Karthika Deepam 2 February 21st: దీప కంటతడి, జ్యోత్స్నని వదిలేసిన దశరథ.. తాతకి దొరికిపోయిన జ్యోత్స్న
Photo Courtesy: JioHotstar
దాస్ బాబాయ్ నీ దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు అని కాశీని అడుగుతుంది జ్యోత్స్న. మా నాన్న గురించి నీకెందుకు అని మండిపడతాడు కాశీ. ఇన్నిరోజులు బాబాయ్ కనిపించలేదు కదా అందుకే అడిగానని అంటుంది జ్యోత్స్న. నన్ను కలిసి బావ దగ్గరికి వెళ్తానని చెప్పాడని అంటాడు కాశీ. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మరోవైపు.. మీరంతా నన్ను మోసం చేశారని దశరథ బాధపడతాడు. నా కూతురు ఎక్కడుందని దశరథ అడగ్గా.. దీపే నీ కన్నకూతురని చెబుతాడు కార్తీక్. ఈ విషయం దీపకి కూడా తెలుసని అంటాడు. దీపని గుండెలకు హత్తుకుని కంటతడి పెడతాడు దశరథ. నా కళ్లెదుటే ఉన్నప్పటికీ ఈ నిజాలు ఎందుకు దాచావని దశరథ ప్రశ్నించగా.. బావే చెప్పొద్దని అంటుంది దీప.
దీప, శౌర్యల మీద అటాక్ చేయించింది జ్యోత్స్నేనని.. మీరు కూడా ప్రమాదంలో ఉన్నారని మిమ్మల్ని కాపాడదామని అనుకున్నానని చెబుతాడు కార్తీక్. దీపకి ఆపరేషన్ కోసం నా దగ్గర డబ్బులు లేకపోవడంతో జ్యోత్స్న రాసిన అగ్రిమెంట్ మీత సంతకం చేశాను. ఆ తర్వాత మీ ఇంట్లోనే పనివాళ్లలాగా చేరి మిమ్మల్ని కాపాడుకున్నామని అంటాడు కార్తీక్. బావని కలవకుండా దాస్ని మధ్యలోనే చంపేయాలని అనుకుని కోపంగా వెళ్తున్న జ్యోత్స్నని ఆపుతుంది పారిజాతం. అయినా నువ్వు సుమిత్ర కూతురివేనని అధికారికంగా డాక్టర్ గారే చెప్పారు కదా నీకెందుకు టెన్షన్ అంటుంది పారు. దానిని నువ్వు నమ్మొద్దని చెబుతుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. మరి ఫిబ్రవరి 21వ తేదీ 600వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నేనే నీ అసలైన మనవరాలని ఎప్పుడో ఒకసారి నమ్ముతావు... కానీ ఈలోపు ఈ ఆట ముగిసిపోతుంది, మళ్లీ నువ్వు పాత బట్టల మూటతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందేనని అంటుంది జ్యోత్స్న. దాని నుంచి తప్పించుకోవాలంటే నువ్వు నేను చెప్పినట్లు వినాల్సిందేనని అంటుంది జ్యోత్స్న. దాస్ ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఎలా అని జ్యోత్స్న అడగ్గా... కాంచనకి ఫోన్ చేస్తుంది పారు. కార్తీక్, దీప ఇంకా ఇంటికి రాలేదు.. ఎందుకు రాలేదు అని అడుగుతుంది. కార్తీక్ - దీపలు గుడికి వెళ్లారని కాంచన చెబుతుంది. దాస్ని గుడిలో కలవడానికి వెళ్లారా? ఆ రకంగా చూస్తే మనింట్లో దశరథ కూడా కనిపించడం లేదని పారు అనడంతో జ్యోత్స్న షాకై కుప్పకూలుతుంది.
జ్యోత్స్న అంతుచూస్తానంటూ ఆవేశంగా వెళ్తున్న దశరథను కార్తీక్, దాస్లు ఆపుతారు. మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని దశరథ అనగా.. తొందరపడి ఇప్పుడు తప్పు చేయొద్దు. అత్తకు జ్యోత్స్న అంటే ప్రాణం. నువ్వెళ్లి జ్యోత్స్న నీ కన్నకూతురు కాదంటే తట్టుకోగలదా? నువ్వు తండ్రిలా కాదు.. ఓ తల్లిలా ఆలోచించు. ఇప్పుడు అత్త ఏ పరిస్ధితుల్లో ఉందో అందరికంటే నీకే బాగా తెలుసు. శాంపిల్స్ మ్యాచ్ కాలేదంటేనే చావు భయం పెట్టుకున్న అత్తని ఎలా కాపాడాలో తెలియక దీపని తీసుకెళ్లి బ్లడ్ శాంపిల్స్ ఇప్పించాను. అవి జ్యోత్స్న శాంపిల్సేనని డాక్టర్ గారితో అబద్ధం చెప్పించా. ఈ నిజం డాక్టర్ గారికి కూడా తెలుసని అంటాడు కార్తీక్.
నువ్వు ఎన్ని చెప్పినాసరే.. నేను సుమిత్రగారికి అర్ధమయ్యేలా చెబుతాను. తనని కాపాడుతున్నది దీప అని తెలియక జ్యోత్స్నని పూజిస్తోంది అంటాడు దశరథ. ఇంతలో దాస్ ఏదో చెప్పబోతుండగా నువ్వేం మాట్లాడొద్దు... అందరూ కలిసి అన్యాయం చేసింది నా కూతురికే. ఇక నా కూతురు కన్నీట్లో నుంచి ఒక్క కన్నీరు కూడా రావొద్దు. శివన్నారాయణ గారికి వారసురాలు.. దశరథ సుమిత్రల బిడ్డ అని అంటాడు. మా యావదాస్తికి ఏకైక వారసురాలు దీపే. నీకు, నీ అమ్మకి, నీ కూతురికి మా పక్కన నిలబడే అర్హత కూడా లేదు. ఇప్పుడే వెళ్లి అందరికీ నిజం చెప్పేస్తానని దశరథ కోపంగా వెళ్తుండగా దీప అడ్డుకుంటుంది. అమ్మకి ఆపరేషన్ అయ్యే వరకు ఈ నిజం అమ్మకి తెలియద్దు. జ్యోత్స్న, పారిజాతం గార్లు ఎవరికైనా ప్రమాదం కలిగించొచ్చు. ఇప్పుడు ఎవరైనా వచ్చి శౌర్య నా కూతురు కాదంటే భరించగలనా అని ప్రశ్నిస్తుంది దీప. నువ్వు నిజం చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టు.. నేనే చెప్పేంత వరకు ఈ నిజం నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దదని మాట తీసుకుంటుంది దీప.
నీ కష్టాల్ని నువ్వే పెంచుకుంటావా? ఇంకా అజ్ఞాతంలో ఎన్నాళ్లు ఉంటావు? ఇంకా ఈ కష్టాలు ఎన్నాళ్లు పడతావని దశరథ బాధపడతాడు. మనం ఇప్పుడు చేయాల్సింది నిజాలు తేల్చడం కాదు.. అత్తను కాపాడుకోవడం. నువ్వు నీ కూతురి గురించి ఆలోచిస్తున్నావు కానీ, అత్త గురించి ఆలోచించడం లేదని చెబుతాడు కార్తీక్. అందరి కంటే ఎక్కువ కష్టాలు పడింది నా కూతురే. అది కూడా నా కళ్ల ముందే కష్టాలు పడిందని బాధపడతాడు దశరథ. అమ్మని కాపాడటం వెంటనే చేయాలి.. అమ్మ ప్రాణాలతో బయటపడిన తర్వాత నా గురించి ఆలోచించమని చెబుతుంది దీప. నీకు నేను ముఖ్యమే కావొచ్చు.. కానీ నాకు మాత్రం అమ్మే ముఖ్యమని అంటుంది. ఎవరైనా ఒట్టు కనిపెట్టింది.. మనిషిని బలహీనం చేసే మరో రూపం ఉందంటే అదే ఒట్టు అని దశరథ బాధపడతాడు. కూతురిని ఒకసారి దూరం చేసుకున్నది చాలు.. మరోసారి దూరం చేసుకోలేనని అంటాడు దశరథ. నీకు ప్రమాదం జరగనంత వరకు ఓకే.. కానీ నీకు ఏమైనా జరిగితే మాత్రం నాలో ప్రళయాన్ని చూస్తారని అంటాడు దశరథ.
అమ్మకి నయమయ్యే వరకు మనకు ఏం తెలియనట్లే ఉందామని అంటుంది దీప. దాస్ వచ్చి కాళ్ల మీద పడగా.. దశరథ ఛీ కొడతాడు. నిజం తెలిసినప్పుడు నాతో చెప్పాలి కదా అని సీరియస్ అవుతాడు. దీప ఎక్కడుందో దాస్ మావయ్యకి తెలియదు, తనకి గుర్తున్నది కుబేర్ గారి ముఖం ఒక్కటే, నిజం చెప్పాలని ప్రయత్నించి కూతురి చేతుల్లో చావు అంచులదాకా వెళ్లొచ్చాడు. ఇంటి పరిస్ధితులు బాలేదని తర్వాత నేనే మావయ్యని ఆపేశాను. మూడోసారి ప్రయత్నిస్తే జ్యోత్స్న కిడ్నాప్ చేసిందని కార్తీక్ చెప్పగా దశరథ షాక్ అవుతాడు. నీకు తమ్ముడు ఉన్నా కూడా నిన్ను ఇంతలా ప్రేమించడు, దాస్ మావయ్యని తప్పుబట్టడం అంటే మంచితనాన్ని తప్పుబట్టడమే అంటాడు కార్తీక్. నీకే కాదు.. దాస్ మావయ్యకి కూడా కూతురిని దూరం చేసింది పారు. ఈ కథ మొదలైనప్పటి నుంచి దాస్ మావయ్య ఈ భారాన్ని మోస్తూనే ఉన్నాడని చెబుతాడు కార్తీక్.
నేను చేతకానివాడిని.. ఏం చేయలేకపోయాను. నువ్వు నేను ఒక తల్లికి పుట్టకపోయినా, నువ్వు నా అన్నయ్యవి అంటాడు దాస్. ఆ మాటలతో దశరథ ఎమోషనలై హత్తుకుంటాడు. ముందు అందరం సంతోషంతో దేవుడికి దండం పెట్టుకుందామని చెబుతాడు కార్తీక్. ముందు నా కూతురితో నిన్ను కలిపించినందుకు మీ ఇద్దరికి థ్యాంక్స్ చెబుతాడు దశరథ. దాస్, దశరథలు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్లారు? అనేది ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. స్వప్న- కాశీల జీవితం గురించి శ్రీధర్ దగ్గర బాధపడతాడు శివన్నారాయణ. కాశీ నాకొద్దన్న నా కూతురే... తనే కావాలనే పరిస్ధితి వస్తుందని చెబుతాడు శ్రీధర్. నా కొడుకే జీవితమే నాకు గుణపాఠం.. వాడిని చూసే నేను నేర్చుకున్నానని అంటాడు. దాస్ని ఎలాగైనా కలవాలని జ్యోత్స్న అడగటంతో పారిజాతం సరేనని బయటకు తీసుకెళ్తుండగా.. పెద్దాయన ఆపుతాడు. మీ నాన్న వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్లొద్దని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ.
దీప, కార్తీక్తో పాటు దీప కడుపులోని బిడ్డ క్షేమంగా ఉండాలని అర్చన చేయిస్తాడు దశరథ. అన్నయ్య ముఖంలో ఈ సంతోషం చూడాలని ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నానని అంటాడు దాస్. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలని చెబుతాడు. అందరికీ నిజం తెలిసేరోజు తొందరలోనే ఉందని అంటాడు దాస్. ఇంతలో కార్తీక్ని దీప పక్కకి పిలిచి నేను బిడ్డను వదులుకుంటున్నట్లు చెప్పొద్దని కార్తీక్ని బతిమలాడుతుంది. నిజం నీకు తెలిసిపోయింది కదా? ఇక నేను ఏమైపోయినా పర్లేదని అంటాడు దాస్. ఎవ్వరికీ ఏం కాకూడదు.. అందరూ క్షేమంగా ఉండాలని అంటాడు దశరథ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











