Karthika Deepam 2 December 11th: కార్తీక్కి అండగా నిలిచిన పారిజాతం... షాక్లో జ్యోత్స్న, పీఏగా కాశీ విరక్తి
Photo Courtesy: JioHotstar
దీప కాకుండా పారిజాతం కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. ప్రెజేంటేషన్ కోసం ల్యాప్టాప్ తీసుకురమ్మని కాశీకి చెబుతాడు శ్రీధర్. కాశీ పీఏగా చేరినట్లు తెలుసుకున్న జ్యోత్స్న, పారిజాతంలు షాక్ అవుతారు. ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. సీఈవోకి ఎవరినైనా ఉద్యోగిగా నియమించుకునే అధికారం ఉందని చెబుతాడు కార్తీక్. ఈ విషయం నాకు ముందే చెప్పాడని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న నోరు మూసుకుంటుంది. శ్రీధర్ ప్రెజేంటేషన్ ఇచ్చిన తర్వాత తనకు నచ్చలేదని, ఫుడ్ ట్రాక్స్ వర్కవుట్ కావని చెబుతుంది జ్యోత్స్న.
దాంతో దీప రంగంలోకి దిగి ఫుడ్ వేస్ట్ కాదని.. మిగిలిపోయిన ఫుడ్ని అనాథాశ్రమాలకి పంపించి దానిని కూడా పబ్లిసిటీ చేద్దామని అంటుంది. ఆ తర్వాత జనానికి జ్యోత్స్న రెస్టారెంట్ మీద నమ్మకం వస్తుందని చెబుతుంది. ఈ ప్లాన్కు అంతా చప్పట్లు కొట్టగా జ్యోత్స్న, పారులు రగిలిపోతారు. దీపని ఆపకపోతే కావేరి, స్వప్నలు కూడా మన ఫ్యామిలీలోకి, బిజినెస్లోకి వచ్చేస్తారని భయపడుతుంది జ్యోత్స్న. కార్తీక్, దీపలు ఇంట్లో వాళ్లకి స్వీట్స్ చేసి తీసుకొస్తారు. దీప లాంటి భార్య దొరికినందుకు నాకు గర్వంగా ఉందని అంటాడు కార్తీక్. కానీ నువ్వు సెకండ్ హ్యాండ్ కదా? దీపకి ఆల్రెడీ పెళ్లి అయ్యింది కదా అని నానామాటలు అంటుంది జ్యోత్స్న. దాంతో కూతురిని సుమిత్ర కొట్టబోతుండగా సుమిత్ర ఆపుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. మరి డిసెంబర్ 11వ తేదీ 538వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
భార్య చనిపోయిన భర్తకి పిల్లలుంటే చావు జరిగిన ఆ ఇంట్లో ఆరు నెలలు తిరగకుండానే రెండో పెళ్లి గురించి మాట్లాడతారు. మరి భర్త చనిపోయిన భార్యకు పిల్లలుంటే చావు జరిగిన ఇంట్లో ఆరు నెలలు తిరగకుండానే రెండో పెళ్లి గురించి ఎందుకు మాట్లాడరు అని జ్యోత్స్నని ప్రశ్నిస్తాడు. ఆడది మనిషి కాదా? తనది జీవితం కాదా? ఎవరో తన జీవితంలో నుంచి పోయారని అక్కడితో ప్రయాణం ఆపేయాలా? అని నిలదీస్తాడు. భర్త పోయిన ఆడది పక్కింట్లో ఉంటే తను అలాగే ఉండాలని కోరుకుంటాం... అదే ఆడది మన చెల్లెలు అయితే అలాగే కోరుకోగలమా అని అంటాడు కార్తీక్. అదే ఆడది మన తల్లి అయితే అది చావుకు మించిన బాధ అని చెబుతాడు.
కష్టాలు అంటే ఏంటో తెలియని వయసులోనే దీపకు పెళ్లి అయిందని జీవితాన్ని అర్ధం చేసుకునేలోపే... తాళి కట్టిన వాడు తల్లిని చేసి పారిపోయాడు. తండ్రి ముఖం ఎలా ఉంటుందో తెలియకుండానే కూతురికి ఐదేళ్లు దాటాయి. కట్టుకున్న వాడి చేతిలో మోసపోయానని తెలుసుకుంది, జీవితం అంటే ఏంటో తెలుసుకునేలోపే జీవితం ముగిసిపోయిందని అనుకుంది. మన విలువ ఏంటో మన జీవితంలోకి వచ్చే వరకు మనం ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియదు. దీప విలువ ఏంటో తెలిసి నేను తన జీవితంలోకి వెళ్లాను.. మళ్లీ తను కార్తీక దీపంలా వెలిగింది. దీప నా భార్య.. నా ఇంటి దీపం, ఇది ఆ విధాత వేసిన ముడి అని చెబుతాడు కార్తీక్. దీప రెండో పెళ్లి చేసుకుంటే నీకొచ్చిన నష్టమేంటీ? దీప మెడలో తాళి కట్టకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కాదని అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అలాంటప్పుడు దీప వల్ల నీకు ఏ నష్టం జరగలేదని చెబుతాడు.
నాతో, గౌతమ్తో పెళ్లి దాకా వచ్చి చెడిపోయింది. రెండు పెళ్లిళ్లు చెడిపోయిన తర్వాత మూడో పెళ్లి నీకు అవసరమా? అని కార్తీక్ ప్రశ్నించడంతో జ్యోత్స్స షాక్ అవుతుంది. అని నేను అనను, నువ్వు అంటున్న జనం అంటే.. వాళ్లు ఫీల్ అవుతున్నారని పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఈ ఇంట్లో ఉండిపోతావా? అని నిలదీస్తాడు కార్తీక్. ఎవరి కోసమో ఎవరి జీవితాలు ఆగవని అంటాడు. దాస్ మావయ్యకి తన భార్య చనిపోయింది.. మరొకరిని ఆ స్థానంలో చూడలేక ఒంటరిగా మిగిలిపోయాడు. అనసూయ గారు కూడా అంతే పోయిన భర్తకి తనకి ప్రేముంది, ఆ జ్ఞాపకాలతోనే మిగిలిపోయిందని అంటాడు. మా అమ్మానాన్న ఏదో ఒక రోజు కలుస్తారని చెబుతాడు కార్తీక్. పారు, తాత అయితే వాళ్ల పిల్లల కోసమో పెళ్లి చేసుకున్నారు, ఇలా ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని నచ్చినట్లుగా, వాళ్లని వేలేత్తి చూపించే అధికారం, అర్హత నీకు లేదని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. మరోసారి దీప జీవితం గురించి మాట్లాడితే నేను క్షమించనని మండిపడతాడు శివన్నారాయణ. అందరికీ గులాబ్ జాంలు ఇచ్చి తినమని చెబుతాడు కార్తీక్.
మనిషి జీవితం గురించి నేను మాట్లాడిన దాంట్లో తప్పుంది అంటావా? అని పారిజాతంను అడగ్గా.. తప్పు ఏదైనా ఉందంటే అది జ్యోత్స్నదేనని అంటుంది పారు. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు ఆడదాని మనసుని అర్ధం చేసుకున్నావని ప్రశంసిస్తుంది. దీపని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు అదృష్టవంతుడివి. గులాబ్ జాం కంటే నీ మాటలే తీయగా ఉన్నాయని శివన్నారాయణ అనడంతో పారిజాతం పొంగిపోతుంది. ఆ వెంటనే గులాబ్ జాంని పారిజాతంకు తినిపిస్తాడు శివన్నారాయణ. దాంతో కార్తీక్ ఫోటో తీస్తాడు. నాన్నేనా నేను కూడా నా భార్యకి తినిపిస్తానని సుమిత్ర దగ్గరికి వెళ్తాడు దశరథ. ఈ సంతోషాలు ఎంతోకాలం ఉండవని రగిలిపోతుంది జ్యోత్స్న. ఫుట్ ట్రక్స్ ప్రారంభోత్సవం గురించి శ్రీధర్ చెబుతుండగా.. కాశీ ఫోన్లో ఛాటింగ్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసిన శ్రీధర్ మండిపడతాడు. ఫుడ్ ట్రక్స్ దగ్గర పరిస్ధితి ఎలా ఉందో చూడమని శ్రీధర్ ఆర్డర్ వేయడంతో కాశీ రగిలిపోతాడు.
జ్యోత్స్న అన్న మాటలతో దీప కంటతడి పెడుతుంది. సంతోషమైనా, బాధ అయినా నేను నీతోనే ఉంటా.. అనేవాళ్లు వంద అంటారు అన్నింటిని పట్టించుకోవద్దని కార్తీక్ చెప్పడంతో భర్తను హత్తుకుంటుంది దీప. ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలనుకున్న జ్యోత్స్న లాంటివాళ్లు అలాగే మాట్లాడతారని చెబుతాడు. నా కోసం ప్రతిసారి నువ్వెందుకు దోషిలా నిలబడాలని బాధపడుతుంది. మా నాన్న సీఈవో అయినందుకు పారుకి, నువ్వు ఇచ్చిన ఐడియాతో ఫుడ్ ట్రక్స్ రోడ్డు మీదకి వెళ్లాయి కాబట్టి జ్యోత్స్నకి నిద్రపట్టడం లేదని అంటాడు. మరోసారి ఎవ్వరూ మాట్లాడకుండా చేస్తానని చెబుతాడు కార్తీక్. దీపని నవ్వించి ఆమెకు గులాబ్ జాం తినిపిస్తాడు.
శ్రీధర్ చెప్పడంతో ఫుడ్ ట్రక్స్ దగ్గర సూపర్వైజర్లా ఉంటాడు కాశీ. ఆ వెంటనే శ్రీధర్ ఫోన్ చేయగా అన్ని చోట్లా టిఫిన్ అయిపోయిందని, మన ఏరియాలో మాత్రమే మిగిలిపోయిందని చెబుతాడు కాశీ. ఓ 20 మందికి సరిపోయే ఫుడ్ ఉందని కాశీ చెప్పగా.. దానిని అనాథశ్రమాలలో పడేద్దామని అంటాడు. దాంతో కాశీపై మండిపడిన శ్రీధర్.. సీఈవోవి, నువ్వా నేనా అంటూ మండిపడతాడు. ఇంటికి వెళ్తానని కాశీ చెప్పగా.. నువ్వు పని పూర్తి చేసుకుని ఆఫీసుకు రా, మనం రేపటి ప్లాన్ గురించి మాట్లాడాలని చెబుతాడు శ్రీధర్. ఆయన మాట్లాడుతుండగానే కాశీ ఫోన్ కట్ చేస్తాడు. దాంతో శ్రీధర్ రగిలిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











