉంటాడు అంతలోనే జ్యోత్స్న,పారిజాతం అక్కడికి వస్తారు. మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు కార్తీక్. మేము కూడా దీప కి శ్రేయోభిలాషులమే, మేము కూడా ఆమెకి అండగా ఉండటం కోసమే వచ్చాము అని వెటకారంగా చెప్తుంది జ్యోత్స్న. తర్వాత ఇద్దరూ లోపలికి వెళ్లి కూర్చుంటారు. ఇంతలో దీప తరపు లాయర్ జ్యోతి వస్తుంది. దీపకి ఆమెని పరిచయం చేస్తాడు కార్తీక్. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి నర్సింహ తరుపు లాయర్ విష్ణువర్ధన్ వస్తాడు.
నేను ఈ కేసు వాదిస్తున్నానని తెలిసే మీరు ఈ కేసు టేక్ అప్ చేశారా అని జ్యోతిని అడుగుతాడు విష్ణువర్ధన్, ఈ కేసు కూడా నేనే గెలుస్తాను అంటాడు. జడ్జి మీకేమైనా బంధువా జడ్జిమెంట్ ముందే చెప్పేస్తున్నారు అంటుంది జ్యోతి. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే నర్సింహా వాళ్ళు వస్తారు. కోర్టులో కలుద్దాం అని చెప్పి జ్యోతి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లాయర్ విష్ణువర్ధన్ నర్సింహతో కోర్టులో ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇస్తాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











